BCCI Central Contracts: Rahane, Pujara Dropped From Grade a to B, Mohammed Siraj Promated - Sakshi
Sakshi News home page

Mohammed Siraj: సిరాజ్‌కు ప్రమోషన్‌.. ఇకపై ఎంత జీతం అంటే!

Published Thu, Mar 3 2022 7:32 AM

Ajinkya Rahane, Cheteshwar Pujara Dropped From Grade A to B, mohammed siraj Promated - Sakshi

ముంబై: భారత స్టార్‌ ఆటగాళ్లు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, జస్‌ప్రీత్‌ బుమ్రా బీసీసీఐ కొత్తగా ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్‌లలో కూడా ‘ఎ’ ప్లస్‌’ గ్రేడ్‌లోనే కొనసాగనున్నారు. వీరికి బోర్డు ఏడాదికి రూ. 7 కోట్లు చెల్లిస్తుంది. అయితే ఇప్పటి వరకు ‘ఎ’ గ్రేడ్‌లో ఉన్న టెస్టు స్పెషలిస్ట్‌లు పుజారా, రహానే, ఇషాంత్‌ శర్మల స్థాయి తగ్గిస్తూ బోర్డు ‘బి’ గ్రేడ్‌ (రూ. 3 కోట్లు)లోకి మార్చింది. ఈ ముగ్గురు టెస్టు జట్టులో స్థానం కోల్పోయారు. గాయాలతో వరుసగా మ్యాచ్‌లకు దూరమవుతున్న హార్దిక్‌ పాండ్యా, వన్డేలకే పరిమితమైన శిఖర్‌ ధావన్‌లను కూడా ‘ఎ’ నుంచి తప్పించి ‘సి’లో (రూ. 1 కోటి) పడేశారు. దాంతో ‘ఎ’ గ్రేడ్‌లో (రూ. 5 కోట్లు) ఐదుగురు ఆటగాళ్లు అశ్విన్, జడేజా, పంత్, రాహుల్, షమీ మాతమ్రే మిగిలారు.

మయాంక్, సాహాలను కూడా ‘బి’ నుంచి ‘సి’కి మార్చారు. టెస్టు జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవడంతో పాటు పరిమిత ఓవర్ల జట్లలో కూడా చోటు దక్కించుకున్న హైదరాబాద్‌ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌కు ప్రమోషన్‌ లభించింది. ఇప్పటి వరకు ‘సి’లో ఉన్న అతడిని గ్రేడ్‌ ‘బి’లోకి తీసుకున్నారు. హనుమ విహారి ‘సి’లోనే కొనసాగనున్నాడు. 27 మందితో రూపొందించిన ఈ కాంట్రాక్ట్‌ జాబితానుంచి కుల్దీప్‌ యాదవ్, నవదీప్‌ సైనీలను పూర్తిగా తప్పించారు.  మరోవైపు మహిళా క్రికెటర్లలో హర్మన్, స్మృతి, పూనమ్‌ యాదవ్‌ ఉన్న గ్రూప్‌ ‘ఎ’ (రూ.50 లక్షలు)లోకి దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్‌లను తీసుకొని ప్రమోషన్‌ ఇచ్చారు. జెమీమా ‘బి’ నుంచి ‘సి’ (రూ. 10 లక్షలు)లోకి పడిపోయింది. మిథాలీ, జులన్‌ గ్రూప్‌ ‘బి’ (రూ. 30 లక్షలు)లో కొనసాగనున్నారు.

చదవండి: Womens ODI World Cup 2022: ప్రపంచ కప్‌ సమరానికి సై.. భారత్‌ తొలి మ్యాచ్‌లోనే..

Advertisement
 
Advertisement
 
Advertisement