పథకాలపై అవగాహన ఉండాలి
భూపాలపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాలపై అసిస్టెంట్ సెక్షన్ అధికారులు సమగ్రమైన అవగాహన పెంపొందించుకోవాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. ఐదు రోజుల జిల్లా పర్యటనకు వచ్చిన 27 మంది అసిస్టెంట్ సెక్షన్ అధికారులతో సోమవారం ఐడీఓసీ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిట్టచివరి ఇంటిని కూడా పరిశీలించి క్షేత్రస్థాయిలో ప్రజల జీవన విధానంపై అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. గ్రామస్థాయి పర్యటన భవిష్యత్ ఉద్యోగ జీవితానికి చాలా ఉపయోగపడుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజాసేవలో మంచి ఉద్యోగులుగా రాణిస్తూ ప్రజల మన్ననలు పొందాలన్నారు. ఉత్తర రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రానికి చాలా వ్యత్యాసం ఉంటుందని.. గ్రామీణ ప్రాంతాలు అత్యధికంగా కలిగినటువంటి రాష్ట్రం కాబట్టి ప్రజల జీవన విధానంపై అవగాహన కలిగి ఉండాలని సెక్షన్ అధికారులకు సూచించారు. ఈ నెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వ అసిస్టెంట్ సెక్షన్ అధికారుల బృందం జిల్లాలో పర్యటిస్తుందని, పర్యటనలో భాగంగా గ్రామాల్లో బస చేయాల్సి ఉన్నందున లోటుపాట్లు రాకుండా పర్యవేక్షణ చేయాలని ఎంపీడీఓలను ఆదేశించారు. 27మంది అధికారులు ఐదు రోజుల పాటు గణపురం మండలంలోని చెల్పూరు, రేగొండ మండలంలోని కొడవటంచ, కాటారం మండలంలోని గంగారం, మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం, భూపాలపల్లి మండలంలోని గొర్లవీడు గ్రామాల్లో పర్యటిస్తారని తెలిపారు. అదే గ్రామాల్లో అధికారులు బస చేయాల్సి ఉంటుందని, సౌకర్యాలు కల్పనలో ఇబ్బంది రాకుండా చూడాలన్నారు. భౌగోళిక, సామాజిక, ఆర్థిక స్థితిగతులు, ప్రజల జీవన విధానం, పంటలు, ఎస్సీ, ఎస్టీ ఆవాసాలు వారి జీవన ప్రమాణాలు తదితర అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని అసిస్టెంట్ సెక్షన్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ మేనేజర్ కుమారస్వామి, సీపీఓ శామ్యూల్, డీఆర్డీఓ నరేష్, ఎంపీడీఓలు పాల్గొన్నారు.
సమస్యలకు సత్వర పరిష్కారం
ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వర పరిష్కారం చూపాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులకు సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల సమస్యలకు సంబంధించిన 15 దరఖాస్తులను అదనపు కలెక్టర్ స్వీకరించారు. ప్రజల నుంచి అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు
జిల్లాకు 27మంది
అసిస్టెంట్ సెక్షన్ అధికారులు