⇒ టెలీకాలర్ హత్య కేసులో తేల్చిన పోలీసులు ⇒ మరో స్నేహితుడితో కలసి ఘాతుకం ⇒ ఇద్దరూ పరారీ.. గాలిస్తున్న పోలీసులు
హైదరాబాద్: హైదరాబాద్లోని మాదాపూర్ భాగ్యనగర్ కో–ఆపరేటివ్ సొసైటీలో దారుణ హత్యకు గురైన టెలీకాలర్ సునీత హత్య కేసును సైబరాబాద్ పోలీసులు వెంటనే ఛేదించారు. ఆమె సన్నిహితుడే హంతకుడిగా గుర్తించారు. అతను మరో స్నేహితుడితో కలసి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. వారి కోసం గాలింపు చేపట్టారు. అయితే ఈ నిందితుల వివరాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు. (చదవండి: పట్టపగలే టెలికాలర్ దారుణ హత్య)
ప్రేమ, పెళ్లి వ్యవహారమేనా?: సికింద్రాబాద్లోని బన్సీలాల్పేట్కు చెందిన సునీత బుధవారం హత్యకు గురైన విషయం తెలిసిందే. అంతకుముందు రోజు మంగళవారం (వాలెంటైన్స్ డే) ఆఫీసుకు వెళ్తున్నానంటూ ఇంటి నుంచి వెళ్లిన సునీత.. విధులకు హాజరుకాలేదు. తాను పనిచేసే ఆఫీసుకు ఫోన్ చేసి.. తమ సమీప బంధువు చనిపోయాడని, మంగళ–బుధవారాల్లో విధులకు రాలేనని చెప్పింది. ఆ రోజు రాత్రి 10 గంటలకు ఇంటికి తిరిగి వచ్చింది.
తిరిగి బుధవారం ఉదయం ఆఫీసుకు బయలుదేరింది. కానీ కొద్ది గంటల్లోనే హత్యకు గురైంది. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు ప్రేమ వ్యవహారం, పెళ్లి ప్రస్తావన తదితర కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం సునీత సోదరుడు నర్సింగ్రావు, సోదరి పుష్పలత బంధువులను పోలీసుస్టేషన్కు పిలిపించి.. మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. సునీత పర్సులో లభించిన మూడు సిమ్కార్డులు, సెల్ఫోన్ కాల్ డేటా, ఈ–మెయిళ్లు, చాటింగ్లను పరిశీలించిన పోలీసులు సన్నిహితుడే హంతకుడని తేల్చారు.