ప్రణాళిక సిద్ధం
జిల్లాలో 3.21 లక్షలకు పైగా ఎకరాల్లో పంటల సాగు అంచనా
మహబూబ్నగర్ (వ్యవసాయం): వానాకాలం పంటల ప్రణాళికను వ్యవసాయశాఖ సిద్ధం చేసింది. ఈ ఏడాది ముందుగానే రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తున్న నేపథ్యంలో రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎరువుల కొరత ఏర్పడకుండా పక్కా ప్రణాళిక రూపొందించింది. మరోవైపు సొసైటీలు, డీలర్ల వద్ద డీఏపీ, యూరియా, ఇతర కాంప్లెక్స్ ఎరువుల నిల్వలపై వ్యవసాయశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నిల్వలు, వానాకాలం పంటలకు అవసరమయ్యే ఎరువులపై లెక్కలు తీస్తున్నారు. జిల్లా, డివిజన్, మండల స్థాయి వ్యవసాయ అధికారులు రోజువారీగా పర్యటించి, తమ పరిధిలో ఉన్న డీలర్ల వద్ద ఎరువుల నిల్వలను తనిఖీ చేసి, ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నారు.
● వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందే 50 శాతం విత్తనాలు, ఎరువులు మార్కెట్లో అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎరువులకు సంబంధించి ప్రతి రైతు తప్పనిసరిగా పట్టాదారు పాస్పుస్తకం, ఆధార్ జిరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒరిజినల్స్తో పాటు జిరాక్స్ తీసుకెళ్తేనే సబ్సిడీపై ఎరువులు అందజేస్తారు. రైతులు కొనుగోలుచేసిన ఎరువులకు తప్పకుండా బిల్లులు తీసుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు. గరిష్ట ధర, సబ్సిడీ వివరాలు ఎరువుల బస్తాపై స్పష్టంగా రాస్తారని సూచిస్తున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం..
ప్రభుత్వ ఆదేశాల మేరకు వానాకాలం పంటల సా గుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తిచేశాం. 3,21,523 ఎకరాల్లో వివిఽ ద పంటలు సాగయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకు సంబంధించి వరి, పత్తి విత్తనాలతో పాటు పప్పు దినుసులు ఇతర విత్తనాలన్నింటినీ ముందుగానే సిద్ధంచేసి ఉంచుతాం. అదేవిధంగా ఎరువులు కూడా అందుబాటులో ఉండేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నాం.
– బి.వెంకటేష్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి 3.21 లక్షల ఎకరాల్లో..
వానాకాలంలో జిల్లావ్యాప్తంగా 3,21,523 ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ ప్రభుత్వానికి నివేదించింది. వరి 1,70,445 ఎకరాల్లో సాగు కానుండగా.. 42,612 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉంచనున్నారు. అదేవిధంగా పత్తి 85,379 ఎకరాల్లో సాగు కానుండగా.. 853.79 క్వింటాళ్ల విత్తనాలు సిద్ధంగా ఉంచాలని ప్రణాళిక రూపొందించారు. మొక్కజొన్న 33,894 ఎకరాలకు గాను 2,711.52 క్వింటాళ్ల విత్తనాలు, కందులు 18,229 ఎకరాలకుగాను 546 క్వింటాళ్ల విత్తనాలు, జొన్నలు 11,312 ఎకరాలకు గాను 452 క్వింటాళ్లు, ఆముదం 921 ఎకరాలకుగాను 18.42 క్వింటాళ్లు, రాగులు 1,079 ఎకరాలకుగాను 21.58 క్వింటాళ్లు, పెసర్లు 174 ఎకరాలకుగాను 13.92 క్వింటాళ్లు, వేరుశనగ పంట సాగుకు 27 క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేయనున్నారు. ఇతర పంటలు 45 ఎకరాలకుగాను 3.6 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉంచాలని వ్యవసాయశాఖ నిర్ణయం తీసుకుంది. అత్యధికంగా వరి, పత్తి పంటలు సాగయ్యే అవకాశం
సీజన్కు ముందే సరిపడా
ఎరువుల నిల్వలు
అవసరమయ్యే ఎరువులు 70,160మెట్రిక్ టన్నులు
అందుబాటులో ఉన్న ఎరువులు 51,053మెట్రిక్ టన్నులు