Telangana Crime News: బైక్‌పై వెళ్తున్న తండ్రీకొడుకును ఢీకొట్టిన కారు.. తండ్రి మృతి!
Sakshi News home page

బైక్‌పై వెళ్తున్న తండ్రీకొడుకును ఢీకొట్టిన కారు.. తండ్రి మృతి!

Published Tue, Dec 26 2023 12:48 AM

- - Sakshi

దామరగిద్ద: తోట నారు తెచ్చేందుకు బైక్‌పై వెళ్తున్న తండ్రీకొడుకును కారు ఢీకొట్టిన ప్రమాదంలో తండ్రి మృతి చెందగా.. కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ విషాదకర ఘటన నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం పిడెంపల్లి గ్రామ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. పిడెంపల్లికి చెందిన సుదర్శర్‌రెడ్డి (43) తోటనారు తెచ్చేందుకుగాను తన కుమారుడు సాయి యశ్వంత్‌రెడ్డితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. స్టేజీ వద్ద ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది.

ప్రమాదంలో సుదర్శన్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా. అతడి కుమారుడు సాయి యశ్వంత్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని సాయి యశ్వంత్‌రెడ్డిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడు చంద్రారెడ్డి ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్‌ ఎండీ ఖాజాపాషాపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపారు.

లారీ ఢీకొని మరో వ్యక్తి..
మహబూబ్‌నగర్‌ క్రైం: రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని లారీ ఢీకొట్టడంతో తీవ్రగాయాలై మృతి చెందాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వన్‌టౌన్‌ ఎస్‌ఐ నవీద్‌ వివరాల మేరకు.. జిల్లా కేంద్రంలోని మేకలబండకు చెందిన సయ్యద్‌ ఖాసీం (45) వన్‌టౌన్‌ చౌరస్తాలో రోడ్డు దాటుతుండగా.. వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది.

ప్రమాదంలో అతడికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు జిల్లా జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడి భార్య షాహెదాబేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.

Advertisement
Advertisement