-
మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
ఆదిలాబాద్: విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే బ్యాంక్ ఉద్యోగులు వీకెండ్లో సరదాగా గడిపేందుకు మహారాష్ట్రకు వెళ్లారు. అక్కడి హిల్స్టేషన్లోని చిక్కల్ధార ప్రాంతాన్ని సందర్శించేందుకు ఆదివా రం తెల్లవారుజామున కారులో పయనమయ్యారు. మరికొద్ది క్షణాల్లో గమ్యస్థానానికి చేరుకోనుండగా ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఉదయం 8 గంటల ప్రాంతంలో 200 అడుగుల లోతులో పడడంతో కారు నుజ్జునుజ్జయ్యింది. నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కారులో డ్రైవర్తో పాటు మరో ఏడుగురు ప్రయాణిస్తుండగా నలుగురు తీవ్ర గాయాలతో బతికి బయటపడ్డారు. స్నేహితుల మృతదేహాలను చూసి వారు బోరున విలపించారు. స్థానికులు మహారాష్ట్ర పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అమరావతి, పరత్వాడ ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలకు చిక్కల్ధర ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. ఈ ఘటనతో ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం అర్లి(టి) గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, తోటి ఉద్యోగులు, అధికారులు సంఘటన స్థలానికి పయనం అయ్యారు. మరణంలోనూ వీడని స్నేహబంధం.. భీంపూర్ మండలం అర్లి(టి) గ్రామానికి చెందిన షేక్ సల్మాన్, బొల్లి వైభవ్ కొన్నేళ్లుగా ప్రాణస్నేహితులుగా ఉంటున్నారు. ఇటీవల గ్రామంలో జరిగిన పొలాల అమావాస్య వేడుకల్లో సైతం ఇద్దరు కలిసి బసవన్నలను ఊరేగించారు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఇద్దరూ దుర్మరణం పాలవడం గమనార్హం. బ్యాంకు ఉద్యోగాలతో స్నేహితులుగా మారి.. వేర్వేరు జిల్లాల్లో పుట్టి పెరిగిన వీరంతా ఉద్యోగరీత్యా ఆదిలాబాద్ జిల్లాలో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఏర్పడిన స్నేహంతో సరదా కోసం చేసిన వీకెండ్ ట్రిప్ విషాదాన్ని మిగిల్చింది. జిల్లాలోని వివిధ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శాఖల్లో ఉద్యోగం చేస్తున్న యువకులకు ఆర్లి(టి) గ్రామానికి చెందిన షేక్ సల్మాన్తో స్నేహం ఏర్పడింది. సల్మాన్ సొంతంగా వాహనాన్ని నడుపుతూ ఉపాధి పొందుతున్నాడు. కాగా అర్లి(టి), భీంపూర్తో పాటు వివిధ బ్యాంక్ శాఖలకు అప్పుడప్పుడు జిల్లా బ్యాంకు నుంచి నగదు రవాణా కోసం ఈయన వాహనాన్ని బ్యాంకు ఉద్యోగులు అద్దెకు తీసుకునేవారు. ఈ క్రమంలో ఏర్పడిన స్నేహంతో వీరంతా కలిసి వీకెండ్ కోసం వెళ్లే క్రమంలో ప్రమాదానికి గురయ్యారు. మృతులు వీరే.. ఆదిలాబాద్ జిల్లాలోని దక్కన్ గ్రామీణ బ్యాంక్లో పనిచేస్తున్న ఆరుగురు ఉద్యోగులతో పాటు అర్లి(టి)కి చెందిన మరో ఇద్దరు మహారాష్ట్రలోని చిక్కల్ధర ఆహ్లాదకర ప్రాంతా న్ని సందర్శించేందుకు ఆదివారం తెల్లవారుజామున బయల్దేరి వెళ్లారు. కారు అదుపు తప్పి చిక్కల్ధర లోయలో పడిపోయింది. ఈ ఘటనలో భీంపూర్ మండలం అర్లి(టి) సర్పంచ్ గొల్లి రమ – లస్మన్నల కుమారుడు వైభవ్ యాదవ్ (28), అదే గ్రామానికి చెందిన షేక్చాంద్ – రుక్సానా దంపతులకు మారుడు, కారు డ్రైవర్ షేక్ సల్మాన్ (31), నల్గొండ జిల్లా మునుగోడు మండలం కొర్టికల్కు చెందిన అద్దంకి శివకృష్ణ (31), అదే జిల్లాలోని తిప్పర్తి మండలం మల్లెపల్లివారి గూడెంకు చెందిన కోటేశ్వర్రావు (27) అనే నలుగురు మృత్యు ఒడిలోకి చేరారు. కాగా ఖమ్మం జిల్లా పొన్నెకల్కు చెందిన శ్యామ్రాజ్, నల్గొండలోని మిర్యాలగూడకు చెందిన యోగేష్యాదవ్, అదే జిల్లాలోని కేటపల్లి మండలం చీకటిగూడెంకు చెందిన హరీష్, ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన సుమన్ తీవ్ర గాయాలతో బయటపడ్డారు. కాగా మృతి చెందిన శివకృష్ణ తాంసి మండలంలోని కప్పర్ల టీజీబీ శాఖలో క్యాషియర్గా, కోటేశ్వర్రావు భీంపూర్ మండల కేంద్రంలోని టీజీబీ శాఖలో క్యాషియర్గా పనిచేస్తున్నారు. అలాగే అర్లి(టి)కి చెందిన వైభవ్ కాటన్ కమీషన్ ఏజెంట్, సీడ్స్ అండ్ ఫర్టిలైజర్ షాపు నిర్వహిస్తున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు కావడంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. తల్లిదండ్రులు కుమారుడి మృతిని తట్టుకోలేక కుప్పకూలిపోయారు. వారు రోధించిన తీరు పలువురిని కలిచివేసింది. రాత్రి వరకు కూడా మృతదేహాలు ఇంటికి చేరుకోలేదు. ఇదిలా ఉండగా గాయపడ్డ వారిలో శ్యామ్రాజ్ రెడ్డి అర్లి(టి)లో క్యాషియర్గా, సుమన్ జైనథ్ మండలం పెండల్ వాడలో క్యాషియర్గా, యోగేష్ యాదవ్, హరీష్లు బేల మండల కేంద్రంలో ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు జిల్లాకేంద్రంలో అద్దెకు ఉంటూ నిత్యం విధులకు హాజరవుతున్నారు. కష్టపడి కొలువు సాధించి కుటుంబాలకు అండగా ఉంటున్న తరుణంలో అనుకోని రీతిలో ఇద్దరు మృతిచెందడం వారి కుటుంబాలకు తీరని శోకం మిగిల్చింది. అలాగే షేక్ సల్మాన్ వాహనాన్ని కొనుగోలు చేసి తన కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నాడు. ఈ తరుణంలో కుటుంబ దిక్కు కోల్పోవడంతో విషాదం నెలకొంది. ఈయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. -
టాలీవుడ్లో సాయి పల్లవి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా?
ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. వైవిధ్యమైన కథలు, పాత్రల్లో నటిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయిన తనదైన నటన, డ్యాన్స్లో ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రమంలో ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ చేత లేడీ పవర్ స్టార్గా పిలుపించుకుంది సాయి పల్లవి. ఇదిలా ఉంటే ఇటీవల ఆమె నటించిన విరాట పర్వం మంచి విజయం అందుకుంది. చదవండి: ప్రస్తుతం ఆ సమస్యతో పోరాటం చేస్తున్నా: శ్రుతి హాసన్ దీంతో విరాట పర్వం చిత్రం బృందం మూవీ సక్సెస్ మీట్స్, ఇంటర్య్వూలతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ టీవీ చానల్తో ముచ్చటించిన సాయి పల్లవి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. టాలీవుడ్లో తనకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారంటూ ఇద్దరు స్టార్ హీరోల పేర్లు చేప్పింది ఆమె. అయితే వారిద్దరు ఒకే కటుంబానికి చెందిన వారు కావడం విశేషం. కాగా అక్కినేని హీరోలు నాగచైతన్య, దగ్గుబాటి వారసుడు రానాలు పరిశ్రమలో తనకు మంచి స్నేహితులని, వారితో ఒక ఫ్యామిలీ అనే ఫిలింగ్ వస్తుందని చెప్పింది. ఒకే ఫ్యామిలీలా రానా, చైతులు తనపై కేర్ తీసుకుంటారని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. చదవండి: ఓటీటీలోకి 'విరాట పర్వం’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే.. ఇటీవల నాగ చైతన్య సరసన ఆమె నటించిన లవ్స్టోరీ మూవీ బ్లాక్బస్టర్ హిట్ను అందుకుంది. అలాగే తాజాగా రానాతో నటించిన విరాట పర్వం కూడా మంచి విజయం సాధించింది. కాగా సాయి పల్లవి ప్రస్తుతం ‘గార్గి’ చిత్రంలో నటిస్తుంది. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే సాయి పల్లవి బర్త్డే సందర్భంగా విడుదలైన ఫస్ట్లుక్ పోస్టర్, మేకింగ్ వీడియోలకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. మహిళా ప్రధాన చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతుంది. -
వారం రోజుల్లో పెళ్లి.. ఇదేంటే.. అసలు విషయం తెలిసి
‘‘కావ్యా (పేరుమార్చడమైనది) ఒక్కసారి కళ్లు తెరువమ్మా! ఏమైందే. వారం రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఇప్పుడిలా చేశావ్, నీకీ పెళ్లి ఇష్టం లేకపోతే ముందే చెబితే సరిపోయేది కదా!’’ సుభద్రమ్మ ఏడుస్తునే ఉంది. ‘‘నువ్వు కాసేపు మౌనంగా ఉండు’’ అంటూ భర్త రాఘవరావు సుభద్ర మీద కేకలేశాడు. కాసేపటికి కావ్య లేచి తల్లిదండ్రులని చూసి, తలదించుకుంది. ‘‘ఏమైందమ్మా! కాస్త ఆలస్యమైతే ఎంత దారుణం జరిగేది. ఉరివేసుకునే పరిస్థితి ఎందుకొచ్చింది తల్లీ’’ అనునయంగా అడిగాడు రాఘరావు. ఆ మాటలతో కావ్య తండ్రిని పట్టుకుని ఏడుస్తూనే ఉండిపోయింది. ‘‘నీకు ఇష్టమని చెప్పాకనే కదా, పెళ్లి పెట్టుకున్నది..’ సందేహంగా అడిగాడు కూతుర్ని. ‘‘నిజమే నాన్నా!’’ అంటూ ఎలా చెప్పాలో తెలియక ఆగిపోయిన కూతుర్ని చూసి, భయమేమీ లేదమ్మా ఇప్పటికైనా చెప్పు. ‘‘పెళ్లి ఆపేద్దామంటే వాళ్లకు చెప్పేస్తే. నీ చావు చూసే పెళ్లి వద్దమ్మా!’ అన్నాడు రాఘరావు. ‘‘అది కాదు నాన్న నేను ఎంతగానో నమ్మిన వంశీ (పేరుమార్చడమైనది) నన్ను టార్గెట్ చేశాడు’’ ఏడుస్తూనే చెప్పింది కావ్య. అర్థం కాక ‘‘వంశీ నీ బెస్ట్ ఫ్రెండ్ కదమ్మా, ఏమైంది’’ కంగారుగా అడిగాడు. కూతురు చెప్పిన విషయం వినడంతోనే రాఘవరావు కోపంతో ఉగిపోయాడు. ∙∙ కావ్య తన క్లాస్మేట్ వరుణ్(పేరు మార్చడమైనది)తో స్నేహంగా ఉండేది. బీటెక్ నాలుగేళ్లూ ఇద్దరూ చాలా క్లోజ్గా తిరిగారు. పెద్దలకు చెప్పి, పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ, ఇద్దరికీ అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయారు. ఇద్దరూ ఒక అవగాహనతో తాము క్లోజ్గా ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలు, వీడియోలు డిలీట్ చేసుకున్నారు. రెండుమూడు నెలల వరకు ఎవరి పనుల్లో వారుండిపోయారు. ఓ రోజు ఫ్రెండ్ ఫోన్ చేసి, డేటింగ్ సైట్స్లో కావ్య వరుణ్ క్లోజ్గా ఉన్న వీడియోలు, ఫోటోలు ఉన్నాయని చెప్పింది. వాటిని కావ్య చూసింది. వరుణ్కి ఫోన్ చేసి తిట్టింది కావ్య. తనేమీ వాటిని షేర్ చేయలేదని రివర్స్ అయ్యాడు వరుణ్. ఈ విషయాన్ని తన బెస్ట్ ఫ్రెండ్ అయిన వంశీకి చెప్పింది. ఎలాగైనా ఆ సైట్స్ నుంచి తన ఫొటోలు డిలీట్ చేయించమని వేడుకుంది. కావ్య చెప్పినట్టు వంశీ వాటిని వివిధ సైట్స్ నుంచి తొలగించేశాడు. ‘హమ్మయ్య’ అనుకుని వంశీకి ‘థాంక్స్’ చెప్పింది. ఆరు నెలల తర్వాత ఇంట్లో పెద్దలు చూసిన సంబంధానికి ఓకే చెప్పింది. త్వరలో పెళ్లి అనుకున్నారు. భవిష్యత్తు సంతోషంగా ఉండబోతుందనుకున్న కావ్యకు పాత వీడియోలు, ఫొటోలు మళ్లీ వివిధ రకాల సైట్లలో అప్లోడ్ అయి ఉండటంతో షాకైంది. వంశీని అడిగితే పెళ్లికి ముందు తనతో గడిపితేనే, అవన్నీ తీసేస్తానని, లేదంటే సమాచారం అంతా పెళ్లికొడుక్కి చేరుతుందని బెదిరించడం మొదలుపెట్టాడు వంశీ. షాకైంది కావ్య. ‘సైట్స్ నుంచి తొలగించినట్టే తొలగించి, అవన్నీ దాచిపెట్టుకొని, పెళ్లి కుదిరే సమయానికి పాత వీడియోలను, ఫొటోలను అడ్డుపెట్టుకొని తన జీవితంతో ఆడుకుంటున్నాడ’ని అర్ధమైంది కావ్యకు. పెళ్లి ఆగిపోతుందని, పరువు పోతుందని భయపడి చావే శరణ్యం అనుకుంది. విషయమంతా తెలుసుకున్న రాఘరావు కూతురుని తీసుకొని పోలీసులను ఆశ్రయించాడు. కావ్య జీవితాన్ని నాశనం చేయాలనుకున్న వంశీ ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతున్నాడు. వ్యక్తిగత వివరాలు గోప్యం కొందరు సన్నిహితంగా ఉన్నప్పుడు ఫొటోలు, వీడియోలు తీసుకుంటుంటారు. చాలాసార్లు సీక్రెట్ కెమెరాల ద్వారా వీడియోలు తీస్తుంటారు. ఇద్దరి మధ్య సంబంధం చెడినప్పుడు వీటిని అడ్డుగా పెట్టుకొని ముఖ్యంగా అమ్మాయిలను రకరకాలుగా బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. వివిధ రకాల యాప్ల ద్వారా ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి పోర్న్సైట్లలో పెట్టడం ఎక్కువగా జరుగుతోంది. అందుకని ముఖ్యంగా అమ్మాయిలు జాగ్రత్తగా ఉండటం అవసరం. పరువు పోతుందని పొలీసులను సంప్రదించకుండా మూడోమనిషి సాయం తీసుకుంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది. నేరాలకు అడ్డుకట్ట వేయాలంటే ముందు కేసు ఫైల్ చేయాలి. వారి వివరాలు పూర్తి గోప్యంగా ఉంచుతాం. సమస్యకూ సత్వరమే పరిష్కారం అందుతుంది. సైబర్ క్రైమ్ సమస్యలకు htps://4s4u.appolice.gov.in/ ఫోన్ నెంబర్: 90716 66667 సంప్రదించవచ్చు. – జి.ఆర్. రాధిక, ఎస్పీ, (సైబర్ క్రైమ్ విభాగం), ఏపీ పోలీస్ బ్లాక్ చేయకూడదు.. బ్లాక్మెయిల్ చేస్తున్నారనగానే వెంటనే భయపడిపోతారు. వేధింపులు భరించలేక సదరు వ్యక్తి నెంబర్ బ్లాక్ చేస్తుంటారు. ఒకసారి వేధించాలనుకున్న వ్యక్తి రకరకాల మార్గాల ద్వారా బెదిరింపులకు దిగుతాడు. డబ్బులు ఇస్తామనో, మరో విధంగానో కాంప్రమైజ్ అవుతాను అనే ధోరణి నుంచి బయపడాలి. బ్లాక్మెయిల్ చేస్తున్నాడనగానే వారి డేటా, కాల్ రికార్డ్ చేసుకోవాలి. అన్ని మెసేజ్లను స్క్రీన్ షాట్స్ చేసి పెట్టుకోవాలి. వెంటనే http://www.cybercrime.gov.in/ నేషనల్ పోర్టల్లో రిపోర్ట్ చేయాలి. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్!
ప్రముఖ నటులు రజనీకాంత్, మోహన్బాబుల స్నేహం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇటీవల ఈ ఇద్దరు మిత్రులు కలుసుకున్నారు. రజనీకాంత్, మోహన్బాబు కలిసి ఉన్న ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ‘అన్నాత్తే’ సినిమా చిత్రీకరణ కోసం హైదరాబాద్ వచ్చారు రజనీకాంత్. ఈ సినిమా హైదరాబాద్ షెడ్యూల్ చిత్రీకరణను ముగించుకుని తిరిగి చెన్నై వెళ్లడానికి ముందు తన ఆత్మీయ మిత్రుడు మోహన్బాబు ఇంటికి వెళ్లారు. రెండు రోజుల పాటు మిత్రుడి ఇంట్లో ఉన్న రజనీ ఆ తర్వాత ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లారు. కాగా రజనీ, మోహన్బాబు ఇద్దరూ దిగిన ఫోటోలను, ఈ ఇద్దరితో కలిసి దిగిన ఫోటోను ‘ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్’ అంటూ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశారు మంచు విష్ణు. -
ఆ స్నేహపాశం తెగిపోలేదు..
కులం, మతం అనేవి ఉంటాయని కొంచెం వయసు వచ్చాక తెలుస్తుంది. ‘మీరేవిట్లు’ అని ఎవరో అడుగుతారు. ఇంటికొచ్చి అమ్మను అడుగుతాం ‘అమ్మా.. మీరేవిట్లు అంటే ఏంటి?!’ అని. కొన్నాళ్లు ఆ కన్ఫ్యూజన్ వేధిస్తుంటుంది. అందరూ ఒకేలా ఉండకుండా ఏంటిది! అని. బెస్ట్ ఫ్రెండ్ రహీమ్ గాడు మసీదుకు వెళతాడని తెలిసినా.. ఎందుకు వాళ్లింట్లో వాళ్లు గుడికి రారు అనే సందేహం అప్పటి వరకు కేశవ్ కి వచ్చి ఉండదు. వాళ్లింటికి మసీదు దగ్గర కాబట్టి వాళ్లంతా అక్కడికి వెళ్తుంటారు అనుకుంటాడు. రహీమ్కీ ఇవేమీ తెలియవు. కేశవ్ గాడితో అప్పటికే అనేకసార్లు గుడికి కూడా వెళ్లి, చేతిలో కేశవ్ వాళ్ల అమ్మ పెట్టిన కొబ్బరి ముక్కను తనూ కళ్లకు అద్దుకుని తినే ఉంటాడు. పెద్దయ్యాక ఇవేవీ ఉండవు. లేకుండా చేస్తాయి సంప్రదాయాలు, ఆచారాలు. రహీమ్, కేశవ్ ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్ గానే ఉంటారు. కేశవ్కి ఐ.ఐ.టి లో సీటు రావాలని రహీమ్ అల్లాను ప్రార్ధిస్తాడు. రహీమ్కి వీసా రావాలని కేశవ్ వేంకటేశ్వరుడిని వేడుకుంటాడు. మనిషి ఉన్నంతకాలం ఈ స్నేహం ఉంటుంది. ‘పెట్టె’ ను మోయడానికి కేశవ్, ‘కట్టె’ ను మోయడానికి రహీమ్ భుజం ఇస్తూనే ఉంటారు. రామ్ నరేష్ దూబే, సయ్యద్ వాహిద్ అలీ బెస్ట్ ఫ్రెండ్స్. స్కూల్ మేట్స్. కాలేజ్ మేట్స్. మధ్యప్రదేశ్, సాగర్ జిల్లాలోని చతుర్భట గ్రామం వాళ్లది. అలీ లాయర్ అయ్యాడు. దూబే పురోహితుడు అయ్యాడు. మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో అలీ చనిపోయినప్పుడు దూబే తన వృత్తిబాట్లను తెంచుకుని మరీ వెళ్లి అలీతో మరుభూమి వరకు నడిచాడు. ఆ స్నేహపాశం తెగిపోలేదు. ఇప్పుడివి ఆలయాలలో పూజలు జరిపించి పితృదేవతలకు తర్పణం వదిలే రోజులు. ఏటా పక్షం రోజులు ఉంటాయి. ఈ ఏడాది.. పితృదేవతలతో పాటు తన మిత్రుడికీ తర్పణం వదిలాడు దూబే!! దేవతలారా దీవించండి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
Advertisement