T20 WC 2024: యువరాజ్‌ సింగ్‌కు కీలక బాధ్యతలు | Sakshi
Sakshi News home page

T20 WC 2024: యువరాజ్‌ సింగ్‌కు కీలక బాధ్యతలు

Published Fri, Apr 26 2024 4:32 PM

Yuvraj Singh Named Ambassador For ICC Mens T20 World Cup 2024

టీమిండియా మాజీ ఆటగాడు, సిక్సర్ల కింగ్‌ యువరాజ్‌ సింగ్‌కు ఐసీసీ కీలక బాధ్యతలు అప్పజెప్పింది. త్వరలో ప్రారంభంకానున్న టీ20 వరల్డ్‌కప్‌ 2024కు రాయబారిగా నియమించింది. యువరాజ్‌.. యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌, ఎనిమిది సార్లు ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత ఉసేన్‌ బోల్ట్‌తో కలిసి పొట్టి ప్రపంచకప్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తాడని ఐసీసీ ప్రకటించింది.

 

 

మెగా టోర్నీలో భాగంగా జరిగే భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌తో సహా యుఎస్‌ఏలో జరిగే మొత్తం మ్యాచ్‌ల ప్రమోషన్‌ బాధ్యతలను యువరాజ్‌కు అప్పజెప్పింది. టీ20 వరల్డ్‌కప్‌కు ఐసీసీ రాయబారిగా ఎంపిక కావడంపై యువరాజ్‌ స్పందిస్తూ.. ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టడం వంటి మరుపురాని జ్ఞాపకాలు పొట్టి ప్రపంచకప్‌తో ముడిపడి ఉన్నాయి.

ఇలాంటి మెగా ఈవెంట్‌లో మరోసారి భాగం కావడం నా అదృష్టం. వరల్డ్‌కప్‌ రాయబారిగా నా బాధ్యతలు నిర్వర్తించడానికి చాలా ఉత్సాహంగా ఉన్నానని అన్నాడు. భారత్‌-పాక్‌ మ్యాచ్‌పై యువీ స్పందిస్తూ.. ఈ ఏడాది ప్రపంచంలో జరుగబోయే అతిపెద్ద క్రీడా సంగ్రామమంగా అభివర్ణించాడు. 

కాగా, ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ యూఎస్‌ఏ, కరీబియన్‌ దీవులు వేదికగా జూన్‌ 1 నుంచి ప్రారంభంకానుంది. నెల రోజుల పాటు సాగనున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూపులుగా విడిపోయి పోటీపడతాయి. గ్రూప్‌-ఏలో భార‌త్‌తో పాటు కెన‌డా, పాకిస్థాన్, యూఎస్ఏ, ఐర్లాండ్ ఉన్నాయి. క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దాయాదుల సమరం (భారత్‌-పాక్‌ మ్యాచ్‌) జూన్‌ 9న న్యూయార్క్ వేదికగా జరుగనుంది. 
 

Advertisement
Advertisement