ముంబయి: స్టాక్ మార్కెట్ లో మరో భారీ పతనం. స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి భారీ స్థాయిలో కుప్పకూలాయి. అంచనాల తప్పిన చైనా తయారీ రంగం భారీగా క్షీణించడంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. దీంతో మంగళవారం నాటి స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 586 పాయింట్ల నష్టాలతో 25వేల 696 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 184 పాయింట్ల నష్టంతో 7,785 పాయింట్లవద్ద ముగిసింది.
సెక్టార్ సూచీల్లో మెటల్ 3.59 శాతం, బ్యాంకెక్స్ 3.83శాతం, క్యాపిటల్ గూడ్స్ 3.03శాతం, రియాల్టీ 3.22 శాతం మేర నష్టపోగా, నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్ట్లో పిఎన్బి 7.59 శాతం , బ్యాంక్ ఆఫ్ బరోడా 7.01శాతం, కోల్ ఇండియా 5.36 శాతం, యాక్సెస్ బ్యాంక్ 5.31శాతం మేర నష్టపోయాయి. గత సోమవారం బీఎస్ఈ సూచి సెన్సెక్స్ సుమారు 1500 పాయింట్లు పతనమై 26వేల పాయింట్ల దిగువకు పడిపోయిన సంగతి తెలిసిందే. ఆనాటి నుంచి స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల్లో కొనసాగుతూ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఇన్వెస్టర్లు తీవ్ర నిరాశకు గురౌతున్నారు.