ఆ ఐదు చోట్ల అమీతుమీ  | Sakshi
Sakshi News home page

ఆ ఐదు చోట్ల అమీతుమీ 

Published Wed, Apr 24 2024 4:15 AM

Sukanta vs Mamata in Balurghat - Sakshi

రెండో విడతలో అందరి దృష్టీ వీటిపైనే 

ఛత్తీస్‌గఢ్‌లో బఘెల్‌కు కఠిన పరీక్ష 

రాజ్‌నంద్‌గావ్‌లో చెమటోడుస్తున్న మాజీ సీఎం 

నాందేడ్‌లో బీజేపీ గెలుపు బాధ్యత చవాన్‌పై 

అమరావతిలో నటి నవనీత్‌ కౌర్‌ ఎదురీత 

పూర్ణియాలో ప్రధాన పార్టీలకు పప్పూ సవాల్‌ 

బాలూర్‌ఘాట్‌లో సుకాంత వర్సెస్‌ మమత 

పూర్ణియా (బిహార్‌) 
ఇక్కడ ఎన్డీఏ కూటమి నుంచి సిట్టింగ్‌ ఎంపీ, జేడీ(యూ) నేత సంతోష్ కుమార్‌ కుశ్వాహా ఈసారి హ్యాట్రిక్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. విపక్ష ఇండియా కూటమి తరఫున ఆర్జేడీ నాయకురాలు బీమా భారతీ పోటీలో ఉన్నారు. ఆమె నెల క్రితమే జేడీ(యూ) నుంచి ఆర్జేడీలో చేరారు. కానీ బాహుబలి రాజేశ్‌ రంజన్‌ అలియాస్‌ పప్పూయాదవ్‌ రంగప్రవేశంతో పోటీ ఒక్కసారిగా ఆసక్తికరంగా మారిపోయింది. ఆయనపై లెక్కలేనన్ని హత్య, హత్యాయత్నం తదితర కేసులున్నాయి. ఐదుసార్లు లోక్‌సభ ఎంపీగా నెగ్గారు. పదేళ్ల తర్వాత మళ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నారు.

2015లో ఆర్జేడీ నుంచి బహిష్కరణకు గురయ్యాక జన్‌ అధికార్‌ పార్టీ పేరుతో సొంత కుంపటి పెట్టుకున్నారు. కాంగ్రెస్‌ టికెట్‌పై ఆశతో దాన్ని ఇటీవలే ఆ పార్టీలో విలీనం చేశారు. కానీ కూటమి సర్దుబాటులో ఆ సీటు ఆర్జేడీకి వెళ్లడంతో ఆగ్రహించి స్వతంత్రునిగా రంగంలోకి దిగి ప్రధాన పార్టీల అభ్యర్థులకు పెనుసవాలు విసురుతున్నారు. గతంలో కూడా ఆయన స్వతంత్రునిగా నెగ్గడం విశేషం. సంతోష్ కుమార్‌పై ఓటర్లలో అసంతృప్తి, వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నాయి. పైగా జేడీ(యూ) మాజీ నేత అయిన బీమా భారతీ కూడా ఆ పార్టీ ఓట్లను బాగానే చీల్చేలా కన్పిస్తున్నారు. ప్రణామ్‌ పూర్ణియా పేరిట పప్పూయాదవ్‌ చేస్తున్న ప్రచారానికి భారీ స్పందన లభిస్తుండటం విశేషం! 

రాజ్‌నంద్‌గావ్‌ (ఛత్తీస్‌గఢ్‌) 
ఈ స్థానం బీజేపీకి కంచుకోట. ఈసారి దాన్ని ఎలాగైనా బద్దలు కొట్టాలని కాంగ్రెస్‌ పట్టుదలగా ఉంది. అందులో భాగంగా తాజా మాజీ సీఎం భూపేశ్‌ బఘెల్‌ను బరిలో దింపింది. అయితే, కాకాగా ప్రసిద్ధుడైన ఆయన బహుముఖ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. నిజానికి సీఎంగా ఈ ప్రాంతాన్ని బఘెల్‌ ఎంతగానో అభివృద్ధి చేశారు. పైగా ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని 8 అసెంబ్లీ సీట్లలో ఏకంగా ఐదు కాంగ్రెస్‌ ఖాతాలోనే ఉన్నాయి. అయినా ఈసారి కూడా ఇక్కడ బీజేపీదే విజయమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఆ పార్టీ తరఫున బరిలో ఉన్న సిట్టింగ్‌ ఎంపీ సంతోష్‌ పాండే ఈసారి కూడా విజయంపై ధీమాగా ఉన్నారు.

