Karnataka Deputy CM Says Declare Mumbai As Union Territory- Sakshi
Sakshi News home page

రోజురోజుకు ముదురుతున్న వివాదం

Published Thu, Jan 28 2021 12:26 PM

Karnataka Deputy CM fire On Uddav Thackeray - Sakshi

బెంగళూరు‌: రాష్ట్రాల మధ్య వివాదం మరోసారి రాజుకుంది. మ‌హారాష్ట్ర‌, క‌ర్నాట‌క మ‌ధ్య స‌రిహ‌ద్దు వివాదం మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చింది. క‌ర్నాట‌క స‌రిహ‌ద్దుల్లో మ‌రాఠీ మాట్లాడే ప్రాంతాల‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్ర‌క‌టించాల‌ని మ‌హారాష్ట్ర సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే చేసిన ప్ర‌క‌ట‌నతో మొదలైన వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా కర్నాటక ఉప ముఖ్యమంత్రి మహారాష్ట్ర రాజధాని ముంబైని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని డిమాండ్‌ చేశాడు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. ముంబై మ‌హాన‌గ‌రాన్ని కర్నాటకలో క‌ల‌పాల‌ని.. ఆలోపు కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని క‌ర్నాట‌క డిప్యూటీ సీఎం ల‌క్ష్మ‌ణ్ సవాది డిమాండ్ చేశారు.

ఇటీవల కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో మరాఠీ మాట్లాడేవాళ్లు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాలను కలిపి కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ప్రకటన చేయడంతో వివాదం మొదలైంది. దీనికి బదులుగా ఒక్క అంగులం కూడా ఇచ్చేది లేదని కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రకటించారు. దీంతో పాటు క‌ర్నాట‌క సరిహ‌ద్దు జిల్లా బెల్గామ్ పేరును బెల్గావిగా మార్చ‌డంతో ఉద్ద‌వ్ ఠాక్రే వ్య‌తిరేకించారు. దీంతో వివాదం ముదిరింది. అయితే ఈ సమయంలోనే బుధవారం ఇరు రాష్ట్రాల‌  మధ్య నెలకొన్న సరిహద్దు వివాదంపై రచించిన ఒక పుస్తకం విడుదలైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్‌ పై వ్యాఖ్యలు చేశారు. 

‘‘రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న బెల్గాం, కార్వార్‌, నిప్పని ప్రాంతాల్లో మరాఠీ భాషను మాట్లాడేవాళ్లు అధికంగా ఉన్నారని తెలిపారు. అయితే ఆ ప్రాంతాలను కలిపి కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలి’’ అని సరికొత్త డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర సీఎం ఉద్ద‌వ్ వ్యాఖ్య‌ల‌ను ఆయన ఖండించారు. సుప్రీంకోర్టులో ఉన్న వివాదం ప‌రిష్కారయ్యే వ‌ర‌కు ముంబైని యూటీగా చేయాల‌ని కోరారు. క‌ర్నాట‌క సరిహ‌ద్దు జిల్లా బెల్గామ్ పేరును బెల్గావిగా మార్చ‌డాన్ని మ‌హా సీఎం ఉద్ద‌వ్ వ్య‌తిరేకించారు. బెల్గామ్‌ను రెండ‌వ రాజ‌ధానిగా చేసిన క‌ర్నాట‌క త‌ప్పుప‌ని చేసింద‌ని, అందరం ఏకమైతే ఆ ప్ర‌క్రియ‌ను అడ్డుకోవ‌చ్చని సీఎం ఉద్ద‌వ్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై కర్నాటక ఉప ముఖ్యమంత్రి చేసిన ప్రకటన మహారాష్ట్ర నాయకులు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.

Advertisement

తప్పక చదవండి

Advertisement