Sakshi News home page

వాస్తవాలపై ‘ఉక్కుపాదం’

Published Sat, Oct 7 2023 5:03 AM

Center approved the proposal of 29 model career centers in the state - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఉపాధి కార్యాలయా­ల ద్వారా నిరుద్యోగులకు నిరంతరం సేవలు అందిస్తున్నట్లు ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్‌ బి.నవ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేషనల్‌ కెరీర్‌ సర్వీసు(ఎన్‌సీఎస్‌) ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలో 29 మోడల్‌ కెరీర్‌ సెంటర్ల(ఎంసీసీ) అభివృద్ధి ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి, ప్రణా­ళికాబద్ధంగా నిధులు విడుదల చేస్తోందని పేర్కొ­న్నారు. కానీ, ఈనాడు పత్రిక వాస్తవాలను వక్రీ­కరిస్తూ ‘ఉపాధిపై ఉక్కుపాదం’ పేరుతో అస­త్య కథనాన్ని వండివార్చిందని ఆమె మండిపడ్డారు.

ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.4.99 కోట్ల ఎన్‌సీఎస్‌ నిధులతో 12 ఉపాధి కార్యాలయాలకు మరమ్మతులు చేసి కంప్యూటర్‌ పరికరాలను సమకూర్చడంతోపాటు పూర్తిస్థాయిలో ఎంసీసీ సెంటర్ల­ను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. ఉపాది కార్యాలయాలు/ఎంసీసీ కేంద్రాల్లో అభ్యర్థుల వ్యక్తిగత హాజరు మేరకే రిజిస్ట్రేషన్లు, రెన్యువల్‌ ప్రక్రియ జరుగుతుందన్న విషయాన్ని ఈనాడు పత్రిక గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. నిరుద్యోగులు తమ ధ్రువీకరణపత్రాలతో జిల్లా ఉపాధి కార్యాలయాల్లో అధికారులను సంప్రదిస్తే ఉచిత రిజిస్ట్రేషన్, కెరీర్‌ కౌన్సెలింగ్‌ అందిస్తున్నట్లు తెలిపారు.

ఇప్పటి వరకు 2,07,971 మంది అభ్యర్థులు ఎన్‌సీఎస్‌ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారని వివరించారు. ఈ డేటా ఆధారంగా ప్రణాళిక ప్రకారం ప్రతి నెలా ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంసీసీ, ఏపీఎస్‌­ఎస్‌డీసీ, సీడాప్‌ సమన్వయంతో 516 జాబ్‌ మేళా­లు నిర్వహించి 28,362 మందికి ఉపాధి కల్పించినట్టు వివరించారు. ఇప్పటికే కొత్త జిల్లాల్లోనూ ఎంసీసీల నిర్వహణ కోసం కార్యాలయాల ఎంపిక చేసి అధికారులను నియమించామని నవ్య స్పష్టంచేశారు.  

Advertisement
Advertisement