విజయవాడలో సర్కిల్ ప్రధాన కార్యాలయం
చీఫ్ జనరల్ మేనేజర్ దామోదర్రావు
అన్నవరం : వచ్చే అక్టోబర్ నుంచి బీఎస్ఎన్ఎల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ విజయవాడ కేంద్రంగా రాష్ట్రంలోని 13 జిల్లాల వినియోగదారులకు సేవలందించనుందని ఆ సర్కిల్ ఛీఫ్ జనరల్ మేనేజర్ దామోదర్రావు తెలిపారు. ఆదివారం ఆయన రత్నగిరిపై సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రెండు సర్కిళ్లుగా విడిపోయినా హైదరాబాద్లోని ఒకే కార్యాలయం నుంచి పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం విజయవాడలో ఏపీ టెలికం సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అయితే హైదరాబాద్ నుంచి విజయవాడ రావడానికి సిబ్బంది సుముఖంగా ఉన్నారా అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ఎగ్జిక్యూటివ్ అధికారుల వరకూ ఇబ్బంది లేదన్నారు. వారికి బదిలీ పరిధి జిల్లా మాత్రమే అవడం వలన ఈ ఇబ్బంది ఉందన్నారు. అయితే నిబంధనలు మార్చి అయినా సిబ్బందిని విజయవాడ తరలించి వి««దlులు నిర్వహించేలా చేస్తామని తెలిపారు. త్రీజీ, ఫోర్జీ డేటా అప్గ్రేడ్ కోసం అవసరమైన చోట ‘హాట్స్పాట్’లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. హాట్స్పాట్కు వంద మీటర్ల రేడియస్లో సిగ్నల్స్ త్వరగా అందుతాయన్నారు. ఆయన వెంట టెలికాం జీఎం(విశాఖ) శ్రీనివాస్, డీఈ ఎస్వి రాజేంద్ర కుమార్, జేటీఓ వెంకటరమణ రాజు తదితరులు ఉన్నారు.