టైటాన్స్‌కు చుక్కెదురు | Sakshi
Sakshi News home page

టైటాన్స్‌కు చుక్కెదురు

Published Sun, Jun 26 2016 12:25 AM

టైటాన్స్‌కు చుక్కెదురు

ఆరంభ మ్యాచ్‌లో పుణెరి విజయం
ప్రొ కబడ్డీ లీగ్

 
 
ముంబై: తొలి టైటిల్‌పై కన్నేసిన తెలుగు టైటాన్స్ జట్టు ప్రొ కబడ్డీ లీగ్‌ను ఓటమితో ఆరంభించింది. లీగ్ నాలుగో సీజన్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 24-28తో పుణెరి పల్టన్ చేతిలో ఓటమి పాలైంది. భారత టెస్టు క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు హాజరయ్యాడు. పుణెరి కెప్టెన్ మంజిత్ చిల్లర్ ఐదు టాకిల్ పాయింట్లతో రాణించగా, అజయ్ ఠాకూర్ మూడు రైడింగ్ పాయింట్లు సాధించాడు. ఇక టైటాన్స్ నుంచి కెప్టెన్ రాహుల్ చౌదరి నాలుగు రైడింగ్ పాయింట్లు, వినోద్ ఐదు... సందీప్ నర్వాల్ నాలుగు టాకిల్ పాయింట్లతో ఆకట్టుకున్నారు.

ఆరంభంలో పుణెరి చకచకా నాలుగు పాయింట్లు సాధించినా ఆ తర్వాత టైటాన్స్ ఆధిక్యం ప్రదర్శించి తొలి అర్ధభాగంలో 15-13తో నిలిచింది. అనంతరం ఆట గతి తప్పడంతో పుణెరి పుంజుకుంది. ద్వితీయార్ధంలో ఏ దశలోనూ ప్రత్యర్థిపై టైటాన్స్ పైచేయి సాధించలేకపోవడంతో పరాజయం తప్పలేదు. యు ముంబా విజయం: చివరి క్షణం వరకు ఉత్కంఠభరితంగా జరిగిన మరో పోరులో యు ముంబా జట్టు 36-34 తేడాతో జైపూర్ పింక్‌పాంథర్స్‌ను ఓడించింది. ముంబా జట్టులో రాకేశ్ 9, రిషాంక్ 5 రైడింగ్ పాయింట్లు సాధించారు.

Advertisement
Advertisement