ప్రేమపెళ్లి చేసుకొని... చంపేశాడు | Sakshi
Sakshi News home page

ప్రేమపెళ్లి చేసుకొని... చంపేశాడు

Published Tue, Aug 1 2017 3:44 PM

A Husband killed his Wife for illegal relationship in ysr kadapa

అక్రమ సంబంధం వల్లే భర్తచేతిలో మృతి చెందిన భార్య
14 నెలల  క్రితం హత్యను ఛేదించిన పోలీసులు
భర్తను అదుపులోకి తీసుకున్న ఎస్‌ఐ


వైఎస్సార్‌ జిల్లా: 14 నెలల క్రితం హత్యచేసి చిత్రావతి నదిలో పూడ్చిన మేదరి చిన్ననాగమ్మ(28)  మృతదేహాన్ని సోమవారం కొండాపురం  ఎస్‌ఐ శివప్రసాద్‌రెడ్డి వెలుగులోకి తీశారు. ఇన్‌చార్జి తహశీల్దార్‌ సుబ్బరామయ్య సంఘటనా స్థలానికి చేరుకొని శవపేటికను బయటకు తీసి పంచనామ నిమిత్తం కడప రిమ్స్‌కు తరిలించినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం కొండాపురం ఏకలవ్య కాలనీకి చెందిన మేదరి నాగేష్‌ అలియాస్‌ నాగన్న, చిన్న నాగమ్మలు 2003లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే భర్త నాగన్న వ్యాపారరీత్యా బయటకు వెళ్లినప్పుడు అదే కులానికి చెందిన వెంటేష్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీనిపై భార్య నాగమ్మను పలుసార్లు మందలించినా ఫలితం లేకపోవడంతో విసుగు నాగన్న భార్యను హత్య చేశాడు. అంతకు ముందు దీనిపై పెద్దల సమక్షంలో పంచాయతీ చేసినా నాగమ్మ తన తీరు మార్చుకోలేదు.

చిత్రావతిలో పూడ్చి పెట్టారు:
కొండాపురం నుంచి 20కిలో మీటర్ల దూరంలో ఉన్న చిత్రావతి నదిలోకి తీసుకెళ్లి భర్త నాగన్న, అతని తండ్రి సుబ్బన్న, తమ్ముడు రమేష్‌ కలిసి గొంతునులిమి నదిలో పూడ్చిపెట్టినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు కొండాపురం సీఐ చిన్నపెద్దయ్య తెలిపారు. కేసు ఛేదించడంలో కృషి చేసిన ఎస్‌ఐ శివప్రసాద్‌ రెడ్డిని వారి సిబ్బందిని సీఐ అభినందించారు. ప్రస్తుతం మరొక నిందితుడి కోసం గాలింపులు జరుగుతున్నాయని త్వరలోనే రిమాండ్‌కు తరలిస్తామని ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
Advertisement