-
ఆయన జీవితమే సంగీతం: అవంతి శ్రీనివాస్
సాక్షి, విశాఖపట్నం: ప్రపంచ ప్రజల భాష సంగీతం. మనసును కదిలించేది, మనిషిలో చైతన్యాన్ని రగిలించేది సంగీతం. కర్ణాటక సంగీత చరిత్రలో మంగళంపల్లి బాలమురళీకృష్ణతో పోల్చదగిన ప్రతిభావంతుడు మరొకరులేరని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. సిరిపురం వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో మంగళవారం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి సందర్భంగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక సంగీతంలోనే కాదు.. భారతీయ శాస్త్రీయ సంగీతంలోనే అంతటి విలక్షణ కళాకారుడు లేరని పేర్కొన్నారు. కీర్తిధన సంపాదనలో ఆరోహణే తప్ప అవరోహణ ఎరుగని గొప్ప కళాకారుడన్నారు. ఆ గొప్ప కళామేధావి తెలుగువారు కావడం గర్వకారణమని ఆయన చెప్పారు. రాబోయే తరాలకు బాలమురళీకృష్ణ గొప్పతనాన్ని తెలియజేయాలన్నారు. కలెక్టర్ వి.వినయ్చంద్ మాట్లాడుతూ పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని, ఆ మరిమళమే బాలమురళీకృష్ణ అని పేర్కొన్నారు. అంతటిగొప్ప కళాకారుడు జయంత్యుత్సవాల్లో పాల్గొనడం గర్వంగా ఉందన్నారు. కళాకారులు వంకాయల వెంకటరమణమూర్తి, డాక్టర్ పంతుల రమ, ఎం.శ్రీనివాస నరసింహామూర్తి, కె.సరస్వతి, గురువిల్లి అప్పన్న, డాక్టర్ మండపాక శారద, ధనవాడ ధర్మారావు, డాక్టర్ బీకేడీ ప్రసాద్, ధనుంజయ పట్నాయక్లను మంత్రి ముత్తంశెట్టి, కలెక్టర్ వినయ్చంద్ సత్కరించారు. అంతకుముందు మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి.సృజన, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మల్లికార్జునరావు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు పి.అరుణ్బాబు, కల్పనా కుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
షాడో మంత్రి వీరంగం
ఆయన షాడో మంత్రి. అధికార పార్టీలో అందరికి సుపరిచితుడు. ఇక పైరవీలు చేసే నేతలకు అయితే ఆయన బాగా సన్నిహితం. నెల్లూరు నగరంలో షాడో మంత్రిగా వ్యవహరిస్తూ మంత్రి నారాయణకు అన్నీ తానై వ్యవహరిస్తున్న వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి వ్యవహారశైలి తరచూ వివాదంగా మారుతోంది. తాజాగా సోమవారం చిన్నబజార్ పోలీస్స్టేషన్లో ఎన్నికల విధుల్లోని పోలీసులు, అధికారులపై వీరంగం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న నారాయణ సిబ్బందినే స్టేషన్కు తీసుకువస్తారా అంటూ నానా యాగీ చేసి పోలీసులపై మండిపడుతూ గందరగోళం సృష్టించారు. అయినా పోలీసులు మాత్రం నోరు మెదపని పరిస్థితి. అదే గతంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే పార్టీ కార్యకర్తల విషయంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తే జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఆగమేఘాల మీద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కానీ అధికార పార్టీ నేతగా ఉన్న పట్టాభి రామిరెడ్డి విషయంలో మాత్రం, అదీ ఎన్నికల కోడ్ అమలులో ఉండగా జిల్లా పోలీసు బాస్ మొదలుకొని నగర డీఎస్పీ వరకు ఒక్కరు కూడా పట్టించుకోకుండా వ్యవహరిస్తూ పచ్చచొక్కాలు ధరించిన పోలీసుల్లా మారడం సర్వత్రా వివాదంగా మారింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. ప్రజాభిమానం లేని నారాయణ కేవలం కరెన్సీ నోట్లనే నమ్ముకుని రాజకీయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సొంత పార్టీ నేతలను కూడా నమ్మకుండా సొంత మనుషుల ద్వారా డబ్బు వ్యవహారాలకు తెరతీశారు. తన విద్యా సంస్థల్లోని సిబ్బందితో అడగడుగునా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ, ఓటర్లకు తాయిలాలు పంపిణీ చేస్తూ ప్రజలకు దొరికిపోతున్నారు. అందులో భాగంగా ఆదివారం, సోమవారం వరుసగా రెండు రోజుల పాటు నెల్లూరు నగరంలో డబ్బులు పంచుతూ స్థానికులకు రెడ్హ్యండెడ్గా పట్టుబట్టారు. అది కూడా నారాయణ విద్యాసంస్థల్లో కీలక స్థాయి ఉద్యోగులే కావడం విశేషం. ఆదివారం 43వ డివిజన్లో డబ్బు పంచడానికి నారాయణ విద్యాసంస్థల ఏజీఎం రమణారెడ్డి రూ.8.30 లక్షలతో ఉండగా స్థానికులు పట్టుకున్నారు. పోలీసులు యథావిధిగా కేసు నమోదు చేసి సాయంత్రానికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేశారు. ఇక సోమవారం నగరంలోని 40వ డివిజన్లో నారాయణ విద్యాసంస్థల లెక్చరర్ బాలమురళీకృష్ణ రూ.50 వేల నగదు ఎవరెవరికి పంపిణీ చేయాలనే దానికి సంబంధించిన స్లిప్పులు, టీడీపీ కండువాలతో చిక్కారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు పట్టుకొని చిన్నబజార్ స్టేషన్లో అప్పగించారు. బాలమురళీతో పాటు మరో ముగ్గురు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి అనుచరుడు పట్టాభి చిన్నబజార్ స్టేషన్కు చేరుకుని తమ వాళ్లను ఎలా పట్టుకుంటారని పోలీసులపై మండి పడ్డారు. నారాయణ సిబ్బంది నారాయణకు కాకుండా మీకు పనిచేస్తారా అంటూ తీవ్రంగా ఆవేశంతో ఉగిపోయారు. పోలీస్స్టేషన్లో గందరగోళం నెలకొనడంతో డీఎస్పీ మురళీ కృష్ణ స్టేషన్కు చేరుకుని అనేక తరన్జనభర్జల అనంతరం డబ్బులతో దొరికిన బాలమురళీ కృష్ణపై కేసు నమోదు చేసి మిగిలిన వారికి సంబంధం లేదంటూ పంపేశారు. ఇదేమి పోలీసు రాజ్యం కొద్ది రోజుల క్రితం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని పోలీసులు అకారణంగా అరెస్ట్ చేశారు. రూరల్ నియోజకవర్గంలో సర్వే నిర్వహిస్తున్న టీడీపీ వ్యక్తులను స్థానిక వైఎస్సార్సీపీ నేతలు ఆపి వారిని స్టేషన్లో అప్పగించారు. పోలీసులు సర్వే టీమ్ సభ్యుల నుంచి ఫిర్యాదు తీసుకుని పార్టీ కా>ర్యకర్తలపై కేసు నమోదు చేశారు. ఇదేమి అన్యాయం అని స్టేషన్కు వెళ్లి ప్రశ్నించిన ఎమ్మెల్యే కోటంరెడ్డిపై పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని నాన్బెయిలబుల్ కేసు నమోదు చేసి హైడ్రామా నడుమ అరెస్ట్ చేశారు. వాస్తవానికి ప్రజాప్రతినిధికి జరిగిన విషయంపై ప్రశ్నించే హక్కు ఉంటుంది. అయితే ఎలాంటి హోదాలేని వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి స్టేషన్లో నానా యాగీ చేసినా పోలీసులు మాత్రం మౌనం వహించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. పైగా ఎన్నికల విధుల్లో ఉండి, ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చాక పోలీసులు మరింత పక్కగా ఎన్నికల నియామావళికి లోబడి పనిచేయాలి. కానీ ఇక్కడి పోలీసులు మాత్రం నారాయణ అడుగులకు మడుగులు ఒత్తడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. పట్టాభి తీరు అంతే పట్టాభి రామిరెడ్డి వ్యవహారశైలి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంటుంది. నగర టీడీపీలో నేతలుగా ఉన్న కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, తాళ్లపాక ఆనురాధ తదితరులు ఇప్పటికే పట్టాభి తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలోనూ పట్టాభి వ్యవహారంపై అనేక సార్లు మంత్రి వద్ద, రెండు సార్లు చంద్రబాబు వద్ద కూడా పంచాయితీ జరిగింది. పట్టాభిపై ఉన్న వ్యతిరేకతతో 2016లో టీడీపీ నేతల గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసిన అతన్ని ఓడించారు. మరో వైపు ఎన్నికల సమయంలో బ్యాలెట్ పేపర్తో పాటు పట్టాభి చేసిన అరాచకాల్ని ఓటర్లు కాగితంపై రాసి బ్యాలెట్ పేపర్తో కలిపివేయడంతో అప్పట్లో చర్చనీయాంశమైంది. ఎన్నికల సమయంలో ఉద్యోగులను వేధించిన తీరును, పట్టాభి ఆడియో టేపులను సీపీఎం నేతలు విడుదల చేశారు. మొత్తం మీద ఈ వ్యవహారంపై వైఎస్సార్సీపీ నేతలు, రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించనున్నారు. -
సంగీత సాహిత్య సమలంకృతే
సంగీతానికి బాలమురళీకృష్ణ. సాహిత్యానికి సి.నారాయణరెడ్డి. సంగీత సాహిత్య సమలంకృతంగా వారి పిల్లలైన రవాలను, వాహినులను సాక్షి ఫ్యామిలీ ఇంటర్వ్యూ చేసింది. ఆయన సంగీతాన్ని పండితపామరులకు చేరువ చేశారు. సంగీతంతో ప్రపంచాన్ని తన్మయత్వంలో ముంచెత్తారు. మరి మంగళంపల్లి బాలమురళీకృష్ణ తండ్రిగా ఎలా ఉండేవారు? పిల్లలతో ఎలా గడిపేవారు? ఈరోజు ఫాదర్స్డే. ఈ సందర్భంగా సాక్షి ఫ్యామిలీ.. ఆయన ఆరుగురు పిల్లల్ని పలకరించింది. ఆ తండ్రి అను‘రాగాల’ గురించి తెలుసుకుంది. మురళీ రవాలు పెద్దబ్బాయి అభిరామ్, రెండో అబ్బాయి సుధాకర్, మూడో అబ్బాయి వంశీమోహన్, పెద్దమ్మాయి కాంతి (అమ్మాజీ), రెండో అమ్మాయి లక్ష్మి, మూడో అమ్మాయి మహతి. పెద్దబ్బాయి ప్రింటింగ్ డిపార్ట్మెంట్లో స్టేట్ గవర్నమెంట్లో పనిచేసి రిటైరయ్యారు. రెండో అబ్బాయి, మూడో అబ్బాయి డాక్టర్లు. పెద్దమ్మాయి బీఏ మ్యూజిక్ ఫిలాసఫీ, సైకాలజీ, రెండో అమ్మాయి బీఎస్సీ, మూడో అమ్మాయి ఎంఏ ఇంగ్లిష్. పెద్దమ్మాయి అమ్మాజీ నేను అందరికంటె పెద్దదాన్ని. నన్ను నాన్నగారు అమ్మాజీ అని పిలిచేవారు. మా నాయనమ్మ గారి పేరు సూర్యకాంతమ్మ. అందువల్ల నాకు సూర్యకాంతి అని పేరు పెట్టారు. కాని అమ్మాజీ అని పిలిచేవారు. నాన్నగారు మాతో చాలా స్నేహంగా, ఎంతో సరదాగా ఉండేవారు. కాలేజీలో సంగీతం పోటీలలో మొదటి బహుమతి వచ్చిన రోజున, ఆ విషయం అమ్మకు చెప్పాను. అమ్మ నాన్నతో చెబితే, ఆయన నన్ను దగ్గరకు తీసుకున్నారు. నాకు ఆనందంతో కళ్లల్లో నీళ్లు వచ్చాయి. ఇప్పటికీ ఆ సంఘటన నేను మరచిపోలేను. నా పెళ్లికి ముందు నాన్నగారి కచేరీలలో వెనకాలే కూర్చుని తంబురా వేసేదాన్ని. నాన్నగారితో పాడాను కూడా. నాన్నగారు రాసిన కల్యాణవసంతం రాగంలో ‘గానమాలించి’ కీర్తన నాకు చాలా ఇష్టం. మా వారి ఉద్యోగరీత్యా మేం పంజాబ్ భటిల్డాలో ఉన్నప్పుడు, నాన్న ఒకసారి మా ఇంటికి వచ్చారు. నాన్నగారికి జనం మధ్యన ఉండటం చాలా ఇష్టం. అందుకని మా వారితో పనిచేసేవారిని భోజనానికి పిలిచాం. వారందరితో కలిసి నాన్న డిన్నర్ చేశారు. వారంతా నాన్నని పాట పాడమన్నారు. నాన్న వారి కోసం కచేరీ చేశారు. వాళ్లు ఎంతో పరవశించిపోయారు. నాన్నగారి షష్టిపూర్తి, 81వ పుట్టినరోజు వేడుకలు మేం ఆరుగురం కలిసి చేశాం. మేం అలా సరదాగా వేడుక చేయడం చూసి నాన్న ఎంతో సంబరపడ్డారు. రెండో అమ్మాయి లక్ష్మి మాతో క్యారమ్స్ ఆడేవారు నాన్న. అప్పుడప్పుడు అందరం కూర్చుని ప్లేయింగ్ కార్డ్స్ ఆడేవాళ్లం. గోదావరి జిల్లాలకు ప్రత్యేకమైన అడ్డాట మాతో బాగా అడేవారు. సరదా కోసం రమ్మీ కూడా ఆడేవారు. అందరం నాన్నతో కలిసి కూర్చుని భోజనం చేసేవాళ్లం. అన్నం కలిపి మా అందరికీ ముద్దలు పెట్టేవారు. నాన్నగారి 75 సంవత్సరాల పుట్టినరోజు పండుగకు నేను ప్లాటినమ్ రింగ్ బహుమతిగా ఇచ్చాను. అది చూసి నాన్న మురిసిపోతూ, చేతికి పెట్టుకుని, ‘లక్ష్మీ నీ ఉంగరం పెట్టుకున్నాను చూశావా’ అన్నారు. ఇచ్చిన బహుమతి చిన్నదా, పెద్దదా అనే ఆలోచనే ఆయనకు ఉండదు. వస్తువు విలువ గురించి అస్సలు పట్టించుకునేవారు కాదు. అలాగే ఏది చేసి పెడితే అది మాట్లాడకుండా తినేసేవారు. రుచి ఎలా ఉన్నా, ‘ఎంతో బాగుంది’ అనేవారు. రెండో అబ్బాయి సుధాకర్ నాన్నగారికి అందమైన బాల్యం లేదు. అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు లేరు. ఆయన ఒక్కరే. ఆరో ఏట నుంచే సంగీతం పాడటం ప్రారంభించారు. సంగీతంతోనే ఆయన జీవితం గడిచిపోయింది. అందుకే ఆడే లోటును ఆయన మాతో తీర్చుకున్నారు. మనవలతో కూడా సరదాగా ఆడేవారు. మాకోసం సింగపూర్ నుంచి టేప్ రికార్డర్ తెచ్చారు. అది ఇప్పటికీ మా దగ్గర ఉంది. నాలుగు సంవత్సరాల క్రితం నాన్నగారు సంగీత కచేరీ చేయడానికి వాషింగ్టన్ డిసి వచ్చారు. అప్పుడు నేను, నా భార్య న్యూయార్క్లో ఉన్నాం. నాన్నగారి దగ్గరకు వెళ్లి రెండు రోజులు అక్కడే సరదాగా గడిపాం. అక్కడ మా రెండో అమ్మాయి లాస్యతో కలిసి అందరం నాన్నగారి కచేరీకి వెళ్లాం. అక్కడ చాలామంది అమెరికన్లు మొట్టమొదటిసారిగా దక్షిణ భారత సంగీత కచేరీ వినడానికి వచ్చారు. వారంతా నాన్నగారి కచేరీ విని సంబరపడిపోయారు. నాన్న పాటకు తాళం వేశారు. ఆ నాటి దృశ్యం మా జీవితంలో మరచిపోలేని సంఘటనగా ముద్ర వేసింది. మూడో అమ్మాయి మహతి ఆయన మాతో చాలా అటాచ్డ్గా ఉండేవారు. నాన్నగారి దగ్గర సంగీతం నేర్చుకునే అదృష్టం కలిగింది నాకు. నేనే కాదు మా అమ్మాయి కూడా ఆయన దగ్గరే సంగీతం నేర్చుకుంది. ఆయన పాఠం చెప్పేటప్పుడు ఏనాడూ స్ట్రిక్ట్గా ఉండేవారు కాదు. చాలా సాధారణంగా నేర్పేవారు. పూర్వీకులు రాసిన పాటలు, కీర్తనలు... నాన్నకి ఏ పాట కావాలంటే ఆ పాట, ఏ పుస్తకం కావాలంటే అది వెతికి తీసి ఇచ్చే బాధ్యత నాది. వేసవి సెలవుల్లో నాన్నతో షటిల్ బ్యాడ్మింటన్ ఆడేవాళ్లం. ఆయన చాలా బాగా ఆడేవారు. మా ప్రోగ్రెస్ కార్డు వస్తే ఏం మాట్లాడకుండా సంతకాలు పెట్టేవారు. మేమందరం బాగా సెటిల్ అవ్వాలని కోరుకున్నారు. ఆయన అనుకున్నట్లుగానే మేమే కాదు, మా పిల్లలు కూడా చక్కగా సెటిల్ అయ్యారు. ఆయన అన్నీ తన కళ్లతో చూశారు. నిండు జీవితం గడిపారు. మేం అందరం కలసిమెలసి ఉంటాం. ఎక్కడో ఒక చోట తరచు కలుస్తుంటాం. అది నాన్నగారి పెంపకంలో వచ్చిన సంస్కారం అనుకుంటాం. నేను కూడా చెన్నైలోనే ఉండటం వల్ల తరచుగా అమ్మానాన్నలను చూడటానికి ఇంటికి వెళ్తుండేదాన్ని. చివరి రోజుల్లో ఇంచుమించు ప్రతిరోజూ వెళ్లేదాన్ని. నాన్న దగ్గరకు వచ్చి ఆయనను చూసి, మళ్లీ ఇంటికి బయలుదేరుతుంటే, కళ్లనీళ్లు పెట్టుకుని, ‘అప్పుడే వెళ్లిపోతున్నావా’ అనేవారు. ఆయన ఇమ్మోర్టల్ అనే భావన మాలో ఉండిపోయింది. అందుకే ‘నాన్నలేరు’ అనే విషయాన్ని నమ్మలేకపోతున్నాం. ఆయన ఉన్నారన్న భావనలోనే జీవించాలి అనుకుంటాం. కాని బాధ మాత్రం పోవట్లేదు. నాన్నగారు రాసి పబ్లిష్ అవ్వని కీర్తనలను ఒక పుస్తకంలా తీసుకురావాలని,. విజయవాడలో ఉన్న ఇంట్లో నాన్నగారికి సంబంధించిన వస్తువులను ప్రదర్శనకు ఉంచాలని, చెన్నైలో నాన్న శిష్యులకు సంగీతం నేర్పించిన రూమ్ను కూడా ప్రదర్శనకు ఉంచాలనీ అనుకుంటున్నాం. మూడో అబ్బాయి డా. వంశీమోహన్ నాన్నగారు ఏ విషయాన్నయినా చాలా తేలికగానే తీసుకునేవారు. సంగీతంలో మునిగితేలడం వలన, ఆ కీర్తనలలోని తత్త్వాన్ని ఒంట బట్టించుకోవడం వల్ల, ఆయన చాలా బ్రాడ్ మైండెడ్గా ఉండేవారు. ఇరుకుగా ఆలోచించే మనస్తత్వం కాదు ఆయనది. అందుకే ఇతర విషయాలను సెకండరీగా తీసుకునేవారు. ఎప్పుడైనా మా మనసుకి బాధ కలిగితే ఆయన తట్టుకోలేకపోయేవారు. అందుకని ఆయనకు చెప్పలేక అమ్మకు చెప్పేవాళ్లం. అయితే అమ్మ ద్వారా విషయం తెలుసుకుని, తన మనసులోనే బాధను దాచుకుని, మమ్మల్ని ఓదార్చేవారు. ఆయనకు చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. ఎప్పుడు తీరిక దొరికినా ఎత్తుకుని ఆడించేవారు. మనవలతో చెప్పే కబురులే వారికి జోలపాట అనుకునేవాళ్లం. ఆయన ఎత్తుకోగానే పిల్లలు ఒళ్లు తడిపితే, బట్టలు మార్చుకునేవారే కాని చిరాకు పడేవారు కాదు. ( తల్లిదండ్రులు అన్నపూర్ణ, బాలమురళీకృష్ణలతో 1. సూర్యకాంతి, 2. లక్ష్మి 3. మహతి 4. అభిరామ్, 5. డాక్టర్ సుధాకర్, 6. డాక్టర్ వంశీమోహన్; అల్లుళ్లు, కోడళ్లు) పెద్దబ్బాయి అభిరామ్ మా చిన్నతనంలో విజయవాడలో ఉండేవాళ్లం. అక్కడ కొన్నాళ్లు ఆకాశవాణి కేంద్రంలోను, సంగీత కళాశాలలోను నాన్నగారు పనిచేశారు. 1964లో ఆయన మ్యూజిక్ కాలేజీకి రాజీనామా చేశాక, మద్రాసు వచ్చేశాం. తెలుగువారిని ఏ మాత్రం అంగీకరించని తమిళనాట నాన్న తట్టుకుని, నిలదొక్కుకుని, నంబర్ వన్ స్థాయికి చేరారు. సంగీత సాధన చేయమని మమ్మల్ని ఎన్నడూ బలవంతపెట్టలేదు. సంగీతం ఎవరో నేర్పితే వచ్చేది కాదని, అది భగవదత్తమైన కళ అని నమ్మేవారు. (బాల మురళికృష్ణ పెద్దమ్మాయి అమ్మాజీ, పెద్దబ్బాయి అభిరామ్, రెండో కూతురు లక్ష్మి) నాన్నగారు నిరంతరం సంగీత కచేరీలలో ఉండటం వల్ల మమ్మల్ని ఎక్కువగా మా అమ్మే చూసుకునేవారు. మేం ఏం ^è దువుతానంటే అదే చదివించారు. అందరం బాగా సెటిల్ అవ్వాలని కోరుకున్నారు. ఆయన కోరుకున్నట్లుగానే అందరం బాగా సెటిల్ అయ్యాం. తొమ్మిది మంది మనవలు, ఆరుగురు మునిమనమలతో హాయిగా ఆడుకుంటూ నిండైన జీవితం అనుభవించారాయన. మా ఇల్లు ఒక మినీ ఇండియా. మా ఇంట్లో కొంకిణి, మలయాళం వాళ్లు కూడా సభ్యులే. ఇతర రాష్ట్రాలవారిని వివాహం చేసుకున్నా నాన్న ఏమీ అనలేదు. మా అబ్బాయి గుజరాతీ అమ్మాయిని చేసుకున్నాడు. ఆయనకు ఫోన్ చేసి చెప్పగానే, ఎంతో సంబర పడ్డారు. వాళ్ల రిసెప్షన్లో ∙‘సీతాకల్యాణ వైభోగమే’ పాట పాడుతూ ‘సదా కల్యాణ వైభోగమే, తను కల్యాణ వైభోగమే’ అంటూ పెళ్లికూతురు (తను), పెళ్లి కొడుకు (సదా) ల పేర్లతో పాడారు. వచ్చినవారంతా ఎంతో సంబరంగా తప్పట్లు కొట్టారు. నాన్నగారు ఆనందపడ్డారు. మా తమ్ముడు కొంకిణి అమ్మాయిని చేసుకున్నాడు. హీ ఈజ్ రివల్యూషనరీ నాట్ ఓన్లీ ఇన్ మ్యూజిక్ బట్ ఇన్ లైఫ్ ఆల్సో. – సంభాషణ: వైజయంతి పురాణపండ కవన వాహినులు ‘అమ్మంటే... ఎవరో తెలుసా ఆ జన్మంటే ఏమో తెలుసా నేల మీద ఉదయించిన దేవతరా అమ్మ కన్నీళ్లు చనుబాలు కలబోస్తే ఆ జన్మ’ అన్నారు సినారె. అమ్మ బొమ్మ (ఫొటో) లేదని... అమ్మ బొమ్మ గీయలేని అశక్తుణ్నంటూ కన్నీళ్లు పెట్టుకున్నారాయన. ఇది జరిగి రెండేళ్లయింది. ‘నాన్న రూపం కళ్ల ముందు నుంచి చెరగడం లేదు. ఆయన నవ్వు ముఖంతో శాశ్వతనిద్రలోకి జారిపోయి ఏడాదైంది. రోజూ అలవాటుగా నాన్న గది వైపు చూస్తూనే ఉన్నాం మా నలుగురు అక్కాచెల్లెళ్లం’ అన్నారు డాక్టర్ సినారె గారి పెద్దమ్మాయి గంగ. సంతోషం, దుఃఖం ఏదైనా సరే... అనుబంధం వ్యక్తమయ్యేది కన్నీళ్ల రూపంలోనే. ఫాదర్స్ డే సందర్భంగా డాక్టర్ సినారె జ్ఞాపకాలను సాక్షితో పంచుకున్నారామె. ‘‘మా నాన్నకు మేము నలుగురం కూతుళ్లం. ఆ రోజుల్లో అబ్బాయి కోసం ఎదురు చూసేవాళ్లు. మగపిల్లవాడులేడని మా నానమ్మ, అమ్మ ఇద్దరికీ కొంచెం కొరత ఉండేది. కానీ నాన్నలో అది లేశమాత్రమైనా ఉండేది కాదు. ఎవరైనా ‘అందరూ అమ్మాయిలేనా’ అంటే ఆ మాట కూడా ఆయనకు నచ్చేది కాదు. ‘నాకు నలుగురు అమ్మలు’ అనేవారు. అమ్మ పోయిన తర్వాత నాన్న ఆమెతో చెప్పాలనుకున్న భావాలను ‘ఎంత స్వార్థం నీది... నలుగురు కూతుళ్లను కన్నావు. ఇప్పుడు తెలిసింది... నాలుగు దిక్కుల్లా తోడుంటారని’ అని రాసుకున్నారు. నదుల పేర్లు నాన్నది బాల్య వివాహం. వాళ్ల నానమ్మ తాను పోయేలోపు పెళ్లి చూడాలని పట్టుపట్టడంతో పదకొండేళ్లకే పెళ్లి చేశారు. అప్పుడు అమ్మకి తొమ్మిదేళ్లు. అమ్మకి భక్తి ఎక్కువ, నాన్న దేవుణ్ని నమ్మేవారు కాదు. నేను పుట్టక ముందు నాలుగైదు సార్లు గర్భం పోవడంతో అమ్మ గోదావరి నది తీరాన నలభై రోజులు ఉపవాస దీక్ష చేసింది. ఆరోగ్యం పాడవుతుందని నాన్న వద్దన్నా వినకుండా దీక్ష చేసిందట. ఆ తర్వాత నేను పుట్టడంతో గంగ అని పేరు పెట్టుకుంది అమ్మ. మా కరీంనగర్లో గోదావరి నదిని గంగగానే వ్యవహరిస్తారు. నాన్నకు స్వతహాగా నదులంటే ఇష్టం. దాంతో మిగిలిన ముగ్గురికీ యమున, సరస్వతి, కృష్ణవేణి అని పేర్లు పెట్టారు. ఇంట్లో అనుబంధాలు జీవనదుల్లా ప్రవహించాలనేది ఆయన కోరిక. (తండ్రి డాక్టర్ సి. నారాయణరెడ్డితో గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణి) అమ్మకు పక్షవాతం నాకు ఏడేళ్లున్నప్పుడు అమ్మకు పక్షవాతం వచ్చింది. అయినా సరే హెల్పర్తో అన్నీ సిద్ధం చేయించుకుని ఒక్కచేత్తోనే నాన్నకు ఇష్టమైనవి వండేది. రోజూ నాన్న ఇంటికి రాగానే తలుపు తీసేదాన్ని. ఇంటికి రాగానే అమ్మ మంచం దగ్గర కూర్చునేవారాయన. అమ్మ పోయే వరకు కూడా ఆయన దినచర్య అలాగే సాగింది. ఉపవాసాలతో ఆరోగ్యం పాడుచేసుకుంటుందని నాన్నకు అమ్మ గురించి ఎప్పుడూ బెంగ ఉండేది. భోజనం చేశావా, మందులు వేసుకున్నావా అని అడగని రోజుండేది కాదు. ఇంటికి ఎప్పుడూ అతిథులు వస్తుండేవారు. అమ్మ చేతి వంట కోసం గుమ్మడి గారు కూడా వచ్చేవారు. మీరు నన్ను పోనిస్తారా! చిన్నప్పటి నుంచి నాకు నాన్న కోసం ఎదురు చూడడం, నాన్న భోజనం చేస్తున్నంత సేపు దగ్గర ఉండడం నాలవాటయిపోయింది. నలుగురిలో ఎవరో ఒకరం నాన్న భోజనం చేసినంత సేపూ దగ్గర ఉండేవాళ్లం. భోజనం కాగానే ట్యాబ్లెట్ ఇస్తే ఎప్పుడు నోట్లో వేసుకునేవారో గుక్కెడు నీటితో మింగేసేవారు. నాకేమో ట్యాబ్లెట్ గొంతు దిగిందో లేదోనని భయం. ఇంకొంచెం నీళ్లు తాగు నాన్నా అంటే... ‘నీకు చాదస్తం ఎక్కువవుతోందమ్మాయ్. వయసొస్తున్నది నీకా నాకా’ అనేవారు. గొంతు పట్టేస్తే ఎలా నాన్నా అంటే... ‘నాకేమవుతుంది, ఏమైనా అయినా అడ్డుపడి కాపాడుకోవడానికి మీరున్నారు కదా, నన్ను అంత సులభంగా పోనిస్తారా’ అనేవారు నవ్వుతూ. అందరూ కనిపించాలి! ఏ తండ్రికైనా కూతుళ్ల మీద ప్రేమ అలాగే ఉంటుందేమో, మా నాన్న మమ్మల్ని పొద్దుపోయాక చదువుకుంటున్నా కూడా ఒప్పుకునేవారు కాదు. అంతంత కష్టం ఎందుకనేవారు. ఆయన నిద్రపోయిన తర్వాత లైట్ వేసుకుని చదువుకునేది మా యమున. జీవితంలో చికాకులు పెంచుకోకూడదు, ప్రశాంతంగా జీవించాలనేవారు. పెళ్లి చేసి అత్తగారిళ్లకు పంపిస్తే రోజూ మమ్మల్ని చూడడం కుదరదని అందరినీ తన దగ్గరే ఉండేలా చూసుకున్నారు. ఫిలింనగర్లో మూడంతస్తుల బిల్డింగ్లో ఒక్కో ఫ్లోర్లో ఒక్కొక్కరి కుటుంబం, వెనుక ఒక పోర్షన్లో ఒక కుటుంబం ఉండేది. అందరికీ వంటగది ఒక్కటే. అల్లుళ్లతోనూ మాతో ఉన్నంత ప్రేమగా ఉండేవారు. ఇక మనుమలు, మనుమరాళ్లనయితే కనురెప్ప వేయకుండా చూసుకునే వారు. అచ్చమైన సోషలిస్టు! నాన్న గొప్ప సోషలిస్టు. ఉద్యమాల్లో పాల్గొనలేదనే కాని, ఆయన నమ్మిన సిద్ధాంతాలను పాటించేవారు. మనుమల్లో ఎవరికీ పేరు చివర కులవాచకాల్లేవు. వాళ్లలో చిన్నప్పుడు కనిపించిన లక్షణాలను బట్టి పేర్లు పెట్టారు. లయ చరణ్ ఉయ్యాల్లో ఉన్నప్పుడు నాన్న చిటికెలు వేస్తుంటే వాడు ఆ చిటికెల శబ్దానికి ఆనందంగా కాళ్లను లయబద్దంగా ఆడించేవాడు. అందుకే ఆ పేరు. అన్వేష్ ప్రతిదీ నిశితంగా పరిశీలిస్తున్నట్లు కళ్లు విప్పార్చి చూసేవాడు. మేడే రోజు పుట్టిన బాబుకి క్రాంతి కేతన్ అని, చైతన్యదేవ్ ఇలాగే ఉంటాయి పేర్లన్నీ. మా ఊరు హనుమాజీ పేటలో అన్ని కులాల వారినీ బంధుత్వంతోనే పిలిచేది మా నానమ్మ. నాన్నకు కూడా అదే అలవాటు వచ్చింది. కులాలవారీగా మనుషులను దూరంగా ఉంచే రోజుల్లోనే వాళ్లు సోషలిస్టు భావాలను అనుసరించారు. అందుకేనేమో నాన్నలో మనిషిని మనిషిగా ప్రేమించే తత్వం కనిపించేది. మనుమలతోపాటే ఇంట్లో ఉన్నంత సేపూ మనుమలు, మనుమరాళ్లందరూ ఆయన చుట్టూ ఉండాల్సిందే. మేము పిల్లలకు అన్నం కలిపి తినిపిస్తుంటే ‘నాకూ పెట్టమ్మాయ్’ అని పెట్టించుకునేవారు. మేము ఎంత దగ్గర బంధువుల పెళ్లి అయినా సరే నలుగురమూ వెళ్లింది లేదు. ఎవరో ఒకరం నాన్న దగ్గర ఉండేవాళ్లం. పెళ్లికి వెళ్తూ ‘నాన్నా పెళ్లికి వెళ్లి, రేపు సాయంత్రానికి వచ్చేస్తాం’ అని చెప్పడానికి నోరు తెరిచినా, మాకు గొంతు పెగిలేది కాదు. ఆయనకు మేము వెళ్లడం నచ్చేదీ కాదు. ‘బంధువులు కదా’ అనేవారు ముక్తసరిగా. నేను మా అమ్మాయి డెలివరీ కోసం అమెరికా వెళ్లాల్సినప్పుడైతే ఆయన ఒకటే ఏడుపు. ఆయన కన్నీళ్లు చూసి నాకూ ఏడుపాగలేదు. చాలాసేపటి తర్వాత ‘నువ్వు వెళ్లకపోతే అక్కడ పాప ఇబ్బంది పడుతుంది. వెళ్లిరా’ అన్నారు. అలా పంపించిన తర్వాత ఆయన నా కోసం రోజులు లెక్కపెట్టుకుంటూ గడిపారని చెల్లెళ్లు చెప్పేవాళ్లు. నేను మనుమరాలిని నెలల పాపాయిని తీసుకుని ఇండియాకి వస్తున్నప్పుడు (వరేణ్య, నాన్నకు మునిమనుమరాలు) ఎయిర్పోర్టుకి వచ్చేశారు. ఆలస్యంగా నిద్రపోయారు గత ఏడాది జూన్ 12వ తేదీ. తెల్లవారు జామున నాలుగ్గంటలకు నాకు మెలకువ వచ్చింది. అంతకు మూడు గంటల ముందే నాన్నకు దగ్గు మందు తాగించి ఆయనకు నిద్రపట్టిన తర్వాత నేను పడుకున్నాను. అంతలోనే మెలకువ వచ్చింది. నాన్న గది దగ్గరకు వచ్చాను. నాన్నకు టెంపరేచర్, బిపి చెక్ చేయడానికి యమున కూడా వచ్చింది. ఆ ముందు రోజు రాత్రి జ్వరంగా ఉండడంతో భోజనం వద్దని బ్రెడ్, పాలు ఇచ్చాం. టెంపరేచర్ నార్మల్గానే ఉందని చెప్పి యమున పైన గదిలోకి వెళ్లింది. నేను నాన్నను ఒకసారి చూసి, ఆలస్యంగా పడుకున్నారు కదా, ఆరు గంటలకు నిద్రలేపుదాం అని అలాగే కూర్చున్నాను. ఆరయ్యేలోపే అటెండర్ వచ్చి ‘యమునమ్మ’ అంటూ ఆగాడు. యమున వచ్చి పల్స్ చూసి ఒక్కసారిగా ఏడ్చేసింది. ఈ ఏడాది కాలంగా నాకు ఎప్పటి లాగానే ఉదయం నాలుగింటికే మెలకువ వస్తోంది. నాన్న లేడని తెలిసి కూడా ‘నాన్నా లే’ అనే పిలుపు నోటి వరకూ వస్తూనే ఉంది. ఈ నెల పన్నెండవ తేదీన ఆయన సంవత్సరీకానికి మిత్రులందరూ సారస్వత పరిషత్లో కలిశారు. మాకు చిన్నప్పటి నుంచి ఇంట్లో కనిపించే నాన్న లేదా వేదిక మీద పులిలా కనిపించే నాన్న రూపాలే తెలుసు. ఆ రోజు అందరూ ఉన్నారు వేదిక మీద నాన్నలేరు. ఇప్పుడు మాతో ఉన్నది ఆయన జ్ఞాపకాలే’’. యమున నాన్న మా చిన్నప్పుడు సినిమాలకు పాటలు రాయడానికి మద్రాసు వెళ్తుండేవారు. మద్రాసు నుంచి వచ్చిన తర్వాత పిల్లలందరినీ దగ్గర కూర్చోబెట్టుకుని అందరినీ నోరు తెరవమనేవారు. పళ్లు శుభ్రంగా తోముకుంటున్నామా లేదా అని అంత పట్టింపుగా ఉండేవారు. సరిగ్గా బ్రష్ చేయట్లేదనిపిస్తే కోప్పడేవారు. నాన్నకు రోజూ కళ్లద్దాలు, వాచీ తుడిచి ఇచ్చేదాన్ని. నాకు వంటలో ఉప్పు, కారం, నూనె ఎక్కువ పడతాయి. ‘నువ్వింత సున్నితంగా ఉంటావు, మృదువుగా మాట్లాడుతావు. వంట ఎందుకు అంత ఘాటుగా చేస్తావు’ అనేవారు. ఆయన పరిషత్తుకెళ్లేటప్పుడు బాక్స్ పెడతాం. బాక్స్ తెరిచి చూడగానే... మా నలుగురిలో ఆ రోజు బాక్స్ ఎవరు పెట్టి ఉంటారనేది పట్టేసేవారు. సరస్వతి నాన్న ఉదయం ఐదున్నరకి అల్లుళ్లతోపాటు వాకింగ్కి వెళ్లేవారు. నాన్న జేబులో చిన్న నోట్బుక్, పెన్ను ఎప్పుడూ ఉంటాయి. వాకింగ్లో ఉన్నప్పుడు వచ్చిన ఆలోచనలను నోట్బుక్లో రాసుకునేవారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ బుక్ని గంగక్కకిచ్చేవారు. అక్క కాపీని తిరగరాసేది. అమ్మ అనారోగ్యం కారణంగా చెల్లెళ్ల బాధ్యత అంతా పెద్దక్కే చూసుకుంది. నాన్న కూడా అన్ని పనులకూ అక్క మీదనే ఆధారపడేవారు. రచనలకు వచ్చిన డబ్బుని ఇంటికి రాగానే ‘అమ్మాయ్’ అని పిలిచి అక్కకిచ్చేసి జేబు బరువు తీరినట్లు భావించేవారు. జేబులో అసలే డబ్బు పెట్టుకోకపోతే ఎక్కడైనా టిప్పు ఇవ్వాల్సి వస్తే ఎలా అని అక్క రోజూ నాన్న జేబులో కొంత డబ్బు పెడుతుండేది. కృష్ణవేణి నాన్న మమ్మల్ని చుట్టూ కూర్చోపెట్టుకుని తాను రాసిన గజల్స్ చదివి వినిపించేవారు. రాత్రి ఇంటికి రావడం ఆలస్యమైతే ఫోన్ చేసి ‘పిల్లలు (మనుమలు, మనుమరాళ్లు) నిద్రపోకపోతే కొంచెం సేపు మెలకువగా ఉంచండి, వచ్చేస్తున్నాను’ అని చెప్పేవారు. ఆయనకు హిందీ సినిమాలిష్టం. సినిమాలు చూడాలనుకుంటే మనుమలు, మనుమరాళ్లందరినీ తీసుకుని వెళ్లేవారు. కుటుంబం డాలర్ హిల్స్కి మారేటప్పుడు పెద్దగా ఇష్టపడలేదు నాన్న. ఫిలిం నగర్ ఇల్లు బాగానే ఉందిగా మారడం ఎందుకన్నారు. ఆ ఇంటిని నాన్న కోసమే డిజైన్ చేయించాం. ఆయన డ్రాయింగ్ రూమ్లోకి కూర్చుంటే ఇల్లంతా ఆయనకు కనిపిస్తుంది. ఆ ఇంట్లో నాలుగు నెలలు ఉన్నారంతే. – సంభాషణ: వాకా మంజులారెడ్డి -
ప్రణవానికి ప్రతిబింబం
నివాళి నేనాయన్ని మొదటిమారుగా చూసింది, విన్నది 1944లో. నా మేనమామ మేకా మువ్వగోపాల అప్పారావు పెళ్లి హైదరాబాదులో జరిగిన తరువాత, సొంత ఊరైన నూజివీడు తేలప్రోలు ఎస్టేటులో జరిగిందా కచ్చేరీ. ఆయన కప్పుడు 14 ఏళ్లుంటాయి కానీ చూడటానికి ఏడెనిమిదేళ్ల వానిలా ఉన్నాడు. నా వయస్సు అయిదు. కచ్చేరీ చివరి భాగం మాత్రం విని-- నాకు తెలుసు నాకు నచ్చేపాటలా సమయంలోనే పాడతారని--‘పదాలు, జావళీలు పాడలేదేం? అతనికి రావా!’ అని నేను నా అమ్మమ్మనడగటం, ‘చిన్నపిల్లాడేం పాడతాడు నీ సానివారి పాట?’ లని అమ్మమ్మ నన్ను గదమాయించడం నాకు గుర్తున్నది. నేను రికార్డులపైనా, ముఖతా గడ్డిభుక్త సీతారాం వద్ద (ఆమె బొబ్బిలి వేణుగోపాలుని నృత్యసేవకే కాక బొబ్బిలి సంస్థాన నర్తకి కూడాను. మా చిన్నతనంలో మేముండే రాణి వాసానికి రోజూ వచ్చి, నేను కోరిన పాటలు పాడేది) పాటలే వినడానికి యిష్ట పడేవాణ్ణని అమ్మమ్మకు తెలుసు. ఆ సమయంలోనే నేను బెంగుళూరు నాగరత్నమ్మ కచ్చేరీ కూడా విన్నాను. ఆమెతో నాకు చనువు కనుక ‘నేనే జాణ’ పాడలేదేమని అడిగాను. ఆ రికార్డు నాకెంతో ఇష్టం. ‘నీ కోసం పాడతాన్నాయనా’ అంటూ నన్ను ఒళ్లో కూర్చోబెట్టు కుని పాడారు. ‘బాలమురళిది సంగీతమూ కాదు, కర్ణాటకమూ కాదు, అదొక ఓంకార మమ్మా! అయ్యవారి (అంటే త్యాగయ్య) ప్రణవానికి ప్రతిబింబం’ అని నాగ రత్నమ్మ మా అమ్మతో ఎన్నో మార్లు అన్నారట. మళ్లీ ఆయన్ను తరచూ చూడటం కుటుంబ సమేతంగా వారు మద్రాసుకి తరలివచ్చిన తరువాతనే! ఆయనతో సాన్నిహిత్యం, భార్య అన్నపూర్ణమ్మ గారితో, పిల్లలతో పరిచయం. క్రమేణా బాలమురళీగారితో చనువు ఏర్ప డింది. ‘ఇది మీరు సరిగా పాడలేదు. ఆ పాటకు వరస బాగా కట్టలేదు’ అనే వాడిని. నా సంగీత పరిజ్ఞానమెంతటిదో ఆయనకు బాగా తెలుసును గనుక చిరునవ్వేసేవారు. 1970 ప్రాంతంలో ఆయన గ్రామఫోను కంపెనీకి అన్నమా చార్యుల సంకీర్తనలొక ఎల్.పి ఇచ్చారు. అన్నమయ్య పాటల తొలి ఎల్.పి యిదే. ఆ తరువాతనే శ్రీరంగం గోపాలరత్నం, ఎం.ఎస్ సుబ్బులక్ష్మి తది తరులు. ఆ ఎల్.పికి ‘స్లీవ్ నోట్స్’ (కవరు మీది వివరణ) వ్రాయమని నన్ను హెచ్.ఎమ్.వి రికార్డింగ్ ఆఫీసరైన పి. మంగపతి అడిగారు, బహుశా బాలమురళి అనుమతితోనే. వ్రాశాను. బాగా వచ్చింది. రాకేం? సంగీతమంటే ఆసక్తి, ఆ గాయకుడంటే గౌరవం, శ్రీమల్లాది రామకృష్ణశాస్త్రి వనమాలల ద్వారా అన్నమ య్యంటే భక్తి ఉండగా! ఈ పాటల్లో రెండిటికి వరసలు అన్నమయ్య అంతరంగంలోంచి దొంగి లించి చేసినవి (రాగి రేకులపైనున్న రాగాలలో కాదు). ‘ఇందరికి నభయంబు లిచ్చు చేయి’ - అన్న దశావతార సంకీర్తనొకటైతే, ‘కొమ్మ తన ముత్యాల కొంగు జారగ’ - రెండవది. ఇందులో అమ్మవారు నిదురించే తీరులో మదాలస భంగి మలు చెలికత్తెలచే పారిజాత పూరేకులంత లలితంగా వర్ణితం. ఈ రెండింటినీ వారి అనుమతితో నేనెన్నోమార్లు శ్రీనివాస మంగాపుర కల్యాణ వేంకటేశ్వరుని సాక్షాత్కార వైభవ సమయంలోనూ (ఆషాఢ శుద్ధ సప్తమి), కార్వేటినగర వేణుగోపాలుని పుట్టిన రోజునా (గోకులాష్టమి) ఒక యాభై సంవత్సరాలు ఆ ట్రాక్స్ ఉపయోగించి నృత్యనివేదనగా చేశాను. ఏం చెయ్యకూడదా! అన్నమయ్య అనలేదూ... ఏనుగుపైనా, కుక్కపైనా ప్రసరించే ఎండ ఒక్కటేనని? ఆ ఎల్.పి.కి ముఖపత్రం బాపు చేత వేయించమని ఆ కుంఫిణీ వారిని వేధించాను. అన్నమయ్య-మురళీ పాటలకు తగిన ట్లు నా విన్నపం విని, బాపు బంగారు వాకిలిలోన ఆ కలియుగ కృష్ణుడు కనబడేటట్లు వేశారు. ఇవన్నీ బాలమురళికి నచ్చాయి కాబోలు... తదుపరి భద్రాచల రామదాసు కీర్తనల ఎల్.పి.కి, తనే పాడి, వాయులీనం, మృదంగం వాయించిన ఒక ఈ.పి.కి అలాగే వ్రాయించుకున్నారు. ఇందులో వినిపించే బాలమురళి విద్వత్తు ఎంత టిదో, హెచ్.ఎమ్.వి రికార్డింగు ఇంజినీరు రఘునాథన్ శబ్దగ్రాహక నైపుణ్యం అంతటిది. మొదట పాట, జాగాలతో రికార్డు చేసి, ఆ తరువాత మృదంగం, చివర వాయులీనం జాగ్రత్తగా ఆ జాగాలలో బిగించడం అప్పటి పరికరాలతో, యింద్రజాలమే. ఆ తరువాత హెచ్.ఎమ్. మేహ శ్ అన్నతను ‘సంగీతా’ కంపెనీ స్థాపించి, తక్కిన కంపెనీలన్నీ పాతికేళ్లలో చేసింది ఒక ఐదేళ్లలో సాధించాడు. ఈ మాస్టర్ రికార్డింగు కంపెనీకి బాలమురళీ... పదీ యిరవై కాదు వందకు పైగా పలు భాషల్లో కేసెట్లు రికార్డు చేశారు. అప్పుడొక తమాషా జరిగింది. ఈ మహేశ్ సరస్వతీ స్టోర్స్కి (కొలంబియా) కన్నడ విభాగంలో పనిచేసినప్పటి నుంచి నా హితుడు. ఒక ఎల్.పి.కి నాతో మొదటిమారుగా స్లీవ్నోట్స్ వ్రాయించిందితనే. వీరికి బాలమురళీ త్యాగయ్య ‘నౌకా చరిత్రం’ లోని కొన్ని పాటలొక కేసెట్టు చేయగా ఇన్లే కార్డు మీద రెండు వాక్యాలు వ్రాయమని అడిగితే వ్రాశాను. ఎప్పటి లాగా నేను వ్రాసింది ప్రూఫ్ చూపేటప్పుడు దానిపై ‘సంగీతం అభయాంబిక’ అని ఉంటే అలా వేయకూడ దన్నాను. ‘ఆమె రికార్డింగుకి ఎంతో తోడ్పడ్డారు. అలా వేసి తీరాలి’ అన్నారు. ‘అయితే నేను వ్రాయను’ అని తుమి తేల్చేశాను. ఆ ఇన్లే కార్డు చూసి ‘రంగా రావు పరిచయ వాక్యాలు లేవేం?’ అని బాలమురళి అడిగితే, నసుగుతూ, నాన్చుతూ చెప్పేరట - ‘సంగీతం ఫలానా’ అని వేస్తే వ్రాయనన్నాడని! వాళ్లనే గసిరి ‘త్యాగరాజు కీర్తనలకు సంగీతం మరొకరా? కావలిస్తే ఆర్కెస్ట్రేషన్’ అని వేయండన్నారట! అలా నా పక్షం వహించారు బాలమురళి. ఇంతకూ అభ యాంబిక ఎవరు? ఆనాడు బాలమురళి నియామకాలు చూసే ఆంతరంగిక కార్యదర్శి. ఆమెతో నాకు సఖ్యమే. చిన్నతనంలో తన యిద్దరు సోదరీమణులతో నాట్య ప్రదర్శనలివ్వడమే గాక, రంగవల్లుల ఎగ్జిబిషన్ను చేసేవారు. ఒకమారు ఆమె, బాలమురళి ప్రోత్సాహంతో బెంగుళూరు నాగరత్నమ్మ పాత పాటలు కేసెట్టుపై విడుదల చేద్దామని నా రికార్డులడిగితే వాటినామెకు ఇచ్చాను. పని జరిగిన తరువాత నా ప్రాణాలను భద్రంగా నాకు తిరిగి యిచ్చారు. ‘సంగీతా’ వారికి బాలమురళి పాడిన కేసెట్లలో నాకు బాగా నచ్చినవి అష్టపదులు, తరంగాలు, క్షేత్రయ్య పదాలు, భరత నాట్యాంశాలు కలిగిన ఒక కార్యక్రమం, తిల్లానాలు. ఆ తిల్లానాలన్నీ వీనుల విందు చేసేవే. కానీ వాటిలో కుంతల వరాళి తిల్లానా అంటే పిచ్చి యిష్టం. నేనెరిగిన నిష్ణాతులైన స్త్రీపురుష నాట్యకళాకారులెందరికో వీటి గురించి చెప్పాను, అడిగాను, ప్రాథేయపడ్డాను... ‘దీనిని రంగమెక్కించండీ’ అని! ‘అబ్బా, చాలా కష్టమైనదండీ!’ అని తప్పించు కున్నారు. చివరికి శాంత - ధనుంజయన్లు (నేనప్పుడు వారి వద్ద భరతనాట్యం నేర్చుకుంటున్నాను) దానికి రంగస్థలంపై ఒక అపూర్వమైన రూపం కల్పించారు, దాదాపు 45 సంవత్సరాల క్రిందట. బాలమురళి కృతిని భరత నాట్యానికి - బంగారుకి పరిమళం- జోడించటానికి వారు ఆడిందే నాంది! ఒకప్పుడు, 1965 ప్రాంతంలో నేను మద్రాసు ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’కి సంగీత కచ్చేరీల గురించి వ్రాస్తుండేవాడిని. ఒక కచ్చేరీలో బాలమురళి పాడిన తీరుని విమర్శించాను ‘మధ్య మధ్య వెనుక తంబూరా వేస్తున్న వ్యక్తిని (ఎవరో కాదు, తన కుమార్తె) తిరిగి చూడటమేమిటి! మైక్కి దూరమై పాట వినపడటం తగ్గిపోదా! రేడియోలో అంతకాలం పనిచేసిన వారికి మైక్ ప్రాముఖ్యం తెలి యదా!’ అంటూ. ఆయన్ని ‘కొడు’కంటూ ముద్దుచేసే నా అక్క ఇందిరాదేవితో (బొబ్బిలి రాకుమారి, ఆకాశవాణి వీణా విదుషి, బహుమతులు పొందిన చిత్ర కారిణి) సగం నవ్వుతూ అన్నారట - ‘అమ్మా! మీ తమ్ముడికి నా పాట నచ్చలే’ దని! అక్క నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా అయిదు నిమిషాలు ఝాడించింది. ‘బాలమురళి పాటను విమర్శించేటంతటి వాడివా నీవు?’ అంటూ. తిల్లానాలు యిటీవలి విద్వాంసులెందరో చేశారు. అవి వారి వారి కంఠాల, వాద్యాల సొగసును యినుమడింప జేయడానికే రూపొందించబడ్డాయి. నాట్యా నికన్నీ అంతగా నప్పవు. బాలమురళీ తిల్లానాలు (ద్విజావంతి, బృందావన సారంగ, కదన కుతూహలం యిత్యాది) అలా కాదు. నాట్యం కోసమే తీర్చిన ట్లుంటాయి. ఇప్పుడాయన తిల్లానాలతో ఎందరో అందలమెక్కి ఊరేగుతు న్నారు, నాతో ఆనాడు ‘అబ్బా కష్ట’మన్నవారు కూడా! బాలమురళి దాదాపు ఏది పాడినా ‘దీనికి నాట్యం చెయ్యరూ?’ అని గోముగా అడిగినట్లుంటుంది. నూరేళ్లుగా దక్షిణ దేశంలో ‘కృష్ణం కలయసఖి సుందర’ మన్న తరంగాన్ని ముఖారి రాగంలో పాడుతున్నారు. 75 సంవత్సరాల కిందట త్రిపురారిభట్ల రామకృష్ణశాస్త్రి రికార్డు విన్నా, బాలమురళిది విన్నా మనసు గంతులు వేస్తుంది. కాళిందీతట తరికిటతోమ్లను కంటికి కట్టిస్తుంది. పదమైనా అంతే. ‘అలిగితే భాగ్యమాయే’ (క్షేత్రయ్య, హుసేని) ఆయన పాడగా వింటే అరసొంపు మాటలాడే ఆ ధూర్తుని దుండగీడుతనాన్నెలా ఆ ముగ్ధ ఓర్చుకుంటున్నదో అనీ, అయ్యో పాపం ఆ అబలాయ కబళాయ వాడి పాల బడిందా అనీ కంటనీరు పెట్టిస్తుంది. తన సంగీతానికెన్నో అన్నమయ్య సంకీర్తనలు పాడిన బాలమురళి మూడో నాలుగో వక్కలంక సరళారావు (ఆనాడు ‘కీలుగుర్రం’లో ఘంటసాలతో కలిసి ‘కాదు సుమా కల కాదు సుమా’ పాడిన గాయకి) వరసలకు ఒక కేసెట్లో పాడారు. ఆ చూడామణిలో కోహినూర్లు ‘చలిగాలి వెడ యేల చల్లీని’ (బృందా వని, సరళతో), ‘ఎంత దవ్వైననేమి’ (బాగేశ్రీ, నాట్యకళాకారిణి స్వప్న సుందరితో). రాగంలో సంగతి, అన్నమయ్య సంకీర్తనల స్వరకర్తగా సరళ ఎవ్వ రికీ తీసిపోదు. అందుకనే అడగ్గానే బాలమురళి ఆమెకు పాడటం. అష్టపదులలో చివరిది ‘నిజగాదస యదునందనే’ ఒక రాజహంస. సరసాలంతా జరిగిన తరువాత రాధ కృష్ణునితో సరాగాలు. యిలా ఎన్నో. నాట్య కళాకారులు వీటిని భరతనాట్య, కూచిపూడి, విలాసిని, మోహినీ ఆట్టం, మణిపురి, సత్రియ, కథక్ పద్ధతులలో గజ్జకడితేనా, అద్దిరభన్నా! ఈ క్రింది విషయం నాతో పద్మాసుబ్రహ్మణ్యం (భరతుని నాట్యశాస్త్రం నా తలకెక్కించే ప్రయత్నం చేసిన ధీరవిదుషి) చెప్పారు. ‘‘ఒకమారు బాలమురళి, నేను కచ్చేరీ నిమిత్తం రైల్లో వెళుతున్నాం. ‘ఒక జావళి నీ కోసం చేస్తా’ నంటూ అప్పటికప్పుడు ధారతో ‘మరులు మించెరా’ అన్నది నవరోజులో చేశారు. ఈ విషయం చెప్పి, అక్కడ దానికి నేను అభినయం పడితే, చూసినవారెంత మెచ్చుకున్నారో చెప్పలేను!’’. మెచ్చుకోక ఏం చేస్తారు? ఆ పాటలో మాటలు - ఒక ప్రౌఢ మరులు మించెరా అని వగలు పోతుంటే వినడం - మాంఛి ఎండాకాలంలో గాలి ఆడక బిగపట్టిన వేళ పచ్చకర్పూరం కలిపిన చందనం వీపుకి తమలపాకుతో పూసినట్లూ, గొంతు తడారిపోయినప్పుడు నిమ్మ నీరులో కాస్త తుహినమూ, తేనే కలిపి త్రాగించినట్లూ ఉంటుంది. నిజం. ఆయనకు సంగీతం తెలియదు. సంగీతానికి ఆయన తెలుసు. కాబట్టే ఆయన తనువిప్పుడు మనలో లేకపోయినా తను విడిచి వెళ్లిన విమల గాంధర్వం మనిషి ఉన్నంతవరకు మనసుకి ఆహ్లాదం కలిగిస్తూనే ఉంటుంది. ఇప్పుడాయన ఉనికి గోలోకంలో (కృష్ణగానం చేసిన వారి పరమావధి గోలోకమనే నా విశ్వాసం). అక్కడ జుగల్బందీ చేస్తే ఆ పెద్ద మురళీ వాడి ముందు బాలమురళి నీడను పడతాడా అన్నది పక్కనున్న మల్లాది రామకృష్ణ శాస్త్రే నిర్ణయించాలి! వి.ఎ.కె. రంగారావు వ్యాసకర్త ప్రముఖ కళా, సంగీత విమర్శకులు, చెన్నై మొబైల్: 094447 34024 -
సంగీత సుధార్ణవం
అక్షర తూణీరం గమకాలు గుండెలవిసేలా లోతుగా.. ఉండాలన్న అతి పాత ధర్మాన్ని సంస్కరించారు. గమకాలు కలువ రేకులు కదిలి నంతసున్నితంగా కూడా ఉండవచ్చని పాడి చూపించారు. ఒక సుమధుర సంగీత ఝరి ఆగిపోయింది. ఆయన గళంలో ఒక ఠీవి ఉంది. శ్రుతికి మించిన ఆత్మవిశ్వాసం ఉంది. సంగ తులు, గమకాలు వాటంతటవే వచ్చి కూర్చుంటాయన్న ధైర్యం ఆయనకుండేది. ‘బాలమురళి’ అంటే నవ శాస్త్రీయ చరిత్ర. ఎనభై ఏళ్ల సుదీర్ఘ రాగ ప్రస్థానం. త్యాగరాజ స్వామి గురు పరంపరలో అయిదో తరం వారసుడు. సంగీత సార్వ భౌమ పారుపల్లి రామకృష్ణయ్య శుశ్రూషలో సంగీత పాఠాలు నేర్చిన విద్యార్థి మంగళంపల్లి బాలమురళీకృష్ణ. అరవై ఏళ్ల క్రితం బాలమురళి వివాదాస్పద విద్వాంసుడు. ఒక బంగారు చట్రంలో బిగుసుకుపోయిన శాస్త్రీయ సంగీత రీతులకు విముక్తి కలిగించాడు. సంప్రదాయమంటే - ఒక తరం వారు తాము ఆర్జించిన సుజ్ఞానాన్ని మారిన కాలంతో వడకట్టి తర్వాతి తరా నికి అందించడమేకానీ, తుచలు పోకుండా అందివ్వడం కాదని ఈ ‘ఛైల్డ్ ప్రాడిజీ’ నమ్మారు. అదే ఆచరించి చూపారు. అందుకే ఆయన వెయ్యిమందిలో ఒక్క రుగా కాక ఒకే ఒక్కడుగా సంగీత ప్రపం చాన్నేలారు. సామాన్య జనులందరినీ సంగీతమాస్వాదించి ఆనందించగల రసి కులుగా ‘కన్వర్ట్’ చేసేస్తున్నాడని బాలముర ళిపై ఆనాటి ఛాందసులు అభియోగం మోపారు. దాన్నొక గొప్ప అభినందనగా, ఆశీర్వాదంగా బాలమురళి స్వీకరించారు. వస్తూనే ‘స్వరార్ణవం’ చంకనపెట్టుకు తెచ్చుకున్నాడని ప్రతీతి. ‘‘నేను వానికి నేర్పిందేమీ లేదు. వాడి సంగీతాన్ని వాడే తెచ్చుకున్నాడు’’ అంటూ గురువు పారుపల్లి రామకృష్ణయ్య తరచూ చెబుతుండేవారట. ఆరవ ఏట పక్కవాద్యాలతో సహా సంగీత గోష్ఠి నెరపిన అసాధారణ ప్రతిభామూర్తి బాలమురళి. సంగీత లోకంలో ఆయనొక సాహసి. విద్యుత్తుతోబాటు తగుమాత్రం ధిషణాహం కారం కూడా బాలమురళి వినూత్న శైలిని తీర్చిదిద్దింది. గమకాలు గుండెలవిసేలా లోతుగా, గొడ్డలి గంట్లులా ఉండాలన్న అతిపాత ధర్మాన్ని సంస్కరించుకుని ఆపాత మధురంగా మలచుకున్నారు. గమకాలు కలువరేకులు కదిలినంత సున్నితంగా కూడా ఉండవచ్చని పాడి చూపించారు. మెప్పించి, ఔననిపించారు. వయోలాని గిటార్లా, వయొలిన్ని ఏక్తారలా, వీణని వయొలిన్లా పలికించగల చతుర్థ సమర్థుడు. అనేక వాద్యాల మీద అధికారం సంపాయించారు. బాలమురళీ ‘పుట్టు విద్వాంసుడు’ అవడం వల్ల, సంగీత జ్ఞానిగా సాహిత్యకారునిగా సాధించాల్సినదంతా పాతికేళ్లకే పూర్తి చేసు కున్నారు. ఇక మిగిలిన తీరికలో కావల్సినన్ని సాము గరిడీలు చేస్తూ సంగీత సరస్వతిని ఆరాధించారు. బాలమురళి కారణ జన్ముడు. స్కూలు చదువులెరుగని బాలమురళి సంస్కృతాంధ్ర భాషల్లో ప్రావీణ్యం గడిం చారు. కొత్త రాగాలను నిర్మించారు. అనేక కృతులు రచించారు. ఆయన తిల్లానాలను ప్రత్యేకంగా చెప్పుకుంటారు. సినిమాలకు పాటలు పాడినా బాలమురళి ముద్ర ఉంటుంది. గొప్ప చమత్కారి. ‘నేను కచ్చేరీల్లోనే సాధన కూడా చేస్తాను. ముఖ్యంగా పెళ్లిళ్లలో నా గోష్ఠి ఏర్పాటు చేసినపుడు. ఎందుకంటే అక్కడ నన్నెవరూ వినరు. అందు కని నా ప్రయోగాలు నేను చేసుకుంటాను’ అని చెప్పేవారు. సంగీతానికి బాల మురళి చేసిన గొప్ప సేవ ఆయన రికార్డింగ్స్. కొన్ని వందల గంటలు రికార్డ్స్లో, టేపుల్లో, సీడీల్లో నిక్షిప్తం చేసి జాతికి అందించారు. త్యాగరాజ కృతుల్లోని సాహిత్యాన్ని సుమధుర గాత్రంతో విశదపరిచారు. శాస్త్రీయ సంగీతానికి, ఆ విద్వాంసులకు బాలమురళి గ్లామర్ తెచ్చి పెట్టారు. ఆయన ‘షోకిలా’గా జీవించారు. ఆయన అందుకోని బిరుదులు, గౌర వాలు ఏవీ లేవు. అన్నమయ్య, సదాశివ బ్రహ్మేంద్ర స్వామి, రామదాసు కీర్తనలు ఆయన నోట అమృతధారలైనాయి. బాలమురళి మరో పేరు ‘‘భక్తిరంజని’’. బాలమురళి నిష్ర్క మణతో సరిగమల బృందావనం సద్దుమణిగింది. వారికి అక్షర నివాళి. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement