Actress Neha Deshpande Husband Mohit Arrested In Hyderabad Drugs Case - Sakshi
Sakshi News home page

డీజే ముసుగులో డ్రగ్‌ పెడ్లింగ్‌.. సినీనటి నేహా దేశ్‌పాండే భర్త అరెస్ట్‌

Published Tue, Jan 3 2023 7:58 AM

NCB Arrested Drug Peddler Mohit Agarwal Alias Myron In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోనే ఘరానా ఈవెంట్ల డీజే సప్లయర్‌ మోహిత్‌ అగర్వాల్‌ అలియాస్‌ మై­రోన్‌ మోహిత్‌ను డ్రగ్స్‌ కేసులో హైదరాబాద్‌ నా­ర్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌– న్యూ) అధికారులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. ఆయన భార్య నేహా దేశ్‌పాండే పలు టాలీవుడ్, బాలీవుడ్‌ చిత్రాల్లో హీరోయిన్‌గా నటిం­చారు. అతడు డీజే నిర్వాహకులతోపాటు ఈవెంట్లలో మాదకద్రవ్యాలు సరఫరా చేసేవా­డని, గోవాకు చెందిన డ్రగ్స్‌ డాన్‌ ఎడ్విన్‌ నుంచి వీటిని ఖరీదు చేసేవాడని అధికారులు గుర్తించారు.

హైదరా­బాద్‌ కొండాపూర్‌ ప్రాంతానికి చెందిన మోహిత్‌ 2014లో ‘ది అన్‌స్క్రిప్టెడ్‌’పేరుతో సంస్థను ఏర్పాటు చేసి హైదరాబాద్, ముంబై, గోవా, బెంగళూరుల్లో జరిగే అనేక ఈవెంట్లు, పబ్స్‌కు డీజేలు సరఫరా చేస్తున్నాడు. గోవాలో సన్‌బర్న్‌ బీచ్‌ క్లబ్‌ సహా అనేక భారీ ఈవెంట్స్‌ నిర్వహించాడు. ఆయా పబ్స్‌ నిర్వాహకులతో క­లి­సి వాటిలో ప్రత్యేకంగా రేవ్‌ పార్టీలు నిర్వహించే వాడు. దీనికోసం ఎడ్విన్‌సహా దాదాపు 50 మంది డ్రగ్‌ పెడ్లర్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకు­ని వారి నుంచే కొకైన్‌ ఖరీదు చేసి సరఫరా చేసేవాడు. 

‘క్రూయిజ్‌’లో ఆధారాల్లేక..
గతేడాది అక్టోబర్‌ 2న ఎన్సీబీ అధికారులు ముంబై క్రూయిజ్‌ డ్రగ్‌ పార్టీపై దాడి చేసి షారూఖ్‌ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ సహా పలువురిని డ్రగ్స్‌ కేసులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మోహిత్‌ కూడా అదే క్రూయిజ్‌లో ఉన్నా ఇతడి వద్ద ఎలాంటి డ్రగ్స్‌ దొరక్కపోవడం, ఆర్యన్‌తో సంబంధాలపై ఆధారాలు లేకపోవడంతో అధికారులు విడిచిపెట్టారు. గోవాకు చెందిన డ్రగ్స్‌ డాన్‌ ఎడ్విన్‌ను హెచ్‌–న్యూ అధికారులు గతేడాది నవంబర్‌ 5న అరెస్టు చేసి విచారించగా మోహిత్‌ పేరు వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న అతడు గోవా, ముంబైల్లో తలదాచుకున్నాడు. హెచ్‌–న్యూ ఇన్‌స్పెక్టర్‌ పి.రాజేశ్‌ నేతృత్వంలోని బృందం అతడి కోసం వివిధ ప్రాంతాల్లో గాలించింది.

మోహిత్‌ ‘డిసెంబర్‌ 31’న గోవాలో రూ.2 కోట్లు వెచ్చించి భారీ ఈవెంట్‌ నిర్వహించినట్లు సమాచారం అందుకున్న హెచ్‌–న్యూ బృందం అక్కడికి వెళ్లగా త్రుటిలో తప్పించుకుని విమానంలో హైదరాబాద్‌ వచ్చే­శాడు. వేట కొనసాగించిన హెచ్‌–న్యూ ఎట్టకే­లకు అతడిని పట్టుకుంది. అతడి వద్ద నుంచి గ్రాము కొకైన్‌ స్వాధీనం చేసుకుంది. రామ్‌గోపాల్‌పేట ఠాణాలో ఉన్న ఎడ్విన్‌ కేసులోనూ రిమాండ్‌కు తరలించింది. విచారణలో నగరానికి చెందిన అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులతో అతడికి ఉన్న సంబంధాలు బ­య­టపడ్డాయి. అయితే వారిలో ఎందరు డ్రగ్స్‌ ఖరీదు చేశారు? ఏఏ పబ్స్‌ నిర్వాహకులతో అతడికి ఒప్పందాలు ఉన్నాయనే వివరాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనికోసం వారం రోజులు తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. డ్రగ్స్‌ దందాలో మోహిత్‌ భార్య నేహా దేశ్‌పాండేకు ఏమైనా లింకు ఉందా? అనే అంశాన్నీ పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నేహా దేశ్‌పాండే ‘ది కిల్లర్, దిల్‌ దివానా, బెల్స్‌’తదితర సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు. 

ఇదీ చదవండి: సర్వం ‘త్రిమూర్తుల’ కనుసన్నల్లోనే!

Advertisement
 
Advertisement
 
Advertisement