భార్య గొంతు కోసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ | Sakshi
Sakshi News home page

భార్య గొంతు కోసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

Published Fri, Dec 2 2016 10:39 AM

భార్య గొంతు కోసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

తాగుడుకు బానిసైన ఓ సాప్ట్‌వేర్ ఇంజనీర్ విచక్షణ మరచి భార్యను దారుణంగా గొంతుకోసి హత్యచేసిన ఘటన  దమ్మాయిగూడ అయ్యప్ప కాలనీలో చోటుచేసుకుంది. స్ధానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దమ్మాయిుగూడకు చెందిన చక్రపాణికి, సికిందాబాద్ మెట్టుగూడకు చెందిన మాధవి (34)తో 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. చక్రపాణి హైటెక్ సిటీలోని బ్యాంక్ ఆఫ్ అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.   పెళ్లయిన ఏడాది పాటు వీరి దాంపత్య జీవితంగా సాఫీగా సాగినా, ఆ తర్వాత మద్యానికి బానిసైన చక్రపాణి నిత్యం భార్యను వేధించేవాడు.
 
పలుమార్లు అతని దాడిలో గాయపడిన మాధవి అపస్మారక స్థితిలోకి కూడా వెళ్లినట్లు ఆమె తల్లి చంద్రకళ తెలిపారు.. వారం రోజుల క్రితం చక్రపాణి మాధవిని తీవ్రంగా కొట్టి పిల్లలతో సహా బాలాజీనగర్‌లోని ఆమె పుట్టింట్లో వదిలి వెళ్లాడు. గురువారం సాయంత్రం అత్తగారింటికి వచ్చిన అతను.. మాధవిని దమ్మాయిగూడలోని తమ ఇంటికి తీసుకొచ్చాడు. అనంతరం కత్తితో దాదాపు 15 సార్లు పొడిచి, పారిపోయాడు. తమ ఇంటికి వచ్చేసరికే మద్యం మత్తులో ఉన్న చక్రపాణిపై అనుమానం వచ్చిన మాధవి కుటుంబసభ్యులు దమ్మాయిగూడలోని వారి ఇంటికి వచ్చి చూసేసరికి ఆమె రక్తపుమడుగులో పడిఉంది. దీంతో జవహర్‌నగర్ పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న ఏసీపీ సయ్యద్ రఫిక్, సీఐ అశోక్‌కుమార్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement