వాళ్లకు ఓటడిగే హక్కు లేదు..


* కేసీఆర్ పాలనను బంగాళాఖాతంలో కలపండి

* వరంగల్ ఉపఎన్నిక ప్రచార సభలో వైఎస్ జగన్ పిలుపు


* ఎన్నికల హామీలన్నీ అటకెక్కించారు.. చేతగాని పాలన సాగిస్తున్నారు

* విడతలుగానే రుణమాఫీ అని ఎన్నికల ముందు చెప్పారా?

* అపరాధ వడ్డీలు కట్టడానికే సరిపోతున్న మాఫీ సొమ్ములు

* అన్నదాతల ఆత్మహత్యలకు కారణం మీరు కాదా..?

* కొత్తగా ఒక్క 108 అంబులెన్సు కొన్నారా?

* గతేడాది ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలకే దిక్కులేదు

* 79 రోజులుగా ఆశవర్కర్లు నిరాహారదీక్ష చేస్తున్నా పట్టదా?

* ఏడాదిన్నరలో 396 ఇళ్లు కట్టడమే కేసీఆర్ ఘనత

* ఏడాదికి 10 లక్షల ఇళ్లు కట్టి దేశానికే ఆదర్శంగా నిలిచిన వైఎస్‌ఆర్

* ఈ పాలనలో నింగినంటిన నిత్యావసరాల ధరలు..

* విలువలు, విశ్వసనీయత ఉన్న ఏకైక పార్టీ మాదే

* ఓటడిగే హక్కు వైఎస్సార్ కాంగ్రెస్‌కే ఉంది..

* వరంగల్ ఉప ఎన్నిక ప్రచారానికి తెర



వరంగల్ నుంచి సాక్షిప్రతినిధి: ‘రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉన్న ఏకైక పార్టీ మాదే. ఈ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. కేసీఆర్ అధికారంలోకి వచ్చి 18 నెలలకు పైగా అవుతోంది. ఎన్నికలకు ముందు కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చారు. వాగ్దానాలు చేశారు.  18 నెలల పాలన ఎలా సాగింది?  ఆప్పుడిచ్చిన హామీలు ఏమైనా నెరవేరాయా? ఒక్కసారి పరిశీలించిన తరువాత మనం ఈ ఉప ఎన్నికలో ఓటు వేద్దాం. మనం వేస్తున్న ఈ ప్రశ్నలకు కేసీఆర్ నుంచి సరైన సమాధానం వస్తే ఆయనకే మద్దతు తెలుపుదాం. ఒకవేళ ఆయన నుంచి సరైన సమాధానం రాకపోతే ఆయన్ను బంగాళాఖాతంలో కలిపేందుకు ముందడుగు వేయాలి’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  పిలుపునిచ్చారు.



వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ విజయాన్ని కాంక్షిస్తూ  తెలంగాణ రాష్ట్ర వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలసి నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారం గురువారం వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రంలో ముగించారు. స్టేషన్ ఘన్‌పూర్  బస్టాండ్ చౌరస్తాకు భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే...

 

ఒక్క అంబులెన్సు కూడా కొనలేదు..


‘పేదవాడు అప్పులపాలు కావడానికి రెండు ప్రధానమైన కారణాలు ఉంటాయని వైఎస్‌ఆర్ భావించేవారు. హఠాత్తుగా ఏదైనా పెద్ద జబ్బు చేసినపుడు ఆ పేదవానికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతుంది. దాన్నుంచి బైటపడడానికి గాను ఎంత వడ్డీ అయినా పరవాలేదని చెప్పి లక్షలు అప్పుచేసి వైద్యం చేయించినపుడు ఆ పేదవాడు అప్పులపాలైపోతాడు. వారికి ఆ పరిస్థితి రాకూడదని భావించిన వైఎస్‌ఆర్ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేశారు.



108కి ఫోన్‌చేస్తే 20నిమిషాల్లోనే పేదవాని ఇంటికి అంబులెన్సు వచ్చి రోగిని తీసుకెళ్లి పెద్దాసుపత్రిలో ఖరీదైన వైద్యం చేయించే పథకం అది.  వైఎస్‌ఆర్ మనకు దూరమైపోయి ఆరేళ్లవుతోంది. ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టి ఎనిమిదేళ్లవుతోంది. ఇన్నేళ్లయి నా ఇవాళ్టికి కూడా ఒక్క కొత్త అంబులెన్సును ఎందుకు కొనలేకపోయారు? ఇప్పటికీ అవే పాతబడ్డ అంబులెన్సులు. వాటి కి కనీసం టైర్లు కూడా మార్చలేని పరిస్థితి.



ఆరోగ్యశ్రీ పథకంలో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు పెరగడం లేదు. దాంతో వాళ్లు సమ్మె చేస్తున్న పరిస్థితి. వారిని పట్టించుకునే నాథుడే లేడు. వీటన్నిటికీ సమాధానాలు చెప్పాలని కేసీఆర్‌ను అడగండి. మీ పరిపాలన ఇంత దారుణంగా ఉందని ఆయనకు చెప్పండి.

 

ఫీజు రీయింబర్స్‌మెంట్ గతేడాది బకాయిలకే దిక్కులేదు..


పేదవాని బిడ్డ డాక్టర్, ఇంజనీర్, కలెక్టర్ వంటి పెద్ద చదువులు చదివినప్పుడే పేదరికం పోతుందని వైఎస్‌ఆర్ ఆలోచించారు. పెద్ద చదువుల కోసం పేదవాడు అప్పులపాలు కారాదన్న ఆలోచనతో ఆయన ఫీజు రీయిం బర్స్‌మెంట్ పథకాన్ని అమలుచేశారు. ఈ పథకం కింద గతఏడాది (2014-15)కి రూ.2,452 కోట్లు అవసరం ఉంటే వాటిలో కేవలం 922 కోట్లు మాత్రమే చెల్లించారు. ఇంకా 1,530 కోట్లు బకాయిలున్నాయి.



ఈ ఏడాది కాలేజీలు మొదలై ఇప్పటికే ఐదునెలలు గడచిపోయాయి. కాలేజీల్లో ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం పూర్తయి సర్టిఫికెట్లు అడిగితే విద్యార్థులకు కాలేజీ యాజమాన్యాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని చెబుతున్నారు. ఇదేం పరిపాలన కేసీఆర్‌గారూ అని గట్టిగా నిలదీయండి.

 

వాళ్లకు ఓటడిగే హక్కు లేదు..

టీఆర్‌ఎస్ పాలించడం చేతకాని పార్టీ కనుక దానికి ఓటేయవద్దు. కాంగ్రెస్ అత్యంత నీచమైన పార్టీ. అవసరమైతే దండలేస్తారు. అవసరం తీరాక బండలేస్తారు. బతికినంత కాలం కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వైఎస్‌ఆర్‌పై ఎలాంటి అభాండాలు వేశారో, ఆయన కుటుంబాన్ని ఎలా జైలుపాలు చేశారో మీ అం దరికీ తెలుసు. నాయకుడినే ఇబ్బందిపెట్టిన పార్టీకి ప్రజలు ఓ లెక్కా? ఎవరో సచిన్ పైలట్ అట. ఆయన వచ్చి మన దగ్గర మీటింగులు పెడుతున్నారు.



ఆయనకు తెలుగువస్తుం దా? ఇలాంటి తెలుగు మాట్లాడలేని, తెలుగు అర్ధం చేసుకోలేని వాళ్లు మన దగ్గరకు వచ్చి మీటింగులు పెడితే వారిని చూసి మనం ఓటె య్యాలంట. బీజేపీకి ఓటేయమని చంద్రబాబు అడిగితే.. ఆంధ్రలో దారుణమైన అబద్ధాల పాలన సాగిస్తున్న విషయం గుర్తుచేయండి. వెన్నుపోటు, అబద్ధాలు, మోసం పునాదుల పైనే ఆయన పాలన సాగిస్తున్న విషయం చెప్పండి.



విభజన హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చని బీజేపీకి ఎందుకు ఓటేయాలని అడగండి. ఈ నాయకులకు బుద్ధి రావాలంటే, వారు నేలమీద నడవాలంటే మీ ఓటు ద్వారానే సాధ్యమౌతుంది. ఇప్పటికీ వైఎస్‌ఆర్‌ను గుం డెల్లో పెట్టుకున్న మీ అందరినీ ఓటడిగే హక్కు మాకే ఉంది. విలువలు, విశ్వసనీయత ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి పార్టీ అభ్యర్థికి అఖండ విజ యం చేకూర్చండి.’ అని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.



ఇంకా ఈ  కార్యక్రమంలో  వైఎస్సార్‌సీపీ శాసనసభా పక్ష నాయకుడు పాయం వెంకటేశ్వర్లు, ప్రోగ్రాం సమన్వయకర్త తలశిల రఘురాం, వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు జెన్నారె డ్డి మహేందర్,  రాష్ట్ర నాయకులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, గాదె నిరంజన్‌రెడ్డి, శివకుమార్, కొండా రాఘవరెడ్డి, ఇరుగు సునీల్‌కుమార్,  డాక్టర్ పి. ప్రపుల్లారెడ్డి,  గౌరెడ్డి శ్రీధర్‌రెడ్డి, బీ. రఘురాంరెడ్డి,  జి. రాంభూపాల్‌రెడ్డి, బిమయ్యగౌడ్, సంపత్, సలీం సంతోశ్‌రెడ్డి, సుమిత్‌గుప్తా, బీష్వ రవీందర్, అమర్‌నాథ్‌రెడ్డి, సంజీవరావు, బొడ్డు సాయినాథ్‌రెడ్డి,  సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బీ శ్రీనివాసరావు, అజయ్‌వర్మ, నర్రా భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

 

ఆశ వర్కర్ల గోడు పట్టదా?


ఆశవర్కర్లు 79 రోజు లుగా సమ్మె చేస్తున్నారు. నెలకు రూ.500 నుంచి రూ.1000 సంపాదించే ఆశావర్కర్లు కిలో కందిపప్పు రూ.230, కిలో టమోటా రూ.50 లకు కొని ఎలా బతగ్గలరు అన్న ఆలోచన చేయలేని అధ్వాన్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. పత్తిని సీసీఐ కొనుగోలు చేయడంలేదు. కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.3,500 కూడా దక్కడం లేదు.



వైఎస్ హయాంలో పత్తి క్వింటాల్‌కు రూ.6,700 పలికిన విషయాన్ని కేసీఆర్‌కు గుర్తుచేయం డి. ప్రతి దళితునికి మూడెకరాలు ఇస్తానన్న కేసీఆర్ 18 నెలల్లో 1,600 ఎకరాలు పంచారు. వైఎస్‌ఆర్ ఐదేళ్లలో 20.60 లక్షల ఎకరాలు పంపిణీ చేసిన విషయం తెలియజేయండి.

 

ఎన్నికలకు ముందే ఎందుకు చెప్పలేదు?


 ఎన్నికలకు ముందు బ్యాంకు రుణాలు కట్టొద్దన్నారు. పంటరుణాలన్నీ మాఫీ అన్నారు. అధికారంలోకి వచ్చాక నాలుగు విడతల్లో రుణమాఫీ అం టున్నారు. మాట ఇచ్చి వెనక్కు తగ్గినందునే ఇవాళ రైతుల మీద 14 శాతం అపరాధ వడ్డీ పడుతోంది.



రుణాలు రెన్యువల్ కాకపోవడంతో పంటల బీమా కూడా అందక రైతన్న పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అందువల్లే ఒక్క వరంగల్ జిల్లాలోనే 150 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నాలుగువిడతలుగా రుణమాఫీ చేస్తానని ఎన్నికలకు ముందే ఎందుకు చెప్పలేదని కేసీఆర్‌ను నిలదీయండి.

 

వైఎస్ దేశంతో పోటీ పడ్డారు, మరి మీరు?

అధికారంలోకి వస్తే రెండు పడకగదుల ఇళ్లు కట్టించి ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. 18 నెలల కాలంలో ఆయన కట్టించిన ఇళ్లు కేవలం 396. అదే వైఎస్‌ఆర్  హయాంలో ఏడాదికి 10 లక్షల చొప్పున ఐదేళ్లలో 48 లక్షల ఇళ్లు కట్టించి ఇచ్చారు. దేశం మొత్తం మీద 48 లక్షల ఇళ్లు కట్టిస్తే వైఎస్‌ఆర్ ఒక్కరే మన రాష్ర్టంలో 48 లక్షల ఇళ్లు కట్టించి దేశంతో పోటీ పడ్డారు. 18 నెలల్లో 396 ఇళ్లు కట్టించి అదేదో గొప్పగా చేసినట్లు పేపర్లలో రాయించుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావని కేసీఆర్‌ను గట్టిగా అడగండి.

 

బుట్ట పట్టుకొని మార్కెట్‌కు ఎపుడన్నా వెళ్లారా?


ఎపుడన్నా మార్కెట్‌కు వెళ్లారా.. సరుకులు కొన్నారా అని కేసీఆర్‌ను అడగండి. కిలో కందిపప్పు రూ.230 ఉంది. గత ఏడాది రూ.90కే వచ్చేది. కిలో మినప్పప్పు రూ. 170 నుంచి 200 ఉంది. గతేడాది రూ.85 ఉం డేది. ఉల్లిపాయలు రూ.40 పలుకుతున్నాయి. గతేడాది రూ.22కే దొరి కేవి. టమోటా కేజీ రూ. 45 నుంచి 50 ఉన్నాయి.



గతేడాది రూ.14 మాత్రమే. ఇలా ధరలన్నీ ఆకాశాన్ని అంటుతుంటే ఎలా కొనాలి? ఎలా బతకాలి కేసీఆర్‌గారూ.. ఇదేనా మీరు ప్రభుత్వం నడిపేతీరు అని నిలదీయండి. ఒకవైపేమో రైతుకు కనీస మద్దతు ధర దొరకడం లేదు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top