తిరుపతి : ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్ సీపీ నాయకుడు భూమన కరుణాకర్రెడ్డి నిప్పులు చెరిగారు. శనివారం తిరుపతిలో భూమన కరుణాకర్రెడ్డి మాట్లాడుతూ... తిరుపతిలో శ్రీవారి పాదాల సాక్షిగా ప్రత్యేక హోదాపై మోదీ, చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ హామీని ఇప్పుడు వారిద్దరు తుంగలోకి తొక్కారని ఆరోపించారు. 5 కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీ, టీడీపీ కలిపి మంటగలిపాయని మండిపడ్డారు.
మోదీ, చంద్రబాబు దొంగనాటకాలాడుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చాలాసార్లు ఢిల్లీ వెళ్లారని భూమన గుర్తు చేశారు. ప్రత్యేక సాధనే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 2న బంద్కు పిలుపు నిచ్చిందన్నారు. ఈ బంద్కు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.