Hyderabad Fire Accident: సికింద్రాబాద్ బోయిగూడ టింబర్, స్క్రాప్ గోడౌన్లో జరిగిన అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో బీహార్ కార్మికులు మరణించడంపై సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఈ మేరకు అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. అలాగే బీహార్ వలస కార్మికుల మృతదేహాలను వారి వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేష్ కుమార్ను సీఎం ఆదేశించారు.
కాగా బోయిగూడలోని తుక్కు (స్క్రాప్) గోడౌన్లో బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగ కమ్ముకోవడంతో గోడౌన్ పైకప్పు కూలింది. ఈ ఘటనలో 11 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 8 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులంతా బిహార్కు చెందినవారుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
చదవండి: Hyderabad: భారీ అగ్నిప్రమాదం.. 11 మంది సజీవ దహనం