ముదిగుబ్బ : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ముదిగుబ్బ సమీపంలో శనివారం వేకువజామున మూడు గంటల ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో నలుగురు కర్ణాటక వాసులు దుర్మరణం చెందారు. కర్ణాటక గంగావతి ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం తిరుపతి వెంకటేశ్వరుని దర్శనం చేసుకుని తిరుగు పయనమయింది.
వారు ప్రయాణిస్తున్న ఓమ్ని వ్యానును అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం సంకేపల్లి వద్ద ఎదురుగా వస్తున్న సిమెంటు లోడు లారీ ఢీకొంది. ఈ ఘటనలో వ్యానులోని నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అనంతపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.