కాంగ్రెస్‌కు రిలీఫ్‌.. సీఎం మమత కీలక నిర్ణయం! | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు రిలీఫ్‌.. సీఎం మమత కీలక నిర్ణయం!

Published Fri, Feb 23 2024 10:05 AM

Congress And Trinamool will Discuss Seat Talks In Bengal - Sakshi

ఢిల్లీ: ఇండియా కూటమిలో భాగంగా బెంగాల్‌లో సీట్ల సర్ధుబాటు అంశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎట్టకేలకు తన పంతం తగ్గించుకుని కాంగ్రెస్‌తో చర్చకు రెడీ అయినట్టు రాజకీయా వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో బెంగాల్‌లో దాదాపు ఆరు లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. 

వివరాల ప్రకారం.. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇండియ కూటమికి బూస్ట్‌ లభించింది. ఇండియా కూటమిలో సీట్ల విషయంలో మమతా బెనర్జీ కూడా తన వైఖరిని తగ్గించుకున్నట్టు తెలుస్తోంది. అయితే, గతంలో పశ్చిమ బెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని మమతా బెనర్జీ ప్రకటించారు. కానీ ఇప్పుడు బెంగాల్, మేఘాలయలో కూడా కాంగ్రెస్‌తో సీట్ల పంపకంపై చర్చలకు తృణమూల్ కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో మరికొన్ని రోజుల్లో సీట్ల పంపకంపై ఇరు పార్టీల మధ్య తుది చర్చలు జరిగే అవకాశం ఉంది. 

ఇక, రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరితే బెంగాల్‌లో ఆరు లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్‌ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. బెంగాల్‌లోని బెహ్రంపూర్‌, దక్షిణ మాల్దా, ఉత్తర మాల్దా, రాయిగంజ్‌, డార్జిలింగ్‌, పురిలియా స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ చేసే ఛాన్స్‌ ఉన్నట్టు సమాచారం. ఇందుకు మమతా బెనర్జీ కూడా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, దీనికి ప్రతిగా మేఘాలయ, అస్సాంలలో ఒక్కో సీటును టీఎంసీ కోరుతోందని సమాచారం. 

ఇదిలా ఉండగా.. సార్వత్రిక ఎన్నికలకు ముందు, కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ మధ్య ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో అధికారికంగా సీట్ల ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. యూపీలో కాంగ్రెస్.. అమేథీ, రాయ్‌బరేలీ సహా 17 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపేందుకు అఖిలేష్ ఒప్పుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా అఖిలేష్‌కు ఎంపీ సీటు ఇచ్చింది. అటు ఆమ్‌ ఆద్మీ పార్టీతో కూడా కాంగ్రెస్‌ సీట్లు ఒప్పందం కుదుర్చుకుంది. 

Advertisement
Advertisement