హైదరాబాద్: త్వరలోనే కాంగ్రెస్ పార్టీ కోసం టీవీ, పత్రిక మొదలు కానున్నాయని టీపీసీసీ చైర్మన్ ఉత్తమ్ కుమార్రెడ్డి వెల్లడించారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలని కోరారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ బస్సు యాత్ర మొదలవుతుందని చెప్పారు. అధికార టీఆర్ఎస్ వేధింపులకు భయటపడవద్దు అని పార్టీ శ్రేణులను కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అన్నీ వసూలు చేస్తామన్నారు. కేసీఆర్ పాలనలో నలుగురికి మాత్రమే బంగారు తెలంగాణ వచ్చిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మాయ మాటల వల్ల 2014 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందని గుర్తుచేశారు.
2019 లో కాంగ్రెస్ 90 స్థానాల్లో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మూడున్నర ఏళ్లలో.. ఉద్యోగ ఖాళీలను పూర్తి చేయలేని అసమర్థుడు కేసీఆర్ అని ఆరోపించారు. రైతులకు కేసీఆర్ పాలన శాపంగా మారిందని చెప్పారు. రైతు సమన్వయ కమిటీలు టీఆర్ఎస్ కమిటీలని అభివర్ణించారు. విద్యుత్ పై సీఎం కేసీఆర్ చెబుతున్నవి పచ్చి అబద్దాలని విమర్శించారు. కేసీఆర్ ..ప్రాజెక్టుల పేరుతో దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీ ప్రాజెక్టులకు కాదు.. కేసీఆర్ చేస్తున్న దోపిడీకి వ్యతిరేకమని స్పష్టం చేశారు.