ఢిల్లీకి కాంగ్రెస్‌ సూట్‌కేసులు | Sakshi
Sakshi News home page

ఢిల్లీకి కాంగ్రెస్‌ సూట్‌కేసులు

Published Sat, Feb 17 2024 5:12 AM

Kishan Reddy comments on Congress party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌పార్టీ ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడం పక్కన పెట్టి ఢిల్లీకి సూట్‌కేసులు మోస్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. రాహుల్‌ గాంధీ కోసం రాష్ట్రంలోని కాంగ్రెస్‌ సర్కార్‌కాంట్రాక్టర్లు, బిల్డర్లు, కంపెనీలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కర్ణాటక నుంచి సూట్‌కేసులు వస్తే.. ఇప్పుడు తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్తున్నాయని విమర్శించారు.

శుక్రవారం పార్టీ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు వెల్లాల రామ్మోహన్‌ తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. వారికి కిషన్‌ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కావడం లేదని ఆరోపించారు. ’’కాంగ్రెస్‌ది భస్మాసుర హస్తం.. చెయ్యి గుర్తుకు ఓటేస్తే.. అదే చెయ్యిని ప్రజల తలపై పెట్టి మోసం చేస్తుందని’’ఇప్పుడు మరోసారి రుజువైందని ధ్వజమెత్తారు. ’’దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన పీవీ నర్సింహారావును మోదీ ప్రభుత్వం గౌరవించింది. పీవీ చనిపోతే.. ఆయన పారి్ధవ దేహాన్ని ఏఐసీసీ ఆఫీసులోకి రానివ్వకుండా హైదరాబాద్‌కు పంపిన చరిత్ర కాంగ్రెస్‌ది అని అన్నారు.

విజిలెన్స్‌తో అయ్యేది లేదు.. పోయేది లేదు 
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలు రెండూ దొందూ దొదేని కిషన్‌రెడ్డి విమర్శించారు. ‘ఈ రెండూ అవినీతి, కుటుంబ పార్టీలే. ఇవి మజ్లిస్‌పంచన చేరి బుజ్జగింపు రాజకీయాలు చేస్తాయి. కాంగ్రెస్‌ కూడా అవినీతి పార్టీనే కాబట్టి బీఆర్‌ఎస్, కేసీఆర్‌పై దర్యాప్తు చేసేందుకు కాంగ్రెస్‌ప్రభుత్వానికి ధైర్యం లేదు. సీబీఐతో విచారణ జరిపించాలని మేము డిమాండ్‌ చేస్తే.. విజిలెన్స్‌ పేరుతో కాలయాపన చేస్తోంది. విజిలెన్స్‌తో అయ్యేది లేదు.. పోయేది లేదు. గత బీఆర్‌ఎస్‌ప్రభుత్వం కాంట్రాక్టర్లకు నిధులు ఇవ్వకుండా వారు జీహెచ్‌ఎంసీ ముందు ధర్నా చేసే దుర్మార్గ స్థితికి తీసుకువస్తే.. కాంగ్రెస్‌ప్రభుత్వం దాన్ని మరింత దిగజార్చనుంది. హైదరాబాద్‌నుంచి రాష్ట్రానికి పెద్ద మొత్తంలో ఆదాయం వస్తున్నా.. జీహెచ్‌ఎంసీకి నిధులు ఇవ్వడం లేదు’’అని కిషన్‌ రెడ్డి మండిపడ్డారు.  

మోదీతోనే తెలంగాణ అభివృద్ధి... 
గత తొమ్మిదిన్నరేళ్లలో మోదీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు ఇస్తోందని కిషన్‌రెడ్డి వివరించారు. ‘రూ.400 కోట్లతో చర్లపల్లి, రూ.720 కోట్లతో సికింద్రాబాద్, రూ.450 కోట్లతో కాచిగూడ, రూ.350 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్లను మోదీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందన్నారు. భద్రాద్రి అభివృద్ధికి రూ.50 కోట్లు కేంద్రం ఇచ్చిందని, వరంగల్‌రామప్ప దేవాలయానికి మోదీ కృషితో యునెస్కో గుర్తింపు వచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణలో రూ.లక్షా 20 వేల కోట్ల విలువైన రహదారుల నిర్మాణం జరిగిందన్నారు. హైదరాబాద్‌ చుట్టూ రూ.26 వేల కోట్ల ట్రిపుల్‌ఆర్‌రోడ్డును మోదీ మంజూరు చేశారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌హయాంలో ఎంపీలు, మంత్రులు అవినీతి ఆరోపణలతో, కుంభకోణాలతో జైలుకు వెళ్లారని, తొమ్మిదిన్నర ఏళ్ల మోదీ పాలనలో ఒక్క రూపాయి అవినీతి జరగలేదని గుర్తు చేశారు. వచ్చే 25 ఏళ్లలో ప్రపంచ దేశాలకు విశ్వగురువుగా భారత్‌ను నిలబెట్టాలని ప్రధాని పిలుపునిచ్చారనీ అందులో భాగస్వామ్యమయ్యేందుకు మనం సిద్ధమవ్వాలని కిషన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. 

Advertisement
Advertisement