2000లో రాష్ట్రం ఏర్పడ్డ నాటినుంచి ఒక్కసారి మినహా ఇక్కడ కాషాయ జెండాయే ఎగిరింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమి నేపథ్యంలో ఇక్కడ గెలుపు బఘెల్‌కు తప్పనిసరిగా మారింది. దాంతో ఈ పోరును ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సుడిగాలి పర్యటనలతో నియోజకవర్గమంతా చుట్టేస్తున్నారు. నిత్యం ఓటర్లను కలుస్తూ ఓట్లడుగుతున్నారు. కాకపోతే మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కుంభకోణం ఆరోపణలు ఆయన అవకాశాలకు మరింతగా గండికొట్టేలా కన్పిస్తున్నాయి. 
ఇక్కడి ఓటర్లలో ఆదివాసీలు ఏకంగా 35 శాతం, ఓబీసీలు 30 శాతమున్నారు. 

నాందేడ్‌ (మహారాష్ట్ర) 
ఈ లోక్‌సభ స్థానం కొన్నాళ్ల క్రితం దాకా కాంగ్రెస్‌కు పెట్టని కోట. కానీ ఆ పార్టీ అగ్ర నేత, మాజీ సీఎం అశోక్‌ చవాన్‌ ఇటీవల బీజేపీలో చేరడంతో ఇక్కడ సమీకరణాలు పూర్తిగా మారాయి. దానికి తోడు గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ పాగా వేసింది. అయితే సిట్టింగ్‌ బీజేపీ ఎంపీ ప్రతాప్‌రావ్‌ గోవిందరావ్‌ పాటిల్‌ చికలీకర్‌కు ఇండియా కూటమి తరఫున వసంత్‌ చవాన్‌ ఈసారి గట్టి పోటీ ఇస్తున్నారు. దీనికి తోడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ పార్టీ వంచిత్‌ బహుజన్‌ అఘాఢీ (వీబీఏ) కూడా బరిలో ఉండటంతో ముక్కోణపు పోరు నెలకొంది.

ఈ సెగ్మెంట్లో సంఖ్యాధికులైన ఓబీసీలు బీజేపీకి గట్టి ఓటు బ్యాంకు. కానీ అదే సామాజిక వర్గానికి చెందిన వీబీఏ అభ్యర్థి అవినాశ్‌ భోసికర్‌ బీజేపీ ఓట్లను చీలుస్తారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చికలీకర్‌ను గెలిపించుకోవాల్సిన బాధ్యతను పార్టీ నాయకత్వం అశోక్‌ చవాన్‌పై ఉంచింది. దాంతో ఆయన సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. వీబీఏ అభ్యర్థి బీజేపీ వ్యతిరేక ఓట్లనే చీల్చి చికిలీకర్‌ విజయాన్ని సునాయాసం చేస్తారని చవాన్‌ చెబుతున్నారు. 

అమరావతి (మహారాష్ట్ర) 
రాష్ట్రంలో అత్యంత హోరాహోరీ పోరు నెలకొన్న స్థానాల్లో ఇదొకటి. సిట్టింగ్‌ ఎంపీ, సినీ నటి నవ్‌నీత్‌ కౌర్‌ రాణా ఈసారి బీజేపీ టికెట్‌పై బరిలో ఉన్నారు. ఆమె 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ దన్నుతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి కేంద్ర మాజీ మంత్రి ఆనంద్‌రావ్‌ అడ్సుల్‌పై నెగ్గి తొలిసారి లోక్‌సభలో ప్రవేశించారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈసారి మాత్రం ఎదురీదుతున్నారు. ఎందుకంటే ఆమెకు టికెటివ్వడంపై స్థానిక బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఇది చాలదన్నట్టు ఎన్డీఏ స్థానిక భాగస్వామి ప్రహార్‌ పార్టీ రాణా అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

తమ పార్టీ తరఫున దినేశ్‌ బూబ్‌ను పోటీకి నిలిపింది! దీనికి తోడు మహావికాస్‌ అఘాఢీ కూటమి తరఫున బరిలో ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే బల్వంత్‌ వాంఖడేకు నియోజకవర్గమంతటా మంచి పేరుంది. పైగా ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు అసెంబ్లీ సీట్లలో మూడు కాంగ్రెస్‌ చేతిలోనే ఉన్నాయి. అయితే వంచిత్‌ బహుజన్‌ పార్టీ నుంచి బరిలో ఉన్న అంబేడ్కర్‌ మనవడు ఆనంద్‌రాజ్‌ అంబేడ్కర్‌ కాంగ్రెస్‌ ఓట్లను భారీగా చీలుస్తారని భావిస్తున్నారు. ఇది రాణాకు బాగా కలిసొచ్చే అంశం.  

బాలూర్‌ఘాట్‌ (పశ్చిమబెంగాల్‌) 
పశ్చిమబెంగాల్లో బీజేపీ, అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ నడుమ హోరాహోరీ పోటీ నెలకొన్న లోక్‌సభ స్థానాల్లో బాలూర్‌ఘాట్‌ ముఖ్యమైనది. ఇక్కడి నుంచి బీజేపీ తరఫున పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సిట్టింగ్‌ ఎంపీ సుకాంత మజుందార్‌ పోటీ చేస్తున్నారు. 2019లో బీజేపీ తొలిసారిగా రాష్ట్రంలో భారీగా సీట్లను గెలుచుకోవడం తెలిసిందే. ఆ ఎన్నికల్లో తృణమూల్‌ అభ్యర్థి అర్పితా ఘోష్‌పై సుకాంత భారీ మెజారిటీతో నెగ్గారు. దాంతో ఈసారి బాలూర్‌ఘాట్‌ను తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

సుకాంతను ఎలాగైనా ఓడించి తీరాలని పట్టుదలగా ఉన్నారు. రాష్ట్ర మంత్రి విప్లవ్‌ మిత్రాను మమత బరిలో దించడంతో పోరు మరింత ఆసక్తికరంగా మారింది. అయినా సుకాంత మాత్రం బాలూర్‌ఘాట్‌తో పాటు బెంగాల్‌ మొత్తాన్నీ మోదీ వేవ్‌లో బీజేపీ క్లీన్‌స్వీప్‌ చేస్తుందంటున్నారు. ఈసారి కూడా తనకు భారీ మెజారిటీ ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తృణమూల్‌ నేతల అంతులేని అవినీతి, సందేశ్‌ఖాలీలో మహిళలపై వారి అకృత్యాలతో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా విసిగిపోయారని చెబుతున్నారు.  

మీరట్‌ (ఉత్తరప్రదేశ్‌) 
‘టీవీ రాముడు’ అరుణ్‌ గోవిల్‌ పోటీతో ఈ లోక్‌సభ స్థానం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. దూరదర్శన్‌లో సీరియల్‌గా వచ్చిన రామాయణంలో రాముని పాత్ర పోషించిన ఆయన దేశవ్యాప్త క్రేజ్‌ సంపాదించారు. బీజేపీ ఆయనను అనూహ్యంగా పార్టీలో చేర్చుకోవడమే గాక మీరట్‌ టికెట్‌ కూడా ఇచ్చింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో 80 స్థానాలకు గాను బీజేపీ 62 చోట్ల నెగ్గడం తెలిసిందే.

ఈసారి దేశవ్యాప్తంగా సొంతంగా 370 లోక్‌సభ స్థానాల లక్ష్యాన్ని సాధించాలంటే యూపీలో క్లీన్‌స్వీప్‌ చేయడం తప్పనిసరని పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో మీరట్‌ పరిసరాల్లోని పలు లోక్‌సభ స్థానాల్లో గోవిల్‌ ప్రభావం చూపుతారన్న అంచనాతో ఆయన్ను బరిలోకి దింపింది. సమాజ్‌వాదీ నుంచి సునీతా వర్మ, బీఎస్పీ నుంచి దేవవ్రత్‌ కుమార్‌ త్యాగీ ఆయనకు ప్రత్యర్థులుగా బరిలో ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement