పీసీబీ వేధింపులే కారణమన్న పేసర్‌ | Sakshi
Sakshi News home page

పీసీబీ వేధింపులే కారణమన్న పేసర్‌

Published Fri, Dec 18 2020 4:27 AM

Pakistan pacer Mohammad Amir announces retirement from International Crickeet - Sakshi

కరాచీ: పాకిస్తాన్‌ లెఫ్టార్మ్‌ పేసర్‌ మొహమ్మద్‌ ఆమిర్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. పాక్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) పెట్టే మానసిక క్షోభ భరించలేకే క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు 29 ఏళ్ల బౌలర్‌ ఓ వీడియో మెసేజ్‌లో వెల్లడించాడు. ‘ఇప్పుడున్న పీసీబీ మేనేజ్‌మెంట్‌ వేధింపుల్ని తట్టుకోలేకపోతున్నా. ఇలాంటి పరిస్థితుల్లో ఆడలేను. నేను తప్పు (స్పాట్‌ ఫిక్సింగ్‌) చేశాను. దానికి శిక్ష కూడా అనుభవించాను. అయినా సరే బోర్డు నన్ను గత అనుభవాలతోనే చిన్నచూపు చూస్తోంది. నిషేధం అనంతరం తిరిగి క్రికెట్‌ ఆడేందుకు మాజీ క్రికెటర్‌ షాహిద్‌ ఆఫ్రిది, మాజీ పీసీబీ చీఫ్‌ నజమ్‌ సేథీ నాకు వెన్నుదన్నుగా నిలిచారు. వాళ్ల అండదండలతోనే నేను మళ్లీ ఆడగలిగాను’ అని ఆ వీడియోలో వివరించాడు. అతని వీడియో సందేశం వైరల్‌ కావడంతో పీసీబీ స్పందించింది. ఆమిర్‌ నిర్ణయాన్ని బోర్డు గౌరవిస్తుందని, అలాగే అతని ఆరోపణలపై తక్షణం స్పందించడం తగదని ఒక ప్రకటనలో తెలిపింది.  

‘స్పాట్‌’ చిచ్చు
నాణ్యమైన పేసర్‌గా కెరీర్‌ తొలినాళ్లలోనే కితాబు అందుకున్న ఈ క్రికెటర్‌ ప్రతిభాపాఠవాలను ‘స్పాట్‌ ఫిక్సింగ్‌’ మసకబార్చింది. 2010లో ఇంగ్లండ్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడటంతో ఐదేళ్ల నిషేధానికి (2010–2015)కు గురయ్యాడు. అంతర్జాతీయ కెరీర్‌లో 36 టెస్టులాడి 119 వికెట్లు తీశాడు. 61 వన్డేల్లో 81 వికెట్లు, 50 టి20ల్లో 59 వికెట్లను పడగొట్టాడు. 2009లో టి20 ప్రపంచకప్‌ నెగ్గిన పాకిస్తాన్‌ జట్టు సభ్యుడు. నిషేధం తర్వాత 2017లో చాంపియన్స్‌ ట్రోఫీ విజయంలోనూ ఆమిర్‌ కీలకపాత్ర పోషించాడు. ఆ టోర్నీ ఫైనల్లో భారత్‌పై పాక్‌ గెలిచింది. 

Advertisement
Advertisement