సాక్షి, హైదరాబాద్: 2004లో కాంగ్రెస్ని అధికారంలోకి తెచ్చిన ఘనత తమదేనని బీఆర్ఎస్ సభ్యుడు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు. నాడు చంద్రబాబు చేతిలో కనీసం ప్రతిపక్ష హోదా దక్కకుండా చిత్తుగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీకి జీవం పోసింది టీఆర్ఎస్, కేసీఆర్ మాత్రమేనని అన్నారు. కేసీఆర్కు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్సే అంటూ సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ శనివారం ఆయన శాసనసభలో ఈ మేరకు స్పష్టం చేశారు. కాంగ్రెస్కు తామే భిక్ష పెట్టామన్నారు.
యూపీఏ కూటమి కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో తెలంగాణ ఏర్పాటును చేర్చిన తర్వాతే యూపీఏలో కేసీఆర్ చేరినట్టు తెలిపారు. కేసీఆర్కు తొలుత షిప్పింగ్ శాఖ ఇవ్వగా, డీఎంకే పార్టీ ఆ శాఖను కోరుకుంటే కేసీఆర్ వదులుకున్నారని గుర్తు చేశారు. మంత్రి పదవుల కోసం కాదు, తెలంగాణ కోసమే కూటమిలో చేరిన విషయాన్ని అప్పట్లో కేసీఆర్ స్పష్టం చేశారన్నారు. రేవంత్రెడ్డి ఏబీవీపీలో ప్రా రంభమై టీఆర్ఎస్, టీడీపీల్లో చేరి ఆ తర్వాత కాంగ్రెస్లోకి వచ్చారని, రేపు ఎక్కడ ఉంటారో తెలియదని పేర్కొ న్నారు. తెలంగాణకు ఒక రూపాయి ఇవ్వ నని నాటి సీఎం కిరణ్కుమార్రెడ్డి అంటే కేవలం తాము మాత్రమే పోరాడామని చెప్పారు.
మంత్రులుగా 14 నెలలే చేశాం...
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో తాము కేవలం 14 నెలలు మాత్రమే మంత్రులుగా పనిచేశామని హరీశ్ తెలిపారు. పోతిరెడ్డిపాడుతో తెలంగాణకు దక్కాల్సిన జలాలను రాయల సీమకు తరలించుకోవడం, తెలంగాణను ముంచి పులిచింతల కట్టి ఆంధ్రకు నీళ్లు మళ్లించడం, 610 జీవో అమలులో నిర్లక్ష్యం, నక్సలైట్లను చర్చల పేరుతో పిలిచి ఎన్ కౌంటర్లు చేయడం వంటి ఆరు కారణాలను పేర్కొంటూ నాడు ఆరు మంది తమ పార్టీ సభ్యులు మంత్రి పదవులకు రాజీనామా చేశారని గుర్తుచేశా రు. పోతిరెడ్డిపాడుపై మా పార్టీ నాయకులే కొట్లాడారని గుర్తు చేశా రు. కాంగ్రెస్ నుంచి కేవలం పీజేఆర్ ఒక్కరే కొట్లాడారన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్రెడ్డి సభను తప్పుదోవపట్టించే విధంగా మాట్లాడారని ఆరోపించారు.