Direct Selling New Guidelines In India 2021: నేరుగా విక్రయాలు సాగించే కంపెనీలు (డైరెక్ట్ సెల్లింగ్) పిరమిడ్, నగదు చలామణి పథకాలను నిర్వహించకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు సంబంధించి కొత్త నిబంధనలను కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంగళవారం నోటిఫై చేసింది. దీంతో 90రోజుల్లోగా కొత్త నిబంధనలను కంపెనీలు అమల్లో పెట్టాలి. ఈ కంపెనీలు తాము విక్రయించే ఉత్పత్తులు లేదా సేవలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించాలి. టప్పర్వేర్, ఆమ్వే, ఒరిఫ్లేమ్ ఇవన్నీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలే. ఈ కంపెనీల కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వాలు యంత్రాంగాలను ఏర్పాటు చేసుకోవాలని కొత్త నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. వీటి వలన ఆర్థిక, వినియోగదారుల మార్కెట్లో పోంజి స్కీమ్స్ అరికట్టవచ్చని నిపుణులు అంటున్నారు.
ఆహ్వానిస్తున్నాం
ప్రభుత్వం విధించిన నూతన నిబంధనలు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు ఆహ్వానించాయి. డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ చైర్మన్, ఆమ్వే ఇండియా, కార్పోరేట్ అఫైర్స్ వైస్ ప్రెసిడెంట్ రజత్ బెనర్జీ స్పందిస్తూ.. ప్రభుత్వం విధించిన నూతన నిబంధనలు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్పై ఆధారపడి దేశంలో 70 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని, ఇందులో సగం మంది మహిళలే అన్నారు. ప్రభుత్వం రెండేళ్లుగా ఈ విధానంపై అధ్యయనంపై చేసి తాజా నిబంధనలు రూపొందించిందన్నారు. దీని వల్ల డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్పై ఉన్న అపోహలు తొలగిపోతాయని ఆశిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.
కీలక నిబంధనలు ఇలా
- డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు పిరమిడ్ తరహా నగదు చెల్లింపు పథకాలను అమలు చేయకూడదు
- ఆమ్వే వంటి కంపెనీలు తమ ఉత్పత్తులను ఈ కామర్స్ సైట్లలో అమ్ముకోవచ్చు. అయితే కన్సుమర్ ప్రొటెక్షన్ రూల్స్ - 2020( ఈ కామర్స్) నిబంధనలు పాటించాలి
- డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న సంస్థలను నియంత్రించేందుకు సమర్థవంతమైన వ్యవస్థలను రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించాలి.
- డైరెక్ట్ సెలింగ్ వ్యాపారంలో ఉన్న కంపెనీలు ఇండియాలో కచ్చితంగా ఒక రిజిస్ట్రర్ ఆఫీసును భౌతికంగా కలిగి ఉండాలి
- వారి ఉత్పత్తుల నాణ్యతకు అమ్మందారులు బాధ్యత వహించాలి