కొత్త పుస్తకాలు | Sakshi
Sakshi News home page

కొత్త పుస్తకాలు

Published Mon, Oct 3 2016 1:25 AM

New books of Literature

 రాణి చిన్నాదేవి:  రచన: మువ్వల సుబ్బరామయ్య; పేజీలు: 136; వెల: 60; ప్రతులకు: జయంతి పబ్లికేషన్స్, కారల్ మార్క్స్ రోడ్, విజయవాడ-520002; ఫోన్: 0866-2577828
 ‘ఎక్కడో కళింగలో పుట్టి పెరిగిన ప్రతాపరుద్ర గజపతి కుమార్తె చిన్నాదేవి, నరహరి పాత్రుడు చుట్టూ తిరిగిన కథ మలుపు తిరిగి, నరహరి పాత్రునికి దక్కాల్సిన చిన్నాదేవి, (విజయనగరాధీశ్వర) కృష్ణరాయని వరించాల్సి వచ్చిన నేపథ్యాన్ని ఎంతో నాటకీయంగా వర్ణించారు. కటకం, హంపీ, ఉదయగిరి, కొండవీడు, కొండపల్లి నగరాలు, బీదరు, బీజాపూరు దుర్గాల మధ్య జరిగిన చారిత్రక సంఘటనలను మనముందుంచటానికి చరిత్రకారునికంటే మిన్నగా తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు’.
 
 పద్యం వ్రాయడం ఎలా?
 రచన: బులుసు వేంకటేశ్వర్లు; పేజీలు: 74; వెల: 100; ప్రతులకు: రచయిత, కల్పవృక్షం, ఇ.ఎస్.ఐ. హాస్పిటల్ వద్ద, ఆదర్శనగర్, చిట్టివలస, విశాఖ-531162; ఫోన్: 9949175899
 ‘(రచయిత) తన నాలుగు దశాబ్దాల అనుభవాల్ని రంగరించి తేలికభాషలో పద్యలక్షణాల్ని వివరించారు. పద్యాలు వ్రాద్దామనే ఔత్సాహికులు పాటించవలసిన పద్ధతులను విస్తృతంగా చర్చించారు. పద్యరచనలో గణ, యతి, ప్రాసల నుండి రసపోషణ వరకు అన్ని విశేషాలను స్థూలంగా నిరూపించారు. పూర్వకవుల పద్యాలతోపాటు ఆధునిక కవుల పద్యాలను కూడా ఇందులో ఉదహరించడం ఒక విశేషం’.
 
 శ్రీమద్భగవద్గీత- ఉపదేశగీత
 రచన:  డాక్టర్ దాశరథి రంగాచార్య; పేజీలు: 262(రాయల్ సైజు); వెల: 225; ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్ హౌస్, గిరిప్రసాద్ భవన్, జి.ఎస్.ఐ. పోస్టు, బండ్లగూడ(నాగోల్), హైదరాబాద్-68. ఫోన్: 24224453 రంగాచార్య మరణానంతరం ఆయన ‘ఆఖరివ్యాఖ్య’గా వెలువడిన పుస్తకమిది. ‘నది’లో 2012-14 మధ్య  ధారావాహికగా వెలువడిన ఉపదేశగీత ఇది. ‘ఉపదేశగీత కేవలం రంగాచార్య స్వకపోల కల్పితం కాదు. అది వేదోపనిషత్తుల నుండి మొదలై, పురాణాల గుండా ప్రవహిస్తూ, కావ్యేతిహాసాల కమ్మదనాన్ని మోసుకొచ్చిన మందాకిని. పద్దెనిమిది భాగాలుగా విస్తరించిన ఉపదేశగీత రంగాచార్య ప్రపంచజ్ఞానాన్ని స్పృశిస్తుంది’.
 
 ఏం చెప్పాయి వేదాలు?
 రచన: రంగనాయకమ్మ; పేజీలు: 216(రాయల్ సైజు, హార్డు బౌండు); వెల: 80; ప్రతులకు: అరుణా పబ్లిషింగ్ హౌస్, ఏలూరు రోడ్డు, విజయవాడ-2; ఫోన్: 0866-2431181
 ‘వేదాల గురించి, ‘‘ఇలా వుంటాయి, అలా వుంటాయి’’ అని వ్యాసాలు రాస్తే, వాటి వల్ల, చదివినవాళ్ళకి నమ్మకం కలగదు. వేద గ్రంధాల్లో వున్న సాహిత్యాన్నే, ఆ కవితలని చూస్తేనే, పాఠకులకు నిజం తెలుస్తుంది. అందుకే, వేద కవిత్వాల్ని చూపించడమే పెట్టుకున్నాను.... వేద కవిత్వాలు ఎలా వున్నాయో, వాటివల్ల తెలుసుకోగలిగేదీ, నేర్చుకోగలిగేదీ, ఏమీ వున్నాయో, మీరే చదివి చూడండి!’ అంటూ రంగనాయకమ్మ చేసిన విమర్శా వ్యాఖ్యానం ఇది.
 
 చమన్ ఆవిష్కరణ సభ
 ‘చమన్’ (ముస్లిం సామాజిక వేదిక) పత్రిక ఆవిష్కరణ (సంపాదకుడు: స్కైబాబ) అక్టోబర్ 5న 5:30కు హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరగనుంది. ఆవిష్కర్త: ఖాదర్ మొహియుద్దీన్. ఇందులో, ఏశాల శ్రీనివాస్, సంగిశెట్టి శ్రీనివాస్, జి.లక్ష్మీనరసయ్య, ఖుతుబ్ సర్‌షార్, కె.విమల, భంగ్యా భూక్యా, తిప్పర్తి యాదయ్య పాల్గొంటారు.
 
 తెలుగు విజయం ప్రదర్శన
 ‘సంస్కృతి’ ఆధ్వర్యంలో- ‘తెలుగు విజయం’ సాహితీ రూపక ప్రదర్శన అక్టోబర్ 8న సాయంత్రం 6:30కు అన్నమయ్య కళావేదిక, బృందావన్ గార్డెన్స్, గుంటూరులో జరగనుంది. ఇందులో- బృహస్పతి, పురాణకవి, ప్రబంధ కవి, శతక కవి, అవధాన కవి, నాటక కవి, వాగ్గేయకారులుగా కడిమిళ్ల వరప్రసాద్, కందుకూరి రామకృష్ణ, కొట్టే కోటారావు, పసుపులేటి రామచంద్రరావు, బులుసు అపర్ణ, సి.వి.వి.సత్యనారాయణ మూర్తి, కొమ్ము సుబ్రహ్మణ్య వరప్రసాద్ నటిస్తారు.

Advertisement
 
Advertisement
 
Advertisement