దేవుడా.. ధోనీని క్షమించి, కాపాడు | Sakshi
Sakshi News home page

దేవుడా.. ధోనీని క్షమించి, కాపాడు

Published Sat, Jan 21 2017 10:47 AM

దేవుడా.. ధోనీని క్షమించి, కాపాడు

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీపై గతంలో పలుమార్లు ఘాటైన విమర్శలు చేసిన ఆల్‌రౌండర్‌ యువరాజ్ సింగ్‌ తండ్రి యోగ్‌రాజ్‌ సింగ్‌ మనసు మార్చుకున్నాడు. భారత జట్టులో యువరాజ్ చోటు కోల్పోవడానికి ధోనీయే కారణమని గతంలో నిందించిన యోగ్రాజ్‌.. ఇప్పుడు అతన్ని క్షమిస్తున్నట్టు చెప్పాడు. అంతేగాక ధోనీని దేవుడు క్షమించి, కాపాడాలని కోరాడు.

‘ధోనీని దేవుడు కాపాడాలి. కటక్‌ వన్డేలో అతను సెంచరీ చేయాలని కోరుకున్నా. నేను ధోనీని క్షమించాను. నా కొడుకు యువరాజ్కు చెడు చేసినందుకు ధోనీ క్షమించాల్సిందిగా దేవుణ్ని ప్రార్థిస్తున్నా. దేవుడు అతని వెన్నంటే ఉండి మంచి చేయాలని కోరుకుంటున్నా. యువీ మూడేళ్ల సమయాన్ని ధోనీ వృథా చేశాడు. అతను ఈ విషయాన్ని గ్రహించి దేవుడికి క్షమాపణలు చెప్పాలి. నాకు, నా పిల్లలకు చెడు చేసినవారిని నేను క్షమిస్తాను. అంతర్జాతీయ క్రికెట్లో మళ్లీ రాణించడం కోసం యువీ ఎంతో కష్టపడ్డాడు. యువీ కోసం ఎప్పుడూ దేవుణ్ని ప్రార్థిస్తుంటా. యువీకి నిత్యం అండగా ఉంటున్న నా కోడలు హజెల్‌ కీచ్‌కు అభినందనలు. యువీ, హజెల్‌ ఎప్పుడూ ఇలాగే కలసి ఉండాలని ఆశిస్తున్నా’ అని యోగ్రాజ్‌ అన్నాడు. కటక్ వన్డేలో యువీ, ధోనీ సూపర్‌ సెంచరీలతో విలువైన భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గెలిపించిన సంగతి తెలిసిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement