ఘరానా మోసగాడు అరెస్ట్ | Sakshi
Sakshi News home page

ఘరానా మోసగాడు అరెస్ట్

Published Sun, Aug 2 2015 6:57 PM

thief arrested by banjara hills police

బంజారాహిల్స్: తాను ఓ పరిశ్రమను స్థాపిస్తున్నానంటూ బోగస్ కార్యాలయాన్ని తెరిచి పలువురిని పెద్ద మొత్తంలో నిండా ముంచిన రాజస్తాన్‌కు చెందిన వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జైపూర్‌కు చెందిన నాసిర్ రాజ్‌పుత్ మూడు నెలల క్రితం బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని కౌశిక్ సొసైటీలో కార్యాలయాన్ని, ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు.

ఈ బోగస్ సంస్థను ప్రారంభించేందుకు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీని ఆహ్వానించడమే కాకుండా కరపత్రాలు కూడా ముద్రించారు. కార్యాలయంలో అద్దెకు ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు సమకూర్చుకున్నాడు. తన సంస్థలో ఉద్యోగాల కోసం 22 మంది నిరుద్యోగుల నుంచి సెక్యూరిటీ డిపాజిట్‌గా లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. మూడు నెలలుగా కార్యాలయం, ఇంటి యజమానులకు అద్దె కూడా చెల్లించలేదు. తనకు రూ. 40 కోట్లు సిటీ బ్యాంకు నుంచి రావాల్సి ఉందని.. బ్యాంకు డిపాజిట్ ఉంటే వెంటనే వస్తుందని చెప్పి.. ఓ ఐసీఐసీఐ బ్యాంకు ఉద్యోగిని నమ్మించి రూ.15 లక్షలు వసూలు చేశాడు. ఇలా రూ.1 కోటి దాకా దండుకొని మూడు రోజుల క్రితం ఉడాయించాడు. దీంతో ప్రత్యేక పోలీసు బృందం బీహార్‌లోని రాంచిలో నిందితుడు రాజ్‌పుత్‌ను వలపన్ని పట్టుకుని నగరానికి తీసుకొచ్చింది. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 406, 420, 471 కింద కేసులు నమోదు చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement