పెంచేద్దాం.. పంచేద్దాం | Sakshi
Sakshi News home page

పెంచేద్దాం.. పంచేద్దాం

Published Mon, Oct 5 2015 1:06 AM

పెంచేద్దాం.. పంచేద్దాం - Sakshi

♦ పోలవరంతో దండుకోవడానికి బాబు ప్రభుత్వం కొత్త ప్లాన్
♦ నిపుణుల కమిటీ పేరుతో కొత్త నాటకానికి రంగం సిద్ధం
♦ కాంట్రాక్టర్‌ను కాపాడుకుంటూ, సబ్ కాంట్రాక్టర్లను తెరపైకి
తెచ్చే యత్నం.. అందుకు అనుగుణంగా ప్రాజెక్టు అంచనా వ్యయం పెంపునకు ప్రయత్నం
♦ ప్రభుత్వ తీరును తప్పు పట్టిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)
♦ కేంద్ర ప్రతినిధి అయిన పీపీఏను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి వరప్రదాయిని అయిన పోలవరం ప్రాజెక్టు విషయంలో అంతులేని నిర్లక్ష్యాన్ని చూపుతూ వస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రాజెక్టు నిర్మాణంతో కాసుల పంట పండించుకోవడానికి రంగం సిద్ధం చేసింది. ఒకవైపు తనవాడైన కాంట్రాక్టర్‌ను కాపాడుకుంటూనే.. మరోవైపు అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి, సబ్ కాంట్రాక్టర్ల పేరుతో తమ వారైన మరింత మందికి లబ్ధి చేకూరుస్తూ.. ప్రజాధనంతో, ప్రజాప్రయోజనాలతో కొత్త ఆటకు సిద్ధమైంది. అంతిమంగా పోలవరం కాంట్రాక్టులు చేపట్టిన తమ వారి జేబులు నింపే ప్రయత్నానికి చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ‘నిపుణుల కమిటీ’ ప్రతిపాదనలను తెరపైకి తెస్తోంది.

 ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేసిన పీపీఏ: పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని, ఏడాదిన్నరగా పనులు నత్తనడకన  నడుస్తున్నా ప్రభుత్వం కాంట్రాక్టరును ప్రశ్నించకపోవడాన్ని ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) ఇప్పటికే తేటతెల్లం చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి కూడా తీసుకెళ్లింది. ప్రభుత్వ నిర్లక్ష్యం, అనాసక్తి, మరోవైపు సొంత ప్రయోజనాల కోసం సత్తాలేని కాంట్రాక్టర్(టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు)కు వత్తాసు పలకడం, ఇంకోవైపు జాతీయహోదా దక్కినా ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించకుం డా కాసుల పంట పండించుకోవడానికి ప్రభు త్వ పెద్దలు చేస్తున్న ప్రయత్నం... వీటన్నింటినీ అథారిటీ ఎండగట్టింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం సెప్టెంబర్ 30న నిపుణుల కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి కాసుల వేటకు కొత్త వ్యూహాన్ని రచించింది.

 అవినీతికి బాసటగా నిపుణుల కమిటీ...
 ప్రాజెక్టు పనులు సకాలంలో చేయించడానికి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం.. ఏడాదిన్నర కాలంగా చూసీచూడనట్లుగా ఉండటానికి కారణాలను నిపుణుల కమిటీ చెప్పలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని పీపీఏ స్పష్టంగా చెప్పిన విషయాన్ని కూడా కమిటీ పరిగణనలోకి తీసుకోలేదు. జాతీయ హోదా దక్కిన ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలంటే..  కేంద్రం ఏర్పాటు చేసిన పీపీఏకు సహకరించకపోతే ఎలా సాధ్యమనే విషయాన్నీ కమిటీ పట్టించుకోలేదు. సమావేశం మినిట్స్‌లో.. కాంట్రాక్టర్ తగిన స్థాయిలో యంత్రాలను మోహరించలేదని కమిటీ స్పష్టంగా చెప్పింది. పనులు చేయడానికి ట్రాన్స్‌ట్రాయ్‌కి సామర్థ్యం లేదని నిపుణుల కమిటీ కూడా తేల్చింది. కానీ అదనపు చెల్లింపుల అంశంలో ‘మిషనరీ, మెటీరియల్స్’ ను పరిగణనలోకి తీసుకొని చెల్లించాలని కమి టీ సూచించడం గమనార్హం. ఈ అంశం ఒప్పం దంలో కూడా లేదు! మిషనరీ ఖాళీగా ఉంచి నందుకు పరిహారం ఇవ్వాలట! 2015-16 ధరలు(స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్) ప్రకారం అదనపు చెల్లింపులు నిర్ణయించాలని సూచించింది.

 ఇప్పటి వరకూ చేసింది శూన్యం...
 పోలవరం ప్రాజెక్టులో భాగమైన రూ. 4,054 కోట్ల విలువైన పనులను ప్రస్తుత టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీకి 2013 మార్చిలో అప్పగించారు. పనులు పూర్తి చేయడానికి ఐదేళ్ల గడువు ఇచ్చారు. ఇచ్చిన గడువులో సగానికిపైగా కాలం గడిచినా ఇప్పటి వరకూ 5.52 శాతం పనులే చేశారు.

 రంగంలోకి సబ్ కాంట్రాక్టర్లు...
 ఇప్పటి వరకూ పనులు చేపట్టని కాంట్రాక్టర్‌ను ప్రభుత్వం కానీ, నిపుణుల కమిటీ కానీ ప్రశ్నించలేదు. అన్ని సమస్యలకూ విరుగుడు అన్నట్టుగా అంచనా వ్యయాన్ని పెంచేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. సబ్ కాంట్రాక్టర్లను రంగంలోకి దించి దాన్ని వారికి పంచడానికి వ్యూహం రచించారు. సబ్ కాంట్రాక్టర్లు వచ్చినా అసలు కాంట్రాక్టర్ అలాగే ఉంటారు. పనులు చేయడం చేతకావడం లేదని స్వయం గా కమిటీనే తేల్చినా ఆ కాంట్రాక్టర్‌కు దక్కాల్సినవన్నీ దక్కుతాయి. సబ్ కాం ట్రాక్టర్లు కూడా ట్రాన్స్‌ట్రాయ్ కిందే పని చేస్తూ.. అంతా కలిసి అవినీతి మొత్తాన్ని పంచుకుంటారు. అందుకు అనుగుణంగా సబ్ కాంట్రాక్టర్లను నియమించే బాధ్యత కూడా ట్రాన్స్‌ట్రాయ్‌కే అప్పగించే అవకాశాలున్నాయి.

 పీపీఏ జోక్యం లేకుండా దొంగదారులు
 పనులు చేయడంలో నిర్లక్ష్యం చూపిన ట్రాన్స్‌ట్రాయ్ మీద చర్యలు తీసుకోవాలనే యోచన ప్రభుత్వానికి లేకపోవడంతో.. నిపుణుల కమి టీ కూడా అందుకు అనుగుణంగానే వ్యవహరించింది. పనులను సబ్ కాంట్రాక్టర్‌కు అప్పగించడానికి రెండు మార్గాలున్నాయని పేర్కొం ది. మొత్తం పనిని సబ్ కాంట్రాక్టర్‌కు అప్పగించడం (బ్యాక్ టు బ్యాక్) ఒక మార్గంగా సూచించింది. అయితే ‘పేమెంట్స్’ విషయం లో ఇబ్బందులు తలెత్తవచ్చని చెప్పింది. సబ్ కాంట్రాక్టర్లను తెచ్చుకొనే అవకాశం ట్రాన్స్‌ట్రాయ్‌కే ఇచ్చి, ఆ సబ్ కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేసే విధానం పరిశీలించదగిందేనని కమిటీ సూచించింది. అంటే.. తనకు కావాల్సిన కాం ట్రాక్టర్లను తెచ్చుకొని సొమ్ము నొక్కేయాలనే యోచనను నిపుణుల కమిటీతో చెప్పించడం ద్వారా ప్రభుత్వ పెద్దలు శంకువులో పోసి తీర్థం చేసేలా వ్యవహరిస్తున్నారని నీటిపారుదల శాఖ ఇంజనీర్లే వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement
Advertisement