ఆరు నెలల్లోనే ప్రజావ్యతిరేకత | Sakshi
Sakshi News home page

ఆరు నెలల్లోనే ప్రజావ్యతిరేకత

Published Sat, Dec 6 2014 4:12 AM

kr suresh reddy takes on trs government

ఆర్మూర్ : ఆరు నెలల కాలంలోనే టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వచ్చిందని శాసన సభ మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని సైదాబాద్ కాలనీలోని షాదీఖానాలో జిల్లా మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని  నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు సుమీర్ హైమద్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో సురేష్‌రెడ్డి ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వాన్ని చూడటం ఇదే మొదటిసారన్నారు.

సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అది హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం కాకుండా ప్రతీ గ్రామంలో ఇదే పరిస్థితి ఉందన్నారు. సీఎం కేసీఆర్ వైఖరి కారణంగా కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా పెద్దగా లభించడం లేదన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజల పక్షాన నిలిచి పోరాటాలు చేస్తామన్నారు. అనంతరం  కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ నెల 9న గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ జెండాలు ఎగరవేయాని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఒక లక్ష 36 వేల మందితో సభ్యత్వాలను పూర్తి చేస్తామన్నారు.  

పార్టీ పదవులకు ఎంపిక...

జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షునిగా మున్సిపల్ మాజీ కోఆప్షన్ సభ్యుడు హబీబొద్దిన్ ను, మండల మైనార్టీ సెల్ అధ్యక్షునిగా షరీ ఫ్‌ను నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్ నియామకపు పత్రాలను అందజేసారు.  కార్యక్రమంలో రాష్ట్ర పీసీసీ అధికార ప్రతినిధి మార చంద్రమోహన్, కౌన్సిలర్ మహమూద్ అలీ, మైనార్టీ నాయకులు ఉస్మాన్ హజ్రమి, హైమద్ షరీఫ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈగ గంగాధర్, మాజీ కౌన్సిలర్ పీసీ భోజన్న పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement