Sakshi News home page

ఏపీలో ఎంఎస్‌ఎంఈ ఉద్యోగాలు భారీగా పెరిగాయి

Published Sun, Dec 31 2023 5:03 AM

MSME jobs in AP have grown tremendously - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ) ఏర్పాటుకు సీఎం వైఎస్‌ జగన్‌ తీసు­కున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఎంఎస్‌­ఎంఈల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల కల్పన ఏటేటా భారీగా పెరుగుతోందని కేంద్ర ఎంఎస్‌ఎంఈల శాఖ సహాయ మంత్రి భానుప్రతాప్‌సింగ్‌వర్మ ఇటీవల రాజ్యసభలో వెల్లడించారు. 2021–22వ ఆర్థిక సంవత్సరంలో ఏపీలో ఎంఎస్‌ఎంఈల ద్వా­రా 12,29,335 మందికి ఉద్యోగాలను కల్పించగా.. 2022–23లో ఏకంగా 27,27,273 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు కేంద్ర మంత్రి భానుప్రతాప్‌సింగ్‌ తెలిపారు.

ఎంఎస్‌ఎంఈల ద్వారా అత్యధిక ఉద్యోగాల కల్పనలో దేశంలోనే ఏపీ 7వ స్థానంలో నిలిచిందని ఆయన వెల్లడించారు. వైఎస్‌ జగన్‌ పాలనలోని ఈ నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో కొత్తగా 5.06 లక్షల ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటయ్యాయి. గత చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో 1,93,530 ఎంఎస్‌ఎంఈలు మాత్రమే ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి ఈ సంఖ్య 6,99,881కు పెరిగిందని కేంద్ర మంత్రి భానుప్రతాప్‌సింగ్‌ తెలిపారు. దేశంలో 2021–22లో 6,222 ఎంఎస్‌ఎంఈలు మూతపడగా.. ఏపీలో 113 మాత్రమే మూతపడ్డాయని చెప్పారు. 2022–23లో దేశంలో 13,290 ఎంఎస్‌ఎంఈలు మూతపడగా ఏపీలో 261 మాత్ర­మే మూతపడ్డాయని వివరించారు.

కోవిడ్‌ కష్ట సమయంలో సైతం ఎంఎస్‌ఎంఈల కార్యకలాపాలు ని­లి­చిపోకుండా సీఎం జగన్‌ రీస్టార్ట్‌ ప్యాకేజీ, వైఎస్సా­ర్‌ నవోదయం తదితర పథకాలతో చేదోడువాదోడుగా నిలిచారు. అలాగే చంద్రబాబు హయాంలో ఎంఎస్‌ఎంఈలు, స్పిన్నింగ్‌ మిల్లులకు ప్రోత్సాహకాలు విడుదల చేయకుండా బకాయి పెట్టిన రూ.1,588 కోట్లను కూడా సీఎం జగన్‌ చెల్లించారు. మరో రూ.­2,087 కోట్ల ప్రోత్సాహకాలనూ విడుదల చేశారు. సీఎం జగన్‌ అందిస్తున్న ప్రోత్సాహంతో భారీగా ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటవుతున్నాయి. స్థాని­కులకు భారీగా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి. 

Advertisement
Advertisement