-
కంటెంట్ ఉంటేనే ‘కిక్కు.. క్లిక్’
సాక్షి, హైదరాబాద్: కంటెంట్లో కిక్కు ఉండాలి...అది ఉంటేనే క్లిక్ అవుతుందనే భావనలో రాజకీయ నాయకులు ఉన్నారు. జనంలోకి దూసుకెళ్లే వీడియోలు.. వినంగానే అర్థమయ్యేలా సోది లేకుండా చెప్పే నైపుణ్యం..నిశితంగా వైరిపక్షాన్ని ఇరుకున పెట్టే వ్యూహం.. లోక్సభ ఎన్నికల వేళ నేతలు ఈ తరహా కంటెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.హైదరాబాద్కు చెందిన వికీపీడియా కంటెంట్ సొల్యూషన్స్ సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా లక్షమంది కంటెంట్ రైటర్లు పనిచేస్తున్నారు. అసలు కంటెంట్ రైటింగ్ అంటే ఏంటో? ఎలా ఉంటుందో? ఎలా క్రియేట్ చేయాలో చెప్పేందుకు ప్రత్యేక శిక్షణ సంస్థలూ ఉన్నాయి. ఢిల్లీకి దగ్గర్లోని గుర్గావ్లో ఇలాంటి పేరెన్నికగల సంస్థల్లో చాలామంది శిక్షణ పొందుతున్నట్టు వీక్పీడియా సంస్థ అధిపతి కుమార్జైన్ తెలిపారు. ఇలా శిక్షణ తీసుకున్నవారు కొన్నేళ్లుగా ఎన్నికలు, ఇతర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీరి ఆధ్వర్యంలో పనిచేసిన మరో 80 వేల మంది వరకూ కంటెంట్ రైటర్లుగా మారిపోయారు. ‘క్లిక్’మనిపించడమే సవాల్ రాజకీయపార్టీ ఏదైనా సరే ఎన్నికల్లో గెలవాలనే అనుకుంటుంది. ఈ దిశగానే వారి ఆశయాలు, ఆచరణ విధానాలను ప్రజల్లోకి తీసుకెళుతుంది. వాట్సాప్, యూట్యూ బ్, ఇన్స్టా, ఫేస్బుక్ ఇలా అన్ని సోషల్ మీడియాల్లోనూ తమ వాదన ‘క్లిక్’కావాలనే కోరుకుంటాయి. ఇక్కడే కంటెంట్ రైటర్ ప్రావీణ్యత ముడిపడి ఉంది. నేతను జనంలో నిలబెట్టే మెళకువలు అందిపుచ్చుకోవడంలో దేశవ్యాప్తంగా 60 శాతం కంటెంట్ రైటర్లు విజయం సాధిస్తున్నారని ఢిల్లీకి చెందిన ఇండియా కంటెంట్స్ మేనేజర్ విజయ్కుమార్ మల్హోత్రా తెలిపారు. పోస్టు పెట్టాక రివ్యూ చేస్తారు. ఎంతమందికి అది రీచ్ అయింది తెలుసుకుని.. సరైన స్పందన లేకపోతే కంటెంట్ మార్చడానికి ప్రయత్నిస్తుంటారు. నాయకుడికి సంబంధింన కంటెంట్ రైటర్ తను పెట్టే వీడియోలు, ఫొటోలు ఓటర్లకు రీచ్ కాకపోతే కంటెంట్ రైటర్ చిక్కుల్లో పడ్డట్టే. దీనికోసం కంటెంట్ రైటర్లు కూడా సొంత ఫాలోవర్స్ ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది. మంచి గిరాకీనే..కంటెంట్ రైటర్లకు ఎన్నికల సీజన్లో మంచి గిరాకీ ఉంటుంది. ఒక్కో సంస్థ పరిధిలో కనీసం 50 మంది పనిచేస్తుంటారు. నాయకుడి అందించే కాన్సెప్ట్ అర్థం చేసుకొని, అందుకు అనుగుణంగా అవసరమైన డైలాగ్స్, సెటైర్లతో కంటెంట్ ఇవ్వడం వీరి బాధ్యత. దీనిని వీడియో ఎడిటర్ చిత్రీకరణలోకి తీసుకెళతాడు. చిత్రం చాలా తేలికగా ఉండాలంటే, ఈజీగా ఉండే పదాలు, వాడుక భాషను కంటెంట్ రైటర్లు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కంటెంట్ అందిచడం అనేక విధాలుగా ఉంటుందని ది రైటర్స్ అనే సంస్థకు చెందిన విఠల్ తెలిపాడు. అధికార పార్టీ నేత పోటీ చేస్తున్నప్పుడు ప్రభుత్వ పథకాలు, జరిగిన లబ్దిపై ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో విపక్షాలు లేవనెత్తే ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కూడా కంటెంట్ ఇవ్వాలి. దీనిని వీలైనంత తక్కువ నిడివి గల వీడియో చిత్రీకరణకు అనువుగా ఉండాలని నేతలు కోరుతున్నట్టు కంటెంట్ రైటర్లు చెబుతున్నారు. విపక్షమైతే ఎదురుదాడి ప్రధానాస్త్రంగా కిక్ ఎక్కించే కంటెంట్ కోరుకుంటోంది. కంటెంట్ క్లిక్ అయ్యే దాన్ని బట్టి రెమ్యూనరేషన్ డిమాండ్ ఉంటోంది. కొంతమంది ఎన్నికల సమయం వరకూ ప్యాకేజీగా రూ.25 నుంచి రూ.40 లక్షల వరకూ తీసుకుంటున్నారు. మరికొంతమంది నేతలు వారి స్థాయిని బట్టి రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. ఇది కూడా రూ.10 లక్షలకు తక్కువ ఉండదు. -
నెహ్రూ జాకెట్ సాహిత్యం
నెహ్రూ గారిని నిలదీయడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయిందిగాని నిజానికి ఆయనను నిలదీయాల్సింది నెహ్రూ జాకెట్ను ఎందుకు పాప్యులర్ చేశావయ్యా అని. రచయితలు, కవులు, విమర్శకులు మున్ముందు రోజులలో లాల్చీ పైజమా ధరించడమేగాక నెహ్రూ జాకెట్ను కూడా తగిలించారంటే గనక చచ్చినట్టు వారు సాహిత్యకారులుగా మన దేశంలో చలామణి అవుతారని ఆయన ఊహించి ఉండడు. ఎరిగిన సాహిత్యకారులు అడపా దడపా ఆ అదనపు వస్త్రాన్ని ధరించినా తాము సాహిత్యకారులమే అని తప్పక నిరూపించుకోవాలనుకునే వారికి మాత్రం నెహ్రూ జాకెట్ కవచ కుండలం. పూర్వం రోజులలో కొందరు సాహితీ తాపసులు పెన్నును బుగ్గకు పెట్టుకుని, నుదుటిని నింగి వంక ఎత్తి పెట్టి ఫొటో దిగి, పుస్తకం వెనుక వేసుకోవడం వల్ల వారు రచయితలని, కవులని నమ్మాల్సి వచ్చేది. మరికొందరు టెలిఫోన్ రిసీవర్ను చెవి దగ్గర పెటుకొన్న ఫొటోను పుస్తకం వెనుక వేయడం వల్ల అమ్మో వీరు రచయితలేస్మీ అనుకోకుండా ఉండలేకపోయేవారం. ‘మానవతా... ఎక్కడమ్మా నీ చిరునామా?’ అని గూగుల్ మేప్స్ లేని కాలంలో ఎవరు పై అడ్రస్ అడుగుతూ కవిత్వం రాసినా వారు కవులు కాకుండాపోలేదు. ఇక ఏ కాలంలో అయినా ఎల్.ఎస్.వి.శేషాచలం, మునవర్తి సుబ్రహ్మణ్యం, విక్టర్ మనోహర్, ప్రొఫెసర్ చారులత వంటి ప్రముఖ విమర్శకులు ఉంటారు కనుక వారు ముందు మాట రాసి వదిలారంటే– ఎందుకొచ్చిన గొడవ అని నోరు మెదపక అట్టి రచయితలను రచయితలే అనుకోవడమూ కద్దు. ఏదేని ఒక శాఖ కలిగిన రాష్ట్రమంత్రితో, ఏదేని ప్రాదేశిక ఇన్ కమ్టాక్సు కమిషనర్తో, లేదంటే స్థానిక వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్తో... ఈ ముగ్గురితో కాని కనీసం వీరిలో ఇద్దరితో కాని ఫొటోలు దిగి, ఫేస్బుక్లో పెట్టి, ఇక మమ్మల్ని సాహిత్యకారులం కాదు అనంటే తంతాం అనేవారు ఉన్నారంటే నోరు నొక్కుకోవాల్సిన పని లేదు. జీవితంలో అక్షరమ్ముక్క రాయకపోయినా రాసే వాళ్లందరి ఫోన్ నంబర్లు కలిగి ఉండటమే కాదు వారికి కాల్ చేసి ‘ఏవోయ్ ఎలా ఉన్నావ్’ అనిగానీ, ‘నమస్కారమండీ... టిఫినయ్యిందా’ అనిగానీ అడగ్గలిగే చనువు ఉన్నందుకు కనీసం డజను మంది తెలుగునాట ప్రముఖ సాహిత్యకారులుగా చలామణి అవుతున్నారంటే గుండె పొంగే సంగతి. ‘శుంఠల్లారా... ఇదా మీ ప్రతాపమూ... నన్ను గనక కళ్లకు గంతలు గట్టి ఢిల్లీలో ఏమూల వదిలినా నేరుగా సాహిత్య అకాడెమీ ఆఫీసుకు చేరుకోగలను’ అనేవారి ప్రదక్షిణ పటిమ వారికి ఇస్తున్న అతిశయం అంతా ఇంతా కాదు. ‘అడుగడుగున నుడి ఉంది’, ‘అక్షర రశ్మీ జయతు’, ‘మనమంతా కలం కులం’... వాట్సప్ గ్రూప్లను స్థాపించి, ఒక దానిలో నూట పదహారుకు తక్కువ కాకుండా సభ్యులను చేసి, అడ్మిన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఏకైక హోదా వల్ల సాహిత్య దశా దిశను నిర్దేశించాలని కన్నీళ్లతో తపన పడేవారెందరో మన హృదయాలను చెమ్మగిల్ల చేస్తున్నారు. ఈ యొక్క వాట్సప్ గ్రూప్లలో ప్రతి ఒక్క కవిత, వ్యాఖ్యకు మరువక లైక్ కొట్టేవారిని దృష్టిలోకి తీసుకుని మాసాంతంలో వారికో అవార్డు బహూకరించడం మరో విశిష్ట ప్రోత్సాహక ప్రోత్సహితం. జూమ్లో స్లాట్ బుక్ చేసి, కార్డు డిజైన్ చేయగల వనరులు కలిగినవారు వారానికి పది మందిని సాహితీ సమాలోచనంలో ముమ్మరం చేయడం చూస్తే ఏమిచ్చి వీరి రుణం తీర్చుకోగలం అనిపిస్తుంది. గుర్తు తెలియని విదేశాలకు వెళ్లి స్థానిక గాంధీనగర్ అసోసియేషన్ స్థాయి సాహితీ సమ్మేళనంలో పాల్గొని రుజువు పత్రంతోనూ, తెల్లవాళ్లతోనూ ఫొటోలు దిగి బెదురు, బెరుకు పుట్టించే వారిది స్వీయ విమానచార్జీలు భరించగలిగే స్థాయి. సాహిత్యం అంటే అందరికీ ఇష్టం. పాఠకులుగా ఉత్తమ సాహిత్యాన్ని ఇష్టపడేవారూ సృజన కారులుగా ఉత్తమ సాహిత్యసృష్టికి పెనుగులాడేవారూ ఎప్పుడూ ఉంటారు. ఈ ఇద్దరూ ప్రతి ప్రాంతంలో, భాషలో, దేశంలో తమ తమ సాహిత్యాన్ని గౌరవ భంగం కలగకుండా కాపాడుకుంటూ వస్తారు. అలాగే ప్రతి సందర్భంలో, ప్రతి సన్నివేశంలో ఈ సాహిత్యంలో భాగం కావాలని నిజాయితీగా అభిలషించేవారూ ఉంటారు.వీరి ప్రయత్న శుద్ధి, సృజన సామర్థ్యం, విడదీయలేని స్వభావం ఇవ్వవలసిన గుర్తింపు ఇస్తూనే ఉంటాయి. వీరు కాక ఔత్సాహిక పాఠకులు, ఔత్సాహిక సాహితీ సేవకులూ ఉంటారు. వీరు తమను తాము సాహితీకారులుగా భావించుకుని కార్యాచరణలో దిగడమూ, సాహిత్యానికి ప్రతినిధులుగా మారడం నేటి సోషల్ మీడియా కాలంలో విస్తృతమైంది. సాహిత్యం ఇచ్చే గుర్తింపు ఆనందాన్ని, ఆత్మసంతృప్తిని కలిగించడమేగాక ఏదో ఒక ఊతం దొరికింది కదా అనుకునేలా చేయడం ఇందుకు కారణం. ఇవన్నీ ఉండాల్సినవే. ఉండతగ్గవే. కాకుంటే శ్రుతి మించి అసలు కొంత, కొసరు మరింతగా మారడం నేటి దుఃస్థితి. వాస్తవానికి రెండు రాష్ట్రాలలోని చిన్న ఊళ్లలో ఉంటూ మంచి కవిత్వాన్ని, కథను రాస్తున్న యువతరం ఎందరో ఉన్నారు. అలాగే ఏళ్లకేళ్లు తమ మానాన తాము రాసుకుంటూ పాఠకుల గౌరవం పొందినవారూ ఉన్నారు. వీరంతా పి.ఆర్. చేయకపోవచ్చు. తమను తాము ముందుకు నెట్టుకోకపోవచ్చు. అంతమాత్రాన రాష్ట్ర, జాతీయస్థాయి వేదికల మీద వీరు కనపడాల్సిన పనిలేదు అనుకోరాదు. అదే సమయంలో పరిచయ సామర్థ్యమే సాహితీ సామర్థ్యంగా చెల్లుబాటయ్యే వారు అట్టి వేదికల మీద పదే పదే సాహితీ ముఖాలుగా కనిపించడాన్నీ ఉపేక్షించాల్సిన పని లేదు. ‘సత్యముతో పని ఏల, మిడియోకర్లతో కలిసి నడిచి ప్రయోజనాలు పొందితే పోలా’ అనుకునే నిజ సాహితీకారులదీ ఈ దోషం. కళ్లు మూత. ఏమైనా మాట్లాడే సందర్భం వస్తుంది. అభినయ సాహిత్యకారులూ కొంచెం నెమ్మదించండి! -
సంజీవని కావాలి!
మనం మనుషులం, మర్త్యులం. పుట్టిన ప్రతి మనిషికీ మరణం తప్పదు. మరణించిన మనుషులు తిరిగి బతికిన ఉదంతాలు అరుదుగా వార్తల్లో కనిపిస్తుంటాయి. చితి మీద నుంచి లేదా శవపేటిక నుంచి అలా బతికి లేచిన వాళ్లు కూడా ఏదో ఒకరోజు మరణిస్తారు. ‘జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ/ తస్మాద పరిహార్యేర్థే న/ త్వం శోచితు మర్హసి’ అని భగవద్గీతలో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పాడు. పుట్టిన వారికి మరణం తప్పదని, మరణించిన వారు తిరిగి పుట్టక తప్పదని, ఇదంతా ఒక చక్రమని చాలా మతాలు నమ్ముతాయి. ఈ నమ్మకంలోని నిజానిజాలు ఆ భగవంతుడికే ఎరుక! ఇది ఇంతవరకు శాస్త్రీయంగా రుజువు కాలేదు. నమ్మకాలకు రుజువులతో పనిలేదు. నమ్మకాలను కలిగి ఉండటం ప్రజల హక్కు గనుక జనన మరణ చక్రంపై నమ్మకాన్ని అలా విడిచిపెడదాం. మన పురాణాల్లో మరణించిన వారిని బతికించిన ఉదంతాలు ఉన్నాయి. అసురగురుడు శుక్రాచార్యుడి వద్ద మృతసంజీవని విద్య ఉండేదట! ఆ విద్యతోనే దేవతలతో జరిగిన యుద్ధాల్లో మరణించిన దానవులందరినీ ఆయన మళ్లీ బతికించేసేవాడట! అప్పట్లో దేవతల వద్ద ఈ విద్య ఉండేది కాదు. ఆ తర్వాత క్షీరసాగర మథనంలో పుట్టిన అమృతం తాగిన తర్వాతనే దేవతలు అమర్త్యులుగా మారారు. క్షీరసాగర మథనానికి ముందు ప్రమాద నివారణ చర్యల్లో భాగంగా దేవగురువు బృహస్పతి మృతసంజీవని విద్యను శుక్రుని వద్ద నేర్చుకోవడానికి స్వయంగా తన కొడుకు కచుడిని పంపించాడు. శుక్రాచార్యుడి ఆశ్రమంలో కచుడి ప్రవేశం ముక్కోణపు ప్రేమ గాథకు దారితీసింది. అదంతా వేరే కథ! త్రేతాయుగం నాటి రామాయణంలో కూడా మృతులను బతికించిన సందర్భం కనిపిస్తుంది. అప్పట్లో ఈ విద్య వానర వైద్యుడు సుషేణుడికి తెలుసు. రామ రావణ యుద్ధంలో ఇంద్రజిత్తు బాణం దెబ్బకు లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు సుషేణుడి సలహాపై హనుమంతుడు సంజీవని మూలిక దొరికే సుమేరు పర్వతానికి వెళ్లి, మూలికను గుర్తించలేక ఏకంగా పర్వతాన్ని పెకలించుకొచ్చాడు. సుషేణుడు సంజీవని మూలికతో లక్ష్మణుడు తెప్పరిల్లేలా చేశాడు. అప్పటి వరకు యుద్ధంలో మరణించిన వానరులను తిరిగి బతికించాడు. ఇదంతా రామాయణ కథనం. ద్వాపర యుగం నాటికి మరణించినవాళ్లను తిరిగి బతికించే విద్య అంతరించిందేమో! కురుక్షేత్ర యుద్ధంలో మరణించిన వాళ్లెవరూ తిరిగి బతికిన దాఖలాలు కనిపించవు. ఆధునిక కాలంలో మనమేం చేస్తున్నామంటే, భూమ్మీద సృష్టి మొదలైనది లగాయతు ఇప్పటి వరకు ఏమేమి అంతరించిపోయాయో లెక్కలు వేసుకుంటున్నాం. భూమ్మీద జీవసృష్టి మొదలయ్యాక దాదాపు ఐదువందల కోట్ల జీవరాశులు ఉద్భవించాయి. వాటిలో తొంభైతొమ్మిది శాతం అంతరించిపోయాయి. ఇప్పటికి మిగిలిన జీవజాతులు దాదాపు ఎనభై ఏడు లక్షలు మాత్రమే! వీటిలోనూ కొన్ని జీవజాతులు మన కళ్లముందే అంతరించిపోయే పరిస్థితులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమ్మీద అంతరించిపోతున్నవి జీవరాశులు మాత్రమే కాదు. భూమ్మీద పుట్టిన మనుషులు సృష్టించుకున్న ఎన్నో నాగరికతలు, భాషలు అంతరించిపోయాయి. ఆధునికత అభివృద్ధి చెందే క్రమంలో ఎన్నో వస్తువులు, ఎన్నో కళలు కనుమరుగైపోయాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఏడువేల భాషలను శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిలో దాదాపు ఐదువందల వరకు భాషలు పూర్తిగా అంతరించాయి. మనుగడలో ఉన్న భాషల్లోనూ కొన్ని సాహితీప్రక్రియలు కనుమరుగైపోయాయి. కొన్ని భాషలు కొన ఊపిరితో ఉన్నాయి. యునెస్కో రూపొందించిన ‘వరల్డ్ అట్లాస్ ఆఫ్ లాంగ్వే జెస్’ ప్రకారం ప్రస్తుత ప్రపంచంలో సుమారు రెండున్నరవేల భాషలు రానున్న కాలంలో కనుమరుగయ్యే స్థితిలో ఉన్నాయి. ఒక భాష అంతరించిపోతే, ఆ భాషతో ముడిపడి ఉన్న ప్రజల చరిత్ర అంతరించిపోతుంది. ఆ భాషలో నమోదై ఉన్న విలువైన సాహిత్యం, శాస్త్రవిజ్ఞానం; ఆ భాష ప్రజల సంస్కృతి కూడా తుడిచిపెట్టుకుపోతాయి. ఇప్పటికే అంతరించిపోయిన భాషలను ఎటూ కాపాడుకోలేకపోయాం. కనీసం ప్రమాదం అంచుల్లో ఉన్న భాషలనైనా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది. మరణించిన భాషలకు ప్రాణం పోసే మృతసంజీవని విద్య ఏదీ ఇప్పటివరకు లేదు. అయితే, అంతరించిపోయిన కొన్ని అరుదైన జీవరాశులకు తిరిగి ప్రాణం పోయడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. నాలుగు శతాబ్దాల కిందట అంతరించిపోయిన ‘డోడో’ అనే ఎగరలేని పక్షిని జన్యుసాంకేతిక పరిజ్ఞానంతో తిరిగి పుట్టించడానికి అమెరికన్ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. నాణ్యత అరుదైపోతున్న ప్రక్రియల విషయానికి వస్తే – తెలుగు సాహిత్యంలో ఇప్పుడు కొన ఊపిరితో ఉన్న ప్రక్రియ విమర్శ. ఆధునిక తెలుగు సాహిత్యంలో కందుకూరి వీరేశలింగంతో మొదలైన విమర్శ – రాచమల్లు రామచంద్రారెడ్డి నాటికి గొప్ప దశకు చేరుకుంది. కానీ, తర్వాత తర్వాత చప్పబడింది. రచయితలు రాటుదేలడానికి విమర్శకులు చాలా అవసరం. తెలుగు సాహిత్యంలో ప్రస్తుతం రచయితలకు, కవులకు కొదవలేదు గాని, విమర్శకుల లోటు బలంగా ఉంది. కొద్దిమంది విమర్శకులు ఈ ప్రక్రియను బతికించుకుంటూ వస్తున్నారు. అలాగని విమర్శ ప్రక్రియ క్షీణతకు కేవలం విమర్శకులను తప్పుపట్టలేం. విమర్శను తట్టుకునే శక్తి రచయితల్లో కొరవడటం కూడా ఈ పరిస్థితికి కారణం కావచ్చు. విమర్శ కనుమరుగైపోతే, సాహితీ సృజన అంతరించి పోవడానికి ఎంతోకాలం పట్టదు. ఇప్పుడు విమర్శకు పునర్జీవం కల్పించే సంజీవని కావాలి! -
అదిగో అయోధ్య... అల్లదిగో అయోధ్య
రాముడు శ్రీరాముడు సకల గుణాభిరాముడు రాఘవుడు... ఇన్ని నామాంతరాలు ఉన్న ఆ దశరథ రాముడు... ఆ రోజున తెల్లవారుజామునే మేల్కొన్నాడు... సరయూ జలాలలో అభ్యంగన స్నానం ఆచరించాడు... అల్లలాడుతున్న అలకలను సరిచేసుకున్నాడు...సూర్య వంశ చిహ్నంగా నుదుటన రవి తిలకం ధరించాడు రవికులుడు... చల్లని వెన్నెలలు చిలకరించే రాజీవాక్షాలకు నల్లని కాటుక అలదాడు..సీతమ్మకు ఆనవాలుగా పంపిన అంగుళీయకాన్ని వేలికి ధరించాడు... తన పట్టాభిషేక సమయానికి సిద్ధం చేయించిన వస్త్రాలు ధరించాడు.. నాడు భరతుడు సింహాసనం మీద ఉంచి పరిపాలన కొనసాగించిన పాదుకలలో పాదాలుంచాడు... బాల్యంలో చందమామ కావాలి అని మారాము చేసినప్పుడు అద్దంలో చందమామను చూపిన ఆ అద్దంలో ఇప్పుడు ఈ రామచంద్రుడు తన ముఖ బింబాన్ని చూసుకుని... చిరునవ్వులు చిందిస్తూ... గడప దాటి బయటకు అడుగు పెట్టబోతున్నాడు... సరిగ్గా అదే సమయానికి... గుమ్మం ముందర కవి సమూహం లోపలకు వస్తూ కనిపించారు. వారికి వినమ్రపూర్వకంగా నమస్కరించి, లోపలకు ఆహ్వానించి, సముచిత స్థానాలు చూపి, ఆసీనులను చేసి, తాను కూడా గౌరవముద్రలో సింహాసనం అధిరోహించాడు.. అందరూ విశ్రాంతులైన పిదప... ‘వాల్మీకి మహర్షీ! మహానుభావులంతా ఒక్కసారే విచ్చేశారు. కారణం తెలుసుకోవచ్చా’ అని వినమ్రంగా ప్రశ్నించాడు. వాల్మీకి తన గుబురు శ్మశ్రువుల మాటు నుంచి చిన్నగా నవ్వుతూ, ‘ఏమయ్యా! నువ్వు ఇంత తొందరగా ఏదో పని మీద బయలుదేరినట్టున్నావు. విషయం తెలుసుకోవచ్చా’ అన్నాడు ఏమీ ఎరగనట్లు. ‘మహర్షీ! ఏమీ ఎరగనట్లు ప్రశ్నిస్తున్నారు. మీరే కదా నా కథను లవకుశల ద్వారా గానం చేయించి ప్రపంచానికి పరిచయం చేసింది. నాకు ఎంతటి మంచి లక్షణాలు ఉండాలో కూడా మీరే నిర్దేశించారు కదా. అటువంటి మీకు నేను ఎప్పుడు, ఎక్కడకు వెళ్తానో తెలియదా. నా నోటితో చెప్పించాలనే ఆలోచన కాకపోతేను’ అన్నాడు వాల్మీకి మహర్షితో చనువుగా. ‘నాకు తెలుసు రామా! నీ వినయం, విధేయత, గౌరవం... అన్నీ. ఈ రోజు ఇక్కడకు వచ్చినవారిని గమనించావా. వీరంతా నీ కథను ఇన్ని వేల సంవత్సరలుగా సజీవంగా ఉంచిన మహానుభావులు. నేను రాసిన కథను యథాతథంగా ఉంచకుండా, వారికి తోచిన కల్పనలు కూడా చేశారు. వీరందరికీ నువ్వంటే ప్రీతి. అందుకే వారి మనసుకి నచ్చిన విధంగా నిన్ను కీర్తించారు. నిన్ను నెత్తిన పెట్టుకుని నేటికీ ‘రామాయణం’ అనే కావ్యాన్ని ‘రామ’ అనే తారక మంత్రాన్ని ఇంకా పచ్చిగా, లేతగా, తడి ఆరకుండా ఉంచారు... అని వాల్మీకి పారవశ్యంతో పలుకుతుంటే, రాముని శరీరం పులకించిపోయింది. రామా! నీకు ఒక్కొక్కరినీ మరోసారి పరిచయం చేస్తాను. ఇప్పుడు నువ్వు బయటకు వెళ్లే సంతోషంలో ఉన్నావు. అందువల్ల నేను పరిచయం చేస్తేనే కాని వారిని నువ్వు జ్ఞప్తికి తెచ్చుకోలేవు.... అంటూ పండిత పరిషత్తు వైపునకు తల పరికించాడు. ఇదిగో మొట్టమొదటగా చెప్పవలసిన వ్యక్తి కాళిదాసు. ఈయన కవికుల గురువు. నీ గొప్పదనాన్ని ‘రఘువంశం’ అనే కావ్యంగా వెలయించాడు. మీ కుటుంబాన్ని ఎంత గొప్పగా ప్రస్తుతించాడో తెలుసా. ఆ కవిత్వమంతా ఇప్పుడు చెప్పనులే. రేఖామాత్రంగానే పరిచయం చేస్తాను. ఇక ఆ పక్కన కూర్చున్న కవి భవభూతి. ఉత్తర రామ చరిత రచించి అందరి కంట నీరు పెట్టించాడు. ఆ పక్కనే ఉన్న భాసుడు ‘ప్రతిమ’ అనే నాటకాన్ని రచించాడు. ఆయనకు నా రామాయణంలోని కొన్ని విషయాలు నచ్చలేదు. అందుకని ఆయన కొన్ని కల్పనలు చేశాడు.కైకేయి దుర్బుద్ధికాని, లక్ష్మణుడు అవాచ్యకాలు పలకలడం కాని ఇందులో కనపడదు. దశరథ ప్రతిమా కల్పనం, దశరథ శ్రాద్ధ కలనం వంటి కొన్ని అంశాలు ఇందులోని కొత్త విషయాలు. అర్థమైందా ఈ కవి విలక్షణత. ఆయనకు కైకమ్మను నిందించాలనిపించలేదు. సరే – ఇంక ఆ పక్కన చూడు... మురారి. ఆయనకు నా పేరు కూడా చేరింది. బాల వాల్మీకి అని పిలుస్తారు. ఎన్నో గురుకుల క్లేశాలు అనుభవించి, చివరకు కవికులంలో స్థానం సంపాదించాడు. ఆ మహానుభావుడు.. నీ తండ్రి దశరథుడిని ఎంత గొప్పగా ప్రశంసించాడో తెలుసా. ఆయనట ఏకంగా దిక్పాలకులను తన ఇంటి ముంగిట్లో బంధించేశాడు. అంటే వారికి పని లేకుండా నీ తండ్రి గారే ముల్లోకాలను సుభిక్షంగా పరిపాలించాడట. అబ్బో ఈ కవి గురించి ఎంత చెప్పినా చాలదు. ఆయన మార్గమే వేరు. నీకు ముందు ముందు ఇటువంటి మార్గంలో వెళ్లిన మరో ఇద్దరిని గురించి చెబుతానులే. ఇక తెలుగు కవులలోకి వస్తే... అబ్బో... బోలెడు మంది.. తెలుగులో ఆది కావ్యం రచించిన నన్నయ మొదలుగా నిన్నమొన్నటి ఉషశ్రీ వరకు ఎంత మంది ఎంత అందంగా నీ కావ్యాన్న రచించారో. కవిత్రయంలో మొదటివాడైన నన్నయభట్టు మహానుభావుడు భారత ఆంధ్రీకరణేకాకుండా నీ కథను ‘రాఘవాభ్యుదయం’ పేరిట తెలుగువారికి అందించాడు. ఆ కవిత్రయంలో రెండవ వాడైన తిక్కన ‘నిర్వచనోత్తర రామాయణం’ పేరున తొట్టతొలి ప్రబంధ కావ్యాన్ని, ఒక్క వచనం కూడా లేకుండా పూర్తి పద్యంలో రచించాడు. కవిత్రయంలో మూడవ వాడైన ఎరన్ర కూడా రామాయణం కావ్యాన్ని రచించాడు. ఇక మంత్రి భాస్కరుడు ‘భాస్కర రామాయణం’, కుమ్మరి మొల్ల ‘మొల్ల రామాయణం’, గోన బుద్ధారెడ్డి ‘రంగనాథ రామాయణం’ రచించారు. వారంతా నీ పట్ల ప్రేమానురాగాలను కురిపిస్తున్న కన్నులతో ఎంత భక్తిగా కూర్చున్నారో చూడు. ఇక వీరందరిదీ ఒక ఎత్తయితే... ఆ మురారిలాగే నిరంకుశుడైన కవి ‘కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ’. ఆ మహానుభావుడు నీ క్రీగంటి చూపు కోసం చూస్తున్నాడు. అటు వైపుగా ఒక్కసారి నీ తల త్రిప్పు. ఈయన నీ కథను ‘రామాయణ కల్పవక్షం’ పేరున రచించి, తెలుగులో మొట్టమొదటి జ్ఞానపీఠ సత్కారాన్ని అందుకున్నాడు. ఇంకా ఎన్నో సత్కారాలు ఉన్నాయిలే. నిన్ను తనకు కావలసిన విధంగా ప్రస్తుతించుకున్నాడు. ఇక ఈ సభకు హాజరైన చివరివాడు ‘ఉషశ్రీ’. మురారి పంథాలో విశ్వనాథ కావ్యరచన చేస్తే, ఆ విశ్వనాథ చేత ‘ఇది ఉషశ్రీ మార్గము’ అనిపించుకుని, నిన్ను నెత్తిన పెట్టుకుని ఊరేగాడు. వాడు త్యాగ్య వాగ్గేయకారుడైతే, వీడు వాక్కావ్యకారుడు. తన నోటితో నీ కథను అందంగా చెబుతూ, తన కలంతో కూడా అంతే అందంగా నిన్ను ప్రస్తుతించాడు. ఇంతమంది కవులు నీ కోసం నిరీక్షిస్తుంటే... నువ్వు నీ బాల రామ ప్రతిష్ఠ కోసం పరుగులు తీయడం న్యాయమేనా. అందుకే నిన్ను లోపలకు పిలిచాను. వీరందరికీ నీ తియ్యని ఆశీర్వచనాలు కావాలి.. అంటూ వాల్మీకి పలుకుతుంటే... మరో నలుగురు పరుగుపరుగున లోపలకు ప్రవేశించారు. వారిలో ప్రథముడు కంచర్ల గోపన్న... అయ్యా! వాల్మీకి మహర్షీ! నన్ను మరచిపోతే ఎలాగయ్యా.. అంటూ పాదాల మీద వాలాడు. వాల్మీకి ఆ గోపన్నను దగ్గరగా తీసుకుని, ‘రామభద్రా! వీడు నీ కోసం భద్రాద్రిలో ఆలయం నిర్మించాడు. నీ పేరున కీర్తనలు రచించి, గోపన్న నామాన్ని రామదాసుగా మార్చుకున్నాడు. నీ కోసం కారాగారం పాలయ్యాడు. ఎన్నో దెబ్బలు తిన్నాడు. అయితేనేం, నీ గురించి ఎన్నో మంచి మంచి కీర్తనలు రచించాడు... అంటుంటే, రామదాసు శ్రీరాముని పాదాల ముందు సాష్టాంగపడ్డాడు. ఇదిగో ఈ మహానుభావుడిని చూడు. ఈయన త్యాగయ్య. నీ మీద ఎన్ని కీర్తనలు రచించాడు. ‘మా జానకి చెట్టపట్టగా మహరాజువైతివి’ అని ఆ తల్లి సీతమ్మను తన గుండెల్లో పొదివిపట్టుకున్నాడు.. అని త్యాగయ్య గురించి పలుకుతుంటే, ఆ మహానుభావుడు తన చేతిలోని తంబురను శ్రీరాముని చేతికిచ్చాడు. ఆ రాముడు తన విల్లును పక్కన పెట్టి, తంబురనే విల్లుగా ధరించాడు. అంతే ఆ దశ్యం చూసిన కొంటె బొమ్మల