రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్‌ విద్యార్థుల దుర్మరణం | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్‌ విద్యార్థుల దుర్మరణం

Published Mon, Sep 11 2023 6:32 AM

B Tech student dies in accident - Sakshi

హైదరాబాద్: వారంతా బీటెక్‌ విద్యార్థులు.. వీకెండ్‌ కావడంతో సరదాగా గడుపుదామని వికారాబాద్‌ జిల్లా అనంతగిరి హిల్స్‌ చూసేందుకు వచ్చారు.. తిరుగు పయనంలో రోడ్డు ప్రమాదం ఇద్దరిని బలితీసుకోగా.. మరో ఇద్దరిని ఆస్పత్రిపాలు చేసింది. ఈ విషాదకర సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఆలూరు బస్‌స్టేజీ సమీపంలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది.

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌ కొంపల్లి ప్రాంతంలోని సెయింట్‌మారి్టన్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో చప్పిడి సోని (19), మండవ ప్రదీప్‌కుమార్‌ (19), అఖిల్, ఆర్యవర్ధన్‌ బీటెక్‌ సెకండియర్‌ పూర్తిచేసుకొని మూడో సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. నలుగురు కలిసి శనివారం వికారాబాద్‌ జిల్లా అనంతగిరి హిల్స్‌ను సరదాగా చూసేందుకు కారులో వచ్చారు. రాత్రి అక్కడే బస చేసిన వారు ఆదివారం ఉదయం తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరారు.

మార్గమధ్యలో చేవెళ్ల మండలం ఆలూరు బస్‌స్టేజీ సమీపంలోకి రాగానే అతివేగంగా వస్తున్న వీరి కారు ఒక్కసారిగా అదుపు తప్పి చెట్టును బలంగా ఢీకొట్టింది. కారు వెనుకసీట్లో కూర్చొని ఉన్న సోని, ప్రదీప్‌కుమార్‌ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. ముందు సీట్లో ఉన్న అఖిల్, ఆర్యవర్దన్‌ తీవ్రంగా గాయపడ్డారు.

వెంటనే స్థానికులు గమనించి అంబులెన్స్‌కు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారులో ఇర్కుపోయిన మృతదేహాలను బయటకు తీసి అంబులెన్స్‌లో చేవెళ్ల ఆస్పత్రికి తరలించారు. అఖిల్, ఆర్యవర్దన్‌కు ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యకోసం నగరంలోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. సరదాగా వెళ్లిన పిల్లలు విగతజీవులుగా మారడం చూసి వారు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

పిల్లల చదువు కోసం.. 
పిల్లల చదువు కోసమని తల్లిదండ్రులు ఆంధ్రపదేశ్‌లోని ఆయా జిల్లాల నుంచి వచ్చి నగరంలో స్థిరపడ్డారు. చప్పిడి సోని తండ్రి మధుసూదన్‌రెడ్డిది కడప జిల్లా. అక్కడ మంచి ఉద్యోగం చేసే ఆయన పిల్లల చదువుకోసమని హైదరాబాద్‌లోని ఓ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో చేరి కర్మాన్‌ఘాట్‌లో నివాసం ఉంటున్నాడు. అన్నింట్లోనూ తమ కూతురు ముందుండేదని ఇలా జరుగుతుందనుకోలేదని బోరున విలపించారు.

మండవ ప్రదీప్‌కుమార్‌ తండ్రి వెంకటశేషయ్యది ప్రకాశం జిల్లా ఒంగోలు. ఒక్కడే కొడుకు కావడంతో అతని చదువుకోసం హైదరాబాద్‌కు వచ్చి కేపీహెచ్‌బీ కాలనీ ధర్మారెడ్డి కాలనీలో ఉంటున్నారు. ఒక్కగానొక్క కుమారుడు బాగా చదివి కుటుంబానికి ఆసరా అవుతాడనుకుంటే అనంతలోకాలకు వెళ్లిపోవటంతో కుటుంబసభ్యులు జీరి్ణంచుకోలేకపోతున్నారు. గాయపడిన అఖిల్‌ది అమీన్‌పూర్‌. సంగారెడ్డి జిల్లా పీవీఆర్‌కాలనీలో ఉంటున్నాడు. తండ్రి కారు తీసుకొని స్నేహితులతో కలిసి అనంతగిరికి వెళ్లారు.    

Advertisement
Advertisement