ఆడవాళ్లను పట్టించుకోరే! 20 ఏళ్లలో తొలిసారి ఇలాంటి పరిస్థితి! | Sakshi
Sakshi News home page

అతివలను పట్టించుకోని పార్టీలు.. మహిళా అభ్యర్థులు లేనట్లే!

Published Wed, Nov 15 2023 1:32 AM

- - Sakshi

నిర్మల్‌: అతివలు రాజకీయ రంగాన్ని శాసిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులూ ఉన్నారు. జనాభాలో, ఓటరు జాబితాలో రాష్ట్రంలోనే జిల్లా మహిళలు సత్తా చాటుతున్నారు. పురుషుల కంటే ఎక్కువ నిష్పత్తిలో ఉన్నారు. కానీ.. రాజకీయాల్లో మాత్రం అంతంత మా త్రంగానే అడుగుపెడుతున్నారు. సర్పంచ్‌, ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యుల దగ్గరే ఆగిపోతున్నారు. గ తంలో ఒకరిద్దరు మాత్రమే ఎమ్మెల్యే దాకా చేరుకోగలిగారు. ఈసారి ఎన్నికల్లో కనీసం పోటీలో కూ డా మహిళలు ఉంటున్నట్లు కనిపించడం లేదు. ప్రతీ వెయ్యి మంది పురుషులకు 1,050 మంది ఉన్న మహిళలు ఓటు వేసే వరకే పరిమితమవుతున్నారు.

స్త్రీ ఆధిపత్యమున్నా..
అతివల రాజ్యమే అయినా జిల్లాలో ఖానాపూర్‌ ని యోజకవర్గం మినహాయిస్తే నిర్మల్‌, ముధోల్‌ ని యోజకవర్గాల్లో ఇప్పటి వరకు కనీసం ఒక్క మహిళ కూడా ఎమ్మెల్యే కాలేదు. ఒకరిద్దరు మినహా కనీసం ఎన్నికల బరిలో నిల్చోవడం లేదు. 1952లో ఎన్నికలు ప్రారంభం కాగా, 71 ఏళ్లలో మహిళలు రాజకీయంగా ముందడుగు వేయకపోవడం వెలితిగానే కనిపిస్తోంది. గత దశాబ్దపు కాలం నుంచి అక్కడక్క డ ఒక్కరో ఇద్దరో బయటకు వస్తున్నారు. 20 ఏళ్లుగా జరుగుతున్న ఎన్నికల్లో తొలిసారిగా ఈ ఎన్నికల్లో మహిళల ప్రాతినిధ్యం ఉండేలా లేదు.

పార్టీలూ పట్టించుకోవు..
చాలామంది మహిళలు రాజకీయాల్లో రాణించేందుకు ఆసక్తిగా ఉన్నా పార్టీలు వారికి అవకాశాలు ఇవ్వడం లేదు. ఖానాపూర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న రేఖానాయక్‌కు బీఆర్‌ఎస్‌ మూడోసారి టికెట్‌ ఇవ్వలేదు. దీంతో ఆమె ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. ముధోల్‌ బీజేపీ టికెట్‌ కోసం ఆ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న రమాదేవి ప్రయత్నాలు చేసినప్పటికీ దక్కలేదు. దీంతో ఆమె బీఆర్‌ఎస్‌లో చేరారు. మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు దుర్గాభవాని సైతం ఉమ్మడి జిల్లాలో ఎక్కడో ఒకచోట టికెట్‌ ఇవ్వాలని కోరినా పార్టీ పట్టించుకోలేదు. ఇలా చాలామంది మహిళా నేతలకు పార్టీలు ఈసారి నిరాశే మిగిల్చాయి. మహిళల ఖిల్లాగా ఉన్న జిల్లాలో ఈసారి కనీసం మహిళ అభ్యర్థులుగా నామినేషన్‌ వేసేందుకు ఎవరూ ముందుకు వచ్చేలా కనిపించడం లేదు.

గత ఎన్నికల్లో..
మహిళాబిల్లు అమలయ్యే దిశగా అడుగులు పడుతున్నవేళ అతివలు మాత్రం జిల్లా రాజకీయాల్లో ముందడుగు వేయడం లేదన్న వాదన ఉంది. ఇప్పటి వరకు జిల్లాలో కేవలం ఇద్దరే ఎమ్మెల్యేలు కాగా, ఈ ఇరవై ఏళ్లల్లో కేవలం ఐదుగురు మాత్రమే బరిలో నిలిచారు.

2008–09లో ఖానాపూర్‌ నుంచి రాథోడ్‌ సుమన్‌బాయి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

2009–14 ఖానాపూర్‌ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై న రాథోడ్‌ సుమన్‌బాయి.

2014–18 ఖానాపూర్‌లో బీఆర్‌ఎస్‌ నుంచి పోటీచేసిన అజ్మీరా రేఖానాయక్‌ ఎమ్మెల్యేగా గెలిచారు.

 2018–23 వరుసగా రెండోసారి బీఆర్‌ఎస్‌ నుంచి రేఖానాయక్‌ ఎమ్మెల్యేగా గెలిచారు.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో ముధోల్‌ బీజేపీ అభ్యర్థిగా పడకంటి రమాదేవి పోటీ చేసి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, కేంద్రమాజీ మంత్రి వేణుగోపాలచారిని మూడోస్థానానికి నెట్టి, ఆమె రెండోస్థానంలో నిలిచారు.

2018 ఎన్నికల్లోనూ రమాదేవి ముధోల్‌ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి మళ్లీ రెండోస్థానంలో నిలిచారు.

2018 అసెంబ్లీ బరిలో ముధోల్‌లో బీఎస్పీ నుంచి రాథోడ్‌ సురేఖ పోటీ చేసి ఓడిపోయారు.

2018 ఎన్నికల్లో నిర్మల్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా డాక్టర్‌ సువర్ణరెడ్డి బరిలో నిలిచి ఓడిపోయారు.

2018 ఎన్నికల్లో నిర్మల్‌ నుంచి బీఎల్‌ఎఫ్‌(బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌) అభ్యర్థిగా అలివేలుమంగ పోటీ చేసి ఓడిపోయారు.

Advertisement
Advertisement