ఎగిరిన కొత్త ఫ్లైట్‌.. దేశంలోనే తొలిసారి!  | Sakshi
Sakshi News home page

ఎగిరిన కొత్త ఫ్లైట్‌.. దేశంలోనే తొలిసారి! 

Published Mon, Jan 22 2024 5:15 PM

Air India launches countrys 1st Airbus A350 900 flight - Sakshi

దేశంలో కొత్త ఫ్లైట్‌ ఎగిరింది. తొలిసారిగా ఎయిర్‌బస్ A350-900 వాణిజ్య విమానాన్ని ఎయిర్ ఇండియా బెంగళూరు, ముంబైల మధ్య ప్రారంభించింది. అలాగే ప్రత్యేకమైన యూనిఫాంను సైతం ఈ సందర్భంగా ఆవిష్కరించింది.

AI 589 ఫ్లైట్ నంబర్‌తో బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నిర్దేశిత సమయానికి బయలుదేరిన ఎయిర్‌బస్ A350-900.. కొత్త అనుభూతిని ఆస్వాదించేందుకు సిద్ధమైన ప్రయాణికులను గమ్యస్థానానికి తీసుకెళ్లింది. మంగళవారం మినహా ప్రతిరోజు ఈ విమాన సర్వీస్‌ను నడపనున్నారు. రోజూ ఉదయం 7.05 గంటలకు బెంగుళూరు నుంచి బయలుదేరి 8.50 గంటలకు ముంబైకి చేరుకుంటుంది.  

సిబ్బందికి అలవాటు కావడానికి, అలాగే రెగ్యులేటరీ సమ్మతి కోసం తొలుత దేశీయ మార్గాల్లోనే ఈ విమానాన్ని నడపనున్నారు. ఈ క్రమంలో బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, ముంబైల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు  ఎయిర్‌బస్‌ A350 విమానంలోని అత్యాధునిక సౌకర్యాలను ఆస్వాదించే అవకాశం కలగనుంది. తదుపరి దశలో అంతర్జాతీయ సర్వీసుల్లో వీటిని నడుపుతారు.

సౌకర్యాలివే..
ఎయిర్‌బస్‌ A350లో ఉన్న ఇన్-ఫ్లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ (IFE) సిస్టమ్, ప్రత్యేకమైన సౌకర్యాలను హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన వింగ్స్ ఇండియా గ్లోబల్ ఏవియేషన్ సమ్మిట్‌లో ప్రదర్శించారు. 

త్రీ-క్లాస్‌ క్యాబిన్ లేఅవుట్‌తో కాన్ఫిగర్ చేసిన A350లో 316 సీట్లు ఉన్నాయి. ఇందులో 28 ప్రైవేట్ బిజినెస్ సూట్‌లు, 24 ప్రీమియం ఎకానమీ సీట్లు, 264 విశాలమైన ఎకానమీ సీట్లు ఉన్నాయి.

అన్ని సీట్లు లేటెస్ట్‌ జనరేషన్‌ పానాసోనిక్ eX3 ఇన్-ఫ్లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్, హెచ్‌డీ స్క్రీన్‌లతో అమర్చబడి ఉంటాయి. రోల్స్ రాయిస్ ట్రెంట్ ఎక్స్‌డబ్ల్యూబీ ఇంజన్‌ల ద్వారా ఆధారితమైన ఈ విమాన ఇంధన సామర్థ్యం, ఇతర విమానాలతో పోల్చితే 20 శాతం మెరుగ్గా ఉంటుంది. ఇంధన ఉద్గారాలను తగ్గించడానికి ఇది దోహదం చేస్తుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement