కెయిన్స్‌పై మరో కేసు | Sakshi
Sakshi News home page

కెయిన్స్‌పై మరో కేసు

Published Sat, Sep 13 2014 12:41 AM

కెయిన్స్‌పై మరో కేసు

వెల్లింగ్టన్: న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ క్రిస్ కెయిన్స్‌పై లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడిపై వేసిన పరువు నష్టం దావా సందర్భంగా అతను అసత్యాలు చెప్పాడని పోలీసులు ఆరోపించారు. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు కెయిన్స్‌ను ఐపీఎల్‌లోకి తీసుకోలేదని మోడి చేసిన ఆరోపణలపై 2012లో కివీస్ క్రికెటర్ పరువు నష్టం దావా వేశాడు. ఈ విచారణలో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడలేదని చెప్పిన కెయిన్స్... మడమ గాయం నుంచి సకాలంలో కోలుకోకపోవడంతో ఐసీఎల్ జట్టు చండీగఢ్ లయన్స్ తనపై వేటు వేసిందని వెల్లడించాడు. ఇందుకు సంబంధించిన ఆధారాలను కెయిన్స్ తరఫు లాయర్ ఆండ్రూ ఫిచ్ హోలాండ్... కోర్టుకు సమర్పించారు. దీన్ని విచారించిన లండన్ హైకోర్టు కెయిన్స్‌కు 90 వేల పౌండ్లు చెల్లించాలని తీర్చు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తనపై నమోదు చేసిన కేసు నిరాశ కలిగించినప్పటికీ అధికారులకు సహకరిస్తానని కెయిన్స్ తెలిపాడు. ‘యూకేలోని క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ వాళ్లు నాపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈనెల 25న ఇది విచారణకు వచ్చే అవకాశాలున్నాయి. నాపై ఉన్న ఆరోపణలను తొలగించుకోవడానికి మరో అవకాశం వచ్చింది. ఈ కేసు నుంచి బయటపడే వరకు పోరాడతా’ అని కెయిన్స్ పేర్కొన్నాడు.
 

Advertisement
Advertisement