-
వేగంగా ముగిసిన ర్యాటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల ధ్రువీకరణ (ర్యాటిఫికేషన్) ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. కొన్నేళ్ళతో పోలిస్తే ఈ ప్రక్రియను ఇంత వేగంగా ముగించడం ఇదే తొలిసారి. వాస్తవానికి ర్యాటిఫికేషన్ కోసం ఉన్నత విద్యా మండలి అధికారులు ప్రతి ఏటా కుస్తీ పడుతుంటారు. ప్రతి ప్రైవేటు కాలేజీకి కేటాయించిన సీటును నిశితంగా పరిశీలించి, ఎలాంటి అభ్యంతరాలు లేవని మండలి సభ్యులు నిర్ణయించిన తర్వాతే ఆమోదం తెలుపుతారు. ఈ కారణంగా ర్యాటిఫికేషన్ ప్రక్రియ ప్రతి సంవత్సరం మార్చి వరకూ కొనసాగతుంది. మండలి కార్యాలయంలో దీనికి ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటు చేస్తారు. రోజుకు కొన్ని కాలేజీలు చొప్పున పెద్ద ఎత్తున ఫైళ్ళతో వస్తుంటాయి. ఈసారి మాత్రం ఈ హడావుడి ఏమీ కన్పించలేదు. రాష్ట్రంలోని 150కి పైగా ప్రైవేటు కాలేజీల్లో ఉండే 25 వేల మేనేజ్మెంట్ కోటా సీట్లకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన ఇంత వేగంగా ముగించడం, అన్నీ సక్రమమేనంటూ ధ్రువీకరించడంపై పలు విద్యార్థి సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఫిర్యాదులకు ఆధారాల్లేవా? ప్రతి ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీకి కొన్ని సీట్లు కేటాయిస్తారు. ఇందులో 70 శాతం కన్వినర్ కోటా కింద భర్తీ చేస్తారు. మిగిలిన 30 శాతం సీట్లలో 15 శాతం ప్రవాస భారతీయుల పిల్లలు, ఎన్ఆర్ఐలు సిఫారసు చేసిన వారికి కేటాయిస్తారు. మిగిలిన 15 శాతం సీట్లను యాజమాన్య కోటా (బి కేటగిరీ) కింద భర్తీ చేస్తారు. అయితే వీటి విషయంలో కొన్ని షరతులు పాటించాల్సి ఉంటుంది. జేఈఈ ర్యాంకర్లకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. వాళ్ళు లేకుంటే ఎంసెట్ ర్యాంకర్లకు, ఆ తర్వాత ఇంటర్లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వారికి ఇవ్వాలి. సర్టిఫికెట్లు అన్నీ సరిగ్గా ఉండాలి. బి కేటగిరీ కింద కేటాయించిన సీట్లకు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు మాత్రమే తీసుకోవాలి. అయితే కాలేజీలు ఈ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టుగా ప్రతి ఏటా మండలికి ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ ఏడాది కూడా 34 కాలేజీలపై 42 ఫిర్యాదులు వచ్చి నట్టు మండలి వర్గాలే తెలిపాయి. అయితే వీటిని పరిశీలించేందుకు ఏర్పాటైన కమిటీని ఎలాంటి చర్యలు తీసుకున్నది అధికారులు వెల్లడించడం లేదు. అదే సమయంలో ఆధారాలుంటే తప్ప ఫిర్యాదుల విషయంలో తామేమీ చేయలేమని అంటున్నారు. ప్రైవేటు కాలేజీలు ఖుషీ ర్యాటిఫికేషన్ ప్రక్రియ ఈసారి సజావుగా సాగిపోవడంతో ప్రైవేటు కాలేజీల యా జమాన్యాలు సంతోషంగా ఉన్నాయి. మండలికి అందిన ఫిర్యాదులన్నీ అవాస్తవమని చెబుతున్నాయి. విద్యార్థి సంఘాల పేరుతో సీట్లు డిమాండ్ చేశారని, వాటిని తిరస్కరించడం వల్లే మండలికి ఫిర్యాదు చేశారని ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఇష్టానుసారం సీట్లు అమ్ముకున్నట్టుగా ఆరోపణలున్న కాలేజీల పట్ల అధికారులు సానుకూలంగా వ్యవహరించారంటూ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసేందుకు సంఘాలు సిద్ధమవుతున్నట్టు సమాచారం. -
కొత్త కోర్సులు సరే.. ఫ్యాకల్టీ ఎక్కడ?
రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ కోర్సులపై యూనివర్సిటీలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. కొత్తగా వచ్చిన కోర్సులకు సంబంధించిన అధ్యాపకుల వివరాలు తెలియజేయాలని కాలేజీలకు సూచిస్తున్నాయి. కొన్ని కాలేజీల్లో పెరిగిన సీట్లకు సరిపడా ఫ్యాకల్టీ లేదని, సంబంధిత సబ్జెక్టుల్లో నైపుణ్యం ఉన్న వారు అస్సలు లేరని పలు సంఘాల నుంచి ఫిర్యాదులొచ్చిన నేపథ్యంలో ఈ చర్యలకు ఉపక్రమించడం గమనార్హం. మరోవైపు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) సైతం కంప్యూటర్ కోర్సుల్లో నాణ్యత పెంచాలని సూచించింది. వివిధ రంగాల నుంచి నిపుణులను బోధకులుగా తీసుకోవాలని తెలిపింది. వాస్తవానికి అనుబంధ గుర్తింపు ఇచ్చే సమయంలో ఇలాంటి వాటిపై యూనివర్సిటీలు దృష్టి సారించాయి. అయితే, తమకు కొంత సమయం కావాలని, సీట్లు పెరిగిన తర్వాత అర్హత గల అధ్యాపకులను నియమించుకుంటామని కాలేజీలు తెలిపాయి. కానీ ఇది ఆచరణలో కనిపించడం లేదని యూనివర్సిటీ అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. –సాక్షి, హైదరాబాద్ భారీగా పెరిగిన సీట్లు ఈ విద్యా సంవత్సరంలో కంప్యూటర్ సైన్స్ కోర్సులు భారీగా పెరిగాయి. వందకుపైగా కాలేజీలు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో డిమాండ్ లేదని గుర్తింపు ఇచ్చే వర్సిటీలకు తెలిపాయి. వీటిని తగ్గించి, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్ వంటి బ్రాంచీల్లో సీట్లు పెంచుకున్నాయి. నిజానికి ఈ ఏడాది కొత్తగా కంప్యూటర్ సైన్స్ కోర్సులో 7,635 సీట్లు మంజూరయ్యాయి. డిమాండ్ లేని కోర్సులను రద్దు చేసుకోవడం వల్ల మరో 6,390 సీట్లు అదనంగా మార్పిడి రూపంలో పెరిగాయి. ఈ విధంగా 14,565 సీట్లు కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ విభాగాల్లో అదనంగా వచ్చి చేరాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి బ్రాంచీలను బోధించే వారు అవసరమైన మేర ఉన్నారు. కానీ కొత్తగా వచ్చిన కంప్యూటర్ కోర్సులను బోధించే అనుభవజు్ఞల కొరత రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీలను వేధిస్తోంది. సరైన ఫ్యాకల్టీ లేకపోవడంతో సీఎస్ఈ బ్రాంచీలో బోధించే వారినే కొత్త కోర్సులకు వాడుతున్నారు. వారికి అవసరమైన శిక్షణ కూడా ఇవ్వకపోవడంతో కొత్త కోర్సుల్లో బోధన నాణ్యత లోపిస్తోందని కాలేజీ అధ్యాపక సంఘా నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అనుభవంపై ఆరా కొత్త కోర్సుల్లో మాస్టర్ డిగ్రీ చేసిన వారితోనైనా బోధించేలా చూడాలని యూనివర్సిటీలు కోరుతున్నాయి. ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ విభాగాల్లో కంప్యూటర్ కోర్సులు చేసిన వాళ్లు అధ్యాపకులుగా పనిచేయడానికి ముందుకు రావడం లేదు. వారంతా సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడ్డారు. ఈ కారణంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ) బోధించే అధ్యాపకులున్న కాలేజీల్లో అదనపు కొత్త సబ్జెక్టులనైనా ప్రొఫెషనల్స్తో బోధించేందుకు ప్రయత్నించాలని వర్సిటీలు సూచిస్తున్నాయి. ఎంఎస్, ఇతర మాస్టర్ డిగ్రీలు చేసి, కనీసం అయిదేళ్లుగా సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న వారితో బోధన సమంజసమని యూనివర్సిటీలు భావిస్తున్నాయి. ఇలాంటి మార్పు ఎన్ని కాలేజీలకు అవసరమనేది క్షేత్రస్థాయి కాలేజీల వివరాలు పరిశీలించాక ఓ అవగాహనకు వచ్చే వీలుందని ఓ యూనివర్సిటీ వీసీ తెలిపారు. కొత్త కోర్సులను నిర్వహిస్తున్న కొన్ని కాలేజీలను దసరా తర్వాత ప్రత్యక్షంగా పరిశీలించి, నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. -
అమ్ముకున్న సీట్లకు అధికారిక ముద్ర!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో యాజమాన్య కోటా భర్తీకి ఉన్నత విద్యామండలి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. నిబంధనల ప్రకారం సీట్లను భర్తీ చేసుకోవచ్చంటూ బుధవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. కన్వీనర్ కోటా సీట్ల తొలివిడత కేటాయింపు ఇటీవలే పూర్తవగా మరో రెండు దశల్లో ఎంసెట్ సీట్ల కేటాయింపు ఉండే వీలుంది. ఈలోగా యాజమాన్య కోటా సీట్ల భర్తీ చేపట్టేందుకు మండలి అవకాశం కల్పించడం గమనార్హం. అలాగే బీఫార్మసీ, ఫార్మా–డీ విభాగాల్లోనూ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి వెసులుబాటు కల్పించింది. అయితే ఈ విభాగాల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీ ఇప్పటివరకు చేపట్టలేదు. రాష్ట్రవ్యాప్తంగా 1.05 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. అందులో 30 శాతం సీట్లు యాజమాన్య కోటాగా ఉంటాయి. అంటే దాదాపు 30 వేల వరకు సీట్లు ఉంటాయి. ఇలా భర్తీ చేయాలి... అన్ని కాలేజీలూ గురువారం తమ పరిధిలో ఏయే బ్రాంచీల్లో ఎన్ని సీట్లున్నాయనే వివరాలతో పత్రికా ప్రకటన ఇవ్వాలి. ఆ వివరాలను ఈ నెల 31లోగా కాలేజీల వెబ్సైట్లలో పొందుపరచాలి. వచ్చే నెల 31న కాలేజీలలో జరిగే అడ్మిషన్ల వివరాలు వెల్లడించాలి. సెప్టెంబర్ 15 వరకూ విద్యార్థుల నుంచి యాజమాన్య కోటా కింద దరఖాస్తులు తీసుకోవాలి. మొత్తం యాజమాన్య సీట్లలో 15 శాతం ప్రవాస భారతీయుల పిల్లలు, వారు సిఫార్సు చేసే వారికి ఇవ్వాలి. మరో 15 శాతం సీట్లను ర్యాంకులవారీగా యాజమాన్యం భర్తీ చేయాలి. ఈ విభాగంలో ప్రవేశం పొందే విద్యార్థుల నుంచి రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ (టీఎస్ఎఫ్ఆర్సీ) నిర్ణయించిన ఫీజులను తీసుకోవాలి. ఎలాంటి ఫీజు రీఇంబర్స్మెంట్ ఈ విభాగానికి వర్తించదు. ఎన్ఆర్ఐ కోటా కింద తీసుకొనే సీట్లకు నిర్ణీత ఫీజు కాలేజీనిబట్టి డాలర్లలో ఉంటుంది. ‘బీ’ కేటగిరీ సీట్లను ముందుగా జేఈఈ ర్యాంకు ఆధారంగా భర్తీ చేయాలి. ఆ తర్వాత ఎంసెట్ ర్యాంకును, తర్వాత ఇంటర్ మార్కులను పరిగణనలోకి తీసుకోవాలని ఉన్నత విద్యామండలి మార్గదర్శకాల్లో పేర్కొంది. ముందుగానే బేరాలు... నిజానికి ఎంసెట్ ఫలితాలు రాగానే యాజమాన్య కోటా సీట్ల భర్తీ ప్రక్రియ మొదలైపోతోందనేది ఏటా వస్తున్న ఆరోపణే. కన్వీనర్ కోటాలో మంచి కాలేజీ, బ్రాంచి రాదని భావించే వారు యాజమాన్య కోటా కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని కాలేజీల యాజమాన్యాలు సీట్లను భారీ మొత్తానికి బేరం పెడుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో కంప్యూటర్ సైన్స్, ఇతర కంప్యూటర్ కోర్సులకు భారీ డిమాండ్ ఉండటంతో ముందే బేరం కుదుర్చుకుంటున్న కాలేజీలు... నోటిఫికేషన్ జారీ ప్రక్రియను సాధారణ విషయంగానే భావిస్తున్నాయి. ఈ సమయంలో ఎవరు దరఖాస్తు చేశారు? ర్యాంకులు ఏమిటి? అనే వివరాలపై అధికారులు ఆరా తీయడం సాధ్యం కావడం లేదు. ఆన్లైన్లో యాజమాన్య కోటా సీట్లను భర్తీ చేస్తే తప్ప దీన్ని నియంత్రించడం సాధ్యం కాదని అన్ని వర్గాలూ చెబుతున్నాయి. కానీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయట్లేదు. దీంతో ‘బీ’ కేటగిరీ సీట్ల భర్తీ నోటిఫికేషన్ కేవలం అప్పటికే అమ్ముకున్న సీట్లకు అధికారిక ముద్ర వేసే ప్రక్రియగానే మిగిలిపోతోంది. ర్యాంకుల ప్రకారమే సీట్లు ఇవ్వాలి యాజమాన్య కోటా సీట్ల భర్తీలోనూ కాలేజీలు నిబంధనలు పాటించాలి. ర్యాంకుల ప్రకారమే సీట్లు ఇవ్వాలి. ముందే అమ్ముకున్నారనే ఆరోపణలపై ఆధారాలుంటే ఎవరైనా మాకు ఫిర్యాదు చేయవచ్చు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. యాజమాన్య కోటాలో అర్హత ఉండి కూడా సీటు రాని వారు సైతం ఆ విషయాన్ని మా దృష్టికి తేవాలి. – ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
TS: ఇంజనీరింగ్ కాలేజీల సీట్ల దందాపై ఉన్నత విద్యామండలి దృష్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల సీట్ల దందాకు చెక్ పెట్టేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు మొదలుపెట్టింది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న టాపర్స్ జాబితాపై దృష్టి పెట్టనుంది. జేఈఈ ద్వారా జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు పొంది, జోసా కౌన్సెలింగ్ ద్వారా వాటిల్లో చేరిన వారి వివరాలు సేకరించాలని యోచిస్తోంది. ఇదే విద్యార్థులు రాష్ట్ర ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా సీట్లు పొంది, చివరలో రద్దు చేసుకోవడం వెనుక కథేంటో తేల్చాలని నిర్ణయించింది. ప్రైవేటు కాలేజీలతో కుమ్మక్కయినట్లు బయటపడితే కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. దీనిపై ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన మండలి త్వరలో ఇందుకు సంబంధించిన విధివిధానాలకు రూపకల్పన చేయనుంది. ర్యాంకర్లకు కాలేజీల వల్ల జేఈఈ, ఎంసెట్లో టాప్ ర్యాంకులు సాధించిన రాష్ట్ర విద్యా ర్థులు అటు ఎన్ఐటీ, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజనీరింగ్ కాలేజీల్లో జరిగే కౌన్సెలింగ్లో పాల్గొంటున్నారు. ముందుగా రాష్ట్ర ఎంసెట్ కౌన్సెలింగ్ మొదలవుతుంది. దీంతో డిమాండ్ ఎక్కువగా ఉన్న కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐఎంఎల్, డేటాసైన్స్ వంటి కోర్సుల్లో తొలి విడత కౌన్సెలింగ్లోనే సీట్లు పొందుతున్నారు. సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేస్తున్నారు. ఆ తర్వాత వీరికి జోసా కౌన్సెలింగ్లోనూ సీట్లు వస్తున్నాయి. వాటిల్లోనూ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తున్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా పొందిన సీటును రద్దు చేసుకోకుండా ఎంసెట్ కౌన్సెలింగ్ అన్ని దశలు అయిపోయే వరకు అలాగే ఉంచి చివర్లో రద్దు చేసుకుంటున్నారు. ఈ సీట్లను ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు స్పాట్ అడ్మిషన్ ద్వారా భర్తీ చేస్తున్నాయి. ఈ క్రమంలో ముందే ఎక్కువ డబ్బులకు మాట్లాడుకున్న వారికి కాలేజీలు సీట్లు కేటాయిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో టాప్ ర్యాంకర్లకు కూడా ముందే వల వేసి ఒప్పందం చేసుకుంటున్నారని, ఈ మేరకు కొంత మొత్తం ముట్టజెబు తున్నారని విద్యార్థి, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో రూ.కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయని, ఉన్నతాధికారులకు సైతం ఇందులో వాటాలు ఉంటున్నాయని ఆరోపిస్తున్నాయి. ప్రైవేటు కాలేజీల దందాపై ప్రతి ఏటా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఈ తంతుపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా నివేదికలు ఇస్తున్నాయి. దీంతో ఈ అడ్డగోలు వ్యాపారానికి చెక్ పెట్టాలనే నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం.. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఏం చేయబోతున్నారు..? తొలిదశలోనే సీటు సాధించి చివరి కౌన్సెలింగ్ వరకూ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరని వారి వివరాలు సేకరిస్తారు. జాతీయ సంస్థలతో సమన్వయం చేసుకుని, జోసా కౌన్సెలింగ్లో వారికి సీటు ఎప్పుడొచ్చింది? ఎప్పుడు రిపోర్టు చేశారు? అనే వివరాలు సేకరిస్తారు. ఇదంతా విద్యార్థుల ఆధార్ నంబర్ ఆధారంగా చేయాలని భావిస్తు న్నారు. విద్యార్థులకు ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల ద్వారా లబ్ధి చేకూరిందా అనేది నిగ్గు తేల్చేందుకు వారి బ్యాంకు ఖాతాలతో పాటు తల్లిదండ్రులు, బంధువుల బ్యాంకు ఖాతాలను కూడా చెక్ చేసే వీలుందని ఓ అధికారి తెలిపారు. ప్రాథమిక ఆధారాలు లభిస్తే తక్షణమే జాతీయ సంస్థలతో మాట్లాడి ఆ విద్యార్థి ఎక్కడ సీటు పొందినా బ్లాక్ చేయాలనే ఆలోచనలో అధికారులున్నారు. ఈ క్రమంలో కాలేజీలు, విద్యార్థులపై కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడ బోమని అధికారులు అంటున్నారు. కాలేజీల సీట్ల వ్యాపారంలో పావులు కావొద్దంటూ విద్యార్థులను హెచ్చరించేలా ప్రచారం సైతం చేసేందుకు మండలి సిద్ధమవుతోంది. -
‘నీట్’లా ఇంజనీరింగ్కూ ఒకే ఎంట్రన్స్!
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్లో ఇక రాష్ట్రాల పరిధిలో ఎంసెట్ల నిర్వహణ ఉండే అవకాశం కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి ‘నీట్’ను నిర్వహిస్తున్న మాదిరిగానే అన్ని రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి జాతీయ స్థాయిలో ఒకే ప్రవేశపరీక్ష నిర్వహించే దిశగా కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ముసాయిదా ప్రతిని కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాలకూ పంపింది. మెజారిటీ రాష్ట్రాలు ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు తెలిసింది. దీంతో ఈ అంశంపై అవగాహనకు కేంద్రం సెమినార్లు నిర్వహిస్తోంది. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఉన్న డిగ్రీ, పీజీ సీట్ల భర్తీకి కూడా కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) ప్రయోగం విజయవంతమైంది. దీంతో జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశపరీక్షపై కేంద్రం దృష్టి పెట్టింది. గత కొన్నేళ్లుగా దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలతోపాటు కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యాసంస్థల్లోని ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు కేంద్రం జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహిస్తోంది. జేఈఈ మెయిన్లో అర్హత సాధించిన విద్యార్థులకు ఐఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష చేపడుతోంది. ఇదే మాదిరిగా రాష్ట్రాల ఇంజనీరింగ్ కాలేజీలనూ కలుపుకొని ఉమ్మడి ప్రవేశ పరీక్ష, కౌన్సెలింగ్ చేపట్టాలని 2016లోనే ఆలోచన చేసింది. కానీ వివిధ కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. కొనసాగుతున్న చర్చలు గత నెల 18న భువనేశ్వర్లో అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ), యూజీసీ, ఐఐటీల డైరెక్టర్లు, గవర్నింగ్ బాడీ చైర్మన్లతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశపరీక్షపై చర్చించారు. అయితే ఇందుకు సంబంధించి అనుసరించాల్సిన విధివిధానాలు, పొందుపరచాల్సిన నిబంధనలపై వివిధ వాదనలు వినిపించాయి. దీంతో అన్ని కోణాల్లోనూ పరిశీలించి, మార్పుచేర్పులతో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఐఐటీ గవరి్నంగ్ బాడీ చైర్మన్లను కేంద్ర మంత్రి ఆదేశించారు. దీంతో వారు అన్ని రాష్ట్రాలతో భేటీ అవుతూ అభిప్రాయసేకరణ చేపడుతున్నారు. 2025–26 నాటికి ఈ ప్రయోగాన్ని అమల్లోకి తేవాలనే ఆలోచనలో ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. విధానపరమైన నిర్ణయం తీసుకున్నాక ప్రస్తుతం రాష్ట్రాల పరిధిలో ఉన్న కాలేజీలకు రెండేళ్ల సమయం ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. అయితే ఐఐటీల నాణ్యతను ఏమాత్రం తగ్గించకుండా చూడాలని సమావేశంలో పాల్గొన్న విద్యావేత్తలు సూచించారు. నీట్, జేఈఈ మెయిన్ పరీక్షలతోపాటు కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)లో విలీనం చేసే యోచన ఉందని యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ జగదీశ్కుమార్ కూడా గతంలో అనేక సందర్భాల్లో తెలిపారు. నిబంధనలు పాటిస్తేనే అనుబంధ గుర్తింపు.. ఇంజనీరింగ్ సీట్ల భర్తీ జాతీయ స్థాయిలోకి వెళ్తే పూర్తిగా వెబ్ ఆధారితంగానే ఉంటుందని అధికారులు అంటున్నారు. యాజమాన్య కోటా కూడా కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేస్తారు. అనుబంధ గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీలన్నీ ఏఐసీటీఈ నిబంధనలు విధిగా పాటించాల్సి ఉంటుంది. మౌలిక వసతులు, నాణ్యమైన ఫ్యాకల్టి, కంప్యూటర్ ఆధారిత కోర్సుల్లో బోధన ప్రణాళిక మొత్తం కేంద్ర పరిధిలోకి వెళ్తుంది. ఫలితంగా కొన్ని ప్రైవేటు కాలేజీలు అనేక మార్పులు చేసుకోక తప్పదని ఓ అధికారి పేర్కొన్నారు. ఇప్పటివరకు యూనివర్సిటీ అధికారులే తనిఖీలు చేసేవాళ్లు. ఇకపై జాతీయ స్థాయిలోనూ ప్రత్యేక బృందాలు తనిఖీలు చేసి అనుమతిస్తేనే ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు లభిస్తుందని తెలుస్తోంది. ఈ విధానంతో యాజమాన్య కోటా సీట్ల బేరసారాలకు బ్రేక్ పడుతుందని అధికార వర్గాలు అంటున్నాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement