నాడు పాక్‌ అనుకూల నినాదాలు.. నేడు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. | Sakshi
Sakshi News home page

నాడు పాక్‌ అనుకూల నినాదాలు.. నేడు సుప్రీంకోర్టులో చుక్కెదురు..

Published Mon, Sep 4 2023 5:15 PM

National Conference Leader Asked Apologise Pro Pak Slogans - Sakshi

ఢిల్లీ: పాక్ అనుకూల నినాదాలు చేసిన నేషనల్ కాన్ఫరెన్స్‌ నాయకుడు, ఆర్టికల్ 370 రద్దు ప్రధాన పిటీషనర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. భారత రాజ్యాంగానికి విధేయత చూపుతున్నట్లు లిఖితపూర్వకంగా ప్రమాణం చేయాలని మహ్మద్ అక్బర్ లోన్‌ను ధర్మాసనం కోరింది. 2018లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేశాడని సొలిసిటర్ జనరల్‌ తుషార్ మెహతా ఆరోపించడంతో సర్వోన్నత న్యాయస్థానం చర్యలకు పూనుకుంది.

"జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని, భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని, విధేయత చూపుతానని అక్బర్ లోన్ బేషరతుగా అంగీకరిస్తున్నాడని మేము కోరుకుంటున్నాము" అని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం పేర్కొంది. 

భారత రాజ్యాంగానికి విధేయత చూపుతున్నానని పేర్కొంటూ జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని వ్యతిరేకిస్తున్నట్లు రేపటిలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కోరింది. నాయకుల మాటలు సమాజంపై ప్రభావం చూపుతాయని పేర్కొంటూ.. క్షమాపణలు కోరకపోతే ఇలాంటి చర్యలను ప్రోత్సహించినట్లవుతుందని కోర్టు స్పష్టం చేసింది. ఇది జమ్మూ కశ్మీర్‌లో శాంతి భద్రతలను కాపాడుతున్న కేంద్రం చర్యలపై ప్రభావం చూపుతుందని వెల్లడించింది. 

జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించే 370 ఆర్టికల్ రద్దు అంశాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్‌లు దాఖలు అయ్యాయి.  వీటిపై గత కొన్ని రోజులుగా విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర హోదా మళ్లీ ఎప్పుడు పునరుద్ధరిస్తారని కేంద్రాన్ని ధర్మాసనం ప్రశ్నించిన విషయం తెలిసిందే

ఇదీ చదవండి: ఉదయనిధి 'సనాతన ధర్మ' వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందన ఏంటంటే..?


 

Advertisement
Advertisement