సీశాట్.. అర్హత పరీక్ష మాత్రమే! | Sakshi
Sakshi News home page

సీశాట్.. అర్హత పరీక్ష మాత్రమే!

Published Wed, May 20 2015 11:36 PM

Civil Services Preliminary Examination 2015

సివిల్స్ ఆశావహులంతా నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తుండగా..  సివిల్స్ ప్రిలిమ్స్‌లో మార్పుల ప్రకటన వెలువడింది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ 2015 నుంచి పేపర్ 2(సీశాట్)ను కేవలం అర్హత పరీక్షగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రెహెన్షన్ విభాగాన్ని పేపర్ 2 నుంచి గతేడాదిలాగే తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు ఈ నెల 16న వెలువడాల్సిన సివిల్స్ ప్రిలిమ్స్ నోటిఫికేషన్ సైతం వాయిదా పడింది. ఈ నెల 23న నోటిఫికేషన్ విడుదల చేస్తామని యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ పరిణామాలు అభ్యర్థుల్లో పలు సందేహాలకు దారితీసి, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.  ఈ నేపథ్యంలో సీశాట్‌కు సంబంధించి ప్రభుత్వ నిర్ణయంపై నిపుణుల విశ్లేషణ..
 
 సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పేపర్-2(సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్) ఇక నుంచి అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో పొందిన మార్కులు మెరిట్ జాబితా రూపకల్పనలో పరిగణనలోకి తీసుకోరు. కనీస అర్హత మార్కులు 33 శాతం పొందాలి. అంటే.. ప్రిలిమ్స్ పేపర్-2లో 33 శాతం మార్కులు పొందితేనే పేపర్-1 (జనరల్ స్టడీస్) మూల్యాంకనం జరుగుతుంది.అంతేకాకుండా గతేడాది మాదిరిగానే పేపర్-2 ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రెహెన్షన్ ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దాంతో సీశాట్‌ను అర్హత పరీక్షగా మార్చడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామీణ, నాన్-మ్యాథ్స్/సైన్స్ విద్యార్థులకు అనుకూలమని కొందరు అభిప్రాయపడుతుంటే.. మ్యాథ్స్, సైన్స్ విద్యార్థులకు తాజా నిర్ణయం శరాఘాతమని మరికొందరు పేర్కొంటున్నారు.
 
 సీశాట్‌పై వ్యతిరేకత ఎందుకు?
 2010 వరకు సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలోని రెండు పేపర్లలో.. రెండో పేపర్ ఒక ఆప్షనల్ సబ్జెక్ట్‌గా ఉండేది. ఈ విధానాన్ని మార్చుతూ 2011 నుంచి రెండో పేపర్‌ను కూడా అభ్యర్థులందరికీ ఉమ్మడిగా ఉండేలా సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనే కొత్త పేపర్‌కు రూపకల్పన చేశారు. ఈ పేపర్ సిలబస్‌లో పేర్కొన్న.. కాంప్రహెన్షన్, బేసిక్ న్యూమరసీ, డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రెహెన్షన్.. సివిల్ సర్వీసెస్‌లో విధులు నిర్వర్తించే అభ్యర్థులకు తప్పనిసరిగా ఉండాల్సినవిగా పేర్కొన్నారు. కానీ ఆ సిలబస్ అంశాలపై గ్రామీణ, ప్రాంతీయ భాష అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ముఖ్యంగా ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రెహెన్షన్, బేసిక్ న్యూమరసీ వంటి అంశాలు పట్టణ ప్రాంత విద్యార్థులకు, మ్యాథ్స్, సైన్స్ నేపథ్యం ఉన్న విద్యార్థులకు మాత్రమే అనుకూలంగా ఉన్నాయనే నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో గతేడాది రెండో పేపర్‌లోని ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రెహెన్షన్ ప్రశ్నల ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.ఇప్పుడిక తాజాగా సీశాట్‌ను కేవలం అర్హత పరీక్షగానే ప్రభుత్వం పేర్కొంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రెహెన్షన్ విభాగాన్ని కూడా గతేడాదిలాగే తొలగిస్తున్నట్లు పేర్కొంది.
 
 మరి కొత్తగా లభించే ప్రయోజనం
 ఒకవైపు పేపర్-2ను కేవలం అర్హత పరీక్షగా పేర్కొంటూనే.. మరోవైపు అందులో కనీస మార్కులు పొందితేనే పేపర్-1 మూల్యాంకనం జరుగుతుంది అనే నిర్ణయంతో కొత్తగా లభించే ప్రయోజనం ఏంటి అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. గతేడాది వరకు రెండు పేపర్లు కలిపి కటాఫ్ నిర్ణయించే విధానం ఉండేది. దాంతో పేపర్-2లో అత్యధిక మార్కులు పొందడం ద్వారా ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ నేపథ్యం ఉన్న అభ్యర్థులు మలి దశ మెయిన్స్‌కు ఎంపికయ్యారని, దీనివల్ల కొన్ని వర్గాలకే ఎక్కువ లబ్ధి చేకూరిందని నిపుణుల అభిప్రాయం. ఇప్పుడు జనరల్ స్టడీస్ పేపర్‌లో పొందిన మార్కులనే మలి దశకు పరిగణనలోకి తీసుకోవాలనే నిర్ణయం అన్ని నేపథ్యాల అభ్యర్థులకు సమాన అవకాశం ఇచ్చినట్లయిందని అంటున్నారు.
 
 ఆర్ట్స్ విద్యార్థులకు అనుకూలమా..!
 సీశాట్‌ను అర్హత పరీక్షగా మార్చడం ఆర్ట్స్, హ్యుమానిటీస్ విద్యార్థులకు అనుకూలమా? అంటే.. ఎక్కువ మంది నిపుణులు అవుననే అంటున్నారు. ఎందుకంటే..ఆర్ట్స్, హ్యుమానిటీస్ అభ్యర్థులు తమ అకడమిక్స్ స్థాయి నుంచే జనరల్ స్టడీస్‌లో పేర్కొన్న అంశాలపై అవగాహన పొందుతారు. తాజా నిర్ణయం ప్రకారం- జనరల్ స్టడీస్ పేపర్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే మెయిన్స్‌కు అర్హుల జాబితా రూపొందించడం వల్ల వీరికి లబ్ధి చేకూరుతుందని నిపుణులు అంటున్నారు. వాస్తవానికి పేపర్-2లోని అంశాలు పదో తరగతి, ఇంటర్మీడియెట్ స్థాయిలోనివే. అయితే అభ్యర్థులు ఆ తరగతుల తర్వాత తమ అకడమిక్ గమ్యాలను మార్చుకుని ఆ అంశాలకు దూరమవడంతో ఇబ్బందికి గురవుతున్నారు. కానీ మూడు లేదా నాలుగు నెలల కసరత్తుతో బేసిక్ న్యూమరసీ, డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ విభాగాల్లో సులువుగానే రాణించొచ్చు’ అనే అభిప్రాయముంది.
 
 వారికి శరాఘాతమా..!
 పేపర్-2లో గరిష్ట మార్కులు సాధించి మెయిన్స్‌కు ఎంపికవ్వాలని భావిస్తున్న మ్యాథ్స్, సైన్స్, ఇంజనీరింగ్ అభ్యర్థులకు తాజా నిర్ణయం శరాఘాతమని నిపుణుల అభిప్రాయం. సీశాట్ అమల్లోకి వచ్చిన 2011 నుంచి గతేడాది వరకు పేపర్-2లోనే 150 నుంచి 180 మార్కులు పొంది మెయిన్స్‌కు ఎంపికైన ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ నేపథ్యం కలిగిన అభ్యర్థులు ఎందరో ఉన్నారు. వీరిలో అధిక శాతం మంది ఐఐటీలు, ఐఐఎంలు, ఇతర ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లలో చదివిన వారే. వీరంతా మెయిన్స్‌లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంత్రోపాలజీ, సైకాలజీ వంటి ఆర్ట్స్, హ్యుమానిటీస్ సబ్జెక్ట్‌లనే ఆప్షనల్‌గా ఎంచుకున్నప్పటికీ.. తమకున్న అనలిటికల్ స్కిల్స్, కంపేరిటివ్ అప్రోచ్ కారణంగా మెయిన్స్‌లోనూ సులభంగా గట్టెక్కుతున్నారు. తుది జాబితాలోనూ పైచేయి సాధిస్తున్నారు. గత నాలుగేళ్ల ఫలితాల గణాంకాలే ఇందుకు నిదర్శనం. 2011 నుంచి ఇప్పటి వరకు సివిల్స్ విజేతల్లో 40 శాతంపైగా టెక్నికల్/మ్యాథ్స్ నేపథ్యం ఉన్న వారే.
 
 మరికొద్ది రోజుల్లో స్పష్టత!
 తాజా ప్రకటన ప్రకారం- సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి విధి విధానాలపై మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయి స్పష్టత రానుంది. ఇప్పటికే నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తుంది. అదే విధంగా 2011 అభ్యర్థులకు 2015లో అవకాశం ఇస్తామని గతేడాది ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయంపైనా స్పష్టత రానుంది. కాబట్టి 2011 అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ పరంగా సంసిద్ధంగా ఉండటం మంచిది.
 
 మార్పు తథ్యం.. మార్చాలి వ్యూహం
 సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో మార్పు తథ్యమని తేలిపోయింది. ఇక అభ్యర్థులు అందుబాటులో ఉండే  మూడు నెలల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సానుకూల ఫలితం పొందేందుకు కృషి చేయాలి.  ఈ క్రమంలో టెక్నికల్/మ్యాథమెటిక్స్; ఆర్ట్స్/హ్యుమానిటీస్ అభ్యర్థులు అనుసరించాల్సిన వ్యూహాలు..
 
 ఇంజనీరింగ్ /మ్యాథ్స్ అభ్యర్థులు ఇలా:
 ఇంజనీరింగ్/మ్యాథ్స్ అభ్యర్థులకు పేపర్-2లోని అంశాలపై ఇప్పటికే అవగాహన ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో అధిక శాతం పేపర్-1 (జనరల్ స్టడీస్)కు కేటాయించాలి. జనరల్ స్టడీస్, ఆర్ట్స్ విద్యార్థులకే అనుకూలమనే ప్రతికూల భావనను వీడి ముందుకు సాగాలి. గత కొన్నేళ్లుగా జనరల్ స్టడీస్ పేపర్‌లోని ప్రశ్నలను పరిశీలిస్తే అధిక శాతం ప్రశ్నలు సమకాలీన అంశాలకు సంబంధంగానే ఉంటున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి సబ్జెక్ట్‌కు సంబంధించి తాజాగా చోటు చేసుకుంటున్న పరిమాణాలపై దినపత్రికలు, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా అవగాహన పెంచుకోవాలి. తర్వాత వాటికి సంబంధించి కాన్సెప్ట్స్‌ను మెటీరియల్ ఆధారంగా చదవాలి.
 
 ఆర్ట్స్/ హ్యుమానిటీస్ నేపథ్యంతో:
 తాజా నిర్ణయాన్ని ఆర్ట్స్ విద్యార్థులు తమకు అనుకూలంగా భావించి; పేపర్-2ని నిర్లక్ష్యం చేయడం ఏమాత్రం తగదు. పేపర్-2లోనూ కచ్చితంగా అర్హత మార్కులు (33 శాతం) పొందితేనే పేపర్-1 మూల్యాంకన చేస్తారనేది గుర్తుంచుకోవాలి. లేదంటే పేపర్-1లో నూటికి తొంభై శాతం మార్కులు పొందినా.. ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆర్ట్స్, హ్యుమానిటీస్ అభ్యర్థులు పేపర్-2 ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమివ్వాలి. సమయ స్ఫూర్తి, నిర్ణయాత్మక శక్తిని పరీక్షించే డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ విభాగాల ప్రిపరేషన్‌ను సులభతరం చేసుకోవాలి. అదే విధంగా రీడింగ్ కాంప్రహెన్షన్ కోసం నిరంతరం ఇంగ్లిష్ దినపత్రికల్లోని వ్యాసాలు చదవడం అలవర్చుకోవాలి. 33 శాతం కనీస అర్హత మార్కులు పొందే విధంగా ప్రయత్నించాలి. సిలబస్‌లో పేర్కొన్న మొత్తం విభాగాల్లో తమకు బాగా అనుకూలమైన అంశాల్లో మరిం త పట్టు సాధించే విధంగా కృషి చేయాలి. ఇందుకోసం వాస్తవ సమస్యలు- వాటి పరిష్కారానికి అనుసరించిన విధానాలు - నిర్ణయాలు వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి. బేసిక్ న్యూమరసీ ప్రశ్నలు నిజంగానే బేసిక్‌గా ఉంటున్నాయి. కాబట్టి ఆందోళన చెందొద్దు.
 
 జీఎస్ ప్రశ్నలు పెరుగుతాయా?
 ఇప్పటి వరకు 200 మార్కులకు జనరల్ స్టడీస్; మరో 200 మార్కులకు ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజా నిర్ణయంతో జనరల్ స్టడీస్‌లో ప్రశ్నలు, మార్కుల సంఖ్య పెరుగుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు అవకాశాలు లేకపోలేదని, ఒకవేళ వీటిని పెంచినా ఆశ్చర్య పోనక్కర్లేదని నిపుణులు అంటున్నారు.
 
 గ్రామీణ యువతకు సదవకాశం
 సీశాట్ విషయంలో ప్రభుత్వ తాజా నిర్ణయం గ్రామీణ యువతకు సదవకాశం కల్పించేందుకు ఎంతో ఆస్కారం ఉంది. గత నాలుగేళ్లుగా రెండో పేపర్‌లోని అంశాల కారణంగా ఎందరో గ్రామీణ అభ్యర్థులు ఫలితాల్లో నిరాశకు గురయ్యారు. ఇప్పుడు ఆ సమస్య తొలగినట్లే. కానీ కనీస అర్హత మార్కులు పొందాలని పేర్కొనడాన్ని గుర్తించి ప్రిపరేషన్ సాగించాలి.
 -ఆర్.సి.రెడ్డి, డెరైక్టర్,
 ఆర్‌సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్
 
 ఆర్ట్స్‌కు పూర్వ వైభవం
 తాజా నిర్ణయంతో సివిల్ సర్వీసెస్‌లో ఆర్ట్స్ నేపథ్యానికి పూర్వ వైభవం రావడం ఖాయం. ఇప్పటి వరకు ఇంజనీరింగ్ విద్యార్థులు పేపర్-2 ద్వారా, ఆర్ట్స్ విద్యార్థులు పేపర్-1 ద్వారా కటాఫ్ స్థాయి దాటి మెయిన్స్‌కు వెళ్లాలని భావిస్తూ ప్రిపరేషన్ సాగించారు. కానీ ఇప్పుడు పేపర్-1 మార్కులనే మలి దశకు పరిగణనలోకి తీసుకోనున్న నేపథ్యంలో ఆర్ట్స్, హ్యుమానిటీస్ అభ్యర్థులకు కచ్చితంగా కలిసొచ్చే అంశం. ఇదే సమయంలో కటాఫ్ కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంది కాబట్టి అభ్యర్థులు కాస్త జాగ్రత్తగా ప్రిపరేషన్ సాగించాలి.
 -వి. గోపాలకృష్ణ, డెరైక్టర్,
 బ్రెయిన్ ట్రీ అకాడమీ
 
 ముందుగా పేర్కొంటే బాగుండేది

 ఇటీవల కాలంలో సివిల్ సర్వీసెస్ ప్రక్రియలో పలు మార్పులు చేస్తున్నారు. వాటికి సంబంధించి చివరి నిమిషంలో ప్రకటిస్తున్నారు. ఇది అభ్యర్థులను మానసిక ఒత్తిడికి గురి చేస్తుంది. తాజా నిర్ణయం కూడా ఇలాంటిదే. మరొక్క రోజులో నోటిఫికేషన్ వస్తుందని ఎదురుచూస్తున్న నేపథ్యంలో సీశాట్‌పై కొత్త ప్రకటన చేశారు. మార్పుల గురించి కొంత ముందుగా ప్రకటన చేస్తే అభ్యర్థులు సంసిద్ధులయ్యేందుకు అవకాశం లభించేంది.
 -శ్రీరంగం శ్రీరామ్,
 శ్రీరామ్స్ ఐఏఎస్
 

Advertisement

తప్పక చదవండి

Advertisement