అల్లాదుర్గం: ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఒక్కటీ అమలు చేయలేదని, హమీలు నీటి మూటలుగానే మిగిలిపోయాయని భారతీయ జానత పార్టీ జిల్లా అధ్యక్షుడు రాంచరణ్ యాదవ్ ఎద్దేవా చేశారు. మంగళవారం అల్లాదుర్గంలో విలేకర్లతో మాట్లాడుతూ రైతులకు తన చర్మం వలిచి చెప్పులు కుట్టిస్తానని చెప్పిన కేసీఆర్ నేడు రైతుల తోలు తీస్తున్నారని మండిపడ్డారు. నాణ్యమైన విత్తనాలు దొరక్క రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారిని ఆదుకోకుండా వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
రుణమాఫీ కాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. యువత బీజేపీ పాలనకు మొగ్గుచూపుతున్నారని, గ్రామ స్థాయిలో బీజేపీని బలోపేతం చేసేందుకు మండలంలో పర్యటిస్తామని తెలిపారు. త్వరలో గ్రామ, మండల కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో అల్లాదుర్గం మండల బీజేపీ నాయకులు కాళ రాములు, శంకరయ్య, టేక్మాల్ మండల కన్వీనర్ శ్యామయ్య, నాయకులు నారాయణ తదితరులు పాల్గొన్నారు.