బాపు... గబగబ అయిదు నిమిషాలలో కవుల కొలువును, తంబుర రాముడిని తన రేఖలలో నింపేశాడు. ఆ పక్కన ముసిముసి నవ్వులతో బాపుని అంటిపెట్టుకున్న ముళ్లపూడి రమణ.. శ్రీరామా! ఓ ఫైవ్ లెటర్స్ అప్పు ఇస్తావా నిన్ను పొగడటానికి... అంటూ ఆయన పాదాల ముందు మోకరిల్లాడు. ఈసారి రాముడు కాదు, వాల్మీకి పరవశించిపోయాడు. నేను 24 వేల శ్లోకాలతో రామకథను కొన్ని వేల సంవత్సరాల క్రితం రచిస్తే, నేటికీ నా రాముడిని అందరూ అక్షరాలలో బంధిస్తూనే ఉన్నారు. ‘రామా! ఇది నా గొప్పతనం కాదు. ఇది నీ గొప్పదనం. నీ వ్యక్తిత్వ ఔన్నత్యం. నీ తండ్రి దశరథుడు నేర్పిన సంస్కారం గొప్పదనం.మా జన్మలు ధన్యమయ్యాయయ్యా. ఇక నువ్వు నీ బాల విగ్రహ ప్రతిష్ఠ చూడటానికి బయలుదేరు. మేమంతా నీ వెంట వస్తాం. అక్కడ అయోధ్యలో ‘రామాయ రామభద్రాయ రాచంద్రాయ వేధసే’ అంటూ రామాయణ గాథ ఉషశ్రీ గళం వినిపిస్తున్నారట. ‘మన ఉషశ్రీ ధన్యుడయ్యాడు. నీ ఎదుట గళం వినిపించే అదృష్టం అతడిని మాత్రమే వరించింది. అతడి మాటలలోనే నా ఉపన్యాసం ముగిస్తాను. స్వస్తి’ అంటూ వాల్మీకి ముగింపు పలికాడు. అందరూ నెమ్మదిగా అయోధ్య వైపుగా బయలుదేరబోతున్నారు. చకచక అడుగులు వేస్తూ ఉషశ్రీ వేగంగా వెళ్లడం గమనించిన రాముడు, ‘మహర్షీ! మనం కూడా బయలుదేరాలయ్యా. వాడు కాలాంతకుడు. సమయ పాలన వాడి ఆత్మ. నా బాలరామ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు కదా. ఆ వ్యాఖ్యానం వీడి గళం నుంచే వెలువడబోతోంది. వాడితో పాటు వాడికి ‘ప్రత్యక్ష వ్యాఖ్యానం ఇలా ఉండాలి’ అని మార్గదర్శనం చేసిన జమ్మలమడక మాధవరామ శర్మ కూడా ఈ పాటికి అక్కడికి చేరి ఉంటాడు. వేగంగా పదండి’ అని పలికాడు. అదిగో అయోధ్య. అదిగో రాముడు. అదిగో మన కవిపండితులు. అదిగో మన తెలుగువారు. జై శ్రీరామ్... (జనవరి 22, 2024 సోమవారం నాడు బాలరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా సృజన రచన. - డా. పురాణపండ వైజయంతి) -
రెండో గొంతు
మనదైనది ఏదో వ్యక్తం చేయడానికి మనదైన భాష ఒకటి ఉండాలనుకుంటాం. కానీ భాష చిత్రమైంది. ఒక్కోసారి అనుకున్న మాట వెంటనే తట్టదు. ఇంకో సందర్భంలో ఆ ఒక్కమాటకు పది మాటలు కనబడి గందరగోళ పరుస్తాయి. రెండు సందర్భాల్లోనూ మనిషి మూగ కావడం గమనార్హం. ఇదంతా భాష సమస్య కాదేమో; మన లోపలి భావానికి అనుగుణంగా భాష మనల్ని ఇలా ఒంటరిగా మాట తోడులేకుండా నిలబెట్టే స్థితిని కల్పిస్తుందేమో! భావం అనేది చాలా సంక్లిష్టమైంది కదా మరి! దాన్ని భాషలోకి తేవాలని అనుకున్నప్పుడు, ఎంతో తెలుసు అనుకున్నది కూడా, ఏ కొసను అందుకోవాలో తెలియక తికమక పరుస్తుంది. ఒక తేనెతుట్టె ఏదో లోపల కదిలినట్టయి గందరగోళం తలెత్తుతుంది. అనుకున్న వ్యక్తీకరణ గాడి తప్పుతుంది. భావాన్ని వ్యక్తపరచడానికి ఏ భాష అయితే కావాలో అదే అవరోధంగా మారడం తమాషా కదా! మరి దానికేమిటి దారి? సంజ్ఞలైతే పనికిరావు. కాబట్టి మళ్లీ భాషే దిక్కు. పోనీ, ఇంకేదో భాష అయితే? అందులో మనకు అంతగా ప్రవేశం లేనిదైతే? ఒక్కోమాటా వాక్యంగా పేర్చుకునేదైతే? నిజంగా అలా రాయడం సాధ్యమా? ప్రపంచ సాహిత్యంలో పేరెన్నికగన్న కొందరు రచయితలు ‘తమది కాని’ భాషలో సాహిత్యం సృజించారు. 1978లో బేస్బాల్ గేమ్ చూస్తున్నప్పుడు, ఆటగాడు బంతిని బలంగా కొట్టిన బ్యాట్ శబ్దం టోక్యో శివార్లలోని ‘జింగు’ స్టేడియం మొత్తం ప్రతిధ్వనించిన ఒకానొక క్షణాన ఇరవైల్లో ఉన్న హరూకీ మురకామీకి ఉన్నట్టుండి తానూ రాయగలనని అనిపించింది. ఆ క్షణం ఆయనలో ఏదో ఎల్లలు లేని సృజనావేశం తన్నుకొచ్చింది. దాన్ని అలాగే పోనీయకుండా కొన్ని నెలలు శ్రమించి, రాత్రుళ్లు కుస్తీపట్టి జపనీస్ భాషలో మొదటి నవల రాయడానికి ప్రయత్నించాడు. అంతా అయ్యాక చదివితే ఆయనకే నచ్చలేదు. దీనికి కారణం – తన మాతృభాషలో ‘పశువుల కొట్టంలో పశువులు క్రిక్కిరిసినట్టుగా’ ఆలోచనలు రొద పెట్టడమే! దీనివల్ల ఉక్కిరిబిక్కిరికి లోనయ్యాడు. ‘ఒకరి భావాలను అలవోకగా ఒక క్రమంలో పెట్టడం గురించి మాట్లాడటం సులభమేగానీ, అలా చేయడం అంత సులభం కాదు. బొత్తిగా అప్పుడే రాయడం మొదలుపెట్టిన నా లాంటివాడికి అది మరింత కష్టం. కొత్తగా మళ్లీ ప్రారంభించడానికి, నేను చేయాల్సివచ్చిన మొదటి పని నా రాతప్రతుల కుప్పనూ, ఫౌంటెన్ పెన్ నూ వదిలించుకోవడం! అవి నా ముందు ఉన్నంతసేపూ నేనేదో ‘సాహిత్యం’ లాంటిదాన్ని రాస్తున్నట్టనిపించింది. వాటి స్థానంలోకి నా పాత అలవెటీ టైప్రైటర్ను అల్మారా లోంచి తెచ్చాను. తర్వాత, ఒక ప్రయోగం లాగా, నా నవల ప్రారంభాన్ని ఇంగ్లీష్లో రాయాలని నిర్ణయించుకున్నాను. ఎటూ ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనుకున్నప్పుడు ఇలా ఎందుకు చేయకూడదనిపించింది?’ అంటూ మురకామీ తాను తన జపనీస్ను కాదని ఆంగ్లంలో రాయడానికి పూనుకోవాల్సి వచ్చిన నేపథ్యం చెబుతాడు. అయితే, ఆంగ్లం ఆయనకేమీ మంచినీళ్ల ప్రాయం కాదు. ఈ భాష పరిమితి వల్ల సంక్లిష్ట వాక్యాలు రాయడం కుదరదు. ఆ ఉన్న కొద్దిపాటి పదసంపద, వ్యాకరణాలనే ప్రతిభావంతంగా ఉపయోగించుకోవాలి. ‘మై కిచెన్ టేబుల్ ఫిక్షన్ ’ ధోరణిగా వర్ణించే ఆయన రచనలు అలా మొదలయ్యాయి. ఈ ధోరణిలో వచ్చిన ‘హియర్ ద విండ్ సింగ్’ నవలిక మురకామీని అమాంతం పైకి ఎత్తేసింది. కృత్యాదిలోనే మురకామీ అవస్థ పడ్డాడు. కానీ ఝుంపా లాహిరిది ఇంకో కథ. లండన్ లో పుట్టి, అమెరికాలో పెరిగిన భారత(బాంగ్లా) సంతతి ఝుంపా ‘ఇంటర్ప్రిటర్ ఆఫ్ మాలడీస్’ నవలకు ‘పులిట్జర్’ గెలుచుకుంది. ‘నేమ్సేక్’తో మరింత పేరొచ్చింది. ఉన్నట్టుండి తన నలభై ఐదేళ్ల వయసులో ఇటాలియన్ లో రాయాలని నిర్ణయించుకుంది. కొత్త భాషలో రాయడంలో ఒక స్వేచ్ఛ ఉంది అంటారామె. ‘పర్ఫెక్టుగా ఉండనక్కరలేని స్వేచ్ఛ’. న్యూయార్క్లో కొన్ని ఇటాలియన్ పాఠాలు విన్న అనుభవం ఉంది. కానీ ఆ భాష కోసమే 2015లో ఆమె కుటుంబంతో సహా రోమ్కు వెళ్లి, కొన్నేళ్లు ఉండివచ్చింది. తర్వాత మూడు పుస్తకాలు ఇటాలియన్ లో వెలువరించింది. తర్వాత అవి ఆంగ్లంలోకి వచ్చాయి. సహజంగానే ఇటాలియన్ లో రాయడమేంటని చాలామందే ఆమెను ప్రశ్నించారు. ఒక్కొక్క పదం, వాక్యం ద్వారా వ్యక్తీకరణను కూడగట్టుకొని కొత్త లోకపు ద్వారంలోకి ప్రవేశించినట్టుగా అనుభూతి చెందానంటుంది. పాత, కొత్త ప్రపంచాల మధ్య అదొక సవాలు కూడా! ‘ఇటాలియన్ భాష నా జీవితాన్నేమీ మార్చలేదు; అది నాకు రెండో జీవితాన్ని ఇచ్చింది; మరో అదనపు జీవితం’. తన అసంబద్ధ రచన ‘వెయిటింగ్ ఫర్ గోడో’ ద్వారా ఖ్యాతినొందిన శామ్యూల్ బెకెట్ పుట్టుకతో ఐరిష్వాడు అయినప్పటికీ ఫ్రెంచ్ను తన రచనాభాషగా ఎంచుకున్నాడు. దానికి ఆయన చెప్పిన కారణాలు సాధారణంగా రచయితలు కోరుకునే లక్షణాలకు పూర్తి విరుద్ధమైనవి. తన మాతృభాషకు దూరం కావడం అనేది, ఒక ముసుగును చించుకోవడంతో సమానంగా చూశాడు. ఫ్రెంచ్లో (పరాయి భాష) మాత్రమే ఒక శైలి లేకుండా రాయడం సాధ్యమవుతుందన్నాడు. అలాగైతేనే తనకు తగిన వనరులు లేకుండా పోతాయన్నాడు. అందువల్లేనేమో, ఆయన ప్రసిద్ధ ‘మినిమలిస్ట్’ రచయిత కాగలిగాడు. వేర్వేరు కారణాల వల్ల తమ మాతృభాషలకు దూరమైన రచయితలు ఎందరో ఉన్నారు. పరిస్థితులు వారికి అలాంటి పరీక్ష పెట్టాయి. ఆ వేదన ఇక్కడ అప్రస్తుతం. కానీ భాష అనేదాన్ని ఒక అవరోధంగా పెట్టుకుని రాయాలనుకోవడం దానికదే ఒక సవాలు. ప్రాణవాయువును మరీ ఎక్కువగా పీల్చకుండా పొదుపుగా వాడుకుంటూ బతికే యోగసాధన లాంటిది అది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement