-
ఎంత చేయాలో అంత చేశారు!
జరుగుబాటున్న కుటుంబంలో పుట్టిన కేతు విశ్వనాథ రెడ్డి కడుపు నిండినవాళ్ళ కోసం రాయలేదు. కడుపు కాలినవాళ్ళ కోసం రాశారు. రాయలసీమను పట్టి పీడిస్తున్న రెండు సమస్యలు – కరువు, ముఠాతత్వం గురించి అత్యుత్తమ కథలు రాశారు. స్త్రీ పట్లగల మానవీయ దృష్టికి కూడా ఆయన కథలు నిదర్శనాలు. అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులుగా పనిచేశారు. కొడవటిగంటి కుటుంబరావు సాహిత్యాన్ని సంపుటాలుగా వింగడించి పెద్ద చలనం తీసుకొచ్చారు. సామాజిక శాస్త్రాల సహాయంతో సాహిత్యాన్ని అధ్యయనం చేయవలసిన తీరును అనేక వ్యాసాలలో స్పష్టం చేశారు. విరుద్ధ భావజాలం గలవారిపట్ల కూడా గౌరవంగా మాట్లాడేవారు. ఒకరు ఉపయోగకరమైన పని చేస్తే, ఆ కృషి కొనసాగింపునకు ప్రోత్సహించే సంస్కారి. ‘మానవతావాదులు కాని వారెవరూ కమ్యూనిస్టులు కాలేరు’ అన్నారు శ్రీశ్రీ ఒక ఇంటర్వ్యూలో. కులం, మతం, జెండర్, ప్రాంతం వంటివాటితో సంబంధం లేకుండా మనుషులను ప్రేమించడమే మానవవాదం. ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి (10 జూలై 1939– 22 మే 2023) అలాంటి మానవ వాది, మానవతావాది. లేకుంటే ‘అమ్మవారి నవ్వు’ అనే మంచికథ రాసేవారు కాదు. ‘బోధి’, ‘వేర్లు’ నవలికలు రాసేవారు కాదు. ‘శశిశ్రీ’, రహమతుల్లా, షేక్ హుస్సేన్ సత్యాగ్ని లాంటి ముస్లిం రచయితలను, హయాత్ అనే ఆచార్యుని సోదరులుగా గౌరవించేవారు కాదు. విశ్వనాథరెడ్డి వ్యవసాయక కుటుంబం నుండి వచ్చారు. బాగా జరుగుబాటున్న కుటుంబంలో పుట్టిన ఆయన కడుపు నిండిన వాళ్ళ కోసం రాయలేదు. కడుపు కాలిన వాళ్ళకోసం రాశారు. అదే ఆయన మానవత్వం. మానవతావాది కనుకనే, రాయలసీమను పట్టి పీడిస్తున్న రెండు సమస్యలు – కరువు, ముఠాతత్వం గురించి ‘జప్తు’, ‘విరూపం’, ‘సానుభూతి’ లాంటి అత్యుత్తమ కథలు రాశారు. ఆయన ఆకాంక్ష , ఆయన స్వప్నం కరువు, కక్షలు లేని రాయలసీమ. ఆయన బంధువర్గం ఫ్యాక్షన్ గొడవల్లో పడి నలిగిపోవడం చూశారు. ఫ్యాక్షన్ వల్ల ఇతర ప్రాంతాల దృష్టిలో రాయలసీమ గౌరవం దెబ్బతింటున్నదని గ్రహించి ‘వెనకా ముందు’ కథ రాశారు. ఫ్యాక్షనిస్టులు చివరికి ఒక్కటై, వాళ్ళ కోసం పేదలు బలైపోతున్న అమానుషత్వాన్ని ‘పీర్లసావిడి’ కథలో చిత్రించారు. నేను శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పరిశోధన చేస్తున్న సమయం (1973–1977)లో బహుశా 1975 ప్రాంతంలో విశ్వనాథ రెడ్డి పరిచయమయ్యారు. నన్ను ‘చంద్రా’ అని పిలిచేవారు. వల్లంపాటి వెంకట సుబ్బయ్య ఒకసారి నన్ను తిరుపతిలో కేతు ఇంటికి పిలుచుకొని వెళ్ళారు. ఆ సమయంలో కేతును గురించి వల్లంపాటి నాతో ‘ఈయన పైకి చూడడానికి నవ్వుతూ కనిపిస్తాడు కానీ, పెద్ద రౌడీ’ అన్నారు. అప్పుడు కేతు నవ్వుతూనే ‘చంద్రా! ఆయన మాటలు నమ్మొద్దు’ అన్నారు. అలా మొదలైన మా పరిచయం నిరాఘాటంగా కొనసాగింది. కేతు మార్క్సిస్టు అయినా, మార్క్సిస్టులు కాని చెరుకు పల్లి జమదగ్ని శర్మ, పేరాల భరత శర్మ వంటి సహాధ్యాపకుల గురించి ఉన్నతమైన మాటలు చెప్పేవారు. ఒకరిని చూస్తే ఇంకొకరికి పడని కాలంలో విరుద్ధ భావజాలం గలవారిపట్ల గౌరవంగా మాట్లా డడం నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఒకరు ఉపయోగకరమైన పని చేస్తే, దానిని మెచ్చుకొని, ఆ కృషి కొనసాగింపునకు ప్రోత్సహించే గొప్ప సంస్కారం ఆయనది. ‘నేను చాలా స్లో రైటర్ని’ అని విశ్వనాథరెడ్డి చెప్పుకొన్నారు. సమాజాన్ని దహించి వేస్తున్న రుగ్మతలను సమగ్రంగా మనసులో రూపుకట్టించుకొని రాయడానికి చాలా సమయమే తీసుకొనేవారు. ‘వాన కురిస్తే’ కథలో రైతు పాపయ్య, ఆయన కుటుంబమంతా వానకోసం ఎదురు చూడడంలోనే జీవితాలు గడిచిపోతాయి. కరువు కాలంలో ప్రభుత్వం పేదలకు సరఫరా చేసే గడ్డిని ఆధిపత్య వాదులు పేదలకు అందకుండా తస్కరించే వాస్తవికతను ‘గడ్డి’ కథలో చిత్రించారు. ఈ అమాన వీయతను ‘నా బట్టా! నువ్వు రైతు కొంపల్లోనే పుట్టి నావా? కాపోడి వేనా?’ అని ఒక పేద మహిళ నిలదీస్తుంది. ఇలాంటి మాటలు రాయాలంటే రచయిత ‘అ–కులీక రణ’ (డీక్యాస్టిఫై) అయితే తప్ప సాధ్యం కాదు. అకులీకరణ చెందా లన్నా, అవర్గీకరణ చెందా లన్నా రచయిత హృదయంలోని మానవ త్వమే దారి చూపుతుంది. పులివెందుల కాలువ వస్తు వుగా ఆర్తితో రాసిన ‘పొడినిజం’ కథలో కరువుతో ఎండిపోయి,పంటలు పండని నేలను ఒక విద్యార్థి దృష్టికోణం నుండి ‘అచ్చరాలు తుడిచేసిన పలకలాగా ఉంది’ అనిపిస్తాడు. పంటలు పండించి బతికే రైతులు కరువు వల్ల సారా వ్యాపారులుగా మారి, పోటీలు పడి, ఆఖరికి ఫ్యాక్షనిస్టులుగా మారి ఒకర్నొకరు చంపుకొనే అమానుష దశకు చేరుతున్న వాస్తవమే ‘కూలిన బురుజు’ కథ. భారతీయ సమా జంలో వితంతువులు పీడిత వర్గం. వాళ్ళపట్ల సమాజం ఎంత క్రూరంగా ప్రవర్తిస్తుందో ‘ముఖదర్శనం’ కథలో చిత్రించారు. కేతు విశ్వనాథరెడ్డి రెడ్డి స్త్రీపక్షపాతి. అలా కాని రచయితలు మానవతా వాదులు కారు. ‘తారతమ్యం’, ‘మారి పోయారు’ వంటికథలు ఆయ నకు స్త్రీ పట్లగల మానవీయ దృష్టికి నిదర్శనాలు. ‘ఎందరి దయా దాక్షిణ్యాల మీద ఆడవాళ్ళు బతకాలి?’ అని ‘తారతమ్యం’ కథ ప్రశ్ని స్తుంది. ఈ కథ 1977 నాటిది. అప్పటికి తెలుగు సాహిత్యంలో స్త్రీవాదం పుట్టలేదు. డబ్బు కొంతమంది చేతుల్లో ఉండిపోవడాన్ని వేమన వంటి ప్రాచీన కవులే గుర్తించారు. ఆధునిక కాలంలో మార్క్సిజం నేర్పిన పాఠాలతో ప్రభావితమైన అభ్యుదయ రచయితలు అసమ ఆర్థిక వ్యవస్థ çసృష్టించే వైరుధ్యాలను బలంగా చిత్రించారు. ‘డబ్బు ఈ సంఘంలో అన్నింటినీ శాసిస్తోంది’ అన్న అవగాహన విశ్వనాథరెడ్డిది. ఈ అవగాహనతో ‘చీకటితప్పు’, ‘దాపుడుకోక’, ‘చెదిరిన గుండెలు’ వంటి విలువైన కథలు రాశారు. ‘దాపుడుకోక’ కథలో చెన్నమ్మ పేదరికం మానవత్వం ఉన్నవాళ్ళను కలవరపరుస్తుంది. సంపద ఒకరి చేతిలో ఉండే వ్యవస్థలో పీడితులు కూడా సంపద తమ చేతికి వేస్తే, పీడకులుగా ఎలా మారతారో ‘సొతంత్రం’ కథలో సాయమ్మ పాత్ర ద్వారా చూపించారు. మార్క్సిజం వ్యక్తి గత ఆస్తిని వ్యతిరేకిస్తుంది. ఆ దృష్టి ఈ కథలో కనిపిస్తుంది. ఆయన కథలు చదివితే మన సంస్కారంలో ఒక కదలిక వస్తుంది. వర్తమాన ఆర్థిక రాజకీయ సాంఘిక వ్యవస్థ మీద మనల్ని పునరాలోచింప చేస్తాయి. ప్రజలకు సేవ చేయడానికి ప్రజాధనాన్ని జీతాలుగా ఇచ్చి ఉద్యోగులుగా ప్రభుత్వం నియమిస్తుంది. ఆ ఉద్యో గులు అదనపు ఆదాయం కోసం ప్రజలను పీడించడాన్ని సహించరు అభ్యుదయ రచయితలు. ‘చక్రబంధం’, ‘పద్ధతి’ (విద్యారంగం), ‘అనధికారం’, ‘ఆ రోజుల్లో వస్తే’, ‘సందాకబళం’, ‘అంతర్ముఖం’ (పోలీసు శాఖ), ‘పారు వేట’ (అటవీ శాఖ), ‘దప్పిక’ (రెవెన్యూ), ‘వైరుధ్యం’ (పంచాయతీ రాజ్) వంటి కథల ద్వారా కార్యనిర్వహణ వ్యవస్థలోని అమానుషత్వాలను ప్రతిబింబించారు కేతు. ప్రాంతాల మధ్య వైరుధ్యాలను కూడా ‘తేడా’, ‘ఒక దృశ్యం– మరొక చిత్రం’ వంటి కథల్లో ఆవిష్కరించారు. ‘శిలువ వేసిన మనుషులు’ వంటి కథలలో దళితుల జీవితాల లోని దైన్యాన్ని ప్రతిపాదించారు. పల్లెలు, నగరాలు, భారతదేశం, విదేశాలు – వీటి మధ్య తేడాలను ‘రెండు ప్రపంచాల మధ్య’, ‘దగ్గరైన దూరం– దూరమైన దగ్గర’, ‘అంత్యాక్షరి’ వంటి కథలలో కంటికి కొట్టి నట్లు చిత్రించారు. ఒక్క వాక్యంలో చెప్పాలంటే, కేతు విశ్వనాథరెడ్డి కథలు పొడినిజాల పట్ల తడిగీతాలు! కేతు శాస్త్రీయమైన సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు. ‘కడప ఊర్ల పేర్లు’ అంశం మీద పరిశోధించి, ఓనమాస్టిక్స్ అనే ప్రత్యేక అధ్య యన విభాగానికి పునాది వేశారు. సామాజిక శాస్త్రాల సహాయంతో సాహిత్యాన్ని అధ్యయనం చేయవలసిన తీరును అనేక వ్యాసాలలో స్పష్టం చేశారు. ‘దృష్టి’, ‘సంగమం’, ‘పరిచయం’ వంటి గ్రంథాలు ఆయన విమర్శన గాఢతకు నిదర్శనాలు. సార్వత్రిక విశ్వవిద్యాలయంలో తెలుగు వాచకాల్లో విప్లవం తీసుకొచ్చారు. అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులుగా పనిచేశారు. కొడవటిగంటి కుటుంబరావు సాహిత్యాన్ని సంపుటాలుగా వింగడించి విలువైన సంపాదకీయాలు రాసి పెద్ద చలనం తీసుకొచ్చారు. గొప్ప విద్యావేత్త. దూరవిద్యా విధానం మీద ఆయన చేసిన కృషి ‘భాషాబోధన, విద్య– మార్పులు, ప్రాసంగికత’ అనే పుస్తకంగా వచ్చింది. ‘రాయలసీమ రాగాలు’, ‘చదువుకోలేదు’ వంటి పుస్తకాలకు సంపాదకుడిగా వ్యవహ రించారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారం, అజోవిభొ కందాళై పురస్కారం వంటివి ఆయనకు దక్కాయి. ఒక మధ్య తరగతి మేధావి, ఆధునిక రచయిత తన సమాజానికి ఎంత చేయాలో అంత చేశారు! రాచపాళెం చంద్రశేఖరరెడ్డి వ్యాసకర్త తెలుగు సాహిత్య విమర్శకులు -
ఆయన... కాలం చెల్లని కవి
తెలుగు సమాజంలో జాషువా ప్రాసంగికత కాలం నడుస్తున్న కొలదీ పెరుగుతోంది. ఆయన మరణించి యాభై ఏళ్ళు గడచినా ఆయన కవిత్వం మన సమాజంతో సజీవ సంబంధం కలిగి ఉంది. 1895 సెప్టెంబర్ 28న అంటే 126 ఏళ్ళ క్రితం పుట్టిన జాషువా 1971లో మరణించారు. ఆయన 76 ఏళ్ళు జీవించారు. ఈ జీవిత కాలంలో 1917 నుండి 1966 దాకా విభిన్న రచనలు చేశారు. కొన్ని పౌరాణిక రచనలు మినహాయిస్తే, ఆయన రచించిన సాంఘిక కావ్యాలు ఈనాటికీ తెలుగు సమాజంతో అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయి. గుర్రం జాషువా ఏయే సామాజిక రుగ్మతల్ని తన కవిత్వంలో విమర్శకు పెట్టారో, అవి ఇప్పుడు కూడా యథాతథంగాగానీ, రూపం మార్చుకొనిగానీ కొనసాగుతూనే ఉన్నాయి. ఆయనకు ఒక అందమైన భారతదేశ సామాజిక స్వప్నం ఉంది. ఆ కల ఇంకా సాకారం కాలేదు. ఆ అందమైన భారతీయ సమాజం ఆవిర్భవించేదాకా ఆయన కవిత్వానికి సామాజిక ప్రాసంగికత ఉంటుంది. వలసపాలన ముగిసిన వెంటనే ‘అచ్చముగ భారతీయుడనైతి నేడు’ అని ఎగిరి గంతేసిన కవి జాషువా. సాంఘికంగా వివక్షలు, ఆర్థికంగా అసమానత, రాజకీయంగా అవినీతి, సాంస్కృతికంగా మౌఢ్యం లేని కొత్త భారతదేశం జాషువా స్వప్నం. స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచీ ఆయన సమాజంలో రావలసిన మార్పులను గుర్తుచేస్తూ వచ్చారు. తన స్వప్నం సాకారం కావడానికి ఏయే సామాంజి కాంశాలు అడ్డుపడుతున్నాయో వాటినన్నిటినీ విమర్శిం చారు జాషువా. 1932 నాటి ‘పిరదౌసి’ కావ్యం నుండే ఆయన శ్రమదోపిడీని విమర్శించారు. 1934 నాటి ‘అనాథ’ కావ్యం నుండే స్త్రీ శక్తిని కీర్తించారు. ఆధిపత్యం, అసమానత, అవినీతి, మౌఢ్యం ఈ నాల్గింటిని ప్రజలకు శత్రువులుగా భావించిన జాషువా, అవి లేని భారతదేశం నిర్మాణం కావాలని ఆకాంక్షించారు. అయితే, స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు గడచిపోతున్నా అవి కొనసాగుతూనే ఉన్నాయి. అందువల్ల ఆయన ఈనాటికీ మనకు కావలసిన కవి. సాంఘిక నిరంకుశత్వానికి భౌతిక రూపమైన కులవ్యవస్థను, దాని వికృతచేష్ట అయిన అస్పృశ్యతను జాషువా తీవ్రంగా విమర్శించారు. అస్పృశ్యతా నిర్మూలనకు అనేక సందర్భాలలో పిలుపునిచ్చారు. ‘అనాథ’, ‘గబ్బిలం’ వంటి అనేక కావ్యాలలో తన దళిత వేదనను ఆగ్రహం గానూ, ఆర్ద్రతతోనూ వినిపించారు. ‘కుల భేద పిశాచి’ అని కులవ్యవస్థను నిర్వచించారు. దళితకులంలో పుట్టినకవిగా తన అనుభవాలను కవితలుగా మలిచారు. ‘కసరిబుసకొట్టు నాతని గాలిసోకనాల్గుపడగల హైందవ నాగరాజు’ అన్న వాక్యం జాషువా కులనిరసనలలో అగ్రగామి. ‘చెండింపుమస్పృశ్యతన్’ అని ఒక చోట, ‘కారుణ్యంబున నంటరాని తనమును ఖండింపవా?’ అని మరోచోట ఇలా అనేక పర్యాయాలు విజ్ఞప్తి చేశారు. సాంఘిక వివక్ష, కులనిరంకుశత్వం లేని వ్యవస్థను కోరుకొన్న జాషువ ఈనాటికీ సామాజిక అవసరమే. కాలం ఎంతమారుతున్నా, దళితులు చదువుకొని, చైతన్యవంతులవుతున్నా వాళ్ల పట్ల వివక్ష మాత్రం తగ్గవలసినంతగా తగ్గలేదు. అందుకే ఆయన కాలంచెల్లిన కవి కాదు. అభ్యుదయ సాహిత్యం మొదలవుతున్నప్పుడే జాషువా ఇతర మార్క్సిస్టు కవులలాగే మన సమాజంలోని వర్గ వైరుధ్యాలను గుర్తించారు. సంపద అందరిదీ కావాలని, శ్రమదోపిడీ నశించాలని కోరుకున్నారు. దళితులు శ్రమదోపిడీకి గురికావడాన్ని నిరసించారు. వాని రెక్కలకష్టంబు లేనినాడు / సస్యరమ పండి పులకింప సంశయించు / వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు / భోజనము బెట్టు, వానికి భుక్తి లేదు (గబ్బిలం) అంటూ దళిత శ్రామికుల శ్రమ పరాయీకరింపబడటాన్ని జాషువా అధిక్షేపించారు. ‘ఒక ప్రాణి కొక ప్రాణి యోగిరంబ’య్యే వ్యవస్థను నిరసించి, మానవీయ భారతదేశం ఆవిర్భవించాలని జాషువా ఆకాంక్షించారు. ఇప్పుడు దేశంలో ఎంతో మార్పు వచ్చినా అధిక సంఖ్యాకుల శ్రమ మాత్రం దోపిడీకి గురౌతూనే ఉంది. శ్రమ దోపిడి నశించేదాకా జాషువా మనల్ని హెచ్చరిస్తూనే ఉంటారు. ఆయన గాంధీజీ అడుగుజాడలలో నడిచిన రాజకీయ కవి. ‘గబ్బిలం’, ‘బాపూజీ’ వంటి కావ్యాలలో జాషువా తన రాజకీయ దృక్పథాన్ని చాటి చెప్పారు. అయితే స్వాతంత్య్రానంతర రాజకీయాలలో ఆడంబరాలు పెరిగిపోవడం, ఆర్థిక అవినీతి పెచ్చరిల్లడం, ఎన్నికలలో ధనప్రాబల్యం ప్రవేశిం చడం వంటి అనేక దుష్పరిణామాల మీద జాషువా కవితాగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం రాగానే దేశం పూర్తిగా మారిపోతుందని కవి ఆశించారు. ఒక ఏడాది గడచినా మార్పు కనిపించలేదు. మొదటి సార్వత్రిక ఎన్నికలలోనే ధనం పాత్రను గుర్తించి ఆనాడే ప్రజలను హెచ్చరించారు జాషువ. ఇప్పుడు ఈ ధనప్రధాన ఎన్నికల రంగం బాగా బలిసిపోయింది. మతం పేరు మీద మౌఢ్యం రాజ్యమేలడాన్ని ఆయన వ్యతిరేకించారు. మతం కన్నా మనిషి ప్రధానమని భావిం చారు. నరుని కష్టపెట్టి నారాయణుని కొలిచే వింత సంస్కృతిని ప్రశ్నించారు. పెండ్లిండ్లకు, విగ్రహాలకు విపరీతంగా ధనం ఖర్చుపెడుతూ ప్రజలు ఆకలితో మాడుతుంటే పట్టిం చుకోని అమానుషత్వాన్ని నిలదీశారు. అంటువ్యాధులు వచ్చినపుడు ప్రతిమలను పూజించడం ‘ముతక తెలివి’ అన్నారు. కందుకూరి, గురజాడల నుండి అనేకమంది తెలుగు ప్రజా రచయితలు సమాజ పునర్నిర్మాణానికి మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో గుర్రం జాషువా ఒక్కరు. మరణించి 50 ఏళ్ళు ముగిసినా ఆయన కవిత్వం ఇప్పటికీ తాజాగానే ఉంది. ఈ సందర్భంలో ఆయన కవిత్వాన్ని సమకాలీన దృక్పథంతో అధ్యయనం చేసి, పునర్మూల్యాంకనం చేయడం ఇప్పుడు చేయవలసిన పని. ఇదే ఆ మహాకవికి అసలైన నివాళి. ‘కులమతాలు గీచుకున్న గీతలజొచ్చి/పంజరాన కట్టువడను నేను /లోకనిఖిలమెట్ల నిర్ణయించిన నాకు/తరుగులేదు విశ్వనరుడ నేను’ (నేడు గుర్రం జాషువా 126వ జయంతి) రాచపాళెం చంద్రశేఖరరెడ్డి వ్యాసకర్త ప్రముఖ సాహితీ విమర్శకులు -
దళిత ఉద్యమ సారథి కత్తి పద్మారావు
డాక్టర్ కత్తి పద్మారావు ప్రపంచ మెరిగిన హేతువాది. జగమెరిగిన దళిత ఉద్యమ నాయకుడు. ఆయనది భౌతిక తాత్విక వాద ప్రాపంచిక దృక్పథం. పైగా కల్తీలేని మానవతావాది. నిజాయితీ గల బోధకుడు. మనిషి తాను సృష్టించుకున్న దైవభావనకు తానే బానిసై, మతం స్వార్థపరుల చేతిలో చిక్కి, అధిక సంఖ్యాకులను మభ్యపెట్టడానికి, అణచిపెట్టడానికి సాధనంగా మారడంపై ఆయన యుద్ధం ప్రకటించారు.. హేతువాది, మానవతావాది అయిన కత్తి పద్మారావు బౌద్ధంవైపు మొగ్గారు. దళిత బహుజనుల రాజ్యాధికార సాధనకు ఆయన బౌద్ధాన్ని, అంబేడ్కర్ వాదాన్ని ఆధారం చేసుకున్నారు. బౌద్ధ ధర్మాన్ని, అంబేడ్కరిజాన్ని తన తాత్విక నేపథ్యంగా స్వీకరించారు. భారతదేశంలో మార్క్సిజం అగ్రకుల నాయకత్వంలో ఉండటం పట్ల ఆయనకు అభ్యంతరాలున్నాయి. మార్క్సిస్టు ఉద్యమ ధోరణుల పట్ల విమర్శనాత్మక దృష్టి కలిగి ఉన్నారు. అలా అని ఆయన మార్క్సిజానికి వ్యతిరేకి కారు. చుండూరు సంఘటన జరిగి దశాబ్దాలు గడిచిన సందర్భంగా దాని పరిణామాలను స్మరించుకుంటూ ‘సైనిక గీతం’ రాశారు. మొదటి నుంచీ ఆయనది ఉద్యమ జీవితం. మొదట హేతువాద ఉద్యమం. ఆ తర్వాత దళిత ఉద్యమం. మధ్యలో మార్క్సిజం అధ్యయనం. సైద్ధాంతిక గ్రంథ రచన, సాహిత్య విమర్శ, కవిత్వ రచన – ఆయన రచనా జీవితానికి మూడు ముఖాలు. కారంచేడు, చుండూరు సంఘటనలతో ఆయన కుల నిర్మూలనా ఉద్యమానికి నాయకత్వం వహించారు. కుల వ్యవస్థ విశ్లేషణకు, దాని నిర్మూలనకు, కుల రహిత సమాజ నిర్మాణానికి అవసరమైన జ్ఞానాన్ని అందివ్వడానికి సామాజికాంశాల మీద విస్తృతంగా గ్రంథ రచన చేశారు. ఆయన ప్రచురించిన ముళ్ళ కిరీటం (2002), భూమి భాష (2004), కట్టెల మోపు (2007), ఆత్మగౌరవ స్వరం (2010), ఈ యుగం మాది (2014) కవిత్వ సంపుటాలు చదివితే గత దశాబ్దాన్ని ఆయన కవిగా తనది చేసుకున్నారా అనిపిస్తుంది. తన అమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మ తన కవిత్వ గురువులని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా కవిత్వ గురువులుగా పూర్వకవులను చెప్పుకుంటాం. పద్మారావు తన తల్లులనే చెప్పుకున్నారు. ఈ ముగ్గురు దళిత మహిళలు. శ్రామిక మహిళలు. వాళ్ళు జీవితాన్ని గడిపేసిన వాళ్ళుకారు. జీవితాన్ని జీవించిన వాళ్ళు, జీవిత సారాన్ని పాదం ముట్టినవాళ్ళు. జీవితం సజీవయానం అన్నది ప్రజా భావన. ఈ ‘యానం’లో సంఘర్షణ, శ్రమ, అనుభవం ఇమిడి ఉంటాయి. కవిని వాళ్ళమ్మ ఎలా పెంచిందో ‘ముళ్ళకీరిటం’ కవిత చదివితే అర్థమౌతుంది. నేల మీద బతికినప్పుడే జీవితయానమవుతుంది. అది పద్మారావుకి తెలుసు. అందుకే జీవితాన్ని సజీవయానం అన్నారు. సజీవయానమంటే శ్రమతో కూడిన బతుకు అని అర్థం. జీవితం ఒక పరివేదన అని చెబుతారు పద్మారావు. పరివేదన అంటే ఏడుపు కాదు. ఇది కలిగిన వాళ్ళ లక్షణం. పరివేదన అంటే జీవితంలో ఎదురయ్యే ఆటుపోటులకు పారిపోకుండా నిలవటం. ‘‘చీకటిని తొలగించటమే కాదు’’ అనే కవితను ‘చీకటిని జయించాలి’ అంటూ ముగించారు కవి (పైది; పు:44). దానికి అవసరమైన కొరముట్టు పరివేదన. జీవితం ఒక గీతం (భూమిభాష; పు:48). గ్రామీణ భారత జీవితాన్ని కాచి వడబోసిన జానపదులు మాత్రమే జీవితాన్ని ఇలా నిర్వహించగలరు. ‘జీవితం ఒక పరివేదన’ అన్న కవి ‘జీవితం ఒక గీతం’ అన్నారు. జీవితం ఒక సముద్రమని, దానిని ఈదడం సాధ్యం కాదని వేదాంతులు మనల్ని భయపెడితే, శ్రామికతత్వాన్ని జీర్ణించుకున్న కవి జీవితాన్ని గీతంగా నిర్వచించారు. ‘‘జీవితానికి సాహసమే ఊపిరి’’ (పైది; పు:379) అన్నా ‘‘జీవించటం ఒక యుద్ధ ప్రక్రియ’’ అన్నా (భూమి భాష; పు:152) కవి తన జాతిని తట్టి లేపడమే. పద్మారావు కవిత్వం ఒక చైతన్య గీతిక. ఒక పొలికేక. ఒక ఆత్మ గౌరవస్వరం. ఆత్మవిశ్వాసపతాక. ఆత్మస్థైర్య గొంతుక. పీడనకు వివక్షకు అణచి వేతకు గురౌతున్న సామాజిక వర్గాల ప్రజలకు పద్మారావుగారి కవిత్వంలోని జీవిత నిర్వచనాలు ధైర్యం చెబుతాయి. ఈ యుగ దళిత గళం ఆయన. కవితా నిర్మాణ శిల్పి, దళిత ఉద్యమ నిర్మాత. మార్క్స్ను, అంబేడ్కర్ను లోతుగా అధ్యయనం చేసి దళిత ఉద్యమానికి కుల నిర్మూలనా రధసారధి అయ్యాడు. తెలుగువారి చరిత్రలో, భారతదేశ చరిత్రలో అనేక మలుపులకు ఆయన కారకుడు. చరిత్ర నిర్మాత, సిద్ధాంతకర్త, తెలుగు జాతి వైతాళికుడిగా ముందుకు నడుస్తున్న డా‘‘కత్తి పద్మారావు 67వ జన్మదినం తెలుగుజాతి చరిత్రలో మలుపు తిప్పిన ఒక గుర్తింపదగిన రోజు. (నేడు డా‘‘ కత్తి పద్మారావు 67వ జన్మదినం నేపథ్యంలో లుంబినీవనం, పొన్నూరులో జరుగుతున్న సదస్సులో ఆయన రాసిన 70, 71వ పుస్తకాల ఆవిష్కరణ సందర్భంగా) రాచపాళెం చంద్రశేఖర్రెడ్డి వ్యాసకర్త ప్రముఖ విమర్శకులు మొబైల్ : 94402 22117 -
విద్యా విధానం అమలుకు తొందరేల?
భారత ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం జాతీయ విద్యా విధానం 2019 అనే నివేదిక ముసాయిదాను విడుదల చేసింది. దాని మీద ప్రజల అభిప్రాయాలను తెలపాలని కోరింది. అయితే ఈ నెలాఖరుకల్లా అభిప్రాయాలు తెలపాలని విద్యాశాఖ కోరినట్లు తెలుస్తున్నది. ప్రసిద్ధ శాస్త్రవేత్త, ఇస్రో పూర్వ అధ్యక్షులు డాక్టర్ కె. కస్తూరి రంగన్ అధ్యక్షులుగా, ఎనిమిది మంది సభ్యులుగా భారత ప్రభుత్వం నియమించిన కమిటీ 2018 డిసెంబర్ 15వ తేదీన నివేదిక సమర్పించింది. వెంటనే ఎన్నికలు వచ్చినందువల్ల ఈ నివేదికను ప్రభు త్వం అప్పుడు విడుదల చేయలేదు. ఎన్నికలు పూర్తయిన ఈ నెల మొదట్లోనే విడుదల చేసింది. ఈ ముసాయిదా చాలా పెద్దది. 480 పుటలున్నాయి. నివేదిక ఆంగ్ల, హిందీ భాషలలో మాత్రమే ఉంది. ప్రతి పౌరుడినీ చర్చలో పాల్గొనమని ప్రభుత్వం కోరింది. అందరూ చర్చలో పాల్గొనాలంటే, ఈ ముసాయిదా అన్ని భారతీయ భాషలలో అనువాదమై భారతీయులందరికీ అందుబాటులోకి రావాలి. అందువల్ల ఈ ముసాయిదాను నామమాత్రపు చర్చకు పెట్టి గబగబా అమలు చేయాలని ప్రభుత్వం తొందరపడవద్దు. ముసాయిదా అన్ని భారతీయ భాషలలోకి అనువాదమై రావాలి. అప్పుడు దానిని చర్చకు పెట్టాలి. ముసాయిదాను అర్థం చేసుకోవడానికి అవసరమైనంత సమయం ఇవ్వాలి. తర్వాతనే ప్రజల అభిప్రాయాలకనుగుణంగా మార్పులు చేర్పులు చేసి ఈ ప్రణాళికలు అమలు చేయాలి. ఈ ముసాయిదాలో నాలుగు ప్రధానాంశాలు ఉన్నాయి. మొత్తం 23 అధ్యాయాలు, 14 అనుబంధాలున్నాయి. ప్రతి అధ్యాయానికీ ఆకర్షణీయమైన శీర్షిక ఉంది. అందమైన వివరణ ఉంది. ఉత్సాహం కలిగించే నిర్వచనాలు ఉన్నాయి. నిర్మాణాత్మకమైన భాష ఉంది. ప్రాథమిక విద్య నుంచి అత్యున్నత స్థాయి విద్య దాకా విద్యా సంస్థల ప్రస్తుత స్థితిగతులను పేర్కొంటూ, ఆయా అంశాలలో ఇప్పుడు ఏమి చేయబోతున్నారో నివేదిక ముసాయిదా చెబుతున్నది. అధ్యాపకులు, వారికి శిక్షణ, విద్యార్థులు, వారికి సౌకర్యాల కల్పన, పాఠ్యాంశాల పునర్నిర్మాణం, ఇంటర్ సప్లిమెంటరీ విద్య, లిబరల్ ఆర్ట్స్వంటి అనేక విషయాలను ఈ ముసాయిదా ప్రతిపాదించింది. పైపైన చూస్తే ఈ ముసాయిదాను ఆమోదించడానికి అభ్యంతరం చెప్పవలసిన పనిలేదనిపిస్తుంది. కానీ లోపలకు వెళితే, దీనిలో లోతుగా చర్చించాల్సినవి చాలా ఉన్నా యని తెలుస్తుంది. ఈ ముసాయిదాలోని పదజాలం చాలా ప్రజాస్వామికంగా ఉన్నట్లు కని పిస్తుంది. కానీ, ఆ పదాల పరమార్థం వేరుగా ఉన్నట్లు అర్థమవుతుంది. ఈ ముసాయిదాలో గతంపట్ల వ్యామోహం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. సైన్సుకు, మతానికి ముడివేసే ప్రయత్నం కనిపిస్తుంది. అన్నీ వేదాల్లో ఉన్నాయని రుజువు చేసే సంకల్పమూ కనిపిస్తుంది. చరిత్ర పట్ల భ్రమలు పెంచే దృష్టి తొంగిచూస్తున్నది. చాలా చోట్ల అశాస్త్రీయ, అచారిత్రక ఆలోచనలు కనిపిస్తున్నాయి. అందువల్ల ఈ ముసాయిదా మీద దేశ వ్యాప్తంగా అనేక స్థాయిలలో చర్చ జరగాలి. పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయిలలో చర్చ జరగాలి. ప్రతిపౌరుడూ చర్చలో పాల్గొనాలని కోరినందున పౌరులందరికీ వాళ్లకు తెలిసిన భాషలోకి ఈ ముసాయిదా అనువాదమై రావాలి. గ్రామస్థాయి దాకా ఈ చర్చ జరగాలి. ఈ చర్చ లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ఏర్పాటు చేయాలి. చర్చలలో వ్యక్తమయ్యే అభిప్రాయాలను ప్రభు త్వం నిజాయితీగా స్వీకరించి తన ప్రణాళికలో చేర్చుకోవాలి. ఈ ముసాయిదా మీద ప్రసార, ప్రచార మాధ్యమాలలో విస్తృతంగా చర్చలను ఏర్పాటు చెయ్యాలి. ఈ చర్చలలో అధ్యాపకులను, విద్యారంగ నిపుణులను, మేథావులను నిమగ్నం చేయాలి. చర్చలు సమగ్రంగా జరిగేదాకా, ప్రజాభిప్రాయం సంపూర్ణంగా వ్యక్తం అయ్యే దాకా ఆగాలి. అప్పటి దాకా ప్రభుత్వం ఓపిక పట్టాలి. ముసాయిదాను త్వరత్వరగా అమలు చేయకుండా నెమ్మదిగా వ్యవహరించాలి. రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి వ్యాసకర్త ఎస్కే యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు -
సాహిత్యానికి రాచబాట
కథా రచయితగానే కాదు.. ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే లక్షణం. కవిగా.. కథకునిగా.. విమర్శకునిగా.. విలువలతో కూడిన సాహిత్యం ఆయన సొంతం. ‘అనంత’ సాహితీవనంలో తనదైన ముద్రతో సాగించిన రచనా సేద్యం అద్భుత ఫలాలను అందించింది. జిల్లా కీర్తి పతాకను జాతీయ స్థాయిలో ఆవిష్కరించింది. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న ఆ కలం ఎందరికో స్ఫూర్తిదాయకం. రాసినా.. మాట్లాడినా.. రాగద్వేషాలకు అతీతంగా వస్తు వివేచనను సాగించే ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్రెడ్డి రచనామృతం అద్భుతం.. అజరామరం. పరిచయం చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని కుంట్రపాకంలో 1948, అక్టోబర్ 16న మంగమ్మ, రామిరెడ్డి దంపతులకు రాచపాలెం చంద్రశేఖరరెడ్డి జన్మించారు. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఏ, పీహెచ్డీలతో పాటు వయోజన విద్యలో డిప్లొమా చేశారు. శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం నుంచి తమిళంలో సర్టిఫికెట్ కోర్సు చేశారు. 37 సంవత్సరాలు బోధనానుభవం (ఎస్వీలో 31సంవత్సరాలు, వైవీయూలో ఆరు సంవత్సరాలు) గల ఆచార్య రాచపాలెం... లెక్చరర్గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి రీడర్గా, ప్రొఫెసర్గా, శాఖ అధ్యక్షులుగా పాఠ్య ప్రణాళిక సంఘ అధ్యక్షులుగా వ్యవహారించారు. ఈయన నేతృత్వంలో 25మంది పీహెచ్డీలు, మరో 20 మంది ఎంఫిల్ చేశారు. అనంతపురం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులుగా, గుర్రం జాషువా జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా వ్యవహారించారు. అరసం రాష్ట్ర అధ్యక్షునిగా, జన విజ్ఞాన వేదిక గౌరవాధ్యక్షునిగా, రాష్ట్ర అధికారభాషా సంఘం సభ్యునిగా సేవలు అందించారు. నేషనల్ బుక్ ట్రస్టు తెలుగు సలహా మండలి, సాహిత్య అకాడమి (న్యూఢిల్లీ) సభ్యుడిగాను పనిచేశారు. ‘మన నవలలు– మన కథానికలు’ అనే రచనకు ఉత్తమ విమర్శకుడిగా 2014లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. నా ఒరవడి కూడా మారింది ఒకప్పుడు సాహిత్యమంటే సంప్రదాయరీతిలో మూసబోసినట్టుండేది. వాటికి కామా పెడుతూ కొత్త వాదాలు పుట్టకొచ్చాయి. 1980 ప్రాంతాలలో అనుకుంటా యుద్దనపూడి మరణం తర్వాత స్త్రీ వాదం, కారంచేడు, చుండూరు ఘటనలతో దళిత వాదం, బాబ్రీ మసీదు విధ్వంసంతో మైనార్టీ వాదం పుట్టుకొచ్చాయి. ప్రాంతీయ అసమానతల వల్ల అస్థిత్వ వాదాలు కూడా జనిస్తున్నాయి. కాబట్టే నా రచనా వస్తువు కూడా తొలినాళ్లలో ఉన్నట్టు కాకుండా ఒరవడి మారింది. కథలు మాత్రమే రాయడంతో రచయిత పని అయిపోదని నా కలం గ్రహించింది కాబట్టే ఫ్యాక్షనిజం, కరువు రక్కసి, వర్తమాన రాజకీయాలు చేస్తున్న వికృత చేష్టలు ఓ వైపు ఎత్తి చూపుతూనే వాటి పరిష్కార మార్గాలు వెతికే పని చేపట్టాల్సి వచ్చింది. మార్క్సిజమే ఎందుకు? చాలా మంది అనుకుంటారు ఇన్ని వాదాలుండగా మార్క్సిజమే ఎందుకని. ప్రపంచాన్ని బాగా అర్ధం చేసుకోవాలంటే మార్క్సిజాన్ని మించినది మరేది ఉండదు. చరిత్ర అంతా వర్గపోరాటమే. రెండు వర్గాల నడుమ సాగే పోరులో అంతిమ విజయం శ్రామిక వర్గానిదే అని చెప్పే మార్క్సిజం.. పీడిత వర్గం వైపు ఉండాలని కవులకు, రచయితలకు, మేధావులుకు సూచిస్తుంది. అభివృద్ది పథంలో ప్రపంచమంతటా ఒకలా ఉంటే మన దేశంలో కులం అడ్డుగోడగా నిలిచిందనడంలో సందేహం లేదు. శక్తి వంతమైన సమాజ నిర్మాణానికి అంబేద్కరిజమే చక్కటి పరిష్కార మార్గం. కుల రక్కసి చేసే విలయతాండవం మరెన్ని రోజులు చూడాల్సి వస్తోందో. ఆ రోజులే వేరు.. ఒకసారి మా జ్ఞాపకాలలోకి వెళితే అప్పుడుండే పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయని అనిపిస్తుంది. ఇప్పుడున్నంత బిజీ లైఫ్ ఉండేది కాదు. కాబట్టే అప్పట్లో నాతో పాటు చిలకూరి దేవపుత్ర, బండి నారాయణస్వామి, రాయుడు, బోసు, బద్వేలు రమేష్, దక్షిణామూర్తి, రఘుబాబు వంటి వారితో నగరంలో ఉండే గిల్డ్ ఆఫ్ సర్వీసు పాఠశాలలోని ఓ తరగతి గదిలో కూర్చొని అనేక విషయాలు చర్చించుకునే వాళ్లం. ముఖ్యంగా 21 వారాలు ‘లిటరరీ మీట్’ నడిపాం. కథా చర్చలు జోరుగా సాగేవి. ముఖ్యంగా అవధాని ఆశావాది ప్రకాశరావు ‘రాయల కళా గోష్టి’ పేరిట సాగిన చర్చలు ఎంతో రసవత్తరంగా ఉండేవి. కవితా వస్తువు కూడా విభిన్నమే రాయలసీమ నిర్ధిష్ట సమస్యలైన కరువు, ఫ్యాక్షనిజం, వర్తమాన రాజకీయాలు..ఇవే నా కవితా వస్తువులు.. కథలలో నాటకీయత కన్నా సజీవ చిత్రణ గొప్పగా కనపడాలని నేననుకుంటాను. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు కళ్లముందు కదలాడే విధంగా రచనలుండాలి. వాటికి తగ్గట్టుగానే నా ‘రెండు ప్రపంచాలు’, ç‘స్వర్ణభారతి సాక్షిగా’, ‘సీమ నానీలు’, ‘పొలి’ వంటి కవితా సంకలనాలు, ‘తెలుగు కవిత్వంలో నన్నయ్య ఒరవడి’, ‘గురజాడ తొలి కొత్త తెలుగు కథలు’, ‘చర్చ మరోచర్చ’, ‘విమర్శ –2009’ వంటి విమర్శనా గ్రంథాలు.. ‘అనంత’ సాహిత్యం ప్రత్యేకతను చాటాయనే అనుకుంటున్నా. ముఖ్యంగా చాలా మందిని కదిలించిన విమర్శనా గ్రంథం ‘ప్రతిఫలనం.’ ఇందులో అనేక మంది రచయితల ప్రసిద్ధ కథలపై విమర్శ సాగుతుంది. ఇదే ఒరవడిలో సాగిన ‘మన నవలలు–మన కథానికలు’ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకుంది. విమర్శపై విమర్శ రాసినవారు అరుదుగా కనిపిస్తారు. ఆ అదృష్టం నాకు దక్కడం ఆనందమే మరి. బయోడేటా పేరు : రాచపాళెం చంద్రశేఖరరెడ్డి పుట్టిన తేదీ : 16.10.1948 స్వగ్రామం : కుంట్రపాకం, చిత్తూరు జిల్లా తల్లిదండ్రులు: రామిరెడ్డి, మంగమ్మ భార్య : లక్ష్మీకాంతమ్మ పిల్లలు : శ్రీవిద్య, ఆనందకుమార్ చదువు : ఎంఏ., పీహెచ్డీ., వృత్తి : ఆచార్యులుగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు అభిరుచులు : విస్తృత పఠనం, తరచూ చర్చా గోష్టుల్లో పాల్గొనడం పురస్కారాలు: గురుజాడ పురస్కారం (2012), కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (2014), తెలుగు భాషా పురస్కారం(2016), గుర్రం జాషువా అవార్డు(2017) అంతరాలు వాస్తవమే అప్పటి గురువులకు.. ఇప్పటి వారికి చాలా అంతరమే ఉంది. మా రోజుల్లో పాఠాలు చెప్పడమే ఉపాధ్యాయుల పని. కానీ ఇవాళ అలా కాదే.. వృత్తితో పాటు మరెన్నో వ్యాపకాలు.. వ్యాపారాలు. నిబద్ధత అనేది లోపిస్తోంది. అందరూ అలా ఉంటారని కాదు కానీ... మా రోజుల్లో శిష్యులను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దేవారనేది స్పష్టం. ఈ విషయంలో నేను చాలా జాగ్రత్త పడ్డాను. మా శిష్యులు కిన్నెర శ్రీదేవి, జూలూరు గౌరీశంకర్, జూపల్లి ప్రేమ్చంద్ (ప్రస్తుతం జిరసం అధ్యక్షులుగా ఉన్నారు), నానీల నాగేంద్ర వంటి వారిలో చాలా మంది పీహెచ్డీలు చేసినా సాహితీ కృషి మరవకుండా చేయడంలో నా వంతు పాత్ర ఉందని సగర్వంగా చెబుతున్నా. గురువులే స్ఫూర్తి నాలోనూ మంచి రచయిత ఉన్నాడని గుర్తించిన తొలి వ్యక్తి తుమ్మపూడి కోటేశ్వరరావుగారు. నా పరిశోధనా గ్రంథం ‘శిల్ప ప్రభావతి’కి ఆయనే గైడ్గా వ్యవహరించారు. అలాగే ఆచార్య జి.ఎన్.రెడ్డి, జాస్తి సూర్యనారాయణ, తిమ్మావఝల కోదండరామయ్య, మద్దూరు సుబ్బారెడ్డి, ఆచార్య నాగయ్య వంటి వారు చాలా మంది గురువులుగా, స్నేహితులుగా నన్నెంతో ప్రోత్సహించారు. అదే ఆప్యాయతను నా శిష్యుల పట్ల చూపించడానికి నాకు పునాదులేశారు. అలాగే మిత్రులు ఆచార్య పి.ఎల్.శ్రీనివాసరెడ్డి, భక్తవత్సలరెడ్డి నా పట్ల చూపిన ఆదరణ కూడా మరవలేనిదే. నాకే ఆశ్చర్యమనిపిస్తుంది నా జీవితాన్ని తరచి చూసుకుంటే నాకే ఆశ్చర్యమనిపిస్తుంది అత్యంత నిరుపేద కుటుంబం మాది. తిరుపతికి సమీపంలోని కుంట్రపాకం చిన్న పల్లె. నా రెండేళ్ల ప్రాయంలోనే తల్లి చనిపోయారు. అప్పటి నుంచి పిన్ని రాజమ్మే నన్ను పెంచారు. వయసొచ్చేకొద్దీ నిత్యమూ పొలం పనులు చూసుకుని పాఠశాలకు, కళాశాలకు వెళ్లాల్సి వచ్చేది. యూనివర్శిటీ చేరినా ప్రతి రోజూ ఆరు కిలో మీటర్లు నడుచుకుంటూ వెళ్లే వాన్ని. మనమేమి చేయగలమో ఆలోచించాలి ‘సమాజం మనకేమిచ్చింది’ అని ఆలోచించే కంటే మనం ఏం చేయగలమో చెప్పగలగాలి. అదే సాహిత్యం అందించే జీవ లక్షణం. ముఖ్యంగా రచయితలు నిబద్ధతతో ఉండాలి. సమస్యలను ఆవిష్కరించడమే కాదు.. వాటి పరిష్కారమార్గం చెప్పగలగాలి. మొదట అందరూ సమాజాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వర్ధమాన రచయితలు ఒక్కరోజులోనే గొప్ప పేరు వచ్చేయాలనుకుంటుంటారు. వారికి నేనిచ్చే సలహా ఒక్కటే. బాగా చదవాలి. చుట్టుపక్కల సాగే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. అప్పుడే వారు చేసే రచనల్లో జీవం ఉంటుంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement