-
ట్రాన్స్జెండర్కు ఘోర అవమానం!
మహారాష్ట్రకు చెందిన తొలి మరాఠీ లింగమార్పిడి (ట్రాన్స్ జెండర్) నటి ప్రణీత్ హట్టే ఇటీవల తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాను ఒక హోటల్లో రూమ్ బుక్ చేశారని, అయితే తాను ట్రాన్స్ను అయినందున సదరు హోటల్ తన బుకింగ్ను రద్దు చేసిందని వాపోయారు. ఈ ఘటనపై తన ఆవేదనను ఆమె ఒక వీడియోలో పంచుకున్నారు.దానిలో ప్రణీత్ హట్టే మాట్లాడుతూ ‘నేను నాసిక్కు ఒక షోలో పాల్గొనేందుకు వచ్చాను. ఇక్కడ ఉండేందుకు ఓ హోటల్లో రూమ్ బుక్ చేశాను. అయితే నేను ట్రాన్స్జండర్ను అయినందున హోటల్ యజమానులు నా రూమ్ బుకింగ్ను రద్దు చేశారు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్లాలి?’ అని ప్రశ్నించారు. ఈ వీడియో చూసిన ప్రణీత్ హట్టే అభిమానులు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఒక యూజర్ ‘నేను ఇప్పుడే ఫోన్ చేసి హోటల్వారితో మాట్లాడాను. వారు ఇప్పుడు ఖచ్చితంగా సిగ్గుపడివుంటారు’ అని రాశారు. మరో యూజర్ ‘మీరు దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేయాలి’ అని రాశారు.ప్రణీత్ హట్టే మరాఠీ నటి. ఆమె మరాఠీ చిత్రం ‘కరభారి లయభరి’లో గంగ పాత్రలో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ చిత్రం ‘హడ్డీ’లో కూడా ప్రణీత్ కనిపించారు. -
వనిత ప్రగతి పరుగు?!
"ఆడాళ్ళు మీకు జోహార్లు .. ఓపిక,ఒద్దిక మీ పేర్లు- మీరు ఒకరి కంటే ఒకరు గొప్పోళ్ళు.." - ఆచార్య ఆత్రేయ. అది అక్షరాలా నిజం. 'క్షమయా ధరిత్రి' అన్న ఆర్యోక్తికి మరోరూపం ఇచ్చారు ఆచార్యులవారు. ప్రతి రంగంలోనూ ఒకరిని మించి మరొకరు దూసుకెళ్తునే ఉన్నారు. ముళ్ళపూడి వెంకటరమణ ఇలా చమత్కరించారు. "ఆడవాళ్లు - మగవాళ్లు ఇద్దరూ సమానమే,కాకపోతే మగవాళ్ళు కాస్త ఎక్కువ సమానం". ముళ్ళపూడివారి మాటలు కూడా నిజాన్ని ప్రతిబింబించేవే. 'ఆకాశంలో సగం' అనే మాట వినడానికి అందంగానే ఉంటుంది కానీ, ఆచరణలో అన్నింటా ఆడవాళ్లకు సగభాగం దొరుకుతోందన్నది అర్ధసత్యం. ఇప్పటికీ ప్రపంచంలో స్త్రీ ఎక్కువ గౌరవాలు పొందుతున్నది మన భరతభూమిలో అన్నది కాదనలేని నిజం. కొంత ఛాందసాలు, చాదస్తాలు రాజ్యమేలుతున్నా, మన వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థలు మనల్ని మిగిలినవారి కంటే భిన్నంగా నిలుపుతున్నాయి. బంధాలు, బాంధవ్యాల వీచికలు ఇంకా వీస్తూనే ఉన్నాయి. ప్రతి మార్చి 8వ తేదీ 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం' జరుపుకోవడంతోనే సరిపోదు. నిజమైన పండుగ వారి గుండె గుడిలో నిండుగ ఉదయించాలి. ఈ వేడుకను ఒకొక్క దేశంలో ఒకొక్క రకంగా జరుపుకుంటున్నారు. ప్రపంచ దేశాల్లో ఈ ఉత్సవాలు ప్రారంభం కాకమునుపే అమ్మను అమ్మవారుగా నిత్యం కొలిచే ఆచారం మనకు వేళ్లూనుకొని వుంది.అదే సమయంలో కష్టాలు,కన్నీళ్లు,బానిసత్వం, అణగదొక్కే విధానం,ఆచారాల పేరిట అసమానతలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఆధునిక సమాజంలోనూ ఆటవిక పోకళ్ళు వదలడం లేదు.'నిర్భయ' చట్టాల వంటివి ఎన్ని వచ్చినా,ఆడపిల్లలు నిర్భయంగా తిరిగే రోజులు ఇంకా రాలేదు. అక్షరాస్యత పెరుగుతున్నా,అరాచకాలు ఆగడంలేదు.ఉద్యోగిత పెరుగుతున్నా సమానత ఇంకా సాధ్యమవ్వలేదు. ఓటు హక్కు వచ్చినా,చట్ట సభల్లో మహిళలు ఇంకా ఆమడ దూరంగానే ఉన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించినా, ఆచరణకు ఏళ్ళుపూళ్ళు పట్టేలా వుంది. శాసనాలు చేసే అధికారం రావాలంటే ఇంకా చాన్నాళ్ళు ఆగాల్సిందే.అప్పటిదాకా శాసించే శక్తి మగవాళ్ల దగ్గరే వుంటుంది. ప్రజాస్వామ్యం,రాజ్యాంగం అందించిన అవకాశాలతో మహిళామణులు రాష్ట్రపతి , స్పీకర్ వంటి అత్యున్నత పదవులను అందుకున్నా, అది సరిపోదు.సమత, సమతుల్యత ఇంకా సాధించాల్సి వుంది. ఇంకొక వైపు వరకట్నపు చావులు, అత్తారింటి వేదింపులు ఆగకుండా సాగుతూనే ఉన్నాయి. 'స్త్రీలకు స్త్రీలే శత్రువులు' అన్నది ఇంకా వీడడం లేదు. లింగవివక్ష నుంచి పూర్తిగా బయటపడే తరుణం కోసం తరుణులంతా ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆర్ధిక స్వేచ్ఛ,సమానత్వం కోసం ఎదురుతెన్నులు కాస్తూనే ఉన్నారు.కార్మిక సంఘాలు ఏర్పడినా,చట్టాలు వచ్చినా మహిళా కార్మికులు,కర్షకుల వేతనాల చెల్లింపుల్లో అన్యాయం జరుగుతూనే ఉంది.1991లో భారతదేశం సరళీకరణ ఆర్ధిక విధానాల వల్ల ప్రైవేట్ రంగం ఎంతో బలపడింది.ఉద్యోగ అవకాశాలు మెరుగుపడ్డాయి కానీ, ఎంపిక ప్రక్రియలో అసమానత అలాగే ఉంది.సాఫ్ట్ వేర్ రంగం మాత్రం కాస్త నయం.అమ్మాయిలను తరలించే (విమెన్ ట్రాఫికింగ్) విషవ్యాపారం,బాలికలపై అత్యాచారాలు యదేచ్ఛగా సాగుతూనే ఉన్నాయి. గ్రామీణ మహిళా సాధికారత ఎంతో పెరగాల్సి ఉంది. పేదరిక విముక్తి, ఆకలి నిర్మూలనకు ముగింపు వాక్యాలు పలకాల్సి ఉంది. 'పని సంస్కృతి' (వర్క్ కల్చర్ ) మారుతున్న క్రమంలో ఎదురవుతున్న ఇబ్బందులకు తగినట్లుగా సౌకర్యాలు పెరగాలి. 100 సంవత్సరాల పై నుంచీ 100 దేశాలకు పైగా 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం' జరుపుకుంటున్నాయి. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నినాదాన్ని వినిపిస్తున్నారు. అవి నినాదాల దశ దాటి ఆచరణ దశకు చేరుకోవడం లేదు. కొంత అభివృద్ధి, ప్రగతి చోటుచేసుకున్నప్పటికీ సమగ్రత,సంపూర్ణత సాధించాల్సి ఉంది. 'లింగ సమానత్వం సాధించడం' 2022 సంవత్సరంలో ఎజెండాగా పెట్టుకున్నారు. ఈ డిజిటల్ యుగంలో, 'నవీనత్వం - సాంకేతికతలో లింగ వివక్షలేని సమానత్వం' 2023 ఎజెండాగా కల్పన చేసుకున్నారు. ' ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ - యాక్సలరేట్ ప్రోగ్రెస్ '- 2024 ఎజెండాగా పెట్టుకున్నారు. మహిళా సాధికారితను సాధించడానికి ఇంకెన్నాళ్లు పోరాడాలి? అనుకున్నది జరగాలి, ఈ పోరాటం ఆగాలి అన్నది మహిళాలోకం కోరుకుంటున్నది. మహిళా ప్రగతి వేగం పెరగాలని ఈ ఏటి ప్రధాన ఎజెండా. వినడానికి ఎజెండాలు ఎప్పుడూ బాగానే వుంటాయి. ఆచరణలో ఎక్కడ? అనే ప్రశ్నలు ఉదయించడం మానడంలేదు. మరోపక్క...స్త్రీలు అబల దశ నుంచి సబల దశకు చేరుకుంటూనే ఉన్నారు.అనేక రంగాల్లో పురుషులతో పోటీ పడుతున్నారు. కొన్ని రంగాల్లో మించి పోతున్నారు. ఇది పూర్తిగా మహిళామణుల స్వయంకృషి,పట్టుదల, దీక్షాదక్షతలు మాత్రమే. అందివచ్చిన ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఎదుగుతున్నారు. సవాళ్లు, దాడులు ఎదుర్కొని నిలుస్తున్నారు.కాకపోతే, సమానత్వంలో సమగ్రత సాధించాలి. మహిళాలోకం వెలగాలి, వెలుగులు పంచాలి (అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీనియర్ జర్నలిస్టు మా శర్మ స్పెషల్ స్టోరీ..) - మాశర్మ, సీనియర్ జర్నలిస్టు -
మహిళా దినోత్సవం: మహిళల ప్రాతినిథ్యం ఎలా ఉంది?
ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెరుగుపడిందని సంబరపడిపోతాం. అయినప్పటికీ ఇంకా చాల చోట్ల మహిళలు కొన్ని అంశాల్లో వెనుకంజలోనే ఉన్నారని వివక్షను ఎదుర్కొంటున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇంతకీ మహిళల ప్రాతినిధ్యం ఎలా ఉంది?. వారి స్థితి మెరుగు పడిందా? అనే విషయాల గురించి ఈ దినోత్సవం సందర్భంగా కూలంకషంగా తెలుసుకుందామా!. ప్రపంచ ఆర్థిక వేదిక ( వరల్డ్ ఎకనామిక్ ఫోరం ) 2023 సంవత్సరానికి వెలువరించిన 146 దేశాల లింగ సమానత్వ సూచీలో భారతదేశం 0.643 స్కోర్తో 127వ స్థానంలో నిలిచింది. 2022 సంవత్సరం కంటే ఎనిమిది స్థానాలు పైకి ఎగబాకింది. అన్ని రంగాల్లో లింగ భేదాన్ని తొలగించడంలో భారతదేశం 64.3% ముందంజ వేసినా, పురుషుల ఆర్థిక భాగస్వామ్యంలో, ఆర్థిక అవకాశాల్లో 36.7% సాఫల్యాన్ని మాత్రమే సాధించిందని వివరించింది. 146 దేశాల లింగ సమానత్వ సూచీలో ఐస్లాండ్ వరుసగా 14వ సారి అగ్రస్థానానంలో ఉంది. పొరుగు దేశం బంగ్లాదేశ్ 59వ స్థానంతో మెరుగైన ఫలితాన్ని సాధించింది. అయితే భారత్ లింగ సమానత్వంలో బెటర్గా ఉన్నా.. కొన్ని విషయాలను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఏయో వాటిలో మెరుగవ్వాల్సి ఉందంటే.. మహిళల విద్య!: భారతదేశంలో మహిళా విద్య అనేది దాదాపు దశాబ్ద కాలంగా ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించే అంశంగా ఉంది. ఎందుకంటే ఈ విషయంలో భారత్ భాగా వెనుకబడి ఉండటమే. పురుషులతో సమానంగా చదువుకునేందుకు మహిళలకు హక్కులు ఉన్నా తరతరాలుగా వేన్నేళ్లుకు పోయిన భావనల కారణంగా పురుషులే అత్యధికంగా విద్యావంతులుగా ఉంటున్నారు. ఇప్పటకీ అక్షరాస్యతలో 2021 నాటి లెక్కల ప్రకారం.. స్త్రీల అక్షరాస్యత రేటు 70.3% కాగా, పురుషుల అక్షరాస్యత రేటు 84.7%గా ఉంది. సామాజిక ఒత్తిళ్లు, పేదరికం, బాల్య వివాహాలు తదితర కారణాల కారణంగా నిర్భంధ విద్యహక్కుకు దూరమవ్వుతున్నారని చెప్పొచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకునే గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలను ప్రవేశపెట్టి విద్యనందించే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే పలు కార్యక్రమాలతో మహిళా సాధికారత కోసం ఆర్థిక సహాయం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, స్కాలర్షిప్లు వంటివి అందిస్తున్నాయి కూడా. అయినప్పటికి పలుచోట్ల బాలికలు విద్యకు దూరమవుతుండటం బాధకరం ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉందంటే.. ప్రపంచవ్యాప్తంగా పురుషుల అక్షరాస్యత రేటు 90% ఉండగా, స్త్రీలు 82.7%తో కొంచెం వెనుకబడి ఉన్నారు. దేశాల పరంగా చూస్తే..అభివృద్ధి చెందిన దేశాలు సాధారణంగా వయోజన అక్షరాస్యత రేటు 96% లేదా అంతకంటే ఎక్కువ. దీనికి విరుద్ధంగా, తక్కువ అభివృద్ధి చెందిన దేశాల్లో సగటు అక్షరాస్యత రేటు 65% మాత్రమే ఉండటం గమనార్హం. ఏ దేశాలు మెరుగ్గా ఉన్నాయంటే.. రష్యా, పోలాండ్, ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, క్యూబా, అజర్బైజాన్, తజికిస్తాన్, బెలారస్ మరియు కిర్గిజ్స్థాన్లు స్త్రీ పురుషుల అక్షరాస్యత రేటు 100% కలిగి ఉన్నాయి. తక్కువగా ఉన్న దేశాలు: చాద్, మాలి, బుర్కినా ఫాసో, దక్షిణ సూడాన్, ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, నైజర్, సోమాలియా, గినియా, బెనిన్ వంటి దేశాలు ఈ విషయంలో పలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ దేశాల్లో అక్షరాస్యత రేటు 27% నుంచి 47% వరకు ఉంది. వ్యత్యాసం ఎలా ఉందంటే.. ప్రపంచవ్యాప్తంగా సుమారు 781 మిలియన్ల పెద్దలలో మూడింట రెండు వంతుల మంది స్త్రీలు చదవడం లేదా వ్రాయడం రాని ఉన్నారు. తక్కువ-అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే పురుషులు ఉద్యోగాలు చేస్తుండగా, మహిళలు వంటింటికి పరిమితమవ్వుతున్నారు. మహిళా అక్షరాస్యత రేటు ఎక్కువగా ఉన్న దేశాలు: తైవాన్ 99.99% మహిళా అక్షరాస్యత రేటుతో ముందంజలో ఉండగా, 99.98%తో ఎస్టోనియా తర్వాత స్థానంలో ఉంది. ఇక ఇటలీ మూడో స్థానంలో ఉంది. స్త్రీలు అక్షరాస్యతలో మెరుగుపడితే, ఆర్థికపరంగా, ఉద్యోగాల్లోనూ మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడే లింగ సమానత్వానికి సరైన నిర్వచనం ఇవ్వగలం. ఈ మహిళల అక్షరాస్యతలో అసమానతను పరిష్కరించడం అనేది అత్యంత కీలకమైనది. ఇదే స్త్రీలను శక్తిమంతంగా మార్చి సాధికారతవైపుకి అడుగులు వేయించి దేశాన్ని ప్రగతి పథంలోకి దూసుకుపోయేలా చేస్తుంది. (చదవండి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఈ ఏడాది ప్రత్యేకత ఏంటి?) -
South Korea: మాతృత్వానికి దూరం.. దూరం!
ఆమె పేరు యెజిన్. టీవీ యాంకర్. ఓ సాయం వేళ స్నేహితురాళ్లతో సరదాగా గడుపుతుండగా మొబైల్లో ఓ పాపులర్ మీమ్ ప్రత్యక్షమైంది. ‘మాలా మీరూ అంతరించిపోకముందే జాగ్రత్త పడండి’ అని ఓ కార్టూన్ డైనోసార్ హితబోధ చేయడం దాని సారాంశం. దాంతో వారందరి మొహాల్లోనూ విషాద వీచికలు. 30 ఏళ్లు దాటుతున్నా వారెవరికీ ఇంకా పిల్లల్లేరు మరి! వారే కాదు, లో చాలామంది మాతృత్వానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంటున్నారు. అక్కడి సమాజంలోని సంక్లిష్టతే ఇందుకు ప్రధాన కారణం...! దక్షిణ కొరియా చాలా ముందుంది. దాంతో ఆడవాళ్లలో అత్యధికులు ఉద్యోగులే. ఇంటిపట్టున ఉండేవారు చాలా తక్కువ. అయితే అక్కడ ఏ రంగంలోనైనా పని ఒత్తిళ్లు విపరీతంగా ఉంటాయి. సుదీర్ఘ పనిగంటలు. పైగా తరచూ ఓవర్ టైమ్ చేయడం తప్పనిసరి. నిరాకరిస్తే ఆ ప్రభావం ప్రమోషన్లతో పాటు చాలారకాలుగా పడుతుంది. దాంతో విపరీతంగా అలసిపోయి ఇంటికొచ్చే భర్తలు పిల్లల బాధ్యతలను అస్సలు పంచుకోరు. పైగా వేతనాలతో పాటు చాలా అంశాల్లో మితిమీరిన. దీనికి తోడు దాల్ చేసేలా కంపెనీలు ఒత్తిడి చేయడం సర్వసాధారణం. దాంతో పిల్లల్ని కనే క్రమంలో కెరీర్ ఒకసారి వెనకబడితే తిరిగి కోలుకోవడం చాలా కష్టం. అదీగాక దక్షిణ కొరియాలో జీవన వ్యయం చాలా ఎక్కువ. ఒక్కరి సంపాదనతో ఇల్లు గడవడం కష్టం. ఇన్ని ప్రతికూలతల మధ్య పిల్లల్ని కని, సజావుగా పెంచేందుకు కావాల్సిన సమయం, ఓపిక, కుటుంబ మద్దతు మహిళలకు ఏ మాత్రమూ ఉండటం లేదు. పిల్లలు, కెరీర్లో ఏదో ఒక్కదాన్నే ఎంచుకోక తప్పని అనివార్య పరిస్థితి. అత్యధికులు రెండో ఆప్షన్కే ఓటేస్తున్నారు. అలా మొత్తంగా మాతృత్వానికే దూరమవుతున్నారు! అట్టడుగుకు జననాల రేటు ప్రపంచవ్యాప్తంగా సంపన్న దేశాలన్నింట్లోనూ చాలాకాలంగా జనాభా క్రమంగా తగ్గుతూ వస్తోంది. కానీ దక్షిణ కొరియాలో ఈ ధోరణి మరీ ప్రమాదకరంగా ఉంది. నిజానికి అతి తక్కువ జననాల రేటు విషయంలో 20 ఏళ్లుగా ఆ దేశానిదే ప్రపంచ రికార్డు! పైగా అది ఏటికేడు మరింతగా తగ్గుతూ వస్తోంది. తాజాగా బుధవారం విడుదలైన గణాంకాలైతే ప్రమాద ఘంటికలే మోగిస్తున్నాయి. 2023లో అక్కడ జననాల రేటు (ఒక మహిళ జీవిత కాలంలో కనే పిల్లల సంఖ్య) 8 శాతం తగ్గి కేవలం 0.73గా నమోదైంది. ఇదిలాగే కొనసాగితే 2100 నాటికి దేశ జనాభా సగానికి సగం తగ్గిపోనుంది. దాంతో ఈ పరిణామాన్ని జాతీయ ఎమర్జెన్సీగా ప్రభుత్వం ప్రకటించింది! ఫలించని ప్రోత్సాహకాలు... పిల్లల్ని కనేలా జనాలను ప్రోత్సహించేందుకు దక్షిణ కొరియాలో ప్రభుత్వాలు చేయని ప్రయత్నాల్లేవు. నగదు ప్రోత్సాహకం, ఇంటి కొనుగోలుపై సబ్సిడీ, పిల్లలను చూసుకునేందుకు ఉచితంగా ఆయా సదుపాయం వంటివెన్ని ప్రకటించినా లాభముండటం లేదు. మహిళలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలను పరిష్కరించనంత కాలం ఇటువంటి పథకాలు ఎన్ని తెచ్చినా ఒరిగేదేమీ ఉండబోదని సామాజికవేత్తలు అంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Nishtha Satyam: సత్య నిష్ఠతో...
వివక్ష అనేది ఎక్కడో ఉండదు. మన చుట్టూనే పొంచి ఉంటుంది. అలాంటి వివక్షను సూక్ష్మస్థాయిలో విశ్లేషిస్తోంది నిష్ఠా సత్యం. స్త్రీ సాధికారతకు సంబంధించిన కార్యక్రమాలపై నిష్ఠగా పనిచేస్తోంది... బాలీవుడ్ సినిమా ‘మొహ్రా’లోని ‘తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్’ పాట యువ గళాల్లో ఎక్కువగా వినిపిస్తున్న కాలం అది. అందరిలాగే తాను కూడా ఆ పాట హమ్ చేస్తోంది నిష్ఠ. ఆమె తండ్రికి విపరీతమైన కోపం వచ్చి ‘నువ్వు ఎలాంటి పాట పాడుతున్నావో తెలుసా’ అంటు తిట్టాడు. చిన్నపాటి పనిష్మెంట్ కూడా ఇచ్చాడు. ‘సరదాగా రెండు లైన్లు పాడినందుకు ఇంత రాద్ధాంతమా?’ అనుకుంది నిష్ఠ. ఒకవేళ ఈ పాట అబ్బాయి పాడి ఉంటే ఇలాగే జరిగి ఉండేదా? ‘జరగదు’ అని బలంగా చెప్పవచ్చు. ఈ సంఘటన ఒక్కటే కాదు పెద్ద కంపెనీలలో పనిచేస్తున్న కాలంలోనూ లింగవివక్షను ఎదుర్కొంది నిష్ఠ. మల్టీనేషనల్ కంపెనీ కేపీఎమ్జీ, అమెరికన్ ఎక్స్ప్రెస్లలో ఎకానమిస్ట్గా పనిచేసిన నిష్ఠా సత్యం ఐక్యరాజ్య సమితిలోకి అడుగు పెట్టింది. ఐక్యరాజ్యసమితిలో పాట్నర్షిప్ అడ్వైజర్గా ప్రయాణం మొదలు పెట్టిన నిష్ఠ డిప్యూటీ హెడ్ హోదాలో పనిచేసింది. ఆ తరువాత యూఎన్ ఉమెన్ మిషన్ హెడ్– తిమోర్–లెస్తే బాధ్యతలు చేపట్టింది. ‘రెండు విధాలుగా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని విశ్లేషించాలి. ఒకటి డిఫాల్ట్ సెట్టింగ్ రెండోది డిజైన్ సెట్టింగ్. డిజైన్ సెట్టింగ్ అనేది పురుషుల నుంచి వచ్చింది. వారికి అనుకూలమైనది’ అంటుంది నిష్ఠ. స్మార్ట్ ఫోన్ల సైజ్ నుంచి పీపీయీ కిట్స్ వరకు మార్కెట్లో ఉన్న ఎన్నో వస్తువుల డిజైన్లు మహిళలకు అనుకూలంగా లేకపోవడంలోని వివక్షను ప్రశ్నిస్తుంది నిష్ఠ. ‘సాంస్కృతిక సందర్భాలు వివిధ మార్గాలలో మహిళలను శక్తిమంతం చేస్తాయి. సాధికారతకు సంబంధించి మన ఆలోచనలను వారిపై బలవంతంగా రుద్దడంలో అర్థం లేదని తిమోర్–లెస్తే మహిళల నుంచి నేర్చుకున్నాను’ అంటుంది నిష్ఠా సత్యం. -
అబ్బాయిగా మారిన లేడి కానిస్టేబుల్.. తండ్రిగా ప్రమోషన్
మహారాష్ట్రకు చెందిన మహిళా కానిస్టేబుల్. ఎన్నో కష్టాలు పడి మగవాడిలా మారింది. కుటుంబాన్ని, సమాజాన్ని ఎదురించి పురుషుడిగా సర్జరీ చేయించుకుంది. తర్వాత కొన్నాళ్లకు ఓ యుతిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఆ జంట బిడ్డకు జన్మనివ్వడంతో.. కానిస్టేబుల్ తండ్రిగా ప్రమోషన్ పొందాడు. వివరాలు.. బీద్ జిల్లా రాజేగాన్ గ్రామానికి చెందిన లలితా సాల్వే(35) కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తోంది. 25 ఏళ్ల వయసులో (2013) తన శరీరంలో మార్పులు రావడాన్ని గమనించింది. ఆసుప్రతికి వెళ్లి వైద్యపరీక్షలు చేయించుకోగా.. ఆమెలో మగవారిలో ఉండే వై క్రోమోజోమ్లు ఉన్నట్లు తేలింది. (ఆడవారిలో రెండు ఎక్స్ క్రోమోజోములు మాత్రమే ఉంటాయి). జెండర్ డిస్ఫోరియాతో బాధపడుతున్న ఆమెకు లింగ మార్పిడి సర్జరీ చేయించుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ క్రమంలో లలితా సాల్వే 2017లో బాంబే హైకోర్టును ఆశ్రయించింది. లింగమార్పిడి సర్జరీ కోసం నెల రోజులు సెలవు కోరింది. బాంబే హైకోర్టుతోపాటు 2018లో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతివ్వడంతో లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుంది. 2018 నుంచి 2020 వరకు మూడు సర్జరీల ద్వారా పురుషుడిగా మారింది. దీంతో లలితా నుంచి తన పేరును లలిత్ కుమార్ సాల్వేగా మార్చుకుంది. అనంతరం 2020లో ఛత్రపతి శంభాజీనగర్కు (ఔరంగాబాద్) చెందిన సీమాను పెళ్లి చేసుకొని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. వివాహమైన నాలుగేళ్ల తర్వాత జనవరి 15న ఆ జంటకు బాబు పుట్టాడు. చదవండి: Video: అకస్మాత్తుగా కూలిన అయిదు అంతస్తుల భవనం లలిత్ సాల్వే మాట్లాడుతూ.. స్త్రీ నుంచి పురుషుడిగా మారిన తన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. అనేక పోరాటాలు చేసి చివరికి తన జెండర్ మార్చుకునట్లు తెలిపారు. ఈ ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన అందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. -
టెక్కీ దారుణ హత్య.. హద్దుల్లేని ప్రేమ పరిణామాలు ఇలాగే ఉంటాయా?
చెన్నై శివారులోని తాలంబూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగి నందినిని స్నేహితురాలు మహేశ్వరి అలియాస్ వెట్రిమారన్ దారుణంగా హత్య చేయడం సంచలనం సృష్టించింది. నందినిని ప్రేమించిన మహేశ్వరి ఆరునెలల కిందటే అబ్బాయిగా మారి వెట్రిమారన్గా పేరు మార్చుకుంది. తన కోసమే లింగమార్పిడి చేసుకున్న తనను నందిని దూరంగా పెడుతుందన్న కోపంతో హత్య చేసి మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టాడు. స్నేహితుడు లేదా స్నేహితురాలి కోసం లింగమార్పిడి చేసుకున్న తర్వాత తనను పట్టించుకోకపోవడం, వేరొకరితో సన్నిహతంగా ఉండటంతో దాడులు చేసిన ఘటనలు గతంలోనూ వార్తల్లో కనిపించాయి. ఈ నేపథ్యంలో లింగమార్పిడి చుట్టూ ఉన్న సామాజిక సంక్లిష్టతల గురించి, ట్రాన్స్ జెండర్స్ పట్ల సమాజం చూపించే తిరస్కరణ గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అసలు కొందరు వ్యక్తులు జెండర్ ఐడెంటిటీలో ఎందుకు గందరగోళ పడతారనేది సంక్లిష్టమైన ప్రశ్న. దీనికి ఖచ్చితమైన సమాధానం లేదు. జెండర్ ఐడెంటిటీకి జీన్స్ కు మధ్య సంబంధాలను అనేక అధ్యయనాలు గుర్తించాయి. అయితే నిర్దిష్టంగా ఏ జీన్స్ కారణమనే దానిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. మరోవైపు చిన్ననాటి అనుభవాలు, సామాజిక, సాంస్కృతిక ప్రభావాలు ఒక వ్యక్తి జెండర్ ఐడెంటిటీకి దోహదపడతాయి. అంటే ఒక వ్యక్తి ట్రాన్స్ జెండర్గా మారడమనేది వారి ఎంచుకున్నది కాదనేది గుర్తించాలి. ప్రతి ఒక్కరూ ‘మగ’ లేదా ‘ఆడ’ వర్గాల్లోనే కాకుండా మధ్యలో కూడా ఉండవచ్చు. వారి జెండర్ ఐడెంటిటీని గుర్తించడం, వారు గౌరవంగా జీవించడానికి సహకరించడం అవసరం. అలా జరగనప్పుడు, ఆ గుర్తింపు గౌరవం దొరకనప్పుడు తీవ్రంగా గందరగోళ పడతారు. మానసిక సమస్యలకు లోనవుతారు. తమ సమస్యలకు కారణమైన వారిపై దాడికి కూడా పాల్పడవచ్చు. ఒక వ్యక్తికి ఐడెంటిటీ అనేది ఎంత ముఖ్యమో తెలుసుకుంటే జెండర్ ఐడెంటిటీ ప్రాధాన్యం తెలుస్తుంది. ఉదాహరణకు నా పేరు విశేష్. నేను Psy.Vishesh అని రాస్తా. అంటే సైకాలజిస్ట్ గా నా ప్రొఫెషన్ తో ఐడెంటిఫై చేసుకుంటున్నా. నన్ను అలా పిలిస్తేనే నాకు ఇష్టం, మరోలా పిలిస్తే కష్టంగా ఉంటుంది. పేరు విషయంలోనూ ఇంత ఖచ్చితంగా ఉన్నప్పుడు.. బాలికగా పుట్టిన వ్యక్తిలో పురుష భావనలు ఉంటే మనసులో ఎంత కన్ఫ్యూజన్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు అలాంటి భావనలను సమాజమే కాదు కుటుంబం కూడా ఒప్పుకోదు. అలాంటి పరిస్థితుల్లో తనను పురుషుడిగా అంగీకరించిన స్నేహితురాలు దొరికితే అంతకంటే ఆనందం ఉండదు. ఆ స్నేహితురాలిని, ఆ స్నేహాన్ని శాశ్వతంగా తనది చేసుకోవాలనుకుంటారు. పురుషుడిగా మారితే నందిని తనను అంగీకరిస్తుందనే, పెళ్లిచేసుకుంటుందనే ఆశతో లేదా అపోహతో మహేశ్వరి లింగమార్పిడి చేయించుకుని వెట్రిమారన్గా మారింది. కానీ నందిని దూరంగా ఉంచడం మారన్ మనసులో కల్లోలం రేపి ఉండవచ్చు. తనకోసం, తన ప్రేమ కోసం, తనతో జీవితం గడపడంకోసం లింగమార్పిడి సైతం చేయించుకున్నా దూరంగా పెట్టడంతో నందినిపై కోపం ఏర్పడి ఉండవచ్చు. ఆ కోసం హద్దులు దాటి నందిని హత్యకు దారితీసి ఉండవచ్చు. కోరుకున్నది దక్కనప్పుడు అందరూ ఒకేరీతిలో స్పందించరు. కొందరు తీవ్ర డిప్రెషన్కు లోనైతే, మరికొందరు ఫ్రస్ట్రషన్, అగ్రెషన్ కు లోనవుతారు. కారణమైన వ్యక్తిపై ద్వేషం పెంచుకుంటారు. అప్పటికే జెండర్ ఐడెంటిటీ సమస్యలో ఉన్నవారిలో ఇలాంటి పరిస్థితులు మరింత తీవ్ర భావోద్వేగాలకు కారణమవుతాయి. అప్పటికే సమాజం నుంచి తిరస్కరణ ఎదుర్కొంటున్న వ్యక్తి మనసులో ప్రేమించిన వ్యక్తి తిరస్కరణ మరింత బలమైన గాయాలు చేస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇలాంటి హింసాత్మక ప్రవర్తనలు కనిపిస్తుంటాయి. నందిని హత్య నిస్సందేహంగా బాధాకరం. అయితే ఆ నేపథ్యంలో ట్రాన్స్ జెండర్స్ పట్ల సమాజం పోకడను మనం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. జెండర్ ఐడెంటిటీ అనేది ఏ ఒక్కరి ఎంపిక కాదని, కొందరిలో అది భిన్నంగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఆడ, మగలతో పాటు ట్రాన్స్ జెండర్స్కు కూడా గౌరవంగా జీవించే హక్కు ఉందని గుర్తించాలి. వారి సమస్యలను సహానుభూతితో అర్థం చేసుకోవాలి. అవసరమైన సందర్భాల్లో కౌన్సెలింగ్ లేదా సైకోథెరపీ ద్వారా వారి సమస్యల పరిష్కారానికి వీలైన సహాయ సహకారాలు అందించాలి. అప్పుడే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలు తగ్గుతాయని అందరం అర్థం చేసుకోవాలి. సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com 8019 000066 -
ఇంకా లింగ వివక్ష: సీజేఐ
బెంగళూరు: ప్రాంతీయ భేదాలకు అతీతంగా చాలా కుటుంబాల్లో నేటికీ లింగ వివక్ష సూక్ష్మ రూపంలో కొనసాగుతూనే ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆవేదన వెలిబుచ్చారు. పైగా వాటిని ఎవరూ ప్రశ్నించరాదన్న ధోరణి కూడా గూడుకట్టుకుని పోయిందని ఆక్షేపించారు. ‘‘ఎవరు ఔనన్నా, కాదన్నా చేదు నిజం మాత్రం ఇదే. పైగా న్యాయస్థానాలు వ్యక్తిగత స్వేచ్ఛ కంటే వివాహ వ్యవస్థను నిలబెట్టడానికే ప్రాధాన్యతనిస్తూ రావడం ద్వారా దీనికి కొంతవరకు పరోక్షంగా ఆమోదముద్ర వేశాయి’’ అని అభిప్రాయపడ్డారు. ఆదివారం బెంగళూరులో ఆయన జస్టిస్ ఈఎస్ వెంకటరామయ్య శతాబ్ది స్మారక ప్రసంగం చేశారు. సంతానంలో ఒకరికి మించి పై చదువులు చదివించలేకపోతే అత్యధిక కుటుంబాల్లో ఆ అవకాశం కచి్చతంగా మగ సంతానానికే దక్కుతుంది. స్త్రీకి ఉండే ఆంక్షలు, ఒత్తిళ్లు మగవాడికి ఉండవన్నది కూడా వాస్తవం’’ అని సీజేఐ అన్నారు. -
భారత్లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సమస్య ఇదే
పురుషుల మాదిరిగానే మహిళలు కూడా ప్రజా సదుపాయాలకు అర్హులని ఐఏఎస్ అధికారి శరణ్య అరి పేర్కొన్నారు. స్మిళిత పట్టణ ప్రణాళిక భారతదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సమస్య అని లింగసమానత్వంతోనే ఇది సాధ్యమవుతుందన్నారు. తాజాగా హైదరాబాద్లోని పార్క్ హయాత్ హోటల్లో జరిగిన TEDx (టెక్నాలజీ ఎంటర్టైన్మెంట్ అండ్ డిజైన్) కార్యక్రమంలో ఆమె ఈ సందర్భంగా మాట్లాడారు. సమ్మిళిత పట్టణ ప్రణాళిక భారతీయ సమస్య మాత్రమే కాదు, ఇది ప్రపంచ సమస్య. మహిళలు పని కోసం 5 నుంచి 8 కి.మీల వరకు నడకను ఎంచుకుంటారు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రజా సౌకర్యాలు మహిళలకు ఉపయోగకరంగా ఉండవు. వియన్నాలో 90 శాతం కార్యాలయాలు మహిళలకు అనుకూలంగా రూపొందించబడ్డాయి. పురుషుల మాదిరిగానే స్త్రీలు కూడా సరైన రకమైన ప్రజా సదుపాయాలకు అర్హులు కాదా?అభివృద్ధిలో మహిళలను కూడా భాగస్వాములను చేయండి. బహిరంగ ప్రదేశాల్లో భద్రత లింగ సమానత్వాన్ని పెంపొందించడం ద్వారా మహిళల అవకాశాలను మెరుగుపర్చవచ్చు అంటూ ఆమె పేర్కొన్నారు. ఇక తన కెరీర్లో గత 15 ఏళ్లుగా అంగవైకల్యం ఉన్న ప్రత్యేక వ్యక్తులను తన సిబ్బందిని నియమించుకుంటూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు సస్టైనబిలిటీ/ఇఎస్జి ఇనిషియేటివ్స్ లీడర్ ఆరాధన. మాజంలోని మహిళలు, అంగవైకల్యం ఉన్నవారు..ఇలా అందరిని కలుపుకొని పోవడం తనకెంతో సంతోషాన్ని ఇస్తుందని, ఇది సంస్థలకు కూడా మేలు చేస్తుందని ఆమె తెలిపింది. సామాజిక ప్రయోజన సంస్థల్లో కేవలం 19% మహిళలు మాత్రమే నాయకత్వం వహిస్తున్నారని, పురుషులకు సమానంగా మహిళలకు కూడా అవకావాలు కల్పించాలని ఆమె తెలిపింది. -
ఆలోచన రేపుతున్న ఎంపిక
ఏటా ఇచ్చే పురస్కారాలు సైతం విజేతల ఎంపిక, వారు చేసిన కృషి రీత్యా విశిష్టంగా నిలుస్తాయి. రాయల్ స్వీడిష్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ ఈ ఏడాదికి గాను ఇప్పటి దాకా ప్రకటించిన పురస్కారాల్లో కొన్ని అలాంటివే! స్వెరిజెస్ రిక్స్బ్యాంక్ ప్రైజ్ అనే పేరు కన్నా ఆల్ఫ్రెడ్ నోబెల్ స్మారకార్థం ఇచ్చే ‘నోబెల్ పురస్కారం’గానే ప్రసిద్ధమైన ఈ గౌరవం దక్కిన ఇద్దరు మహిళల గురించి ఇప్పుడు ప్రపంచమంతా ఆసక్తి కనబరుస్తోంది. మహిళా శ్రామికశక్తిపై విస్తృత పరిశోధన జరిపిన ఆర్థిక శాస్త్రవేత్త క్లాడియా గోల్డిన్కు అర్థశాస్త్రంలో నోబెల్ ప్రైజ్, అలాగే ఇరాన్లో జైలులో మగ్గుతున్న మానవ హక్కుల ఉద్యమకారిణి నర్గిస్ మొహమ్మదీకి నోబెల్ శాంతి బహుమతి దక్కడం వారు దీర్ఘకాలంగా చేస్తున్న కృషికి అతి పెద్ద అంతర్జాతీయ గుర్తింపు. ఈ ఇద్దరి ఎంపిక వేతనాల్లో స్త్రీ పురుష వ్యత్యాసం మొదలు లింగ సమానత్వం దాకా అనేక అంశాలపై మరోసారి చర్చ రేపుతోంది. గోల్డిన్ కృషికి అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారం దక్కడం బాగున్నా, అందులోనూ వైచిత్రి ఉంది. ఆమె నాలుగు దశాబ్దాల కృషి అంతా శ్రామిక విపణుల్లో మహిళలు, లింగ సమానత్వం గురించి! విచిత్రం ఏమిటంటే 1969లో అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని స్థాపించినప్పటి నుంచి నిన్నటి వరకు ఆ పురస్కారం దక్కింది ఇద్దరంటే ఇద్దరు మహిళలకే! అదీ వేరేవాళ్ళతో కలసి! ఆ గౌరవం దక్కిన మూడో మహిళ గోల్డినే! పైగా, ఒక మహిళకు ఒంటరిగా అర్థశాస్త్రంలో నోబెల్ దక్కడమూ ఇదే ప్రప్రథమం. నోబెల్ బహుమతుల్లో లింగ అసమానత్వంపై విమర్శలు వస్తున్న వేళ లేబర్ మార్కెట్లో మహిళా విజయం లోతుపాతులు విశ్లేషించిన గోల్డిన్కు ఈ గౌరవం దక్కడం గమనార్హం. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరైన గోల్డిన్ అమెరికాలోని శ్రామిక విపణినీ, అలాగే వేతనాల్లో లింగ అసమానత్వానికి కారణాలనూ నాలుగు దశాబ్దాలుగా లోతుగా అధ్యయనం చేస్తూ వచ్చారు. 200 ఏళ్ళ అమెరికా చరిత్రను లోతుగా విశ్లేషిస్తూ, చారిత్రకంగా స్త్రీ పురుషుల ఆదాయాల్లో తేడాకు ప్రధానంగా చదువు, వివిధ రకాల ఉద్యోగాలే కారణమని తేల్చారు. వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి పారిశ్రామిక ఆధారిత వ్యవస్థ వైపు దేశం మారడంతో శ్రామిక విపణిలో వివాహిత స్త్రీల భాగస్వామ్యం పడిపోయిందనేది ఆమె అధ్యయన సారం. ఆ తర్వాత 20వ శతాబ్దంలో సర్వీసుల పరిశ్రమ వృద్ధి చెందడంతో, మరింత విద్యావంతులైన మహిళలు రంగంలోకి వచ్చారు. గర్భనిరోధక విధానాల లాంటివి ఆరోగ్యరంగంలో వ్యాప్తిలోకి వచ్చాయి. తత్ఫలితంగా, శ్రామికశక్తి లోకి మహిళలు మళ్ళీ ప్రవేశించారు. కానీ, అప్పటికే తలెత్తిన అంతరం మాత్రం పూడిపోలేదు. ముఖ్యంగా, తొలిచూలుతో ఈ తేడా తలెత్తుతోందని గోల్డిన్ పరిశోధన. ఇక, మరణశిక్షకు వ్యతిరేకంగా గళం విప్పినందుకూ, దేశంలో మహిళలకు సైతం సమాన హక్కులు ఉండాలని కోరినందుకూ ఇరాన్లో కటకటాలు లెక్కపెడుతున్న నర్గిస్ పోరాటం మరో పెద్ద కథ. ఇప్పటికి ఆమె 13 సార్లు అరెస్టయి, అయిదుసార్లు దోషిగా తీర్మానమై, 31 ఏళ్ళ జైలుశిక్షను ఎదుర్కొంటోంది. 2022 నాటి డబ్యూఈఎఫ్ గ్లోబల్ జెండర్ గ్యాప్ నివేదికలో అట్టడుగున అఫ్గానిస్తాన్, పాకిస్తాన్లతో పాటు నిలిచిన దేశంగా ఇరాన్ పేరుమోసింది. అలాంటి దేశాల్లో నర్గిస్ లాంటి మహిళలు కడకు తమ ఉనికిని కాపాడుకొనేందుకు సైతం పోరాడాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అటు క్లాడియా గోల్డిన్ అధ్యయనానికీ, ఇటు నర్గిస్ మొహమ్మదీ అలుపెరుగని పోరాటానికీ నోబెల్ గుర్తింపు రావడం ఆనందదాయకం. సరిగ్గా గోల్డిన్కు నోబెల్ ప్రకటించిననాడే మన దేశంలో వార్షిక ‘పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే‘ (పీఎల్ఎఫ్ఎస్) విడుదలైంది. గత 2022 జూలై నుంచి ఈ 2023 జూన్కి సంబంధించిన ఈ సర్వే శ్రమజీవుల్లో మహిళల సంఖ్య మునుపటి కన్నా కొద్దిగా పెరిగిందని పేర్కొంది. అయితే, అది సహజ మైన పెరుగుదల కాక కరోనా తర్వాత కుటుంబ ఆదాయాలు దెబ్బతినడంతో తప్పని పరిస్థితుల్లో వచ్చిన పాలపొంగు అని విశ్లేషకుల అభిప్రాయం. వెరసి, లోతుగా గమనిస్తే భారత్లోనూ మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం రేటు ఇవాళ్టికీ తక్కువగానే ఉందన్నది విచారకరమైన వాస్తవం. ఇది మారాలంటే... అర్థవంతమైన ఉపాధి, అదే సమయంలో మహిళా శ్రామికశక్తి భాగస్వామ్యం పెరి గేలా విధాన నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వాలది. అందుకు ప్రొఫెసర్ గోల్డిన్ అధ్యయనం నుంచి భారతదేశం సైతం పాఠాలు నేర్వాలి. ఏ దేశమైనా సరే ఆర్థిక పురోగతి సాధించినంత మాత్రాన శ్రామిక విపణిలో లింగ వ్యత్యాసం దానంతట అది తగ్గిపోదని గోల్డిన్ నిరూపించారు. అలాగే, సామాజిక, వ్యవస్థాపరమైన అవ రోధాలు ఉన్నంత కాలం కేవలం స్త్రీ విద్య సైతం శ్రామికశక్తిలో లింగ అంతరాల్ని తగ్గించలేదు. సాంప్రదాయిక సమాజాల్లో పిల్లల పెంపకమూ ఓ కీలకాంశం. విధాన నిర్ణేతలు వీటిని దృష్టిలో ఉంచుకోవాలి. లింగ కోణం నుంచి అర్థశాస్త్ర అధ్యయనం ప్రధాన స్రవంతిలో భాగం కాదన్న భావనల్ని గోల్డిన్ బద్దలుకొట్టారు. అమెరికా నుంచి ఇరాన్ దాకా ప్రపంచంలో ప్రతి చోటా ఇవాళ్టికీ ఆడవారి పరిస్థితి ఒకేలా ఉంది. ఇవాళ పురుషుల్లో నూటికి 80 మంది ఉద్యోగాల్లో ఉంటే, ప్రపంచ మహిళా జనాభాలో కేవలం సగం మందే వేతన ఉపాధి పొందుతున్నారు. అదీ మగవాళ్ళ కన్నా తక్కువ వేతనాలకే పనిచేస్తూ, వృత్తిలో ఉన్నత శిఖరాల అధిరోహణకు అవకాశాలూ తక్కువే. అందుకే, లింగ సమానత్వ సాధనలో ప్రపంచం ప్రయాణించాల్సిన దూరం ఇంకా ఎంతో ఉంది. ఆ దిశలో నోబెల్ విజేతలైన గోల్డిన్ అధ్యయనం, నర్గిస్ పోరాటం మనకు తాజా మార్గదర్శకాలు. -
Women : ఆడబిడ్డల ఆంధ్రా!
సాక్షి, అమరావతి: దేశంలో, రాష్ట్రంలో జననాల్లో బాలికల సంఖ్య పెరుగుతోంది. 2014–15 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. దేశంలో ప్రతి వెయ్యి మంది బాలురకు 2022–23లో బాలికల నిష్పత్తి 15కు పెరగ్గా, రాష్ట్రంలో 24కు పెరిగింది. దేశం మొత్తంతోపాటు చాలా రాష్ట్రాల్లో గతంలో కన్నా జననాల్లో బాలికల నిష్పత్తి పెరుగుతోందని, ఇది శుభపరిణామమని కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే బిహార్తో పాటు మిజోరాం, నాగాలాండ్లలో గతం కన్నా బాలికల నిష్పత్తి తగ్గడం ఆందోళన కలిగిస్తోందని తెలిపింది. బేటీ బచావో బేటీ పఢావో పథకం ద్వారా బాలికలు, మహిళా సాధికారతకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో కలిసి ప్రయత్నాలు చేస్తున్నట్టు కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ పథకం కింద జనన సమయంలో లింగ నిర్ధారణను గుర్తించే చర్యలను ప్రభుత్వం నిలుపుదల చేసిందని, ఆడపిల్లల జననాల పట్ల అవగాహన పెంచేందుకు చర్యలు చేపట్టిందని తెలిపింది. ఆడపిల్లల అభివృద్ధికి ప్రోత్సాహం ఆడపిల్లల విద్య, పెరుగుదల, అభివృద్ధి, హక్కులకు మద్దతుగా సానుకూల చర్యలను ప్రోత్సహించడానికి అన్ని స్థాయిల్లో ప్రయత్నాలు చేస్తున్నట్టు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తగిన మార్గదర్శకాలతో కూడిన కార్యాచరణ క్యాలెండర్ జారీ అయినట్లు తెలిపింది. దానిని జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు పేర్కొంది. లింగ నిష్పత్తి తగ్గకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసినట్టు తెలిపింది. -
భారతదేశ న్యాయవ్యవస్థలో లింగ సమానత్వానికి నాంది!
భారతీయ సమాజంలోని వివిధ రంగాలలో సమాన హక్కులు అంతుచిక్కని లక్ష్యం. న్యాయవ్యవస్థలో కూడా ఇదే ధోరణి. భారతీయ న్యాయ వ్యవస్థలోని మహిళల ప్రాతినిధ్యాన్ని నిశితంగా పరిశీలిస్తే, మగవారి ఆడవారి మధ్యలో ఉన్న అసమానత్వం స్పష్టమైన చిత్రాన్ని చిత్రీకరిస్తుంది. పైగా ఇందులో మార్పు అత్యంత అవసరం అనే విషయాన్ని నొక్కి చెబుతుంది. అత్యున్నత న్యాయస్థానంలో 36 మంది న్యాయమూర్తులలో కేవలం ముగ్గురు మాత్రమే మహిళలు. ఈ అసమానత అత్యున్నత న్యాయస్థానానికి మాత్రమే పరిమితం కాదు. ఇది హైకోర్టుల వరకు వ్యాపించింది, ఇక్కడ వెయ్యి మంది న్యాయమూర్తులలో కేవలం 96 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. జిల్లా న్యాయవ్యవస్థలో కూడా పరిస్థితి మెరుగుపడలేదు. 3.3 లక్షల మంది న్యాయమూర్తులకు న్యాయ అధికారులలో కేవలం 6% మంది మహిళలు ఉన్నారు. భారతదేశంలోని విస్తృత చట్టపరమైన ల్యాండ్స్కేప్లో 15% కంటే తక్కువ మంది మహిళలు న్యాయవాదులు ఉన్నారు. ఈ నిరుత్సాహపరిచే అసమానతకు దోహదపడే కారకాలు చాల ఉన్నాయి. అవి చాలా లోతుగా పాతుకుపోయాయి. ఇప్పటికి సామాజిక పక్షపాతాలు, నిబంధనలు న్యాయవాద వృత్తిని కొనసాగించకుండా మహిళలను నిరుత్సాహపరుస్తున్నాయి. దానితో పాటు చట్టపరమైన విద్య కూడా చాల తక్కువ అవకాశాలు ఉంటున్నాయి. న్యాయవాద వృత్తిలో ఆదాయం చాలా మారవచ్చు. ఇది న్యాయమూర్తులు కావాలనుకునే మహిళా న్యాయవాదులకు కష్టతరం చేస్తుంది. న్యాయనిర్ణేతగా మారడం వారికి కష్టంగా ఉంటుంది. ఇలా చాల సవాళ్లు ఉన్నాయి. కానీ దాంతో పాటు ఆశ కూడా మిగిలి ఉంది. మాజీ, ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తులు కోర్టులలో చాల సార్లు మహిళలకు పదోన్నతులు కల్పించారు. ఇలాంటి పరిస్థితిలో చట్టపరమైన రంగంలో లింగ సమానత్వం కోసం ప్రయత్నాలు మరింత ముఖ్యమైనవిగా ఉండాలి. మెరుగైన మహిళా ప్రాతినిధ్యానికి స్థిరమైన లక్ష్యం, విధానం అవసరం. ఈ మొదటి అడుగు ప్రశంసనీయమే కానీ నిజమైన సమానత్వం కోసం ప్రతి ఒక్కరి కృషి అవసరం. న్యాయవ్యవస్థ, ప్రభుత్వం, పౌర సమాజం అందరు కలిసి పనిచేయాలి. ఇటీవలే, అస్సాం, జమ్మూ కాశ్మీర్లో మహిళా కమిటీని ఏర్పాటు చేయడం వంటి చర్యలు చూసి, కోర్టులు మహిళా న్యాయానికి కట్టుబడి ఉన్నాయని చూపిస్తున్నాయి. ఇలాంటి చర్యలు సమాన హక్కులు గూర్చి లోతైన కారణాలపై పోరాడటానికి న్యాయస్థానాలు తమ బాధ్యతను అంగీకరిస్తాయని చూపిస్తుంది. కొంతకాలం క్రితం, భారతదేశ సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆగస్ట్ 7న మణిపూర్లో హింసాత్మక పరిస్థితి గురించి ప్రకటన చేసారు. ఈ సమస్యను పరిశీలించడానికి ముగ్గురు న్యాయమూర్తుల బృందానికి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నాయకత్వం వహించారు. ఇది ఒక కొలిక్కి రావాలంటే ఈ తరహా సహాయం ఆయన చేయాలనీ సుప్రీంకోర్టు గ్రహించింది. కాబట్టి, వారు సహాయం చేయడానికి మొత్తం మహిళల కమిటీని రూపొందించడానికి తమ ప్రణాళికను పంచుకున్నారు. ఈ ఏర్పడిన కమిటీలో ఉన్నత న్యాయస్థానాల నుంచి ముగ్గురు ప్రముఖ మాజీ న్యాయమూర్తులు ఉంటారు. జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ గీతా మిట్టల్ కమిటీకి నాయకత్వం వహిస్తారు. ఇతర కమిటీ సభ్యులు జస్టిస్ షాలినీ ఫన్సల్కర్ జోషి (బాంబే హైకోర్టు నుంచి పదవీ విరమణ చేసారు), జస్టిస్ ఆశా మీనన్ (గతంలో ఢిల్లీ హైకోర్టు నుండి పనిచేశారు). సహాయక చర్యలను పర్యవేక్షించడం, ప్రార్థనా స్థలాలు, గృహాలను పునరుద్ధరించడం, సహాయక చర్యలను మెరుగుపరచడం తోపాటు మరిన్ని బాధ్యతలు కమిటీకి ఉంటాయి. మే నుంచి జులై వరకు జరిగిన హింసాత్మక సంఘటనల గురించి పరిశోధన చేయడానికి ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి దత్తాత్రయ్ పద్సాల్గికర్ను నాయకత్వం వహించడానికి ఎంపిక చేసారు. పద్సల్గికర్ ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో, నాగాలాండ్లో పనిచేశాడు. ఈ కేసుల కోసం మణిపూర్లో 6500 పైగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. కానీ, న్యాయవ్యవస్థలో లింగ సమానత్వాన్ని సాధించడానికి సమయం పడుతుంది. మహిళలకు మాత్రమే న్యాయస్థానాలను సృష్టించడం, మహిళలపై హింసకు వ్యతిరేకంగా పోరాడడం తదితరాలు సానుకూల అభివృద్ధి. కానీ, నిజమైన పురోగతికి మరిన్ని మార్పులు అవసరం. న్యాయవాద వృత్తిలో మహిళలకు మరింత అధికారం ఇవ్వడం ముఖ్యం. చట్టంలో మహిళలపై అన్యాయమైన నమ్మకాలను తొలగించడం చాలా కీలకం. మహిళలు ఎదగడానికి చాలా అవకాశాలు ఉన్నాయని నిర్ధారించుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ మార్పుల కోసం నిరంతర శ్రద్ధ, కృషి అవసరం. ఇలాంటి కార్యక్రమాలతో మనం స్థిరంగా కొనసాగితే, న్యాయవ్యవస్థలో మహిళలు తమ స్థానాలను సక్రమంగా చేపట్టేందుకు చాల గొప్ప అవకాశం ఉంటుంది. దీని వల్ల న్యాయ వ్యవస్థలో మహిళలకు పెద్ద పాత్ర ఉంటుంది. వైవిధ్యమైన న్యాయ వ్యవస్థ బలంగా, న్యాయంగా ఉండవచ్చు. భారతదేశ న్యాయ వ్యవస్థలో స్త్రీలను, పురుషులను సమానంగా చూడటం ముఖ్యం. మనమందరం మహిళల అభిప్రాయాన్ని ఎక్కువగా వినడానికి, చూడటానికి సహాయం చేస్తే, పరిస్థితులు మారవచ్చు. పురుషులు, మహిళలు ఒకే విధంగా పరిగణించే భవిష్యత్తును సృష్టించడానికి ప్రయాస పడాలి. -డాక్టర్ శ్రీదేవి రెడ్డి గాధే, సీనియర్ హైకోర్టు అడ్వకేట్(అభిజ్ఞా భారత్ ఆర్గనైజేషన్ ఫౌండర్) -
తీర్పుల్లో మహిళల పట్ల అనుచిత పదాలు వాడొద్దు
ఢిల్లీ: న్యాయస్థానాల్లో కేసుల విచారణ, తీర్పులు వెల్లడించే సమయంలో మహిళలపై వివక్షకు తావు లేకుండా కీలక ముందడుగు పడింది, వేశ్య, పతిత, ఎఫైర్, హౌస్వైఫ్, ట్రాన్సెక్సువల్, వ్యభిచారం వంటి పదాలు ఇక ఉపయోగించకూడదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు నిర్దేశించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ బుధవారం ఒక హ్యాండ్బుక్ను విడుదల చేశారు. ‘‘హ్యాండ్బుక్ ఆన్ కంబాటింగ్ జెండర్ స్టీరియో టైప్స్’’ పేరుతో ఉన్న ఈ హ్యాండ్బుక్లో న్యాయస్థానాలు గతంలో ఇచి్చన తీర్పుల సమయంలో మహిళల పట్ల అనుచితంగా ఉండే 100కి పైగా పదాలు అందులో ఉన్నాయి. ఆ పదాలకు బదులుగా ఏం వాడాలో కూడా అందులో వివరంగా రాశారు. రెచ్చగొట్టే దుస్తులు, పెళ్లి కాకుండానే తల్లి, ఎఫైర్, వేశ్య వంటి పదప్రయోగాలకు చేయకూడదని, వాటికి బదులుగా దుస్తులు, తల్లి, వివాహేతరం సంబంధం, సెక్స్ వర్కర్ అని మాత్రమే రాయాలని ఆ హ్యాండ్బుక్ స్పష్టంగా చెబుతోంది. ఈవ్టీజింగ్ బదులుగా స్ట్రీట్ సెక్యువల్ హెరాజ్మెంట్, హౌస్వైఫ్ బదులుగా హోమ్మేకర్ అన్న పదాలు వాడాలని నిర్దేశించింది. మూస పదాలు వద్దు ఈ హ్యాండ్బుక్ విడుదల చేసిన సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ మాట్లాడుతూ న్యాయ ప్రక్రియల్లో మహిళలపై మూస పద్ధతుల్లో ఎలాంటి పదాలు ఉపయోగిస్తారో ఈ పుస్తం చెబుతుందని అన్నారు. ‘‘తీర్పులు రాసే సమయంలో న్యాయమూర్తులు మహిళల పట్ల అనాలోచితంగా అనుచిత పదాలు వాడుతున్నారు. మూసపద్ధతుల్లో ఉండే పద ప్రయోగాలు చేస్తున్నారు. గతంలో వచ్చిన తీర్పుల్ని విమర్శించడం ఉద్దేశం కాదు. భవిష్యత్లో న్యాయమూర్తులు ఆ పదాలు ఉపయోగించకుండా ఈ హ్యాండ్బుక్ ఉపయోగపడుతుంది. ఏ పదాలకు గుర్తింపు ఉందో స్పష్టంగా తెలుస్తుంది. భవిష్యత్లు ఇచ్చే తీర్పుల్లో న్యాయమూర్తులు సరైన పదాలు వాడితే వారిచ్చే తీర్పులపై అపోహలకు కూడా తావుండదు’’ అని జస్టిస్ చంద్రచూడ్ వివరించారు. ఇదీ చదవండి: ఢిల్లీ చట్టంపై అసెంబ్లీ స్పెషల్ సెషన్..ఎల్జీ అభ్యంతరం -
టీ తోట నుంచి చైతన్యం
పోష్ (ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ సెక్సువల్ హెరాస్మెంట్) యాక్ట్ 2013 ప్రకారం వ్యవస్థీకృతమైన రంగాల్లో మహిళల పట్ల లైంగిక వేధింపులను నివారించడానికి ఇంటర్నల్ సెల్ ఏర్పాటు చేయడం జరుగుతోంది. కానీ అసంఘటిత రంగాల్లో పని చేసే మహిళలకు ఇలాంటి ఒక చట్టం ఉందనే సంగతి కూడా తెలియదు. ఇలాంటి స్థితిలో అస్సాంలోని టీ తోటల్లో పని చేసే మహిళలు సంఘటితమై తమ హక్కును కాపాడుకోవడానికి ఉద్యమించారు. ఒకరికొకరు అండగా మనదేశంలో వ్యవసాయరంగం తర్వాత మహిళలు అతిపెద్ద సంఖ్యలో పని చేస్తున్నది టీ తోటల్లోనే. ఈ తోటల్లో పని చేసే కార్మికుల్లో ఎనభైశాతం మహిళలే. అస్సాం, వెస్ట్బెంగాల్, కేరళ, తమిళనాడులన్నీ కలిపి దేశంలో 350కి పైగా టీ తోటలున్నాయి. దాదాపుగా ఒక్కో తోటలో వెయ్యికి పైగా మహిళలు పనిచేస్తుంటారు. దేశవ్యాప్తంగా మూడు లక్షల అరవైవేలకు పైగా మహిళలు టీ తోటల్లో పని చేస్తున్నారు. ఈ మహిళల పరిస్థితి ఒకప్పుడు అత్యంత దయనీయంగా ఉండేది. వాళ్ల మాటకు ఇంట్లో విలువ ఉండేది కాదు, పని చేసే చోట లైంగిక వేధింపులు, వివక్ష తప్పేది కాదు. ఒకరి కష్టాన్ని మరొకరికి చెప్పుకుని ఓదార్పు పొందడమే తప్ప, ఆ కష్టాల నుంచి బయటపడవచ్చని తెలియని రోజులవి. ఒకసారి తెలిసిన తరవాత ఇక వాళ్లు ఆలస్యం చేయలేదు. ఉమెన్స్ సేఫ్టీ యాక్సెలరేటర్ ఫండ్ (డబ్లు్యఎస్ఏఎఫ్) స్వచ్ఛంద సంస్థ అండతో ముందుకురికారు. అస్సాం నుంచి కేరళ వరకు తమకు భద్రత కల్పించడానికి పోష్ అనే చట్టం ఉందని తెలిసిన తర్వాత ఆ చట్టం ద్వారా ఎన్ని రకాలుగా రక్షణకవచంగా ఉపయోగించుకోవచ్చనే వివరాలు కూడా తెలుసుకున్నారు. ‘సమాజ్’ పేరుతో వాళ్లలో వాళ్లు కమిటీలుగా ఏర్పడ్డారు. బృందంగా వెళ్లి ప్రభుత్వ అధికారులను కలుస్తూ... ప్రతి తోటలో ఇంటర్నల్ సెల్ ఏర్పాటయ్యే వరకు తమ ఉద్యమాన్ని ఆపలేదు. లైంగిక వేధింపులకు గురయినప్పుడు ఎలా ప్రతిఘటించాలో, ఎలాంటి ఆధారాలతో ఇంటర్నల్ సెల్కు ఎలా తెలియచేయాలో కళ్లకు కడుతూ చిన్నచిన్న నాటికలు ప్రదర్శించారు. అస్సాం, బెంగాల్ నుంచి కొంతమంది చురుకైన మహిళలు కేరళ, తమిళనాడులకు వచ్చి ఇక్కడి వారిని చైతన్యవంతం చేసే పని మొదలుపెట్టారు. ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఒక్క ఫోన్ కాల్ చాలు! పోష్ చట్టం ప్రకారం సెక్సువల్ హెరాస్మెంట్ రిడ్రసల్ కమిటీలు భవన నిర్మాణ రంగంలో కూడా ఉండాలి. అయితే టీ తోటల్లో మహిళల్లాగ భవన నిర్మాణంలో పని చేసే మహిళలు సంఘటితం అయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ఎక్కువ కాలం ఒకే చోట నివసిస్తున్న వాళ్లు మాత్రమే వేధింపులకు గురవుతున్న విషయాన్ని ఒకరితో ఒకరు పంచుకోగలుగుతారు. వాళ్లలో వాళ్లు మాట్లాడుకుని కలిసికట్టుగా పోరాటానికి సిద్ధమవుతారు. టీ తోటల్లో పని చేసే వాళ్లు సుదీర్ఘకాలం ఒకే చోట నివసిస్తూ, అదే తోటల్లో కలిసి పనిచేస్తూ ఉంటారు. భవన నిర్మాణ కార్మికులు అలా కాదు. ఒక భవనం పూర్తి కాగానే మరోభవనం కోసం వెళ్లిపోతుంటారు. తమ సమస్యకు పరిష్కారం కోసం సంఘటితం కాగలిగినంత సమయం కూడా ఒకేచోట ఉండరు. కాబట్టి పని చేసే ప్రదేశంలో కంప్లయింట్ ఇవ్వాల్సిన వివరాలతోపాటు ఫోన్ నంబరు రాయడమే వారిలో చైతన్యాన్ని కలిగిస్తుంది. అలాగే రైతుబజార్లు, కూరగాయల మార్కెట్లలో కూడా మహిళలు ఎక్కువగా ఉంటారు. అధికారులు సమావేశం ఏర్పాటు చేసి లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు కంప్లయింట్ ఇవ్వవచ్చని తెలియచేయాలి. కంప్లయింట్ విభాగానికి చెందిన ఫోన్ నంబర్ను ఆ మార్కెట్లో కూరగాయల ధరల పట్టిక కనిపించినట్లు బాగా కనిపించేటట్లు రాయాలని సూచించారు మహిళల హక్కుల యాక్టివిస్టు కొండవీటి సత్యవతి. ఒక నోడల్ పాయింట్ లైంగిక వివక్ష, వేధింపు, హింస, బాల్య వివాహాలు, అక్రమ రవాణా, ప్రసవ సమయంలో మరణాలు దేశంలో అస్సాం మొదటిస్థానంలో ఉంటుంది. అస్సాం, బెంగాల్లో మహిళల కోసం ప్రాతినిధ్యం వహించేవాళ్లు లేరు. టీ ఎస్టేట్లలో పనిచేసే బాలికలు, మహిళల భద్రత, హింస నిరోధం కోసం ఏర్పడిన కన్షార్షియం డబ్లు్యఎస్ఏఎఫ్... మహిళలను చైతన్యవంతం చేయడంతోపాటు లీగల్ సర్వీసెస్ అథారిటీ, హెల్త్ డిపార్ట్మెంట్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లు, పోలీస్, గ్రామీణ ఉపాధి కార్యక్రమాలన్నింటినీ ఒక గొడుగు కిందకు తీసుకువచ్చింది. ఆ ప్రయత్నం మంచి ఫలితాన్నిచ్చింది. అస్సాం టీ తోటల్లో పని చేసే మహిళలు దేశానికి దిక్సూచి అయ్యారు. – వాకా మంజులారెడ్డి చట్టం... కమిటీలే కాదు... ప్రభుత్వం ఇంకా చేయాలి! వ్యవస్థీకృత రంగంలో పనిచేసే మహిళల కోసం ఇంటర్నల్ కమిటీలున్నట్లే అసంఘటితరంగంలో కూడా కమిటీలుండాలి. ఇళ్లలో పని చేయడం, వీధుల్లో తిరుగుతూ కూరగాయలు, పండ్లు అమ్ముకోవడం వంటి ఇతర పనుల్లో ఉండే మహిళల కోసం లోకల్ కంప్లయింట్స్ కమిటీలుండాలి. కమిటీలు వేయడంతో సమస్య పరిష్కారం కాదు. ఇలాంటి కమిటీలున్నాయనే విషయం మహిళలకు తెలియాలి. లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు ఆయా కమిటీలకు కంప్లయింట్ ఎలా ఇవ్వాలో తెలియచేయాలి. ఫోన్ నంబర్ లేదా హెల్ప్లైన్ నంబర్లను పని ప్రదేశంలోనూ ఇతర కమ్యూనిటీ సెంటర్లలోనూ బాగా కనిపించేటట్లు బోర్డు మీద రాయాలి. అందుకు ప్రభుత్వమే పూనుకోవాలి. చట్టం చేసి తన బాధ్యత అయిపోయిందనుకుంటే సరిపోదు. చట్టాన్ని అమలు చేయడం, అమలయ్యే పరిస్థితులు కల్పించడం, చట్టం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం, తమ హక్కుల ఉల్లంఘన కలిగినప్పుడు గళమెత్తగలిగేటట్లు భరోసా కల్పించడం కూడా ప్రభుత్వం నిర్వర్తించాల్సిన బాధ్యతలే. – కొండవీటి సత్యవతి,భూమిక ఉమెన్స్ కలెక్టివ్, మెంబర్, లోకల్ కంప్లయింట్ కమిటీ, రంగారెడ్డి జిల్లా -
ఇద్దరు యువతుల ప్రేమ పెళ్లి.. లింగమార్పిడి చేసుకుని..
లక్నో: ఉత్తరప్రదేశ్లో విచిత్రమైన సంఘటన జరిగింది. ఇద్దరు అమ్మాయిలు వివాహం చేసుకోవడానికి కోర్టును ఆశ్రయించారు. ఇందుకోసం వారిలో ఒకరు లింగమార్పిడి చేసుకున్నారు. ఆ సంబంధిత ధ్రువపత్రంతో స్థానిక సబ్ డివిజినల్ కోర్టులో రిజిస్ట్రేషన్ వివాహానికి వీరు దరఖాస్తు చేసుకున్నారు. బరేలీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని బరేలీలో ఇద్దరు అమ్మాయిలు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరి మధ్య స్నేహం.. ప్రేమగా మారింది. వీరిలో ఒకరు బరేలికి చెందినవారు కాగా.. మరొకరు బదాయూ ప్రాంతానికి చెందినవారు. ప్రేమలో ఉన్న వీరు పెళ్లి చేసుకుని కలిసి బతకాలనుకున్నారు. కానీ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో వారు కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ జంటలోని ఓ అమ్మాయి లింగమార్పిడి చేయించుకుంది. చికిత్స అనంతరం ధ్రువపత్రంతో స్థానిక సబ్ డివిజినల్ కోర్టులో రిజిస్ట్రేషన్ వివాహానికి వీరు దరఖాస్తు చేసుకున్నారు. డిజిస్ట్రేషన్ ద్వారా వివాహానికి ప్రత్యేక వివాహ చట్టం కింద దరఖాస్తు పెట్టుకున్నారని బరేలీ ఎస్డీఎం ప్రత్యూష పాండే తెలిపారు. ఇలాంటి కేసు చాలా అరుదుగా వస్తుంటాయని చెప్పారు. ఇదీ చదవండి: అంబులెన్సును ఢీకొట్టిన మంత్రి కాన్వాయ్.. అసలే పేషెంట్.. మళ్ళీ పేషెంట్ అయ్యాడు.. -
జెండర్ ఈక్వాలిటీ అంటే అది!'దటీజ్ జపాన్'
ఇటీవల జూన్ 24, 25 తేదీల్లో లింగ సమానత్వం, మహిళ సాధికారతపై జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు జరిగింది. దీనికి జపాన్ ఆతిధ్య ఇచ్చింది. ఈ సదస్సులో ఏడుగురు మంత్రుల బృందం సమావేశమై ప్రతిజ్ఞ చేసింది. ఆ మంత్రులంతా మహిళా కార్యనిర్వాహకులకు మద్దతు ఇస్తామని, నిర్వాహక పాత్రలలో మహిళల ప్రాతినిధ్యాన్ని విస్తరింపజేస్తామని ప్రతిజ్ఞ చేశారు. అయితే ఆ మంత్రుల సదస్సు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల దృష్టిని తెగ ఆకర్షించింది. అసాధారణరీతిలో లింగ సమానత్వ మహిళా మంత్రులు సదస్సులో ఒకే ఒక్క మగ మంత్రి తన దేశం తరుపున ప్రాతినిధ్య వహించడం విశేషం. ఈ సమావేశానకి ఆతిధ్యమిచ్చిన జపాన్ దేశమే మహిళ సాధికారతపై జరగుతున్న సదస్సుకు తన దేశం తరుఫు నుంచి ఓ ఫురుషుడిని పంపి అందర్నీ ఆశ్చర్యపర్చింది. జెండర్ ఈక్వాలిటీ అంటే అర్థం ఏమిటో చెప్పకనే చెప్పింది. పైగా చెప్పడం కాదు చేసి చూపడం లేదా ఆచరించి చూపడం అని చాచిపెట్టి కొట్టినట్లు చెప్పింది. "దటీజీ జపాన్" అని సగర్వంగా ఎలుగెత్తి చెప్పింది. ఇక ఆ సమావేశంలో తన దేశం తరుఫున పాల్గొన్న జపాన్కు చెందిన రాజకీయ ప్రముఖుడు, కేబినేట్ మంత్రి మసనోబు ఒగురా మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఆ సమావేశంలో ఏకైక పురుష డెలిగేట్ అయ్యినందుకు ఎలా భావిస్తున్నారని అడుగగా..లింగ సమానత్వం కోసం పురుషులు ఇంకాస్త చొరవ తీసుకుని ముందుకొచ్చి నాయకత్వం వహించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పాడు. ఇతర దేశాల సహకారంతో మహిళల చురుకైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేలా పని చేస్తున్నట్లు చెప్పాడు. అలాగే లింగ సమానత్వమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పాడు. ఇదిలా ఉండగా, టైమ్ మ్యాగ్జైన్ ప్రకారం..వరల్డ్ ఎకనామిక్ ఫోరం తన తాజా వార్షిక గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ను విడుదల చేసిన కొద్ది రోజులకే జపాన్లో నిక్కోలో ఈ జీ7 శిఖారాగ్ర సమావేశం జరగడం గమనార్హం. కాగా, ఈ ఎకనామిక్ ఫోరం ఆర్థిక భాగస్వామ్యం, అవకాశం, విద్యాసాధన, ఆరోగ్యం, మనుగడ, రాజకీయ సాధికారత తదితర కీలక కొలమానాల ఆధారంగా ఈ జెండర్ గ్యాప్ ఇండెక్స్ని అంచనా వేస్తుంది. (చదవండి: ఎవరి ఆలోచనో అది!..'స్నేహితుల బెంచ్') -
స్నేహితురాలిపై ప్రేమతో ఆమె..‘అతని’గా మారాలనుకుంది.. తరువాత జరిగిన దారుణమిదే..
ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో ఒక యువతి తన స్నేహితురాలిని గాఢంగా ప్రేమించింది. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, పురుషునిగా మారేందుకు ఒక మాంత్రికుని వద్దకు వెళ్లింది. ఇదే అవకాశంగా భావించిన ఆ మాంత్రికుడు ఆమెపై ఘాతుకానికి తెగబడ్డాడు. రెండు నెలల క్రితం కుటుంబ సభ్యులు ఆ యువతి అదృశ్యమయ్యిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ఆ మాంత్రికునితో పాటు ఆమె స్నేహితురాలిని కూడా అరెస్టు చేశారు. ఆర్సీమిషన్ పరిధిలో ఉంటున్న పూనమ్ ఇంటి నుంచి ఏప్రిల్ 18న మాయమయ్యింది. ఏప్రిల్ 26న ఆమె సోదరుడు దీనిపై పోలీసులకు పిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాయమైన ఆ యువతి తన స్నేహితురాలు ప్రీతిని పెళ్లాడాలనుకుందని తెలిసింది.ఇదిలా ఉండగా మే 18న లఖీంపురా పరిధిలో ఒక యువతి అస్థిపంజరం పోలీసులకు లభ్యమయ్యింది. పోలీసులు ఆ అస్థిపంజరం శాంపిల్ ల్యాబ్కు పంపగా మాయమైన పూనమ్దేనని తేలింది. ఈ కేసు గురించి పోలీసులు మాట్లాడుతూ.. పువాయులో ఉంటున్న ప్రీతి, పూనమ్లు స్వలింగ సంపర్కులుగా ఉంటున్నారు. ఈ నేపధ్యంలో పూనమ్ తన స్నేహితురాలు ప్రీతిని వివాహం చేసుకోవాలని అనుకుంది. అయితే పూనమ్ కారణంగా ప్రీతికి పెళ్లి సంబంధాలు కుదరడం లేదు. దీంతో ప్రీతి తల్లి ఊర్మిళ.. లఖీంపూర్ ఖీరీ పరిధిలో ఉంటున్న రామ్నివాస్ అనే వ్యక్తిని కలుసుకుంది. తన కుమార్తె వివాహానికి పూనమ్ అడ్డుగా ఉందని, ఆమెను అంతమొందిస్తే రెండున్నర లక్షల రూపాయలు ఇస్తానని అతనికి చెబుతూ రూ. 5 వేలు అడ్వాన్స్గా ఇచ్చింది. తరువాత ప్రీతి, పూనంలను రామ్నివాస్ ఒక అడవికి తీసుకువెళ్లాడు. అక్కడ వారిద్దరికీ వివాహం చేసే విషయమై మాట్లాడాడు. మంత్ర విద్యలతో పురుషునిగా మార్చేస్తానని పూనమ్కు రామ్నివాస్ హామీనిచ్చాడు. ఇందుకోసం మరోమారు అడవికి రావాల్సివుంటుందని పూనమ్కు చెప్పాడు.అతను చెప్పిన సమయానికి పూనమ్ అడవికి రాగానే రామ్నివాస్ ఆమెపై దాడి చేసి, హత్యచేశాడు. తరువాత ఆమె మృతదేహాన్ని అక్కడున్న పొదల్లో దాచిపెట్టాడు. ఈ కేసు గురించి సిటీ ఎస్పీ సుధీర్ మాట్లాడుతూ ఈ కేసు దర్యాప్తు చేస్తున్న తాము మే 18న వివిధ ఆధారాలతో పూనమ్కు చెందిన అస్థిపంజరాన్ని గోమతి నది ఒడ్డున స్వాధీనం చేసుకున్నామన్నారు. పూనమ్ సోదరుడు పర్వీందర్ తన సోదరి దుస్తులను చూసి గుర్తుపట్టాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘాతుకానికి పాల్పడ్డ రామ్నివాస్, ప్రీతి, ఆమె తల్లి ఊర్మిళలపై కేసు నమోదు చేశారు. రామ్నివాస్, ప్రీతిలను అరెస్టు చేశారు. పరారైన ఊర్మిళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇది కూడా చదవండి: ఆ హ్యాండ్సమ్ సీరియల్ కిల్లర్పై అమ్మాయిల మోజు.. -
పైసల కోసం... ‘పాపం చేస్తున్నారు
ఆడపిల్లంటే ‘ఆడ’ పిల్లని, మగపిల్లాడంటే ‘మన’ పిల్లాడనే భావన ఉన్నంత వరకు ఈ సమాజంలో ఆడ పిల్లలకు స్థానం లేదుకావొ చ్చేమో.. ప్రాణం పోయాల్సిన వైద్యులే కడుపులోనే చంపేస్తున్నారు. కాసులకు కక్కుర్తి పడి లింగనిర్ధారణ పరీక్షలు చేసి ఆడపిల్లని తెలిస్తే గర్భవిచిత్తి చేస్తున్నారు. – సాక్షి, వరంగల్ గర్భస్త లింగ నిర్ధారణ నేరం... అంటూ ఆస్పత్రుల్లో పెద్దపెద్ద బోర్డులు పెడుతున్న వైద్యులే... పైసల కోసం ‘పాప’ం చేస్తున్నారు. గతంలో గర్భవిచిత్తి ఉదంతాలు వెలుగులోకి వచ్చినా... కొందరు వైద్యుల తీరు ఏమాత్రం మారడం లేదు. వరంగల్ నగరంతో పాటు నర్సంపేట పట్టణం, నెక్కొండ ఇలా చాలా ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా అమ్మ కడుపులోని పాపలను భ్రూణహత్యలు చేస్తున్న ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. గర్భంలో ఉన్న శిశువు ఆడనా, మగనా అని తెలుసుకునేందుకు లింగ నిర్ధారణ పరీక్షలు చేయడంతో పాటు ఆడపిల్ల అయితే గర్భవిచిత్తి చేస్తున్న కేసుల్లో సంబంధమున్న 18 మంది నిందితులను వరంగల్ కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేయడంతో ఈ చట్టవిరుద్ధ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. ఒక్కో గర్భస్రావానికి రూ.20వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారని తెలిసింది. హనుమకొండలోని లోటస్, గాయత్రి ఆస్పత్రులతో పా టు నర్సంపేటలోని బాలాజీ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, నెక్కొండలోని ఉపేందర్ క్లినిక్లు వీటిలో భాగస్వామ్యం అయ్యాయని వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ వెల్లడించడంతో వరంగల్ సిటీతో పాటు జిల్లాలోని ఆస్పత్రుల వ్యవహార శైలిపై అనుమానాలు వస్తున్నాయి. పోలీసులు ఇంకా లోతైన విచారణ చేస్తే మరిన్ని ఆస్పత్రులు, క్లినిక్లపై క్రిమినల్ కేసులు నమోదవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఆడపిల్ల అని తెలుసుకోవడానికి వచ్చినా, అబార్షన్ చేయాలన్న వైద్యులు నిరాకరించాల్సి ఉన్నా కాసుల కక్కుర్తి కోసం ప్రోత్సహిస్తుండడం గమనార్హం. అయినా.. మారలే.. ► నెక్కొండ మండలం బొల్లికొండ గ్రామ శివారు మాలోతు నంద్యానాయక్తండాలోని ప్రశాంత్.. పార్థు నర్సింగ్ హోంలో తన భార్యకు జన్మించిన ఆడ శిశువును రూ.25వేలకు ఆస్పత్రి సిబ్బంది సహకారంతో హనుమకొండలోని విజయ్కుమార్, రజనీ దంపతులకు విక్రయించారు. ఈ విషయం బాలల సంరక్షణ విభాగాధికారుల దృష్టికి వెళ్లగా.. 2020 ఏప్రిల్ 25న నెక్కొండ ఠాణాలో ఫిర్యాదు చేశారు. దీంతో డాక్టర్ పార్థు, డాక్టర్ ఉపేందర్, స్టాఫ్ నర్సు పద్మ, శిశువు తండ్రి ప్రశాంత్, నాయనమ్మ నర్సమ్మలపై కేసు నమోదు చేశారు. ఎట్టకేలకు 2020 మే 5న పాప జాడ దొరికింది. అంతకుముందు 2011జూలై 22న కవల పిల్లల విక్రయాల కేసులోనూ ఈ ఆస్పత్రి వివాదానికి కేరాఫ్గా నిలిచింది. ఈ రెండు ఘటనల తర్వాత పార్థు నర్సింగ్ హోం పేరును ఉపేందర్ క్లినిక్గా మార్చుకొని కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఈసారి లింగనిర్ధారణ పరీక్షలు చేసి గర్భవిచిత్తు చేస్తున్నారని ఉపేందర్ క్లినిక్లోని రెండు స్కానింగ్ మెషీన్లను ఇప్పటికే వైద్యారోగ్యవిభాగాధికారులు సీజ్ చేశారు. ఇవి రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో ఎక్కడి నుంచి తెప్పించారనే దిశగా విచారణ చేస్తున్నారు. అయితే సీపీ రంగనాథ్ ఆదేశాల మేరకు కమలాపురం సీఐ సంజీవ్, నెక్కొండ ఎస్సై జానీ పాషా, గ్రామ కార్యదర్శి సదానందం, రెవెన్యూ సిబ్బందితో కలిసి తనిఖీ చేసి రికార్డులు, గదులను పరిశీలించారు. ఇప్పటికే డాక్టర్ బాల్నె పార్థు, పార్థు భార్య ఆశలత, కాంపౌండర్ కీర్తి మోహన్ను పోలీసులు అరెస్టు చేశారు. ► దాదాపు ఏడాది క్రితం ప్రారంభమైన నర్సంపేటలోని బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లోనూ లింగ నిర్ధారణ పరీక్షలతో పాటు గర్భ విచిత్తి జరుగుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నెల 13న అక్కడి స్కానింగ్ మెషీన్ను వైద్యారోగ్యవిభాగాధికారులు సీజ్ చేశారు. ఇవన్నీ పకడ్బందీగా చేస్తేనే... ► గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గర్భం దాల్చిన వారి వివరాలను వైద్యారోగ్య శాఖ సిబ్బంది సమగ్రంగా సేకరించాలి. గుర్తించిన గర్భిణుల సంఖ్యను... ప్రసవాలతో పోలిస్తే గర్భస్రావాలు...గర్భవిచిత్తి ఉదంతాలు బయటపడే అవకాశముంది. ఈ దిశగా యంత్రాంగం దృష్టి సారించాలి. ► ప్రైవేట్ స్కానింగ్ కేంద్రాలకు వస్తున్న గర్భిణుల వివరాలు నమోదు చేయించి. ఆ వివరాలను ప్రసవాల సంఖ్యతో సరిపోల్చడం ద్వారా ఎక్కడైనా అక్రమాలు జరిగితే గుర్తించవచ్చు. ► వైద్యారోగ్యశాఖ అధికారులు స్కానింగ్ కేంద్రాలు తరచుగా తనిఖీ చేయకపోవడంతో రహస్యంగా లింగనిర్ధారణ, భ్రూణహత్యలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ► జిల్లా పరిధిలో కలెక్టర్ అధ్యక్షతన లింగ నిర్ధారణ నిరోధక కమిటీ ఏర్పాటై ఉంటుంది. పోలీసు కమిషనర్, న్యాయమూర్తి, డీఎంహెచ్ఓ, స్వ చ్ఛంద సంస్థ ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. కనీసం ఆరునెలలకోమారు ఈ కమిటీ సమావేశం జరగాలి. తీసుకుంటున్న చర్యలపై సమీ క్షించాలి. ఆ దిశగా కసరత్తు జరగాలి. -
అక్షర స్వరం
‘రచన చేయడం అంటే తెలుసుకోవడం కూడా’ అనే మాట ‘రైజింగ్ ఫ్రమ్ ది యాషెస్’ పుస్తక రచన కోసం కలం పట్టినప్పుడు కృతిక పాండేకు అనుభవంలోకి వచ్చింది. ఈ పుస్తకం మనల్ని బాధితుల ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. ఈ పుస్తక ప్రయాణం సానుభూతి కోసం కాదు. ‘మనలో వారి పట్ల చిన్న చూపు ఉంటే మార్చుకుందాం’ అని చెప్పడం. ‘వారితో కలిసి నడవండి’ అని చెప్పడం. ‘విజేతలకు కష్టాలు అడ్డు కాదు’ అనే సత్యాన్ని గుర్తు చేయడం... అవమానాలు, అనుమానాలు, లింగవివక్ష, వేధింపులు, గృహహింసలు... స్త్రీలు ఎదుర్కొనే సకల సమస్యలకు సమాధానం చెబుతుంది ‘రైజింగ్ ఫ్రమ్ ది యాషెస్: ఎ జర్నీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్’ పుస్తకం. ఇది కాల్పనిక ఊహల సమాహారం కాదు. నిజజీవితానికి చెందిన కథ. నిమృత్కు చిన్నప్పటి నుంచి మూర్ఛ సమస్య ఉంది. ఆ సమస్య తనను నీడలా వెంటాడింది. ‘ఈ సమస్యతో స్కూల్కు ఎలా పంపుతాం?’ ‘ఫ్రెండ్స్తో సినిమాకు వెళతావా? అక్కడ పడిపోతే ఎవరు చూస్తారు?’ పెళ్లి వయసులోనూ ఆ సమస్య ముందుకు వచ్చింది. ‘మీ అమ్మాయికి మూర్ఛ సమస్య ఉందా? ముందే చెప్పి బతికించారు’ అని వెనక్కి తిరిగి వెళ్లిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. నిమృత్కు పెళ్లి జరగడం అనేది అతి కష్టం అనుకునే సందర్భంలో తన సమస్య తెలిసి కూడా ఒక కుటుంబం పెళ్లికి ఒప్పుకుంది. ‘మూర్ఛ’ కారణంగా సంసార జీవితంలో ఒడిదొడుకులు మొదలయ్యాయి. అయితే ముందు కనిపిస్తున్న ముండ్లబాటను చూసి భయపడలేదు నిమృత్. అక్కడే ఆగిపోయి ఉంటే, వెనుతిరిగి ఉంటే ఆమె జీవితం ఈ పుస్తకంలోకి వచ్చేది కాదు. సమస్యను సవాలు చేసి ముందుకువెళ్లింది. కష్టాలను తట్టుకొని నిలబడింది. ప్రపంచం గుర్తుంచుకోదగిన అసాధారణ విజయలేమీ ఆమె సాధించకపోవచ్చు. అయితే తన జీవితాన్ని జయించింది. కష్టాల్లో ఉన్నవారికి స్ఫూర్తిని ఇచ్చింది. తనలాంటి వారెందరికో ధైర్యాన్ని ఇస్తోంది. ‘ఆరోగ్య స్థితిని బట్టి ఎవరూ నిర్లక్ష్యానికి గురి కావద్దు. వారికి సహాయంగా నిలవండి. వారి అడుగులు ముందుకు పడడానికి సహకరించండి’ అని ఈ పుస్తకం సందేశం ఇస్తుంది. కృతిక పాండే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగం హెడ్గా పనిచేస్తోంది. బెంగళూరులో గ్రాడ్యుయేషన్ చేసిన కృతిక దిల్లీలో డిజిటల్ మార్కెటింగ్ కోర్సు చేసింది. డెహ్రడూన్కు చెందిన కృతిక ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు, స్త్రీ సాధికారతకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. ఈ పుస్తకం అమ్మకాల ద్వారా వచ్చిన మొత్తాన్ని దివ్యాంగుల సంక్షేమం కోసం పనిచేస్తున్న బెంగళూరులోని ‘మిత్ర జ్యోతి ట్రస్ట్’కు ఇవ్వనుంది కృతిక. -
ఆ వివాహాలు నేరం కాదు.. అవసరం: వివేక్ అగ్నిహోత్రి ట్వీట్
ది కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్వలింగ వివాహం నేరం కాదని ఆయన ట్వీట్ చేశారు. ఇది వారి హక్కు అంటూ తన మద్దతు ప్రకటించారు. ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో ఇలాంటివి సాధారణమైన విషయమని అన్నారు. ఈ సందర్భంగా స్వలింగ వివాహంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. వివేక్ తన ట్వీట్లో రాస్తూ.. 'స్వలింగ వివాహం అనేది 'అర్బన్ ఎలిటిస్ట్' అన్న భావన కరెక్ట్ కాదు. ఇది మానవ అవసరం. చిన్న పట్టణాలు, గ్రామాలలో ఎప్పుడూ ప్రయాణించని కొంతమంది వ్యక్తులే దీన్ని ప్రశ్నిస్తున్నారు. మొదట స్వలింగ వివాహం అనేది ఒక కాన్సెప్ట్ కాదు. అది ఒక అవసరం మాత్రమే. అలాగే ఇది ఒక హక్కు కూడా. భారతదేశం వంటి ప్రగతిశీల దేశంలో స్వలింగ వివాహం సాధారణమైన విషయమే. ఎలాంటి నేరం కాదు.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. స్వలింగ వివాహం అనేది పట్టణ ఉన్నత వర్గాల భావన అని కేంద్రం సుప్రీంకోర్టుకు చెప్పింది. ఇది దేశంలోని సామాజిక తత్వానికి దూరంగా ఉందని తెలిపింది. స్వలింగ వివాహాన్ని ప్రోత్సహించడం కొత్త సమస్యలు సృష్టిస్తుందని కేంద్రం పేర్కొంది. దీన్ని ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా.. వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించి ది కశ్మీర్ ఫైల్స్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, పల్లవి జోషి ప్రధాన పాత్రల్లో నటించారు. (ఇది చదవండి: షూటింగ్లో ప్రమాదం.. ది కశ్మీర్ ఫైల్స్ నటికి తీవ్రగాయాలు) NO. Same sex marriage is not an ‘urban elitist’ concept. It’s a human need. Maybe some sarkari elites drafted it who have never travelled in small towns & villages. Or Mumbai locals. First, same sex marriage is not a concept. It’s a need. It’s a right. And in a progressive,… https://t.co/M4S3o5InXI — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) April 18, 2023 -
‘సాగు’లో లింగవివక్ష మూల్యం 81.84 లక్షల కోట్లు!
మహిళలపట్ల వివక్ష వల్ల సామాజికంగా వాటిల్లే నష్టానికి వెలకట్టలేం. అయితే వ్యవసాయం, ఆహార శుద్ధి, నిల్వ, పంపిణీ (అగ్రి ఫుడ్ సిస్టమ్స్) రంగాల్లో లింగవివక్ష వల్ల ఎంత నష్టం వాటిల్లుతున్నదో తెలుసుకొనేందుకు ఐక్యరాజ్య సమితి (ఐరాస)కి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) ఇటీవల అధ్యయనం చేసింది. లింగవివక్ష కారణంగా ఏటా లక్ష కోట్ల డాలర్ల (రూ. 81,84,550 కోట్లు) సంపదను ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోల్పోతున్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది. వ్యవసాయ రంగంలో మహిళల స్థితిగతులపై 2010 విరామం తర్వాత ఎఫ్ఏఓ వెలువరించిన తొలి అధ్యయన నివేదిక ఇదే. వ్యవసాయంతోపాటు ఈసారి ఆహార శుద్ధి, రవాణా, నిల్వ, పంపిణీ రంగాల్లో రైతులుగా, కూలీలుగా, ఉద్యోగినులుగా, వ్యాపారవేత్తలుగా, చిరు వ్యాపారులుగా పనిచేసే మహిళల స్థితిగతులపై సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక విడుదల చేయటం గమనార్హం. వివక్షను రూపుమాపితే రైతుల ఆదాయం పెరుగుతుంది వ్యవసాయ, ఆహార వ్యవస్థల్లో మహిళలపట్ల లింగ వివక్షను నిర్మూలిస్తే ఆహారోత్పత్తి పెరిగి ఏటా లక్ష కోట్ల డాలర్ల మేరకు ఆదాయం సమకూరుతుంది. పేదరికం, ఆకలి తగ్గుతుంది. 4.5 కోట్ల మంది నిరుపేదలకు అదనంగా ఆహార భద్రత కలుగుతుంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ఎఫ్ఏఓ తేలి్చచెప్పింది. అంతేకాదు.. వాతావరణ మార్పులు, కోవిడ్ మహమ్మారి వంటి విపత్కర పరిస్థితులను దీటుగా తట్టుకోవాలన్నా లింగవివక్షను రూపుమాపాల్సిన అవసరం ఉందని ఎఫ్ఏఓ నివేదిక స్పష్టం చేసింది. లింగ వివక్షను తగ్గించి మహిళా సాధికారతను పెంచే పథకాల వల్ల సగానికి సగం చిన్న రైతులకు మేలు జరుగుతుంది. 5.8 కోట్ల మంది ఆదాయం పెరుగుతుంది. మరో 23.5 కోట్ల మందికి విపత్తులను తట్టుకొనే శక్తి పెరుగుతుందన్నది తమ అంచనా అని ఎఫ్ఏఓ డైరెక్టర్ జనరల్ క్యు డోంగ్యు తెలిపారు. ఏ ముప్పు అయినా మహిళలనే ముందు దెబ్బతీస్తుంది. కోవిడ్ మహమ్మారి వచి్చన మొదటి ఏడాదిలో ఆహార శుద్ధి, పంపిణీ రంగంలో 22% మహిళల ఉద్యోగాలు పోతే, 2% పురుషుల ఉద్యోగాలు పోయాయి. కరువు కాటకాలు, ఉష్ణోగ్రతలు పెచ్చుమీరిన సంక్షోభ కాలాల్లో వ్యవసాయ–ఆహార రంగాల్లో పనిచేసే మహిళల బిడ్డల పోషణ, ఇంటి పనికి అదనంగా దూరం వెళ్లి నీళ్లు తెచ్చే భారం పెరిగిపోతోంది. అల్ప, మధ్య తరహా ఆదాయ దేశాల్లో మొబైల్ ఇంటర్నెట్ సదుపాయం విషయంలో లింగ వివక్ష 25% నుంచి 16 శాతానికి తగ్గినట్లు గుర్తించారు. గత పదేళ్లుగా అనేక దేశాల్లో మహిళలకు అనుకూల విధానాలు వస్తున్నప్పటికీ వ్యవసాయం–ఆహార రంగాల్లో పెద్ద మార్పు కనిపించట్లేదు. 68 దేశాల్లో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన 75% విధానాల్లో మహిళల ప్రాధాన్యతను గుర్తించినప్పటికీ లింగవివక్షను తగ్గించే ప్రయత్నాలు 19% విధానాల్లోనే కనిపించింది. విధాన నిర్ణేతలు క్షేత్రస్థాయిలో లింగవివక్షను తగ్గించేందుకు మహిళా సాధికారతకు పెద్దపీట వేయాలని ఎఫ్ఏఓ సూచించింది. గొడ్డు చాకిరీ.. 18% తక్కువ ఆదాయం ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ, ఆహార వ్యవస్థలపై ఆధారపడి జీవిస్తున్న వారి సంఖ్య 400 కోట్లు. ఏటా 1,100 కోట్ల టన్నుల ఆహారోత్పత్తి జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా సగటున 36% మంది మహిళలకు, 38% మంది పురుషులకు ఉపాధి కల్పిస్తున్న రంగం ఇది. అయితే ఆఫ్రికా దేశాల్లో 66% మంది మహిళలకు వ్యవసాయమే ఉపాధి. చిన్న, సన్నకారు రైతులకు నిలయమైన భారత్ తదితర దక్షిణాసియా దేశాల్లో ఇది మరీ ఎక్కువ. ఈ దేశాల్లో 71% మంది మహిళలు (మహిళా రైతులు, కూలీలు, ఉద్యోగినులు) వ్యవసాయ–ఆహార వ్యవస్థల్లో ఉపాధి పొందుతున్నారు. అలాగే పురుషులు 47% మంది ఉపాధి పొందుతున్నారు. అయితే కూలికి వెళ్లే వారిలో పురుషులకన్నా మహిళల సంఖ్యే తక్కువ. గత పదేళ్లలో పొలం పనులపై ఆధారపడే వారి సంఖ్య 10% తగ్గినట్లు ఎఫ్ఏఓ.నివేదిక చెబుతోంది. వ్యవసాయ–ఆహార వ్యవస్థల్లో ఉపాధి పొందుతున్న మహిళల పని పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. గొడ్డు చాకిరీ చేసినా పని భద్రత లేదు. పార్ట్టైమ్ పనులు, కొన్నాళ్లు మాత్రమే ఉండే పనులు, తక్కువ నైపుణ్యం అవసరమైన పనులే మహిళలకు ఇస్తున్నారు. అందువల్ల పురుషులకన్నా 18% తక్కువగా వారి ఆదాయం ఉంటోంది. కౌలు రైతులకు మరీ కష్టం.. భూమిని కౌలుకు తీసుకున్న మహిళా రైతులు తీవ్ర అభద్రతకు గురవుతున్నారని ఎఫ్ఏఓ పేర్కొంది. 46 దేశాల్లో గణాంకాలను పరిశీలిస్తే 40 దేశాల్లో పురుష రైతులకు ఎక్కువ భూమి హక్కులు ఉన్నాయి. అదేవిధంగా కౌలు నిబంధనలు కూడా వారికి అనుకూలంగా ఉన్నాయి. మరోవైపు మహిళా రైతులకు రుణ సంస్థల నుంచి పరపతి అందట్లేదు. శిక్షణా అవకాశాలు మహిళలకు అంతగా అందుబాటులో ఉండట్లేదు. అన్నిటికన్నా మించి పురుషులను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన సాంకేతికతలు, యంత్రాలనే మహిళలు ఉపయోగించాల్సి వస్తోంది. ఈ అసమానతల వల్ల సమాన విస్తీర్ణంలో పంటలు సాగు చేసిన పురుషులకన్నా మహిళలు సాగు చేసిన పొలాల్లో ఉత్పాదకత 24% తక్కువగా వస్తున్నట్లు ఎఫ్ఏఓ నివేదిక తెలిపింది. ఇప్పుడు మహిళల కోసం వ్యవస్థలు పనిచేయాలి వ్యవసాయ, ఆహార రంగాల్లో లింగ అసమానతలను స్థానికంగా ఎక్కడికక్కడ పరిష్కరించి మ హిళలకు సాధికారత కలి్పస్తే పేదరికాన్ని అంతం చేయడం, ఆకలి కేకలులేని ప్రపంచాన్ని సృష్టించ డం వంటి లక్ష్యాల సాధన కృషిలో ప్రపంచం ముందుకు దూసుకుపోతుంది. వ్యవసాయ, ఆహార వ్యవస్థల్లో మహిళలు అనాదిగా పనిచేస్తున్నారు. వారి కోసం ఈ వ్యవస్థలు పని చేయాల్సిన సమయం ఆసన్నమైంది. – డా. క్యూ డోంగ్యు, డైరెక్టర్ జనరల్, ఆహార–వ్యవసాయ సంస్థ(ఎఫ్ఏఓ) చదవండి: కృత్రిమ మేధను తలచుకొంటే నిద్రలేని రాత్రులే -
లింగ సమానత్వానికి మరో 300 ఏళ్లు పడుతుంది: గుటేరస్
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న లింగ అసమానతలపై ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆవేదన వ్యక్తం చేశారు. లింగ సమానత్వం మన కళ్ల ముందే కనుమరుగు అవుతోందని పేర్కొన్నారు. మహిళలు, పురుషుల మధ్య అంతరాలు తగ్గడానికి ఇంకో 300 ఏళ్లు పడుతుందని, ఇది బాధాకరం అన్నారు. మహిళల హోదా విషయంపై ఐరాస సెషన్లో సోమవారం మాట్లాడుతూ గుటేరస్ ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళల హక్కులను అవహేళన చేస్తూ, ప్రమాదంలోకి నెడుతూ, ఉల్లంఘిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. లింగసమానత్వంపై సాధించిన దశాబ్దాల పురోగతి మన కళ్ల ముందే కనుమరుగు కావడం ఆలోచించాల్సిన విషయమన్నారు. అఫ్గానిస్తాన్లో మహిళల హక్కులను తాలిబన్ ప్రభుత్వం కాలరాస్తున్న విషయాన్ని కూడా గుటెరస్ ప్రస్తావించారు. సాధారణ ప్రజా జీవితానికి వాళ్లను దూరం చేశారని చెప్పారు. చాలా దేశాల్లో మహిళల లైంగిక, పునరుత్పత్తి హక్కులను కూడా హరించివేస్తున్నారని తెలిపారు. కొన్ని దేశాల్లో పాఠాశాలకు వెళ్లే చిన్నారులను కిడ్నాప్ చేసి దాడులు చేస్తున్నారని, మరికొన్ని దేశాల్లో మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వాళ్లపై దారుణాలకు పాల్పడుతున్నారని వివరించారు. లింగ సమానత్వ అంతరం రోజురోజుకు మరింత పెరుగుతోందన్నారు. చదవండి: అంటార్కిటికా కరిగిపోతోంది! -
క్షణ క్షణం వివక్షను ఎదుర్కొంటున్న మహిళ: గవర్నర్ తమిళిసై
సాక్షి, హైదరాబాద్: కంపెనీల ప్రకటనలు మొదలు కొని సినిమాల వరకూ మహిళను వివక్షతో చిత్రీకరించడాన్ని ప్రజలు ఎప్పటికప్పుడు నిరసించాలని, అలాంటి ప్రకటనలు, సినిమాలను తిరస్కరించడం, తమ అభ్యంతరాలను స్పష్టంగా చెప్పడం అవసరమని తెలంగాణ గవర్నర్, పుదుచ్చెరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఈ ధోరణి కనిపిస్తున్నా.. విస్తృత స్థాయిలో సమాజంలో మాత్రం వివక్ష కొనసాగుతూనే ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రింట్, వీడియో, సినిమాల్లో లింగ వివక్ష, మహిళలను నిర్దిష్ట దృక్కోణం (స్టీరియో టైపింగ్)లో చూపడాన్ని నియంత్రించడం, రూపుమాపడం లక్ష్యంగా ఇండియన్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ (ఐఏఏ) శుక్రవారం హైదరాబాద్లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘‘వాయిస్ ఆఫ్ ఛేంజ్’’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. మహిళలు నిత్యం వివక్షకు గురవుతూనే ఉన్నారని, ప్రతిక్షణం మహిళను నిర్దిష్ట దృక్కోణంతో చూపుతున్నారని ఈ సందర్భంగా గవర్నర్ సోదాహరణంగా వివరించారు. మహిళలు గవర్నర్లు కారని.. వయసు మీరిన పురుషులే అవుతారన్నట్టుగా ఎనిమిదేళ్ల బాలిక చెప్పడాన్ని తాను ఒక విమానాశ్రయంలో విన్నానని తెలిపారు. ఆఖరుకు మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కొన్ని పోటీల్లో బహుమతులుగా వంట పాత్రలు ఇస్తున్నట్లు ప్రకటించారని.. వారి దృష్టిలో ఆడవారంటే వంటిల్లుకు మాత్రమే పరిమితం అని వ్యాఖ్యానించారు. దేశంలో ఇప్పుడు పురుషుల కంటే మహిళ పైలట్లే ఎక్కువగా ఉన్నారని విమానయాన శాఖ మంత్రి తనతో చెప్పినప్పుడు ఎంతో సంతోషించానని, దురదృష్టవశాత్తూ సమాజంలో చాలామంది పాత, మూస పద్ధతుల్లోనే మహిళలను చూస్తున్నారని అన్నారు. సమాజంలో పదిరెట్లు ఎక్కువ కష్టం మాది... ప్రకటనల్లో లింగ వివక్షను ప్రస్తావిస్తూ.. ‘‘ఒక దాంట్లో మహిళ ట్రాఫిక్ కానిస్టేబుల్ను చూపారు. ఫర్వాలేదని అనుకుంటూండగానే.. ఆమె ఓ పురుషుడి బనియన్ చూసి తన్మయంతో ఊగిపోతున్నట్లు చూపారు. ఆఖరుకు పురుషుడి లోదుస్తుల ప్రకటనకూ మహిళను స్టీరియోటైపింగ్ చేశారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. తంజావూర్ మెడికల్ కాలేజీలో గైనకాలజిస్టుగా ఉండగా... కవలల తల్లి మగబిడ్డకు చనుబాలు, ఆడబిడ్డకు పలచన చేసిన ఆవుపాలు ఇచ్చిన సంఘటన తాను గమనించానని అన్నారు. ఇలాంటి అంశాల విషయంలో సమాజం మైండ్సెట్ మారాలని.. ప్రకటనలు తయారు చేసే వారు కూడా ఈ మార్పునకు తమవంతు సాయం అందించాలని కోరారు. మీడియా, అడ్వర్టైజ్మెంట్ రంగాల వారు ఇలాంటి అంశంపై చర్చించడం ఆహ్వానించదగ్గ పరిణామమని ఐఏఏను ప్రశంసించారు. సమాజంలో మహిళలు అన్ని విషయాల్లోనూ పురుషుల కంటే పది రెట్లు ఎక్కువ కష్టపడాల్సి వస్తోందని ఈ పరిస్థితిలో మార్పు రావాలని, ఇకపై లింగ వివక్ష, స్టీరియోటైపింగ్ విషయాల్లో అందరూ తమ అభ్యంతరాలను స్పష్టంగా వ్యక్తం చేయడం ద్వారా మాత్రమే ఈ మార్పు సాధ్యమని వివరించారు. ‘నిర్భయ’ తరువాత కొంత మార్పు... ప్రకటనలు, సినిమాలు, ఇతర కంటెంట్లలో మహిళ వివక్ష, స్టీరియోటైపింగ్ నిర్భయ ఘటన మారిందని, బాధితుల పేర్లు ప్రస్తావించకపోవడం మొదలుకొని, వారినే దోషులుగా చూపడం వరకూ మీడియా సంయమనంతో వ్యవహరిస్తోందని పాపులేషన్ ఫస్ట్ డైరెక్టర్ డాక్టర్ ఏ.ఎల్.శారద తెలిపారు. డిజిటల్ మాధ్యమం కారణంగా మహిళల అంశాలపై వివరంగా చర్చించే అవకాశం లభిస్తోందని, ప్రకటనలు ఇతర కంటెంట్లలో మహిళలను కించపరచడం తగ్గిందని, యువతకు సంబంధించిన ప్రకటనలో అందరినీ కలుపుకుపోయేలా కంటెంట్ ఉంటోందని ఆమె వివరించారు. ఈ మార్పు భవిష్యత్తులోనూ కొనసాగుతుందన్న ఆశాభావాన్ని డాక్టర్ ఏఎల్ శారద వ్యక్తం చేశారు. అంతకుముందు యూనిసెఫ్ ఇండియా ప్రతినిధి, పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్స్ నిపుణులు గీతాంజలి మాస్టర్ మాట్లాడుతూ ప్రకటనల్లో లింగవివక్ష, స్టీరియోటైపింగ్లపై యునిసెఫ్ జరిపిన పరిశోధన వివరాలను వెల్లడించారు. సమావేశంలో యాక్సెంచర్ మేనేజింగ్ డైరెక్టర్ చారులత రవికుమార్ ‘రెస్పాన్సిబుల్ కమ్యూనికేషన్’ అన్న అంశంపై ప్రసంగిస్తూ కంటెంట్లో ఇప్పటికే సున్నితంగా.. పరోక్షంగా లింగవివక్ష కొనసాగుతోందని వివరించారు. ఐఏఏ ఇండియ ఛాప్టర్ అధ్యక్షులు అవినాశ్ పాండే, ఐఏఏ విమెన్స్ ఎంపవర్మెంట్ కమిటీ ఛైర్పర్సన్ నీనా ఎలవియా జైపూరియా, ‘సాక్షి’ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ రాణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘జెండర్ కాన్షస్ అండ్ పర్పస్ఫుల్ ఎంటర్టైన్మెంట్’ ‘జెండర్ కాన్షస్ క్రియేటివిటీ ఇన్ కమ్యూనికేషన్స్’, ‘కాన్షస్ క్రియేటివిటీ ఇన్ ఫిల్మ్స్, ఓటీటీ, అండ్ అడ్వర్టైజింగ్’ అంశాలపై ప్యానెల్ డిస్కషన్ నడిచింది. యాంకర్ స్వప్న సమన్వయకర్తగా వ్యవహరించగా సినీ నటుడు అవసరాల శ్రీనివాస్, దర్శకులు నందినీ రెడ్డి, వైల్యులు ప్రణతి రెడ్డి, ఐపీఎస్ అధికారిణి శిఖా గోయెల్ తదితరులు పాల్గొన్నారు. కాస్మోస్ మాయా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో మేఘ తాత ఒక ప్యానెల్ డిస్కషన్కు సమన్వయ కర్తగా వ్యవహరించారు. చదవండి: అసెంబ్లీలో కేటీఆర్, ఈటల మధ్య ఆసక్తికర సన్నివేశం.. -
లింగ పక్షపాతంపై ఐఏఏ సదస్సు.. ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళిసై
హైదరాబాద్: ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ (ఐఏఏ), ఇండియా చాప్టర్ ఫిబ్రవరి 3న హైదరాబాద్లోని టీ-హబ్ వేదికగా 'జెండర్ సెన్సిటైజేషన్ ఇన్ మీడియా' అంశంపై సదస్సు నిర్వహిస్తోంది. 30 సెకన్ల TV ప్రకటన నుంచి నుంచి 3 గంటల సినిమాల్లో మహిళలకు ఎలాంటి ప్రాధాన్యం ఇస్తున్నారనే విషయంపై చర్చించనున్నారు. పరిశ్రమలో లింగ పక్షపతాన్ని విచ్ఛిన్నం చేయాల్సిన ఆవశ్యకతపై మాట్లాడనున్నారు. 'వాయిస్ ఆఫ్ ఛేంజ్' పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో పాటు ఇతర ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ ఈవెంట్కు ప్రిన్సిపల్ పార్ట్నర్గా సాక్షి మీడియా గ్రూప్, నాలెడ్జ్ పార్ట్నర్గా యూనిసెఫ్ వ్యవహరిస్తున్నాయి. ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ అనేది అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు, మీడియాకు ప్రాతినిధ్యం వహించే ఏకైక ఏకీకృత ప్రకటనల వాణిజ్య సంస్థ. ఇందులో కార్పొరేట్, విద్యా అనుబంధ సంస్థలు, టాప్-10 దేశాలతో పాటు ప్రపంచవ్యప్తంగా 76 దేశాలకు చెందిన యువ నిపుణులు సభ్యులుగా ఉన్నారు. 80 ఏళ్లుగా ఉన్న ఈ సంస్థ ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది. -
ప్రతిస్పందించే తీరులో మెదడుకూ ‘జెండర్’ భేదం.. ఆసక్తికర విషయాలు ఇవే..
విషయాలను అర్థం చేసుకోవడంతో పాటు వివిధ అంశాలపై ప్రతిస్పందించే తీరులో మెదడుకూ లింగ భేదం (బ్రెయిన్ జెండర్) ఉందని తేలింది. విభిన్న రంగాలను, విషయాలను అర్థం చేసుకునే విషయంలో ‘జెండర్’ ప్రధాన అంశంగా ఉన్నట్టుగానే.. తాజాగా జరిగిన మెదడు అధ్యయనంపై కూడా ‘జెండర్’ ప్రధాన భూమిక ΄పోషిస్తోందని తెలుస్తోంది. మెదడుకు సంబంధించిన పూర్తి విషయాలు ఇప్పటికీ తెలియనప్పటికీ ‘జెండర్’ కేంద్రంగా జరిగిన తాజా అధ్యయనాలు మాత్రం విచిత్రంగానూ, కొంచెం విభిన్నంగానూ ఉన్నాయి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/ కేజీ రాఘవేంద్రారెడ్డి: మనిషి మెదడు.. ఓ అంతుచిక్కని వ్యవహారం. మనిషి మొత్తం బరువులో కేవలం 2 శాతం బరువు ఉండే మెదడు మనిషి ఉపయోగించే మొత్తం ఆక్సిజన్లో ఏకంగా 20 శాతం ఉపయోగించుకుంటుంది. అంటే ఏ స్థాయిలో మెదడు పనిచేస్తుందో ఇది తెలియజేస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అయితే, ఇప్పటికీ మెదడును ఏ మేరకు అర్థం చేసుకున్నామని అడిగితే.. ‘మనం ఇంకా క్రిమికీటకాల మెదడునే అర్థం చేసుకోలేదు’ అని అలెన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రెయిన్ సైన్సెస్ చీఫ్ సైంటిస్ట్ క్రిస్టోఫ్ కోచ్ చెబుతున్నారు. వాస్తవానికి మనిషి మెదడులో 86 బిలియన్ సెల్స్ ఉంటాయి. వీటికి 100 ట్రిలియన్ కనెక్షన్లు ఉంటాయని అంచనా. కానీ.. క్రిమికీటకాల మెదడులో కేవలం 302 సెల్స్ ఉంటాయి. అయినా పురుగు మెదడునే ఇంకా అధ్యయనం చేయలేక΄ోతున్నామని కోచ్ చెబుతున్నారంటే.. మనిషి మెదడును అధ్యయనం చేసేందుకు ఇంకా ఎంత సమయం పడుతుందో ఊహించడానికి కూడా కష్టమే. కాగా, ఇప్పటివరకు జరిగిన పరిశోధనల్లో తాజాగా నిర్వహించిన పరిశోధన కాస్త విభిన్నంగా సాగింది. ఇది మగ/ఆడ (జెండర్) మెదళ్ల మధ్య వ్యత్యాసాలను తేటతెల్లం చేసింది. భావోద్వేగ సంబంధాలకే ప్రాధాన్యం పురుషులతో పోలిస్తే మహిళలు భావోద్వేగ సంబంధాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారని మరికొందరు తమ అధ్యయనాల ద్వారా గుర్తించారు. ఇందుకోసం అప్పుడే పుట్టిన పిల్లలు తమ మొదటి 24 గంటల సమయాన్ని ఎవరు దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారో అధ్యయనం చేయడం ద్వారా నిర్ణయానికి వచ్చామని కేంబ్రిడ్జి శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇందుకోసం మొబైల్ బొమ్మతో ΄పాటు కొద్దిమంది వ్యక్తులను ఎదురుగా ఉంచి.. అప్పుడే పుట్టిన 102 మంది పిల్లలపై కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన సైమన్ బారన్, కోహెన్ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. పుట్టిన తర్వాత మొదటి 24 గంటల΄పాటు ఎంతసేపు మొబైల్ బొమ్మతోను, మనుషులతోను పిల్లలు సమయాన్ని వెచి్చస్తున్నారో తెలుసుకునేందుకు దీనిని చేపట్టారు. విచిత్రంగా మగపిల్లలు ఎక్కువగా మొబైల్ బొమ్మను చూడటంపైనే దృష్టి కేంద్రీకరించారు. ఆడ పిల్లలు మాత్రం ఎక్కువగా మనుషులవైపే తమ దృష్టిని ఎక్కువ సమయం కేంద్రీకరించడం గమనార్హం. అంటే పుట్టుకతోనే అబ్బాయిలకు వస్తువులపైన, అమ్మాయిలకు బంధాలపై ఎక్కువ అటెన్షన్ ఉంటుందని తేల్చారు. అయితే, కేవలం ఈ ఒక్క అంశం ద్వారానే తుది నిర్ణయానికి రాలేమని మరి కొద్దిమంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా జెండర్ అంశం కేంద్రంగా మెదడు అధ్యయనాలు జరగడం ద్వారా కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తుండటాన్ని మాత్రం లింగభేదంతో సంబంధం లేకుండా అందరూ ఆహా్వనించాల్సిందే. పురుషుల్లోనే భయం ఎక్కువ.. సహజంగా శారీరక దారుఢ్యం మహిళల కంటే పురుషులకే కాస్త ఎక్కువనేది తిరుగులేని వాస్తవం. ఇందుకు జన్యుపరమైన అంశాలతో ΄ాటు తరతరాలుగా జరిగిన పని విభజన కూడా ఒక కారణంగా చెబుతారు. కానీ.. మెదడు విషయానికి వస్తే శారీరక దారుఢ్యంతో΄ాటు మెదడు పరిమాణం కూడా స్త్రీలతో ΄ోలిస్తే మగవారిలో కొంచెం ఎక్కువగానే ఉన్నట్టు తేలింది. లైజ్ ఎలియట్, అతని టీం సభ్యులు చేసిన అధ్యయనాల ప్రకారం.. పురుషుల మెదడు స్త్రీల మెదడు కంటే పరిమాణంలో 15 శాతం పెద్దగా ఉంటుందని తేలింది. ఇందుకు అనుగుణంగా అమిగ్డాలా (మనిషి భావోద్వేగంతో ముడిపడిన మెదడులోని ఒక భాగం) కూడా పరిమాణంలో పురుషుల్లోనే ఎక్కువ. పురుషుల్లోని అమిగ్డాలాను స్త్రీలలోని అమిగ్డాలాతో ΄ోల్చి అధ్యయనం చేస్తే పురుషుల్లోనే ఎక్కువ భయం ఉంటుందని వీరి అధ్యయనాల్లో తేలింది. స్త్రీలలోనే భావోద్వేగాలు అధికం పురుషులు, మహిళల్లో ఎవరికి ఎక్కువ భావోద్వేగం ఉంటుందనే అంశంపైనా పరిశోధనలు జరిగాయి. జీవితంలో జరిగిన ఏదైనా ఘటన లేదా సామాజికంగా బాగా గుర్తుండి΄ోయేలా జరిగిన బాధాకరమైన ఘటనలను గుర్తుచేస్తే ఏం జరుగుతుందో పరిశీలించారు. పురుషుల కంటే ఎక్కువగా స్త్రీలకే అటువంటి భావోద్వేగ ఘటనలు గుర్తుకు వస్తున్నాయని తేలింది. పురుషులతో ΄ోలిస్తే ఆ సంఘటన తాలూకు వివరాలను స్త్రీలు వెంటనే గుర్తుతెచ్చుకోవడంతో ΄ాటు పురుషుల కంటే ఎక్కువగా ఆ ఘటనలకు సంబంధించిన విషయాలను కూడా పేర్కొనడాన్ని గమనించారు. మెదడుపై ‘జెండర్’ అధ్యయనాల్లో కొన్ని.. జెండర్ కేంద్రంగా ఇప్పటికే వివిధ పరిశోధనలు జరిగాయి. 1991లో మొదలైన ఈ అధ్యయనాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. - మొదటిసారిగా 1991లో అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేసిన డయాన్ హాల్పెర్న్ ‘సెక్స్ డిఫరెన్సెస్ ఇన్ కాగి్నటివ్ ఎబిలిటీస్’ అనే అంశంపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించారు. - 1995లో స్టాండ్ఫర్డ్ ప్రొఫెసర్ నైరో షా... స్త్రీ, పురుషుల మెదళ్లపై అధ్యయనం చేశారు. - 2017లో జెండర్ కేంద్రంగా పలువురు రాసిన 70 ఆరి్టకల్స్తో కూడిన ‘జర్నల్ ఆఫ్ న్యూరోసైన్స్ రీసెర్చ్’ ప్రత్యేక సంచికను ్ర΄÷ఫెసర్ లారి కాహిల్ వెలువరించారు. - 2021లో బ్రిటన్లో 40 సంవత్సరాల వయసు పైబడిన 5 లక్షల మందికి చెందిన జెనటిక్, హెల్త్ డేటాపై ఆస్టన్ యూనివర్సిటీకి చెందిన గినా రిప్పన్ అనే న్యూరో బయాలజిస్టు అధ్యయనం చేశారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ప్లీజ్ నన్ను ట్రోల్ చేయండి..
రాజమాత మాధవి రాజే సింధియా కన్నుమూత
లక్నోపై ఢిల్లీ గెలుపు.. ప్లే ఆఫ్స్లో రాజస్తాన్
మళ్లీ కలకలం రేపుతున్న సుచిత్ర లీక్స్..
పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
ప్రేమలు హీరోయిన్ తో ప్రేమలో పడనున్న రౌడీ..
మళ్లీ జగనే సీఎం..తేల్చేసిన కొమ్మినేని
ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
రౌడీతో రౌడీ బేబీ.. క్రేజీ కాంబినేషన్ సెట్ కానుందా..
మీసా భారతి.. రోహిణి ఆచార్య.. కూతుళ్లకు లాలూ ఈ పేర్లెందుకు పెట్టారు?
తప్పక చదవండి
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- అతనితో 16 రోజులే ఉన్నాను.. రెండో పెళ్లి చేసుకోవాలని ఉంది: ఎస్తర్
- మనీష్ సిసోడియా జ్యుడిషీయల్ కస్టడీ పొడగింపు
- కెనడాలో ఘనంగా పదేళ్ల తెలంగాణ ఉత్సవాలు!
- పాడెపై వెళ్లి నామినేషన్! గోరఖ్పూర్లో విచిత్రం
- కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
- సీజన్ మొత్తం మాకు అదే సమస్య.. అందుకే ఈ దుస్థితి: కేఎల్ రాహుల్
- Anasuya Bharadwaj: అందానికే కాదు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనసూయ.. బర్త్డే స్పెషల్ (ఫోటోలు)
- 100 విమానాలు కొనుగోలు చేయనున్న ఇండిగో.. ఎందుకంటే..
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
Advertisement