-
2026 ఆఖర్లో టాటా ‘ధోలేరా’ చిప్
ధోలేరా (గుజరాత్): టాటా ఎల్రక్టానిక్స్ తలపెట్టిన ధోలేరా (గుజరాత్) ప్లాంటు నుంచి చిప్ల తొలి బ్యాచ్ 2026 డిసెంబర్ నాటికి అందుబాటులోకి రాగలదని కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. ఈ ప్లాంటులో 28, 50, 55 నానోమీటర్ నోడ్ల చిప్స్ తయారు కానున్నాయని పేర్కొన్నారు. టాటా గ్రూప్నకు చెందిన రెండు, సీజీ పవర్కి చెందిన ఒక చిప్ ప్లాంటుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ఈ మూడింటిపై కంపెనీలు మొత్తం రూ. 1.26 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నాయి. మూడు భారీ సెమీకండక్టర్ల ప్లాంట్లకు ఒకే రోజున శంకుస్థాపన చేయడం రికార్డని మంత్రి చెప్పారు. 2029 నాటికి టాప్ 5 సెమీకండక్టర్ల వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టాటా ఎల్రక్టానిక్స్ సెమీకండక్టర్ల ప్రాజెక్టులతో అస్సాంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 72,000 పైచిలుకు ఉద్యోగాల కల్పన జరగగలదని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. -
టాటా సన్స్ మెగా ఐపీవో!
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా సన్స్ పబ్లిక్ ఇష్యూకి రానున్నట్లు ఈక్విటీ మార్కెట్ రీసెర్చ్ సంస్థ స్పార్క్ క్యాపిటల్ పేర్కొంది. టాటా గ్రూప్ ఎన్బీఎఫ్సీ హోల్డింగ్ కంపెనీ విలువను రూ. 7.8 లక్షల కోట్లుగా మదింపు చేసింది. గ్రూప్ కంపెనీల ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం విలువ మదింపు చేయగా.. ఆర్బీఐ నిబంధనల ప్రకారం రానున్న 18 నెలల్లో టాటా సన్స్ ఐపీవో చేపట్టనున్నట్లు తెలియజేసింది. అప్పర్లేయర్ ఎన్బీఎఫ్సీగా ఆర్బీఐ గతేడాది గుర్తింపునిచి్చన నేపథ్యంలో 2025 సెపె్టంబర్కల్లా తప్పనిసరిగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ కావలసి ఉన్నట్లు స్పార్క్ పేర్కొంది. ఇందుకు ఏడాదిన్నర కాలంలో పబ్లిక్ ఇష్యూ చేపట్టవలసి ఉంటుందని తెలియజేసింది. దీంతో సంక్లిష్టంగా ఉన్న గ్రూప్ హోల్డింగ్ నిర్మాణం సరళతరమయ్యేందుకు వీలుంటుందని అభిప్రాయపడింది. కాగా.. ఇటీవల వెలువడిన సమాచారం ప్రకారం కంపెనీ రూ. 11 లక్షల కోట్ల విలువను అందుకోగలదని వెల్లడించింది. వెరసి ఐపీవో పరిమాణం రూ. 55,000 కోట్లుగా ఉండవచ్చని అంచనా వేసింది. టాటా సన్స్ హోల్డింగ్స్లో 80 శాతం మోనిటైజబుల్ కానప్పటికీ పునర్వ్యవస్థీకరణ కారణంగా కంపెనీ రీరేటింగ్ను సాధించే వీలున్నట్లు పేర్కొంది. విలువ జోడింపు అన్లిస్టెడ్ పెట్టుబడులతో పలు మార్గాల ద్వారా టాటా సన్స్కు అదనపు విలువ జమకానున్నట్లు స్పార్క్ క్యాపిటల్ తెలియజేసింది. ఇటీవల సెమీకండక్టర్స్ తదితర ఆధునికతరం విభాగాలలోకి టాటా గ్రూప్ ప్రవేశించడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. టాటా ఎలక్ట్రానిక్స్.. చిప్ తయారీ ప్రణాళికలు ప్రకటించిన విషయం విదితమే. టాటా టెక్నాలజీస్, టాటా మెటాలిక్స్, ర్యాలీస్ తదితర అనుబంధ సంస్థలను పేర్కొంది. ఫలితంగా టాటా గ్రూప్ మరో రూ. 1–1.5 లక్షల కోట్ల విలువను జోడించుకోనున్నట్లు అంచనా వేసింది. లిస్టెడ్, అన్ లిస్టెడ్ కంపెనీలు, ప్రిఫరెన్స్ షేర్లు, ఫండ్స్లో పెట్టుబడులను పరిగణించి విలువను మదింపు చేసింది. టీసీఎస్ బలిమి టాటా సన్స్ విలువలో సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టీసీఎస్ అతిపెద్ద వాటాను ఆక్రమిస్తోంది. టీసీఎస్ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం టాటా సన్స్ వాటా విలువ రూ. 10 లక్షల కోట్ల వరకూ ఉంటుంది. అన్లిస్టెడ్ కంపెనీలు, పెట్టుబడులుకాకుండా గ్రూప్లోని ఇతర లిస్టెడ్ దిగ్గజాలు టాటా మోటార్స్, టాటా పవర్, ఇండియన్ హోటల్స్లో యాజమాన్య వాటాలు కలిగి ఉంది. టాటా కెమికల్స్లో అత్యధిక స్థాయి(కంపెనీ విలువలో 80 శాతం)లో యాజమాన్య హక్కులను కలిగి ఉంది. కాగా.. టాటా సన్స్లో దొరాబ్జీ టాటా ట్రస్ట్ 28 శాతం, రతన్ టాటా ట్రస్ట్ 24 శాతం, సైరస్ మిస్త్రీ కుటుంబ పెట్టుబడి సంస్థ(స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెంట్) 9 శాతం, ఇతర ప్రమోటర్లు 14 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నాయి. -
ఎయిరిండియాకు ఏమైంది? ‘వెజ్ మీల్స్లో చికెన్ ముక్కలు’!
టాటా సన్స్ గ్రూప్ ఆధీనంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తుందా? ఫలితంగా ప్రయాణికులకు ఎయిరిండియా సంస్థపై నమ్మకం సన్నగిల్లుతుందా? అంటే అవుననే అంటున్నాయి ఎయిరిండియా సంస్థలోని వరుస సంఘటనలు. టాటా సన్స్ ఎయిరిండియాను కొనుగోలు చేసిన ఆరంభం నుంచి ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. ఇప్పటికే ప్రయాణికులపై మూత్ర విసర్జన,దుబాయ్- ఢిల్లీ ఎయిరిండియా విమానం కాక్పిట్లోకి ప్రియురాలు, మహిళ భోజనంలో రాయి వంటి వరుస వివాదాలతో ఆ సంస్థ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. తాజాగా, మరో మహిళ వెజ్మీల్స్లో చికెన్ ముక్కలు కనిపించడంతో కంగుతినడం ఆమె వంతైంది. వీర్జైన్ అనే మహిళ ప్రయాణికురాలు కాలికట్ టూ ముంబై ఏఐ582 ఎయిరిండియా విమానం ఎక్కింది. సాయంత్రం 6.40 బయలుదేరాల్సిన విమానం 7.40కి ప్రారంభమైంది. కొన్ని సార్లు రాకపోకల కారణంగా ఫ్లైట్ జర్నీ కొంచెం ఆలస్యం అవుతుందిలే అని సర్ది చెప్పుకుంది. వీర్జైన్కు జర్నీ ప్రారంభమైంది. కొద్దిసేపటికి బాగా ఆకలివేసిన వీర్జైన్ వెజ్మీల్స్ ఆర్డర్ చేసింది. సిబ్బంది వెజ్మీల్స్ తెచ్చారు. అసలే ఆకలి..పైగా ప్లేట్లో మీల్స్ వేడివేడిగా ఉండడంతో ఆతృతగా ఆరగించే ప్రయత్నం చేసింది. క్రూ సిబ్బంది సర్వ్ చేసిన ఆహార ప్యాకెట్పై ‘వెజ్ మెయిన్ మీల్’ అని స్పష్టంగా రాసిఉన్నా.. అందులో చికెన్ పీసెస్ రావడం పట్ల ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఇలా ఎందుకు జరిగిందని ఎయిరిండియా కేబిన్ సూపర్వైజర్ సోనాని ప్రశ్నించింది. వీర్జైన్తో పాటు తన స్నేహితురాలు సైతం తన వెజ్ ప్లేట్లో చికెన్ ముక్కలు వచ్చాయంటూ ఫిర్యాదు చేసింది. పట్టించుకోని ఎయిరిండియా సిబ్బంది? అయితే జరిగిన తప్పిందంపై ఎయిరిండియా సిబ్బంది సరిగ్గా స్పందించ లేదని.. సంబంధిత సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తనని ఆశ్చర్యానికి గురి చేసిందంటూ ఎయిరిండియా విమానంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. దిగొచ్చిన ఎయిరిండియా.. ఆపై క్షమాపణలు ప్రస్తుతం ఆఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా..ఇలాగే పునరావృతమైతే ఎయిరిండియాపై ప్రయాణికులకు నమ్మకాన్ని పోగొట్టుకుంటుందంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎయిరిండియాకు ఏమైందని, ఆ సంస్థ సీఈఓ కాంప్బెల్ విల్సన్, మాతృ సంస్థ టాటా గ్రూప్ చర్యలు తీసుకుంటే బాగుంటుదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక సోనాజైన్ ఫోటోలపై ఎయిరిండియా స్పందిస్తూ క్షమాణలు చెప్పింది. చదవండి👉 అంబానీతో పోటీపడి.. ఆపై అడ్డంగా దొరికిపోయిన గౌతమ్ సింఘానియా! -
రతన్ టాటాకు ప్రాణ హాని
ముంబై: టాటా సన్స్ మాజీ చైర్మన్, దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు ప్రాణ హాని ఉందంటూ వచ్చి న ఫోన్ కాల్ శనివారం ముంబై పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. రతన్ టాటాకు తక్షణం భద్రత పెంచాలని, లేదంటే టాటా సన్స్ మరో మాజీ చైర్మన్, పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీకి పట్టిన గతే పడుతుందని కాలర్ హెచ్చరించాడు. సైరస్ మిస్త్రీ 2022 సెప్టెంబర్ నాలుగో తేదీన కారు ప్రమాదంలో దుర్మరణం పాలవడం తెలిసిందే. దాంతో పోలీసులు ఆగమేఘాల మీద రతన్ టాటా భద్రతను పెంచారు. కాల్ కర్ణాటక నుంచి వచ్చినట్టు తేల్చారు. కాల్ చేసిన వ్యక్తిని పుణేకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే, అతను ఐదు రోజులుగా ఆచూకీ లేడంటూ భార్య అప్పటికే స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన విషయం పోలీసుల దర్యాప్తు సందర్భంగా వెలుగులోకి వచ్చింది. బంధుమిత్రులను విచారించగా ఇంజనీరింగ్, ఎంబీఏ ఫైనాన్స్ చేసిన అతనికి కొంతకాలంగా మతిస్థిమితం లేదని తేలింది. కర్ణాటకలో వేరొకరి ఇంట్లోంచి ఫోన్ తీసుకుని వారికి చెప్పకుండానే ముంబై కంట్రోల్ రూమ్కు ఇతను ఫోన్ చేసి హెచ్చరించినట్లు దర్యాప్తులో తేలింది. మనోవైకల్య బాధితుడు కావడంతో కేసు నమోదు, విచారణ వంటి చర్యలు చేపట్టకూడదని పోలీసులు నిర్ణయించారు. -
1నుంచి టీసీఎస్ బైబ్యాక్
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సరీ్వసెస్(టీసీఎస్).. సొంత ఈక్విటీ షేర్ల కొను గోలు(బైబ్యాక్)ను డిసెంబర్ 1నుంచి ప్రారంభించనుంది. షేరుకి రూ. 4,150 ధర మించకుండా 1.12 శాతం ఈక్విటీకి సమానమైన 4.09 కోట్ల షేర్లను కొనుగోలు చేయనుంది. ఇందుకు మొత్తం రూ. 17,000 కోట్లవరకూ వెచి్చంచనుంది. బైబ్యాక్లో భాగంగా రూ. 2 లక్షల పెట్టుబడిలోపుగల చిన్న ఇన్వెస్టర్ల వద్దగల ప్రతీ 6 షేర్లకుగాను 1 షేరుని తీసుకోనుంది. ఇందుకు రికార్డ్ డేట్ నవంబర్ 25కాగా.. ఇతర సంస్థాగత ఇన్వెస్టర్ల వద్దగల ప్రతీ 209 షేర్లకుగాను 2 షేర్లను కొనుగోలు చేయనుంది. ఈక్విటీ షేర్ల తాజా బైబ్యాక్ ప్రభావం కంపెనీ లాభదాయకత లేదా ఆర్జనపై ఎలాంటి ప్రభావాన్నీ చూపబోదని ఈ సందర్భంగా కంపెనీ స్పష్టం చేసింది. బైబ్యాక్ కారణంగా పెట్టుబడులకు వినియోగించగల నిధులు మాత్రమే ఆమేర తగ్గనున్నట్లు వివరించింది. వెరసి కంపెనీ వృద్ధి అవకాశాలకు ఎలాంటి విఘాతం కలగబోదని స్పష్టం చేసింది. ప్రమోటర్ల వాటా.. టీసీఎస్లో ప్రమోటర్ టాటా సన్స్ 72.27 శాతానికి సమానమైన 26.45 కోట్ల షేర్లను కలిగి ఉంది. వీటిలో బైబ్యాక్కు 2.96 కోట్ల షేర్లను దాఖలు చేయనుంది. ఇక టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ తమవద్ద గల 10,14,,172 షేర్లలో 11,358 షేర్లను టెండర్ చేయనుంది. టీసీఎస్ మొత్తం 4,09,63,855 షేర్లను బైబ్యాక్ చేసే లక్ష్యంతో ఉంది. బైబ్యాక్కు పూర్తిస్థాయిలో షేర్లు దాఖలైతే కంపెనీలో ప్రమోటర్ల వాటా ప్రస్తుత 72.3 శాతం నుంచి 72.41 శాతానికి బలపడనుంది. కాగా.. బైబ్యాక్ పూర్తయిన తదుపరి ఏడాదివరకూ టీసీఎస్ మూలధన సమీకరణ చేపట్టబోదు. గతేడాది సైతం షేరుకి రూ. 4,500 ధరలో ఈక్విటీ బైబ్యాక్కు రూ. 18,000 కోట్లు వెచ్చించిన సంగతి తెలిసిందే. అంతక్రితం 2020, 2018, 2017లలో సైతం బైబ్యాక్లకు సుమారు రూ. 16,000 కోట్లు చొప్పున పెట్టుబడులను వెచి్చంచడం విశేషం! కంపెనీ తొలిసారి 2017లో మార్కెట్ ధరకంటే 18 శాతం అధిక ధరలో షేర్ల కొనుగోలుకి తెరతీసింది. ఆపై 18–10 శాతం మధ్య ప్రీమియంలో బైబ్యాక్లను పూర్తి చేసింది. 2022 బైబ్యాక్కు 17 శాతం అధిక ధరను చెల్లించింది. తాజా బైబ్యాక్ తదుపరి షేరువారీ ఆర్జన(ఈపీఎస్) రూ. 58.52 నుంచి 59.18కి మెరుగుపడనుంది. ఈ నేపథ్యంలో టీసీఎస్ షేరు ఎన్ఎస్ఈలో 1.3 శాతం లాభపడి రూ. 3,515 వద్ద ముగిసింది. -
ప్రపంచ కుబేరుల జాబితాలో 'రతన్ టాటా' ఎందుకు లేరు - కారణం ఇదే!
ప్రపంచం కుబేరుల జాబితాలోనే కాదు, భారతదేశంలోని టాప్ 10 ధనవంతుల లిస్ట్లో కూడా దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'రతన్ టాటా' (Ratan Tata) పేరు ఎందుకు లేదనే సందేహం ఇప్పటికే చాలామంది మనసులో ఒక ప్రశ్నగా మిగిలి ఉంటుంది. ఈ కథనంలో ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. ఉప్పు నుంచి కార్లు, విమానం, బంగారం, ఐటీ వంటి అన్ని రంగాల్లోనూ తమదైన రీతిలో దూసుకెళ్తున్న టాటా సన్స్ కంపెనీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన ఈయన సంపద వేల కోట్లలో ఉంటుంది. అయినప్పటికీ ధనవంతుల జాబితాలో ఈయన పేరు లేదు. దీనికి ప్రధాన కారణం ఎక్కువ డబ్బుని దాతృత్వానికి వినియోగించడమే. అపారమైన వ్యాపార సామ్రాజ్యం, అంతకు మించిన పేరు ప్రతిష్టతలు కలిగిన రతన్ టాటా 2022లో భారతదేశంలోని ధనవంతుల జాబితాలో 421వ స్థానంలోనూ.. 2021లో 433వ స్థానంలో నిలిచారు. కంపెనీ నుంచి వచ్చే ఆదాయంలో దాదాపు 66 శాతం టాటా ట్రస్టుల ద్వారా సేవా కార్యక్రమాలకు విరాళంగా అందిస్తున్నారు. ఈ కారణంగానే టాప్ 10 ధనవంతుల జాబితాలో కూడా ఉండలేకపోతున్నారు. ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రాపై కేసు నమోదు.. కారణం ఇదే! 2021 - 22లో టాటా కంపెనీల మొత్తం ఆదాయం 128 బిలియన్ డాలర్లు అని నివేదికలు చెబుతున్నాయి. టాటా సంస్థల్లో ఏకంగా 9,35,000 కంటే ఎక్కువమంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. కాగా రతన్ టాటా 2012లో టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. -
నమ్మరు కానీ రతన్ టాటా తమ్ముడితడే.. చిన్న అపార్ట్మెంట్లో..
Ratan Tata Brother Jimmy Naval Tata: భారతీయ ఆటో మొబైల్ రంగానికి ఆజ్యం పోసిన టాటా కుటుంబం గురించి అందరికి తెలుసు. అయితే ఇప్పుడు టాటా గ్రూప్ అనగానే 'రతన్ టాటా' గుర్తుకు వస్తాడు. అయితే రతన్ టాటాకి వివాహం కాలేదు, కానీ తోబుట్టువులతో కూడిన ఒక కుటుంబం ఉంది. ఈ కుటుంబంలో చెప్పుకోదగ్గ వ్యక్తి రతన్ టాటా తమ్ముడు 'జిమ్మీ నావల్ టాటా'. రతన్ టాటా తమ్ముడంటే ఆయన మాదిరిగానే వ్యాపార లావాదేవీలు బాగా చూసుకునే వ్యాపార వేత్త, బిలీనియర్ అని ఊహిస్తారు. కానీ ఆలా ఊహిస్తే మీ ఊహ తప్పే అవుతుంది. ఎందుకంటే జిమ్మీ నావల్ టాటా వారి వ్యాపార సామ్రాజ్యానికి దూరంగా సాధారణ ప్రజలలో ఒకరుగా కలిసి జీవిస్తున్నాడు. ఇప్పటికి కూడా ఆయన ముంబైలో ఒక 2BHK అపార్ట్మెంట్లో నివసిస్తున్నట్లు సమాచారం. జిమ్మీ నావల్ టాటా మీడియాకి దూరంగా ఉండటమే కాకూండా, వ్యాపారాలన్నింటికీ కూడా దూరంగా ఉంటూ చాలా సాధారణ జీవితం గడుపుతున్నాడు. నావల్ టాటా కుమారుడు, రతన్ టాటా తమ్ముడై ఉండి ఇలాంటి జీవితం గడుపుతున్న జిమ్మీ నావల్ టాటాను చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. 90వ దశకంలోనే జిమ్మీ నావల్ తన తండ్రి ఆధ్వర్యంలో ఏర్పాటైన వస్త్ర వ్యాపారంలో వృత్తిని ప్రారంభించి, ఆ తరువాత అనేక టాటా ఆధ్వర్యంలో ఉన్న కంపెనీలలో పనిచేసి అనతి కాలంలోనే విరమణ తీసుకున్నాడు. అప్పటి నుంచి ఒక చిన్న ఫ్లాట్లో సామాన్యుడిలా జీవిస్తున్నాడు. View this post on Instagram A post shared by Ratan Tata (@ratantata) ఈ ఏడాది ప్రారంభంలో రతన్ టాటా తన తమ్ముడు జిమ్మీ టాటాతో కలిసి ఉన్న ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'అవి సంతోషకరమైన రోజులు, మా మధ్య ఏమి రాలేదు' అని ఇందులో రాసారు. ఆ ఫోటో 1945లో తీసుకున్నట్లు ఇందులో స్పష్టంగా తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఇండియాలో బిజినెస్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్న అమెరికన్ సిస్టర్స్.. వారు చేసే బిజినెస్ ఏంటో తెలుసా?) రతన్ టాటా ఆస్తులు సుమారు రూ. 3500 కోట్లకంటే ఎక్కువ. అయితే ఇప్పటి వరకు చాలా మందికి తెలియని జిమ్మీ నావల్ రతన్ టాటా కంటే 2 సంవత్సరాలు చిన్నవాడు. ఎందుకు ఈయన వ్యాపారాల మీద ఆసక్తి చూపడం లేదు అనేదానికి సంబంధించిన సమాచారం అందుబాటులో లేదు. బహుశా ప్రశాంతమైన జీవితం గడపాలని నిర్ణయించుకోవడం వల్ల అన్నింటికీ దూరంగా ఉన్నాడని తెలుస్తుంది. (ఇదీ చదవండి: అమెరికా వద్దు భారత్ ముద్దు.. 60 ఏళ్ల వయసులో 100 వ్యాపారాలు) Did you know of Ratan Tata's younger brother Jimmy Tata who lives a quiet reticent life in a humble 2 bhk flat in Colaba, Mumbai! Never interested in business, he was a very good squash player and would beat me every time. Low profile like the Tata group! pic.twitter.com/hkp2sHQVKq — Harsh Goenka (@hvgoenka) January 19, 2022 RGP ఎంటర్ప్రైజెస్ చైర్మన్ హర్ష గోయాంక్ గతంలో షేర్ చేసిన ఒక ట్విటర్ పోస్ట్లో జిమ్మీ టాటా ఒక చిన్న ఫ్లాట్లో ఉన్నారని, కుటుంబ వ్యాపారంపై పెద్దగా ఆసక్తి లేదని చెప్పారు. అంతే కాకుండా అతడు మంచి స్క్వాష్ ప్లేయర్ అని తనని (గోయెంకాను) ఎప్పుడూ ఓడించేవాడని చెప్పుకొచ్చాడు. కొన్ని వార్తా పత్రికలు అందించిన సమాచారం ప్రకారం.. జిమ్మీ టాటాకు మొబైల్ ఫోన్ లేదని, కేవలం వార్తాపత్రిక ద్వారా అతని అన్ని అప్డేట్లను పొందుతారని తెలిసింది. -
టాటా ట్రస్ట్స్ తొలి సీవోవోగా అపర్ణ ఉప్పలూరి
సాక్షి,ముంబై: టాటా ట్రస్ట్స్ కొత్త సీఈవో, సీవవో లను ఎంపిక చేసింది. సిద్ధార్థ్ శర్మను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా, అపర్ణ ఉప్పలూరిని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా నియమించింది. ఈ నియామకాలు ఏప్రిల్ 1, 2023 నుండి అమల్లోకి వస్తాయని సంస్థ ఒక ప్రకటనలో మంగళవారం తెలిపింది. టాటా ట్రస్ట్స్ తొలి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO)గా అపర్ణ ఉప్పలూరి (48) ఎంపిక కావడం విశేషం. ప్రస్తుతం ఫోర్డ్ ఫౌండేషన్లో భారతదేశం, నేపాల్ శ్రీలంకలకు ప్రోగ్రామ్ డైరెక్టర్గా ఉన్నారు ఆమె. 2018, మేలో ప్రోగ్రాం ఆఫీసర్గా ఫౌండేషన్లో చేరిన ఆమె పరోపకారం, మహిళల హక్కులు, ప్రజారోగ్యం, కళలు సాంస్కృతిక రంగాలలో వ్యూహాత్మక ప్రణాళిక కార్యక్రమాల అభివృద్ధిలో పాపులర్ అయ్యారు అపర్ణ. జెండర్ ఈక్వాలిటీ ప్రోగ్రాంని ముందుకు తీసుకెళ్లడంతోపాటు ఫోర్డ్ ఫౌండేషన్లో గ్రాంట్-మేకింగ్ కార్యక్రమాల నిర్వహణలో 20 ఏళ్ల లీడర్షిప్ , మేనేజ్మెంట్ అనుభవం ఆమె సొంతం. ఇక 2022లో టాటా ట్రస్ట్ల సీఈవో పదవికి రాజీనామా చేసిన ఎన్ శ్రీనాథ్ ప్లేస్లో సిద్ధార్థ్ శర్మ శర్మ ఎంపికైనారు. కాగా టాటా ట్రస్ట్స్, భారతదేశంలోని పురాతన స్వచ్ఛంద సంస్థల్లో ఒకటి, టాటా సన్స్లో 66 శాతం వాటాను టాటా ట్రస్ట్స్ సొంతం. -
‘ఆ కారు ఎప్పటికీ నాకు ప్రత్యేకమే’.. రతన్ టాటా భావోద్వేగ పోస్ట్ వైరల్!
రతన్ టాటా.. ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. ఆయన ప్రముఖ వ్యాపారవేత్తగానే కాకుండా తన దాతృత్వ కార్యక్రమాల ద్వారా ఎనలేని గుర్తింపు సంపాదించుకున్నారు. వ్యాపారంలో ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లను తన పోస్ట్లతో పలకరిస్తూ భారీగా ఫోలోవర్స్ని సంపాదించుకున్నారు. తాజాగా ఆయన సోషల్మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశ ప్రగతి కోసం తన వంతు కృషి చేయడంలో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. తాజాగా ఆయన టాటా ఇండికా కారుని ప్రారంభించ 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దాన్ని గుర్తుచేసుకుంటూ తన ఇన్స్టాగ్రామ్లో భావోద్వేగ పోస్ట్ చేశారు. అందులో .. ‘25 ఏళ్ల క్రితం టాటా ఇండికా ప్రారంభం కావడంతో భారతదేశ స్వదేశీ ప్యాసింజర్ కార్ల పరిశ్రమకు పునాది పడింది. ఇది మధురమైన జ్ఞాపకాలను నాకు ఎప్పుడూ గుర్తు చేస్తుంది. ఈ కారుకు నా మనస్సులో ప్రత్యేక స్థానం ఉందంటూ..’ టాటా ఇండికాతో దిగిన ఫోటో షేర్ చేశారు. 1998లో ఇండికా టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహన విభాగాన్ని ప్రారంభించింది. ఈ వాహనం ప్రారంభించిన రెండు సంవత్సరాలలోనే సక్సెస్ ట్రాక్లోకి వచ్చింది. ఇందులోని ఫీచర్లు, అందుబాటు ధరల కారణంగా త్వరగా ఈ కారు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే, ఇరవై సంవత్సరాల తర్వాత, టాటా మోటార్స్ ఈ విభాగంలో గట్టి పోటీని ఎదుర్కొన్న తర్వాత 2018లో కాంపాక్ట్ హ్యాచ్బ్యాక్ ఉత్పత్తిని నిలిపివేసింది. View this post on Instagram A post shared by Ratan Tata (@ratantata) చదవండి: ‘అప్పుడు తండ్రిని.. ఇప్పుడు ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాను’.. అమెజాన్ ఉద్యోగుల అంతులేని వ్యథ -
సంస్కరణలతో భారత్ వృద్ధికి దన్ను
న్యూఢిల్లీ: రాబోయే కొన్ని దశాబ్దాల పాటు భారత్కు వృద్ధి అవకాశాలు పటిష్టంగా ఉన్నాయని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ధీమా వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా అమలు చేస్తున్న సంస్కరణలు ఇందుకు ఊతంగా నిలవనున్నాయని ఆయన చెప్పారు. కరోనా మహమ్మారి ముందు, తర్వాత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంస్కరణలు 2047 నాటికి సాధించదల్చుకున్న లక్ష్యాలకు గట్టి పునాదిగా ఉండగలవని చంద్రశేఖరన్ చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు అయ్యే నాటి కి భారత్ 25–30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఆవిర్భవించగలదని ఆయన తెలిపారు. అయితే, అసంఘటిత రంగంలోని వర్కర్లు, వ్యవసాయ కార్మికులు, మహిళలు సహా ప్రజలందరికీ ఆ ఫలాలు దక్కేలా చూసుకోవడం చాలా ముఖ్యమని చంద్రశేఖరన్ పరిశ్రమ సమాఖ్య ఫిక్కీ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా వివరించారు. మహమ్మారి సమయం నుంచి వ్యవస్థాగత సంస్కరణలు మరింతగా పుంజుకున్నాయని ఆయన చెప్పారు. -
బీ20 చెయిర్గా ‘టాటా’ చంద్రశేఖరన్
న్యూఢిల్లీ: జీ–20లో భాగమైన బీ20 ఇండియా చెయిర్గా టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసినట్లు పరిశ్రమల సమాఖ్య సీఐఐ వెల్లడించింది. జీ–20 దేశాల వ్యాపార వర్గాలకు బిజినెస్ 20 (బీ–20) చర్చా వేదికగా ఉండనుంది. ప్రస్తుతం జీ–20 కూటమికి భారత్ సారథ్యం వహిస్తోంది. ఈ నేపథ్యంలో దేశీ పరిశ్రమ వర్గాల అజెండాను అంతర్జాతీయ వ్యాపార దిగ్గజాలకు తెలియజేయడానికి కూడా బీ20 తోడ్పడనుంది. సమతూక అభివృద్ధి సాధన దిశగా గ్లోబల్ బీ20 అజెండాను ఇది ముందుకు తీసుకెళ్లగలదని, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనే పరిష్కార మార్గాలను కనుగొనడంలో జీ–20కి సహాయకరంగా ఉండగలదని చంద్రశేఖరన్ చెప్పారు. -
Cyrus Mistry: గౌరవం కోసం పోరాటం..
ముంబై: పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. దీనితో, కొన్నాళ్ల క్రితమే టాటా గ్రూప్ నుంచి అర్ధాంతరంగా ఉద్వాసనకు గురైన మిస్త్రీ తాజాగా జీవితం నుంచి కూడా అర్ధాంతరంగా నిష్క్రమించినట్లయింది. టాటా సన్స్లో అత్యధికంగా 18 శాతం పైగా వాటాలున్న షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ తరఫున 2012లో టాటా గ్రూప్ చైర్మన్గా పగ్గాలు చేపట్టే వరకూ.. కుటుంబ వ్యాపార వర్గాల్లో తప్ప సైరస్ మిస్త్రీ పేరు పెద్దగా బైట వినిపించేది కాదు. 1991లో మిస్త్రీ తమ కుటుంబ వ్యాపార సంస్థ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్లో (ఎస్పీ) డైరెక్టరుగా చేరారు. 1994లో ఎండీగా నియమితులయ్యారు. ఎస్పీ గ్రూప్ కార్యకలాపాలు మెరైన్, ఆయిల్, గ్యాస్, రైల్వే తదితర రంగాల్లోకి విస్తరించడంలో ప్రధాన పాత్ర పోషించారు. 2006లో కీలకమైన టాటా సన్స్ బోర్డులో చేరారు. అప్పటివరకూ ఆయన పలు టాటా కంపెనీల బోర్డుల్లో సభ్యుడిగా కొనసాగారు. సాధారణంగా నలుగురిలో ఎక్కువగా కలవకపోయినా.. తెలిసినంత వరకూ వ్యాపార దక్షత విషయంలో ఆయనకు మంచి పేరు ఉండేది. ఇదే టాటా గ్రూప్ చీఫ్ రతన్ టాటా తన వారసుడిగా మిస్త్రీని ఎంచుకునేలా చేసింది. వాస్తవానికి టాటా పగ్గాలు చేపట్టడానికి మిస్త్రీకి ఇష్టం లేకపోయినప్పటికీ రతన్ టాటా స్వయంగా నచ్చచెప్పడంతో ఆయన అంగీకరించినట్లు సన్నిహిత వర్గాలు చెబుతాయి. అలా 44 ఏళ్ల వయస్సులో, దేశంలోనే అతి పెద్ద దిగ్గజాల్లో ఒకటైన టాటా గ్రూప్ చీఫ్గా బాధ్యతలు తీసుకున్న మిస్త్రీ సంస్థను కొత్త బాటలో నడిపించే ప్రయత్నం చేశారు. టాటాల కుటుంబానికి చెందిన వారు కాకుండా వేరొకరు టాటా గ్రూప్నకు సారథ్యం వహించడం అదే ప్రథమం. కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలను మెరుగుపర్చడంపై ఆయన దృష్టి పెట్టారు. నష్టాల్లో ఉన్న సంస్థలను, ఉత్పత్తులను నిలిపివేసి.. లాభదాయక ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్పటివరకూ ఎక్కువగా బిజినెస్ టు బిజినెస్ (బీ2బీ)కి పరిమితంగా ఉంటున్న సంస్థ .. మరింతగా వినియోగదారులకు సంబంధించిన ఉత్పత్తులు, సేవలవైపు మళ్లే విధంగా ప్రణాళికలను రూపొందించేందుకు కృషి చేశారు. ఇందుకోసం తగు సిఫార్సులు చేసేందుకు టాటా గ్రూప్లోని సీనియర్ ఎగ్జిక్యూటివ్లు, పరిశ్రమ నిపుణులు, విద్యావేత్తలతో ఒక గ్రూప్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ను (జీఈసీ) ఏర్పాటు చేశారు. టాటాతో విభేదాలు.. ఉద్వాసన .. అయితే, ఈ క్రమంలో వ్యాపార వ్యవహార శైలి విషయంలో మిస్త్రీ, రతన్ టాటాల మధ్య విభేదాలు తలెత్తాయి. చివరికి 2016 అక్టోబర్లో ఆయన అర్ధాంతరంగా చైర్మన్ పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యారు. ఆ తర్వాత టాటా సన్స్ డైరెక్టరుగా కూడా ఆయన్ను తప్పించారు. మిస్త్రీ కుటుంబం అతి పెద్ద వాటాదారే అయినప్పటికీ సైరస్ తన పదవిని కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో ఎన్ చంద్రశేఖర్ (టీసీఎస్ చీఫ్) .. గ్రూప్ పగ్గాలు అందుకున్నారు. న్యాయస్థానాల్లో చుక్కెదురు.. అవమానకరంగా తనను పంపించిన తీరుపై మిస్త్రీ న్యాయపోరుకు దిగారు. స్వయంగా టాటాపైనే విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘అహంభావంతో ఒక్కరు’’ తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలతో గ్రూప్ వ్యాపారానికి నష్టం జరుగుతోందని, టాటా వాస్తవాలు మాట్లాడటం లేదని ఆరోపించారు. తనను తొలగించడంపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ను (ఎన్సీఎల్టీ) ఆశ్రయించారు. అంతకు కొన్నాళ్ల క్రితమే తన పనితీరు అద్భుతమని ప్రశంసించి, అంతలోనే అలా ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలో బాంబే డయింగ్ చీఫ్ నుస్లీ వాడియా, ఆయన చిన్ననాటి స్నేహితురాలు.. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే తదితరులు ఆయన పక్షాన నిల్చారు. అయితే, బోర్డు, మెజారిటీ వాటాదారులు ఆయనపై విశ్వాసం కోల్పోయారంటూ ఎన్సీఎల్టీ 2018లో మిస్త్రీ పిటీషన్ను తోసిపుచ్చింది. దీనిపై ఆయన నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)ని ఆశ్రయించగా ఆయనకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. కానీ దీనిపై టాటాలు సుప్రీం కోర్టులో అప్పీలు చేయగా 2021 మార్చిలో ఇచ్చిన తుది తీర్పులో.. అత్యున్నత న్యాయస్థానం టాటాల పక్షం వహించింది. అయితే, అంతకు ముందు తీర్పులో ఆయనపై చేసిన కొన్ని ప్రతికూల వ్యాఖ్యలను తొలగించడం ద్వారా కొంత ఊరటనిచ్చింది. -
క్యాంప్బెల్ విల్సన్: ఆ పిచ్చే ఎయిరిండియా సీఈవోని చేసింది!
ఎయిరిండియా సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్గా క్యాంబెల్ విల్సన్ నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని టాటా సన్స్ ప్రకటించింది. 50ఏళ్ల విల్సన్కు విమానయాన రంగంలో 26ఏళ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం సింగపూర్ ఎయిర్లైన్స్(ఎస్ఐఏ) అనుబంధ సంస్థ అయిన స్కూట్కు సీఈవోగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా విల్సన్ను ఎయిరిండియాకు సీఈవోగా నియమించడం పట్ల ఎయిర్ ఇండియా చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ స్పందించారు. ప్రపంచ స్థాయి విమానయాన సంస్థను నిర్మించడంలో విల్సన్తో కలిసి చేసేందుకు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఐకానిక్ ఎయిరిండియా “ఐకానిక్ ఎయిరిండియాకు నాయకత్వం వహించడానికి, అత్యంత గౌరవనీయమైన టాటా గ్రూప్లో భాగస్వామి అవ్వడం గౌరవంగా ఉంది. ఎయిరిండియా ప్రపంచంలోని అత్యుత్తమ ఎయిర్లైన్స్లో ఒకటిగా అవతరించే దిశగా ప్రయాణం కొనసాగుతుంది. భారతీయ ఆతిథ్యం ప్రతిబింబించేలా ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సేవల్ని అందిస్తోంది. ఆ ఆశయాన్ని సాకారం చేసే లక్ష్యం దిశగా ఎయిరిండియా, టాటా సహోద్యోగులతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది"అంటూ ఎయిరిండియా కొత్త బాస్ విల్సన్ తెలిపారు. ఆ పిచ్చే ఎయిరిండియా సీఈవోని చేసింది న్యూజిలాండ్లో పుట్టి పెరిగిన కొత్త ఎయిర్ ఇండియా బాస్ క్యాంప్ బెల్ విల్సన్ న్యూజిలాండ్ కాంటర్బరీ యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్ ఆఫ్ కామర్స్ పూర్తి చేశారు. అనంతరం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా..ఎందుకో మనసు యూరప్, అమెరికాపై మళ్లింది.ఆ రెండు దేశాలు తిరిగి స్వదేశమైన న్యూజిల్యాండ్కు వచ్చిన ఆయనకు జర్నీలపై పిచ్చి పెరిగింది. ఆ జర్నీ పిచ్చే విల్సన్ ఎయిరిండియా సీఈవో అయ్యేందుకు దోహద పడిందనే చెప్పుకోవాలి. ఇక న్యూజిల్యాండ్కు తిరిగి వచ్చిన ఆయనకు విమానయాన రంగంపై మక్కువతో సింగపూర్ ఎయిర్లైన్స్(ఎస్ఐఏ)లో మేనేజ్మెంట్ ట్రైనీగా తన కెరీర్ను ప్రారంభించాడు. ఇప్పుడు దాని అనుబంధ సంస్థ స్కూట్కి సీఈవో స్థాయికి చేరుకున్నారు. అనేక పదవుల్లో చక్రం తిప్పారు ఏప్రిల్ 1996 నుండి ఎస్ఐఏ గ్రూప్లో ఉన్న అతను అనేక పదవులు చేపట్టారు. మే 2011లో అంటే స్కూట్లో చేరడానికి ముందు సింగపూర్ ఎయిర్లైన్స్ జనరల్ మేనేజర్గా,హాంకాంగ్కు ఎస్ఐఏ జనరల్ మేనేజర్తో పాటు, కెనడా ఎస్ఐఏకు వైస్ ప్రెసిడెంట్గా ఎస్ఐఏ హెడ్ ఆఫీస్ నెట్వర్క్ ప్లానింగ్, నెట్వర్క్ రెవెన్యూ మేనేజ్మెంట్ విభాగాలలో 3ఏళ్లు విధులు నిర్వహించారు. విల్సన్ ఎస్ఐఏ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్, మార్కెటింగ్)గా పనిచేశారు. దీంతో పాటు ధర, పంపిణీ, ఇ-కామర్స్, మర్చండైజింగ్, బ్రాండ్ అండ్ మార్కెటింగ్, గ్లోబల్ సేల్స్, ఎయిర్లైన్ యొక్క విదేశాల్లో ఉన్న ఎస్ఐఏ కార్యాలయాల్ని పర్యవేక్షించారు. ఏప్రిల్ 2020లో స్కూట్ సీఈవోగా పదోన్నతి సాధించారు. ఇప్పుడు ఎయిరిండియా సీఈవోగా ఆ సంస్థ ఖ్యాతిని దశదిశలా వ్యాపింప జేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. చదవండి👉టాటా గ్రూపుకి షాక్! సీఈవో పోస్టు వద్దన్న ఇల్కర్ ఆయ్సీ -
ఎయిర్ఏషియా ఇండియాపై ఎయిరిండియా కన్ను
న్యూఢిల్లీ: చౌక చార్జీల విమానయాన సంస్థ ఎయిర్ఏషియా ఇండియాను కొనుగోలు చేయాలని ఎయిరిండియా యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన డీల్కు అనుమతులు ఇవ్వాలంటూ కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ)కు దరఖాస్తు చేసుకుంది. ఎయిర్ఏషియా ఇండియాలో టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు 83.67 శాతం, మలేషియాకు చెందిన ఎయిర్ఏషియా గ్రూప్లో భాగమైన ఎయిర్ఏషియా ఇన్వెస్ట్మెంట్కు మిగతా వాటాలు ఉన్నాయి. ఎయిరిండియా, దాని అనుబంధ సంస్థ ఎయిరిండియా ఎక్స్ప్రెస్ను టాటా సన్స్లో భాగమైన టాలేస్ ఇటీవలే కొనుగోలు చేసింది. వీటితో పాటు సింగపూర్ ఎయిర్లైన్స్తో కలిసి ఫుల్ సర్వీస్ ఎయిర్లైన్ విస్తారాను కూడా టాటా గ్రూప్ నిర్వహిస్తోంది. విమానయాన సేవలను కన్సాలిడేట్ చేసుకునే క్రమంలో ఎయిర్ఏషియా ఇండియాను పూర్తిగా కొనుగోలు చేయాలని టాటా గ్రూప్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో మార్కెట్లో గుత్తాధిపత్య సమస్య తలెత్తకుండా నిర్దిష్ట డీల్స్కు సీసీఐ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతిపాదిత కొనుగోలుతో దేశీయంగా పోటీపై, మార్కెట్ వాటాపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదని సీసీఐకి చేసుకున్న దరఖాస్తులో ఎయిరిండియా పేర్కొన్నట్లు సమాచారం. -
ఎయిరిండియాకు కొత్త బాస్..
ఎయిర్ ఇండియాకు కొత్త సీఈవో ఎండీని నియమిస్తూ టాటా సన్స్ నిర్ణయం తీసుకుంది. 2022 ఫిబ్రవరి 14న జరిగిన బోర్డు సమావేశంలో ఐకెర్ ఆయ్సీని కొత్త బాస్గా నియమిస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటి వరకు టర్కీ ఎయిర్వేస్కి చీఫ్గా ఐకెర్ ఆయ్సీ ఉన్నారు. 2022 ఏప్రిల్ 1 నుంచి ఆయన ఎయిరిండియా చీఫ్గా బాధ్యతలు చేపడతారు. బిల్కెంట్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ అడ్మినిష్టేషన్ పట్టాను 1994లో పొందరు ఐకర్ ఆయ్సీ. అనంతరం యూకేలని లీడ్స్ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్లో పట్టా సాధించారు. టర్కీ ఫుడ్ ఫెడరేషన్ బోర్డ్ మెంబర్గా కూడా ఐకెర్ ఉన్నారు. అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్ఇండియాను కేంద్రం అమ్మకానికి పెట్టగా ఇటీవల టాటా సన్స్ సొంతం చేసుకుంది. అప్పటి నుంచి పాలనపరమైన సంస్కరణలు చేపడుతోంది. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా కొత్త సీఈవో, ఎండీలను నియమిస్తున్నట్టు టాటాసన్స్ చీఫ్ చంద్రశేఖరన్ వెల్డించారు. -
ఎయిర్ ఇండియాకు అసలు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?
దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కొద్ది రోజుల క్రితం తన సొంత గూటి(టాటా)కి చేరిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే, ఎయిర్ ఇండియాకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలియజేస్తూ టాటా గ్రూప్ ఒక ఆసక్తికర ట్వీట్ చేసింది. సుమారు 75 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఎయిర్ ఇండియాకు ఆ పేరు పెట్టడం వెనుక జరిగిన ఆసక్తికర ప్రక్రియను తన ట్విటర్ వేదికగా షేర్ చేసింది. ఆ పేరు పెట్టడానికి అప్పటి టాటా సంస్థ ఉద్యోగులు యాజమాన్యానికి ఎలా సహకరించారో సంస్థ వివరించింది. 1946లో టాటా సన్స్ విభాగం నుంచి టాటా ఎయిర్ లైన్స్ ఒక సంస్థగా విస్తరించినప్పుడు, సంస్థ దానికి ఒక పేరు పెట్టవలసి వచ్చింది. భారతదేశం మొదటి విమానయాన సంస్థకు సంస్థ 4 పేర్లను(ఇండియన్ ఎయిర్లైన్స్, పాన్-ఇండియన్ ఎయిర్లైన్స్, ట్రాన్స్-ఇండియన్ ఎయిర్లైన్స్, ఎయిర్-ఇండియా)లను ఎంపిక చేసింది. ఆ నాలుగు పేర్లలో ఒక పేరును ఎంపిక చేసేందుకు ప్రజాస్వామ్య బద్దంగా బాంబే హౌస్లోని టాటా ఉద్యోగుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టింది. ఉద్యోగులు తమ మొదటి, రెండవ ప్రాధాన్యతలను సూచించమని సంస్థ వారిని కోరింది. (2/2): But who made the final decision? Read this excerpt from the Tata Monthly Bulletin of 1946 to know. #AirIndiaOnBoard #WingsOfChange #ThisIsTata pic.twitter.com/E7jkJ1yxQx — Tata Group (@TataCompanies) February 6, 2022 మొదటి ఓటింగులో ఎయిర్-ఇండియాకు 64 ఓట్లు, ఇండియన్ ఎయిర్ లైన్స్'కు - 51 ఓట్లు, ట్రాన్స్-ఇండియన్ ఎయిర్ లైన్స్ కు -28 ఓట్లు, పాన్-ఇండియన్ ఎయిర్ లైన్స్ కు - 19 ఓట్లు వచ్చాయి. ఇందులో అధిక ఓట్లు వచ్చిన మొదటి రెండు పేర్లను ఎంపిక చేసి మరలా ఓటింగు ప్రక్రియను చేపట్టింది. అయితే, రెండవసారి ఓటింగులో ఎయిర్-ఇండియాకు 72 ఓట్లు, ఇండియన్ ఎయిర్ లైన్స్ కు 58 ఓట్లు వచ్చాయి. దీంతో తమ తమ నూతన విమానయాన సంస్థకు 'ఎయిర్-ఇండియా' అని పేరు పెట్టినట్లు ఆ ట్వీట్లో సంస్థ పేర్కొంది. (చదవండి: జియోబుక్ ల్యాప్టాప్ గురించి అదిరిపోయే అప్డేట్..!) -
విస్తారా ఎయిర్లైన్స్ అదిరిపోయే ఆఫర్.. రూ.977కే ఫ్లయిట్ జర్నీ!
విస్తారా ఎయిర్లైన్స్ కంపెనీ విమానయాన ప్రయాణికులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. నేటి(జనవరి 6) నుంచి 48 గంటల స్పెషల్ సేల్ను ప్రయాణికుల కోసం ముందుకు తీసుకొచ్చింది. టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్ఐఏల జాయింట్ వెంచర్ అయిన విస్తారా ఎయిర్లైన్స్ తన 7వ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భంగా సంస్థ ఈ ఆఫర్లను ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ మార్గాలలో విమాన ప్రయాణాలపై స్పెషల్ ధరలను ప్రకటించింది. దేశీయ విమాన టిక్కెట్ ధర ఎకానమీ క్లాస్కి కేవలం రూ.977 నుంచే ప్రారంభిస్తున్నట్టు విస్తారా ఎయిర్లైన్స్ తెలిపింది. జనవరి 6, 2022 నుంచి జనవరి 7, 2022 అర్ధరాత్రితో ముగిసే 48 గంటల స్పెషల్ సేల్లో ప్రయాణికులు పాల్గొని టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అని పేర్కొంది. అంతర్జాతీయ విమానాలకు కూడా ఈ సరికొత్త ఆఫర్ ధరలను ప్రకటించింది. కానీ, ప్రస్తుతం ఈ ఆఫర్ బుకింగ్ కోసం అందుబాటులో ఉన్న టిక్కెట్స్ మీద మాత్రమే వర్తిస్తాయి. 7వ వార్షికోత్సవ ఆఫర్లో భాగంగా అందిస్తోన్న ఈ టిక్కెట్ల ప్రయాణ కాలం ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు ఉండనుంది. విస్తారా ఎయిర్లైన్స్లో టాటా సన్స్ కి 51 శాతం మెజారిటీ వాటా ఉంది. విస్తారా వెబ్సైట్ ప్రకారం.. దేశీయ ప్రయాణానికి వన్ వే ఆల్ ఇన్ ఛార్జీలు కలిపి ఎకానమీ క్లాస్ కోసం ధర రూ. 977, ప్రీమియం ఎకానమీ కోసం ధర రూ. 2677, బిజినెస్ క్లాస్ కోసం ధర రూ. 9777 వద్ద నుంచి ప్రారంభం అవుతున్నాయి. అంతర్జాతీయం ప్రయాణానికి రిటర్న్ ఆల్-ఇన్ ఛార్జీలు కలిపి ఎకానమీ క్లాస్(ఢిల్లీ-ఢాకా) ధర రూ.13880, ప్రీమియం ఎకానమీ(ముంబై-మాల్దీవులు) ధర రూ. 19711, బిజినెస్ క్లాస్ (ముంబై-సింగపూర్) ధర రూ. 47981 వద్ద నుంచి ప్రారంభం అవుతున్నాయి. సంస్థ పేర్కొన్నట్లు రూ.977 టిక్కెట్ ధర జమ్ము-శ్రీనగర్ మార్గంలో ఉంది. విస్తారా వెబ్సైట్, ఐఓఎస్, ఆండ్రాయిడ్ మొబైల్ యాప్స్ ద్వారా ఈ ఆఫర్ కింద టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. లేదంటే విస్తారా టిక్కెట్ ఆఫీసులు, కాల్ సెంటర్లు, ఆన్ లైన్ ట్రావెల్ ఏజెన్సీలు, ట్రావెల్ ఏజెంట్ల ద్వారా కూడా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని కంపెనీ ప్రయాణికులకు సూచించింది. (చదవండి: 2022 సీఈఎస్ టెక్ షోలో హైదరాబాద్ కంపెనీ అదిరిపోయే ఆవిష్కరణ!) -
ఎయిరిండియా జాతీయీకరణ ఒక భారీ కుట్ర!
మన దేశంలో టాటా గ్రూప్ అంటే తెలియని వారు చాలా తక్కువ మంది ఉంటారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దేశంలో ఏ ప్రైవేట్ సంస్థకు లేని ఆదరణ టాటా గ్రూప్ సొంతం. ఇంత పెద్ద టాటా గ్రూప్, ఎయిరిండియాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, టాటా సన్స్ ఎయిరిండియాను రూ.18,000 కోట్లకు దక్కించుకున్నప్పుడు రతన్ టాటా ఒక బావోద్వేగా ట్వీట్ చేశారు. జెఆర్డీ టాటా ప్రస్తుతం జీవించి ఉంటే చాలా సంతోషించి ఉండేవారిని ఆ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. చాలా వరకు మన దేశంలోని ప్రజలు, మేధావి వర్గాలు ప్రైవేట్ కరణను వ్యతిరేకిస్తారు. కానీ, టాటా సన్స్ ఎయిరిండియాను కొనుగోలు చేసినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ ఆహ్వానించారు. అయితే, ఈ ఎయిరిండియా కొనుగోలు వెనుక ఒక పెద్ద చరిత్ర ఉంది. రతన్ టాటా అలా ట్వీట్ చేయడం వెనుక చాలా పెద్ద స్టోరీ ఉంది. ఇప్పుడు మనం ఆ స్టోరీ గురుంచి తెలుసుకుందాం.. ఎయిరిండియాను వ్యాపారం కోసం రతన్ టాటా దక్కించు కోలేదు. ఎయిర్ ఇండియా అనేది జెఆర్డీ టాటా కలల ప్రాజెక్టు. టాటా ఎయిర్ లైన్స్ ఏప్రిల్ 1932లో జెహంగీర్ రతన్ జీ దాదాభోయ్(ప్రేమగా జెఆర్డి అని పిలుస్తారు) టాటా నాయకత్వంలో ప్రారంభించారు. ఈ ఎయిర్ లైన్స్ ముఖ్య ఉద్దేశ్యం సామాన్య ప్రజానీకానికి సాధ్యమైనంత తక్కువ ధరలో వరల్డ్ క్లాస్ సదుపాయాలతో విమానయాన సౌకర్యాన్ని కల్పించడం. భారతరత్న అందుకున్న భారతదేశపు మొదటి పౌర విమానయాన పైలట్ టాటా గ్రూప్ ఛైర్మన్, ఏకైక పారిశ్రామికవేత్త జెఆర్డి. భారతీయ వాణిజ్య పౌర విమానయానం కథ అక్టోబర్ 15, 1932న ప్రారంభమైంది. Welcome back, Air India 🛬🏠 pic.twitter.com/euIREDIzkV — Ratan N. Tata (@RNTata2000) October 8, 2021 ఎయిరిండియా ఇంటర్నేషనల్ జెఆర్డి కరాచీ డ్రిగ్ రోడ్ ఏరోడ్రోమ్ నుంచి తన మొదటి అధికారిక టాటా ఎయిర్ లైన్స్ విమానంలో బయలుదేరి అప్పటి బొంబాయి జుహు ఎయిర్ స్ట్రిప్ వద్ద ల్యాండ్ అయ్యారు. తర్వాత 5 సంవత్సరాలలో టాటా ఎయిర్లైన్స్ లాభాలు గణనీయంగా పెరిగాయి. బాహ్య ప్రపంచంతో, 99.4% సమయపాలనతో సేవలు అందించే ఈ విమానయాన సేవలను భారత రాకుమారులు చాలా ఇష్టపడ్డారు. ఇక స్వాతంత్ర్య అనంతరం టాటా ఎయిర్ లైన్స్ పాకిస్తాన్ నుంచి భారతదేశానికి శరణార్థులను తరలించింది. 1947 అక్టోబరులో టాటా సన్స్ అంతర్జాతీయ వైమానిక సేవను ఎయిరిండియా ఇంటర్నేషనల్ పేరుతో స్థాపించాలని అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూను కోరితే వారు కూడా మూడు వారాల్లో ఆమోదించారు. బాంబే నుంచి లండన్ కు మొదటి ఎయిరిండియా ఇంటర్నేషనల్ విమానం జూన్ 1948లో సకాలంలో(కైరో, జెనీవా వద్ద ఆగిపోయిన కూడా) దిగింది. స్వాతంత్ర్యం తర్వాత పాన్ అమెరికన్, ట్రాన్స్ వరల్డ్ ఎయిర్ లైన్స్, కెఎల్ఎమ్, ఎయిర్ ఫ్రాన్స్ వంటి ఎయిర్ లైన్స్ దేశంలో విమానయాన సేవలు అందిస్తున్నాయి. జవహర్ లాల్ నెహ్రూ సోదరి దౌత్యవేత్త విజయలక్ష్మీ పండిట్ స్వతంత్ర భారత తొలి రాయబారిగా మాస్కోకు ఎయిరిండియా విమానంలో వెళ్ళింది. ఆమె విమానయాన సంస్థ సేవలు, ప్రమాణాల గురించి పొగుడుతూ జెఆర్డీ టాటాకు లేఖ రాసింది. ఇక క్రమ క్రమంగా ఎయిరిండియాకు ప్రజాదరణ వస్తుంది. ఈ సమయంలోనే అసలు సమస్య ఉత్పన్నం అయ్యింది. ఒడిదుడుకులు ప్రారంభం అప్పటి దేశ కమ్యూనికేషన్ మంత్రి భారతదేశం నాలుగు మూలలను కలిపే తపాలా సేవలను ప్రారంభించడానికి ఎయిరిండియా సేవలను కోరారు. ఆ ఆలోచన చాలా మంచిదే కానీ, ఎయిర్ ఇండియా ఈ ప్రతిపాదనను పరిశీలించడానికి ముందు రాత్రి ల్యాండింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని జెఆర్డి టాటా అప్పటి కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. దీనివల్ల రాత్రి వేల తపాలా సేవలను అందించాలని భావించారు. కానీ, ప్రభుత్వం అంగీకరించలేదు. రాను రాను ప్రభుత్వానికి, జెఆర్డీ టాటాకు మధ్య దూరం పెరిగింది. దీంతో అప్పటి కమ్యూనికేషన్ మంత్రి మరిన్ని ప్రైవేట్ సంస్థలకు లైసెన్స్ ఇవ్వడం ప్రారంభించారు. దీంతో అనేక దేశాల కంపెనీలు మన దేశంలో అడుగ పెట్టాయి. అయితే, రెండవ ప్రపంచ యుద్దం ముగిసిన తర్వాత యునైటెడ్ స్టేట్స్ అనేక డకోటా విమానాలను మన దేశంలో విమానయాన సేవల కోసం మార్కెట్లోకి పంపింది. ఏటువంటి వ్యాపార అనుభవం లేకుండా మార్కెట్లోకి అడుగు పెట్టడంతో కొన్ని సంస్థలు నష్ట పోయాయి. పోస్టల్ సర్వీస్ ఆలోచనను ఉమ్మడిగా వ్యతిరేకించడానికి ఎయిరిండియా, ఎయిర్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా, ఎయిర్ వేస్(ఇండియా), ఇండియన్ నేషనల్ ఎయిర్ వేస్లతో ఒక సమావేశాన్ని జెఆర్డి టాటా ఏర్పాటు చేశారు. ఈ సమావేశ విషయం దేశ కమ్యూనికేషన్ మంత్రి రఫీ అహ్మద్ కిద్వాయ్ కి తెలవడంతో చాలా కలత చెందాడు. హిమాలయన్ ఏవియేషన్ అతను 1948లో హిమాలయన్ ఏవియేషన్ అనే కొత్త విమానయాన సేవలను ప్రారంభించాడు. జెఆర్డి టాటా, కమ్యూనికేషన్ మంత్రికి బహిరంగ లేఖ రాశారు. లాభాల గురించి మేము విమానయాన సేవలను నడిపించడం లేదు అని అతనికి రాశాడు. ఈ బహిరంగ లేఖతో కోపంతో ఉన్న కిద్వాయ్ జెఆర్డి టాటాకు ఒక గుణపాఠం నేర్పాలని నిశ్చయించుకున్నాడు. ఈ విషయం కాస్త అప్పటి ప్రధాన మంత్రి నెహ్రూకు తెలిసింది. టాటాలు మంచి పని చేస్తున్నారని, ఎయిరిండియా సమర్థవంతమైన, స్నేహపూర్వక సేవలను అందిస్తుందని బహిరంగంగా ప్రకటించారు. మంత్రికి, జెఆర్డి టాటాకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడానికి జెఆర్డి టాటా ప్రతిపాదనను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రధాన మంత్రి సూచించారు. అప్పటి బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జి.ఎస్.రాజధ్యక్ష ఆధ్వర్యంలో నిర్ఘాంతకమిటీ ఆర్థిక సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించకుండా లైసెన్స్ లు జారీ చేసినందుకు ప్రభుత్వాన్ని మందలించింది. “నాలుగు కంపెనీలు మనుగడ సాగించలేని చోట విచక్షణారహితంగా డజనుకు పైగా లైసెన్స్ లను జారీ చేయడం ఏకపక్షంగా ఉంది” అని కమిటీ తెలిపింది. దీంతో కమ్యూనికేషన్ మంత్రి కుట్ర వైఖరి నిరూపితమైంది. అయితే, కేంద్ర ప్రభుత్వం ఎయిరిండియా విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిరిండియా జాతీయీకరణ త్వరలోనే ఎయిరిండియా జాతీయీకరణ చేయనున్నట్లు ప్రకటించింది. ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెఆర్డి టాటా ఈ రంగాన్ని జాతీయం చేయడం దేశానికి మంచిది కాదని, ఇది రాజకీయం చేయడానికి దారితీస్తుందని, ఇది వినాశకరమైనదని అన్నారు. జాతీయసంస్థల కోసం పనిచేసే బ్యూరోక్రాట్లు సంబంధిత మంత్రిత్వ శాఖకు నివేదించారు. ఈ రంగంలో పోటీ తట్టుకోవాలంటే స్వతంత్ర నిర్ణయాలు వెంట వెంటనే తీసుకోలేరు అని అన్నారు. ప్రధానమంత్రికి ఆయన ఇంటర్వ్యూ కాపీని నెహ్రూకు పంపారు. నెహ్రూ మాత్రం ఈ విషయంపై స్పందించలేదు. త్వరలోనే జెఆర్డి టాటా భయపడినట్లుగా అంబికా ఎయిర్ లైన్స్, జూపిటర్ ఎయిర్ వేస్ అనే రెండు కంపెనీలు దివాలా ప్రకటించాయి. చివరగా 1953లో అన్ని విమానయాన సంస్థలను ఒకటిగా విలీనం చేసి ప్రభుత్వం కిందకు తీసుకొని వచ్చింది. చివరి ప్రయత్నంగా, జెఆర్డి టాటా రెండు కంపెనీలగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఒకటి దేశీయ రంగానికి, మరొకటి అంతర్జాతీయ కార్యకలాపాల కోసం తెలిపారు. కాని నెహ్రూ ప్రభుత్వం వీటిని పట్టించుకోలేదు. విలీనం అవుతున్న కంపెనీలకు పరిహారం చెల్లించడానికి స్వతంత్ర కమిటీని నియమించాలని జెఆర్డి టాటా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దానిని కూడా తిరస్కరించారు. దీంతో జెఆర్డి టాటా తీవ్రంగా కలత చెందారు. ఆయన ఇంకా పట్టు విడవలేదు. ఆ తర్వాత వచ్చిన అప్పటి కమ్యూనికేషన్స్ మంత్రి జగ్జీవన్ రామ్ తో జరిగిన సమావేశంలో జెఆర్డి టాటా ఇలా అడిగారు.. “మీరు ఇతర విభాగాలను నడుపుతున్న విధంగా విమానయాన సంస్థను నడపడం సులభమని మీరు భావిస్తున్నారా? మీరే చూస్తారు” అని అన్నారు. దానికి జగ్జీవమ్ రామ్ ఇలా జవాబిచ్చాడు” ఇది ప్రభుత్వ శాఖ కావచ్చు, కానీ మీ సహాయంతో దానిని నడపాలని మేము కోరుకుంటున్నాము” అని అన్నారు. ఆ సమావేశం అసంపూర్తిగా ముగిసింది. టాటాలకు కేంద్ర ప్రభుత్వం సరైన పరిహారం చెల్లించలేదు. ఆ తర్వాత జెఆర్డి టాటా ఆ విమానయాన బోర్డులో ఒక సభ్యుడిగా కొనసాగుతూ వచ్చారు. 1957 అక్టోబరు 15న భారత పౌర విమానయానం రజతోత్సవాన్ని దేశం జరుపుకోవడంతో రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ భారతదేశాన్ని ప్రపంచ విమానయాన పటంలో నిలిపినందుకు జెఆర్డి టాటాని ప్రశంసించారు. ఆయనకు పద్మవిభూషణ్ తో సత్కరించారు. 1978 ఫిబ్రవరిలో మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఎయిర్ ఇండియా అధ్యక్షపదవి నుంచి, ఇండియన్ ఎయిర్ లైన్స్ డైరెక్టర్ పదవి నుంచి జె.ఆర్.డీ.ని తప్పించింది. పైసా పారితోషికం తీసుకోలేదు ఈ నిర్ణయంతో ఒక్క పైసా పారితోషికం తీసుకోకుండా 45 సంవత్సరాలు సంస్థకు సేవలందించిన వ్యక్తిగా నిలిచారు. కానీ, అతని కలల ప్రాజెక్టు విషయంలో భాగ కలత చెందాడు. 1980లో ఇందిరా గాంధీ తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు, ఆమె చైర్మన్ గా కాకపోయినా రెండు విమానయాన సంస్థల బోర్డులో జె.ఆర్.డీ.ని తిరిగి నియమించింది. ఎయిర్ ఇండియా చైర్మన్ గా రతన్ టాటా నియమితులైన సంవత్సరం 1986 వరకు జె.ఆర్.డీ.ని బోర్డులలో సేవలను కొనసాగించారు. 1990లో ప్రధాని వీపీ సింగ్ ప్రభుత్వం టాటాలను కొత్త దేశీయ విమానయాన సంస్థను ప్రారంభించడానికి ఆసక్తి చూపిస్తుందా అని ప్రశ్నించారు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత మరొక అవకాశం వచ్చింది, టాటాలు ఈ ప్రతిపాదనను ఒకే చేసే లోపే ప్రభుత్వం పడిపోయింది. 1994లో ప్రధానమంత్రి నరసింహారావు ఓపెన్ స్కైస్ పాలసీ ప్రకారం ఎయిర్ కార్పొరేషన్ చట్టం-1953 చట్టం ప్రకారం వైమానిక రవాణా సేవలు జాతీయం చేసిన వాటిని రద్దు చేయాలని చూశారు. సంకీర్ణ ప్రభుత్వాలు రావడం బలమైన నిర్ణయాలు తీసుకోలేకుండా పోయింది. ఆ తర్వాత 1995 నుంచి 1997 మధ్య ఎయిర్ ఇండియా వల్ల ₹671 కోట్ల నష్టం వచ్చింది. ఇలా నష్టాలతో కొనసాగుతున్న సంస్థను 2001లో అటల్ బిహారీ వాజ్ పేయి నేతృత్వంలోని ప్రభుత్వం ఎయిర్ ఇండియాలో 40% వాటాను అమ్మకానికి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్ ఇండియాలో ఒక్కొక్కటి 20% వాటాను కొనడానికి ఎస్ఐఎ(సింగపూర్ ఎయిర్ లైన్స్), టాటా సన్స్ ముందుకు వచ్చాయి. కొందరు పెట్టుబదుదారుల కుట్రలు, రాజకీయ నాయకుల అవినీతి వల్ల పరిస్థితులు క్షీణించాయి. ఈ పరిణామాలతో ఎస్ఐఎ తన భాగస్వామ్యాన్ని ఉపసంహరించుకుంది. విమానయాన రంగంలో టాటాల ప్రవేశం నిలిచిపోయింది. అలా అప్పటి నుంచి ఆ కొనుగోలు ఒప్పందం అగుతూ వచ్చింది. చివరికి ఈ ఏడాదిలో ఎయిర్ ఇండియాను కొనుగోలు టాటా సన్స్ దక్కించుకుంది. -
ఎయిరిండియా విక్రయ ఒప్పందం ఖరారు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా విక్రయానికి సంబంధించి టాటా సన్స్, కేంద్ర ప్రభుత్వం సోమవారం ఒప్పందం కుదుర్చుకున్నాయి. సంతకాలు చేశాయి. ఎయిరిండియా డైరెక్టర్ (ఫైనాన్స్) వినోద్ హెజ్మాదీ, పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి సత్యేంద్ర మిశ్రా, టాటా గ్రూప్నకు చెందిన సుప్రకాష్ ముఖోపాధ్యాయ్.. షేర్ల కొనుగోలు ఒప్పందంపై సంతకాలు చేశారు. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే ... మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో ఈ విషయం ట్వీట్ చేశారు. టాటా గ్రూప్లో భాగమైన టాలేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ.. ఎయిరిండియాలో 100 శాతం వాటాలను ప్రభుత్వం నుంచి కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ డీల్ విలువ సుమారు రూ. 18,000 కోట్లు. ఇందులో రూ. 2,700 కోట్ల మొత్తాన్ని టాలేస్ నగదు రూపంలో చెల్లించనుండగా, మిగతా రూ. 15,300 కోట్ల రుణభారం కంపెనీకి బదిలీ కానుంది. ఎయిరిండియా విక్రయాన్ని నిర్ధారిస్తూ అక్టోబర్ 11న టాటా గ్రూప్నకు కేంద్ర ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్వోఐ) జారీ చేసింది. ఆగస్టు 31 నాటికి ఎయిరిండియా మొత్తం రుణ భారం రూ. 61,562 కోట్లుగా ఉంది. ఇందులో 75 శాతం భారాన్ని (రూ. 46,262 కోట్లు) స్పెషల్ పర్పస్ వెహికల్ ఏఐఏహెచ్ఎల్కు ప్రభుత్వం బదలాయిస్తోంది. ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్తో పాటు ఏఐఎస్ఏటీఎస్లో 50 శాతం వాటాలను రూ. 12,906 కోట్ల రిజర్వ్ ధరతో వేలం వేయగా, అత్యధికంగా కోట్ చేసి టాటా గ్రూప్ విజేతగా నిల్చింది. ప్రైవేట్ విమానయాన సంస్థ స్పైస్జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ రూ. 15,100 కోట్లకు బిడ్ వేశారు. -
ఎయిరిండియాలో మరో వివాదం.. చిక్కుల్లో టాటా గ్రూపు
ఎయిరిండియాను తిరిగి స్వాధీనం చేసుకున్నామన్న సంతోషం ఆస్వాదించకముందే టాటా గ్రూపుకి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. మరోసారి మహారాజా స్టేటస్ని తెచ్చి పెట్టాలంటే చెమటోడ్చక తప్పని పరిస్థితిలు కళ్లేదుటే కనిపిస్తున్నాయి. ఆస్తులపై పేచీ ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణలో భాగంగా వేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న ఎయిరిండియాను అమ్మాలని కేంద్రం నిర్ణయించింది. ఇటీవల టాటా సన్స్ రూ. 18,000 కోట్లు చెల్లించేందుకు అంగీకరించి ఎయిరిండియాను దక్కించుకుంది. దీంతో ఎయిరిండియా స్థిర, చర ఆస్తులన్నీ టాటా సన్స్ స్వంతం అవుతాయి. ఇందులో బోయింగ్ విమానాలతో పాటు సిబ్బంది క్వార్టర్స్, కార్గో స్టేషన్లు ఇతర విలువైన భూములు కూడా ఉన్నాయి. క్వార్టర్లు ఖాళీ చేయండి నిబంధనల ప్రకారం ప్రైవేటీకర ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆరు నెలలలోపు ప్రస్తుతం ఎయిరిండియా క్వార్టర్లలో ఉంటున్న సిబ్బంది వాటిని ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇప్పటికే ఎయిరిండియా కాలనీల్లో ఉంటున్న ఉద్యోగులకు నోటీసులు జారీ చేశారు. దీనిపై ఎయిరిండియా ఉద్యోగులు భగ్గుమంటున్నారు. ఉన్న పళంగా మమ్మల్ని క్వార్టర్లు ఖాళీ చేయమనడం దారుణమంటూ మండి పడుతున్నారు. సమ్మెకు రెడీ ఎయిరిండియాలో ప్రస్తుతం 12,085 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో పర్మినెంట్ ఉద్యోగులు 8084, కాంట్రాక్టు ఉద్యోగులు 4001 మంది ఉన్నారు. ఇందులో చాలా మందికి ముంబై, ఢిల్లీ, కోల్కతా తదితర ఏరియాల్లో క్వార్టర్లు కేటాయించారు. ఇప్పుడు వాటిని ఖాళీ చేస్తే తమ కుటుంబాలు రోడ్డు మీద పడతాయంటూ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లు ఖాళీ చేయాలంటూ జారీ చేసిన నోటీసులు వెనక్కి తీసుకోకుంటే నవంబరు 2 నుంచి నిరవధిక సమ్మె చేస్తామంటూ తేల్చి చెబుతున్నారు. కనీసం మాట్లాడరా ? ఎయిరిండియాను ప్రైవేటీకరించిన తర్వాత సెటిల్మెంట్, తమ భవిష్యత్తుకు భరోసా అందించేందుకు కేంద్రం నుంచి ఎటువంటి చర్యలు లేవని, కానీ ఇప్పటికిప్పుడు ఇళ్లు వదిలేసి వెళ్లాలంటూ ఆదేశాలు ఇవ్వడం అమానవీయమని ఉద్యోగులు అంటున్నారు. కనీసం తమతో చర్చలు జరిపేందుకు కూడా ఎవరూ సిద్ధంగా లేరంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిక్కుముళ్లు ఏవియేషన్ రంగంలో తమదైన ముద్ర వేయాలని టాటాగ్రూపు ఎప్పటి నుంచో ఆశిస్తోంది. విస్తారాలో పెట్టుబడులు పెట్టినా పూర్తి స్థాయిలో టాటాల ఆశయం నెరవేరలేదు. ఈ సమయంలో ఎయిర్ ఇండియా ద్వారా ఏవియేషన్ రంగంలో దూసుకుపోవాలని టాటా యోచిస్తోంది. అయితే అంతకు ముందు ఉద్యోగుల సెటిల్మెంట్, క్వార్టర్లు తదితర చిక్కుముళ్లు వీడాల్సి ఉంది. చదవండి : ఎయిర్ఇండియా తర్వాత ప్రైవేటీకరించేది వీటినే ! -
‘దేశంలో రాజాలు ఎందరున్నా.. మహారాజా ఒక్కడే’
ఎయిర్ ఇండియా సంస్థను టాటా గ్రూపు తిరిగి దక్కించుకోవడం పట్ల పారిశ్రామిక వర్గాల్లో సానుకూల స్పందన లభిస్తోంది. ప్రైవేటీకరణ అంటే సాధారణ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. కానీ టాటా గ్రూపు విషయానికి వస్తే... ఈ వ్యతిరేకత కొంత తక్కువే అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ప్రజాభిప్రాయాన్ని అద్దం పట్టే సోషల్ మీడియాలో ఈ డీల్ పట్ల సానుకూల స్పందనే వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ఆర్పీజీ ఇండస్ట్రీస్ చైర్మన్ హార్ష్ గోయెంకా ఎయిరిండియా ప్రైవేటీకరణపై స్పందించారు. మస్కట్ మహారాజాతో పోలిక పెడుతూ ఆసక్తికర ట్వీట్ చేశారు. దేశంలో చాలా మంది ధనవంతులు ఉన్నారు. వారిలో చాలా మందిని రాజా అని పిలస్తూ ఉండవచ్చు. కానీ దేశంలో మహారాజు అని పిలిచే గ్రూపు ఒక్కటే ఉంది. అది టాటా అని ఆయన పేర్కొన్నారు. There are very very rich people who may be the ‘Rajas’ of India. But there is only one group who can be called the ‘Maharaja’ of our Country. pic.twitter.com/M4b2eX53M2 — Harsh Goenka (@hvgoenka) October 9, 2021 మరోవైపు ఆనంద్ మహీంద్రా సైతం ఈ డీల్ను ఉద్దేషిస్తూ ట్వీట్ చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే ‘ఈ టేకోవర్ ప్రాముఖ్యతపై నేను చేసే వ్యాఖ్యలు కొంచెం అతిశయోక్తిగా అనిపించొచ్చు. ఈ పెట్టుబడుల ఉపసంహరణ వల్ల భారత వ్యాపార వాతావరణానికి ప్రభుత్వం పునర్వైభవం తీసుకొస్తోందని నేను భావిస్తున్నాను. అప్పుల్లో కూరుకుపోయిన సంస్థను ప్రభుత్వం వదులుకుంటోంది. అంతేకాదు, దశాబ్దాల తర్వాత ప్రైవేటురంగ సామర్థ్యంపై ఉన్న విశ్వాసాన్ని పునరుద్ధరిస్తోంది’ అని పేర్కొన్నారు. I may be accused of overstating the importance of this event but I think this divestment amounts to a ‘reset’ of the Indian business environment. Yes, the Govt. is dispensing of a cash drain; But it’s also renewing faith-after decades-in the potential efficiency of the Pvt.sector https://t.co/iZKgt2L7cD — anand mahindra (@anandmahindra) October 8, 2021 చదవండి : వెల్కమ్ బ్యాక్ ఎయిర్ ఇండియా - రతన్ టాటా -
మళ్ళీ టాటాల చేతుల్లోకే ఎయిర్ ఇండియా
-
టాటా చేతికే ఎయిరిండియా!
ఇంత కాలం ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న ఎయిరిండియా ఇకపై ప్రైవేటు పరం కానుంది. ఇకపై ఎయిరిడియా టాటా గ్రూపు చేతిలోకి వెళ్లనుందని సమాచారం. రూ. 20,000 వేల కోట్లు ? పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఎయిరిండియాలో వంద శాతం వాటాను కేంద్రం అమ్మకానికి పెట్టింది. ఈ మేరకు బిడ్లను ఆహ్వానించగా టాటా గ్రూపు సంస్థ ఇందులో విజేతగా నిలిచినట్టు తెలుస్తోంది. దీని ప్రకారం ఎయిరిండియా విమనాలతో పాటు సంస్థ స్థిర, చర ఆస్తులు టాటా గ్రూపునకు దక్కనున్నాయి. ఈ పెట్టుబడుల ఉపసంహారణ ద్వారా కేంద్రం రూ.20,000 కోట్ల రూపాయల నిధులను సమీకరించనుంది. టాటాకే దక్కింది ఎయిరిండియాలో వాటాల విక్రయానికి సంబంధించి ఇటీవల కేంద్రం బిడ్లను ఆహ్వానించింది. టాటా గ్రూపుకి సంబంధించిన టాటా సన్స్తో పాటు స్పైస్ జెట్ సంస్థ బిడ్లను దాఖలు చేసింది. వీటిని పరిశీలించిన కేంద్ర మంత్రి అమిత్షా నేతృత్వంలో మంత్రుల బృందం చివరకు టాటా గ్రూపునకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ బిడ్డింగ్కి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 1932లో ప్రారంభం స్వాతంత్రానికి పూర్వమే జంషెడ్జీ టాటా 1932లో టాటా ఎయిర్లైన్స్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1946లో ఎయిర్ ఇండియా పేరు మార్చారు. అయిత ఆ తర్వాత 1953 సెప్టెంబరు 29న టాటా ఎయిర్లైన్స్ని కేంద్రం జాతీయం చేసింది. దీంతో ప్రైవేటు ఎయిర్లైన్స్ కాస్తా ప్రభుత్వ ఎయిరిండియాగా మారింది. నష్టాల ఊబిలో విదేశాలకు నడిపే విమానాలు ఎయిరిండియా, దేశీయంగా నడిపే విమాన సర్వీసులను ఇండియన్ ఎయిర్లైన్స్గా వ్యవహరించారు. అయితే ఈ రంగంలో రాజకీయ జోక్యం పెరిగి పోవడం, నిర్వాహాణపరమైన లోపాల కారణంగా గత ఇరవై ఏళ్లుగా నష్టాలే తప్ప లాభాలు రావడం లేదు. దీంతో ఈ సంస్థను అమ్మేయాలని కేంద్రం నిర్ణయించింది. 67 ఏళ్ల తర్వాత ఉప్పు నుంచి హెలికాప్టర్ల వరకు అనేక రంగాల్లో వ్యాపారం నిర్వహిస్తోన్న టాటా గ్రూపు ఎప్పటి నుంచో విమానయాన రంగంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. వివిధ కారణాల వల్ల ఈ నిర్ణయం వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా 67 ఏళ్ల తర్వాత తాము స్థాపించిన సంస్థను తిరిగి టాటా గ్రూపు సొంతం చేసుకునే అవకాశం ఉంది. అన్ని ప్రచారాలే మరోవైపు తాజా మీడియా నివేదికలను ప్రభుత్వం ఖండించింది. ఇంతవరకు ఎయిరిండియా ఇన్వెస్ట్మెంట్ బిడ్కు సంబంధించి ఎవరికీ ఎలాంటి ఆమోదం ఇవ్వలేదని తెలిపింది. దీనిపై ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నప్పుడు మీడియాకు తెలియచేస్తామంటూ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ ట్వీట్ చేసింది. మీడియా నివేదికలు తప్పు అని పేర్కొంది. Media reports indicating approval of financial bids by Government of India in the AI disinvestment case are incorrect. Media will be informed of the Government decision as and when it is taken. pic.twitter.com/PVMgJdDixS — Secretary, DIPAM (@SecyDIPAM) October 1, 2021 చదవండి : ఎయిరిండియా రేసులో టాటా -
ఎయిరిండియా రేసులో టాటా
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం ఎయిరిండియా కొనుగోలుకి దేశీ పారిశ్రామిక దిగ్గజం టాటా సన్స్ ఫైనాన్షియల్ బిడ్ను దాఖలు చేసింది. ఇదే విధంగా అందుబాటు ధరల ఎయిర్లైన్స్ స్పైస్జెట్.. చీఫ్ అజయ్సింగ్ సైతం బిడ్ చేయడం ద్వారా పోటీ పడుతున్నారు. చివరి రోజు బుధవారానికల్లా ఎయిరిండియా కొనుగోలుకి ఫైనాన్షియల్ బిడ్స్ దాఖలైనట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే తాజాగా వెల్లడించారు. అయితే ఎన్ని సంస్థలు రేసులో నిలిచిందీ వెల్లడించలేదు. టాటా సన్స్ బిడ్ను దాఖలు చేసినట్లు గ్రూప్ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. మరోపక్క స్పైస్జెట్ ఎండీ, చైర్పర్శన్ అజయ్ సింగ్ వ్యక్తిగత హోదాలో పోటీ పడుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ బాటలో పలు కంపెనీలు బిడ్స్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఎయిరిండియా విక్రయ లావాదేవీల నిర్వాహక సంస్థకు పలు ఫైనాన్షియల్ బిడ్స్ దాఖలైనట్లు పాండే తెలియజేశారు. దీంతో డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియ ప్రస్తుతం చివరి దశ(కన్క్లూడింగ్ స్టేజ్)కు చేరినట్లు ట్వీట్ చేశారు. 100 శాతం వాటా: డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎయిరిండియాలోగల 100 శాతం వాటాతోపాటు.. ఏఐ ఎక్స్ప్రెస్ లిమిటెడ్లో ఎయిరిండియాకుగల 100 శాతం వాటాను సైతం విక్రయించనుంది. అంతేకాకుండా ఎయిరిండియా సాట్స్ ఎయిర్పోర్ట్ సరీ్వసెస్ ప్రయివేట్లోగల కంపెనీకిగల 50 శాతం వాటాను సైతం బదిలీ చేయనుంది. 2020 జనవరిలో ప్రారంభమైన విక్రయ సన్నాహాలు కోవిడ్–19 కారణంగా ఆలస్యమైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్లో ఎయిరిండియా కొనుగోలుకి అవకాశమున్న సంస్థల నుంచి ఫైనాన్షియల్ బిడ్స్ను ప్రభుత్వం ఆహా్వనించింది. వీటికి గడువు ఈ బుధవారం(15)తో ముగియనుంది. బయటకు వెల్లడికాని రిజర్వ్ ధరకు ఎగువన దాఖలైన బిడ్స్ను సలహాదారు సంస్థ పరిగణించనుంది. అధిక ధరను కోట్ చేసిన బిడ్స్ను ఎంపిక చేయనుంది. తద్వారా వీటిని క్యాబినెట్ అనుమతి కోసం పంపనుంది. -
టాటా గ్రూప్ కిట్లో 1ఎంజీ
న్యూఢిల్లీ: ఆన్లైన్ హెల్త్కేర్ మార్కెట్ప్లేస్.. 1ఎంజీ టెక్నాలజీస్లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయనున్నట్లు టాటా సన్స్ సొంత అనుబంధ సంస్థ టాటా డిజిటల్ తాజాగా పేర్కొవాటా విలువను వెల్లడించలేదు. కంపెనీ ఇటీవలే ఫిట్నెస్ సంబంధ సేవలందించే క్యూర్ఫిట్ హెల్త్కేర్లో 7.5 కోట్ల డాలర్లు(రూ. 550 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. తద్వారా క్యూర్ఫిట్లో వాటాను సొంతం చేసుకోనుంది. కాగా.. విభిన్న విభాగాలలో వినియోగదారుడి అవసరాలను ఒకే గొడుగు కింద అందించేందుకు వీలుగా డిజిటల్ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేస్తున్నట్లు టాటా డిజిటల్ వివరించింది. ఈ ప్రణాళికల్లో భాగంగానే 1ఎంజీలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు పేర్కొంది. డిజిటల్ వ్యవస్థలో ఈఫార్మసీ, ఈడయాగ్నోస్టిక్స్, టెలి కన్సల్టేషన్ కీలక విభాగాలుగా నిలవనున్నట్లు వెల్లడించింది. ఇవి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు తెలియజేసింది. ప్రధానంగా కరోనా మహమ్మారి కారణంగా హెల్త్కేర్ విభాగం మరింత జోరు చూపుతున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఈ విభాగంలో 100 కోట్ల డాలర్ల(సుమారు రూ. 7,300 కోట్లు) మార్కెట్ ఉన్నట్లు తెలియజేసింది. వార్షికంగా 50 శాతం చొప్పున వృద్ధి సాధిస్తున్నట్లు వివరించింది. 1ఎంజీ బ్యాక్గ్రౌండ్ 2015లో ప్రారంభమైన 1ఎంజీ ఈహెల్త్ విభాగంలో మెడిసిన్స్, వెల్నెస్ ప్రొడక్టులు, డయాగ్నోస్టిక్ సర్వీసులు, టెలి కన్సల్టేషన్ తదితర పలు సేవలు అందిస్తోంది. ఆధునిక డయాగ్నోస్టిక్ ల్యాబ్లతోపాటు.. మెడిసిన్స్, ఇతర ఆరోగ్య పరిరక్షణ ఉత్పత్తుల పంపిణీ నిర్వహిస్తోంది. కాగా.. ఈ వారం మొదట్లో రూ. 550 కోట్లతో క్యూర్ఫిట్లో వాటా కొనుగోలు చేస్తున్నట్లు టాటా సన్స్ వెల్లడించిన విషయం విదితమే. దీనిలో భాగంగా క్యూర్ఫిట్ వ్యవస్థాపకుడు, సీఈవో ముకేశ్ బన్సల్కు టాటా డిజిటల్లో ప్రెసిడెంట్గా ఎగ్జిక్యూటివ్ బాధ్యతలను అప్పగించనున్నట్లు తెలియజేసింది.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement