-
రగులుతున్న క్యాంపస్లు!
గాజాలో ఇజ్రాయెల్ అమానుష హత్యాకాండ మొదలైనప్పటినుంచీ అమెరికన్ విద్యాసంస్థల్లో అలుముకున్న అశాంతి ఈ వారం తీవ్ర రూపం దాల్చింది. ప్రపంచంలోనే పేరెన్నికగన్న విశ్వవిద్యా లయాలు విద్యార్థి ఉద్యమాలతో అట్టుడుకుతున్నాయి. వియత్నాంను వల్లకాడు చేస్తున్న అమెరికా సైనిక దురాక్రమణకు వ్యతిరేకంగా 1968లో తిరుగుబాటు జెండా ఎగరేసిన విద్యార్థుల పోరాటాన్నీ, 1980ల్లో దక్షిణాఫ్రికా జాత్యహంకార ప్రభుత్వం నెల్సన్ మండేలాను దీర్ఘకాలం చెరసాలలో బంధించటాన్ని నిరసిస్తూ సాగిన ఉద్యమాలనూ గుర్తుచేస్తున్నాయి. అప్పటిమాదిరే ఈ ఉద్యమాలు అట్లాంటిక్ మహా సముద్రం ఆవలితీరాల్లోని యూనివర్సిటీ క్యాంపస్లకు సైతం విస్తరించాయి.ఫ్రాన్స్, బ్రిటన్ తదితర దేశాల్లో మాత్రమేకాదు... పశ్చిమాసియాలోని బీరూట్, కువైట్, లెబనాన్, ట్యునీ సియా యూనివర్సిటీలు కూడా రగులుతున్నాయి. లాఠీచార్జిలు, బాష్పవాయు గోళాలు ఎవరినీ భయపెట్టడం లేదు. వేలాదిమంది విద్యార్థులను అరెస్టుచేస్తూ ఉద్యమాలను చల్లార్చాలని పోలీసులు ప్రయత్నిస్తున్నా సాగటం లేదు. వీటి తీవ్రత పెరుగుతున్నదే తప్ప తగ్గటం లేదు. ప్రజాస్వామ్యం గురించి ప్రపంచానికి ప్రవచనాలు చెప్పే అమెరికా తన క్యాంపస్లను ప్రస్తుతం పోలీసు శిబిరాలుగా మార్చింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించిన హమాస్ మిలిటెంట్లు 1,200మంది పౌరులను కాల్చిచంపి, దాదాపు 250 మందిని బందీలుగా తీసుకెళ్లిన ఉదంతాన్ని ప్రపంచ వ్యాప్తంగా అందరూ తీవ్రంగా ఖండించారు. స్వతంత్ర పాలస్తీనా కోసం సాగుతున్న ఉద్యమాలను ఇలాంటి దుందుడుకు చర్యలు బలహీనపరుస్తాయని హెచ్చరించారు. దాన్ని సాకుగా తీసుకుని ఇజ్రాయెల్ గత ఆర్నెల్లుగా సాగిస్తున్న మారణహోమం తక్కువేమీ కాదు. ఇంతవరకూ 35,000మంది పాలస్తీనా పౌరులు ఇజ్రాయెల్ సైనిక దళాల దాడుల్లో మరణించారని చెబుతున్నారు.ఇందులో అత్యధికులు నిరాయుధులైన స్త్రీలు, పిల్లలే. చివరికి బాంబుదాడుల్లో శిథిలమైన జనావా సాల్లో బాధితులకు అండగా నిలబడుతున్న ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలను సైతం ఇజ్రాయెల్ సైన్యం వదిలిపెట్టడం లేదు. కావాలని ఉద్దేశపూర్వకంగా వారిని కాల్చిచంపుతూ పాలస్తీనా పౌరులకు బాసటగా నిలబడాలన్న సంకల్పంతో వచ్చేవారిని భయభ్రాంతుల్ని చేసేందుకు ప్రయత్నిస్తోంది. మరోపక్క అనేకమంది హమాస్ ఉగ్రవాదులను మట్టుబెట్టా మని చెప్పుకుంటోంది. ఇజ్రాయెల్కు ఎడాపెడా మారణాయుధాలు సరఫరా చేస్తూ, భద్రతామండలి వంటి అంతర్జా తీయ వేదికలపై అది సాగిస్తున్న నరమేథాన్ని నిలువరించే అన్ని రకాల ప్రయత్నాలకూ మోకా లడ్డుతూ మద్దతుగా నిలబడుతున్న అమెరికా అప్పుడప్పుడు కోమానుంచి నిద్రలేచిన రోగి మాదిరిగా శాంతి వచనాలు వల్లిస్తోంది. ఇది సబబేనా? నిరాయుధ సాధారణ పౌరులను కాల్చిచంపటం ప్రపంచమంతా మౌనంగా వీక్షిస్తూ ఉండాల్సిందేనా? ఈ ప్రశ్నలే విశ్వవిద్యాలయాల విద్యా ర్థులను కలవరపరిచాయి. తాము మూగసాక్షులుగా మిగిలిపోలేమంటూ ఆ విద్యార్థులు గొంతెత్తటం వెనకున్న నేపథ్యం ఇదే. జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ఏంజెలస్ (యూసీఎల్ఏ), కొలంబియా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా వగైరా ఉన్నతశ్రేణి విద్యాసంస్థలు నినాదాలతో మార్మోగుతున్నాయి. పేరెన్నికగన్న హార్వర్డ్, బర్క్లీ, యేల్ వర్సిటీలు సైతం రణక్షేత్రాలయ్యాయి. అమెరికా ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్నాయి. ఈ విశ్వవిద్యాల యాలు సాధారణమైనవి కాదు. పేరెన్నికగన్న ప్రపంచశ్రేణి సంస్థలు. ఉదాహరణకు యూసీఎల్ఏ 16 మంది నోబెల్ బహుమతి గ్రహీతలను తయారుచేసింది. ఆ సంస్థనుంచి ఇంతవరకూ 15 మంది మెక్ఆర్థర్ ఫెలోషిప్లను అందుకున్నారు. అసాధారణ ప్రతిభాపాటవాలున్నవారికి ఈ ఫెలోషిప్లు ఇస్తారు. ఇక్కడి పట్టభద్రుల్లో క్రీడల్లో రాణించి ఒలింపిక్స్లో పతకాలు అందుకున్నవారెందరో! ఎన్నో దేశాలు అందుకునే పతకాల సంఖ్యతో పోలిస్తే ఈ యూనివర్సిటీ పట్టభద్రులు సాధించే పతకాలే ఎక్కువంటారు. ఇలాంటిచోట చదువుకునే పిల్లలు సమాజ పరిణామాలపట్ల ఇంతగా కలవరపడటం బహుశా మన దేశంలో చాలామందిని ఆశ్చర్యపరిచి వుండొచ్చు. విద్యార్థి ఉద్యమ కేంద్రాలుగా ముద్రపడిన ఢిల్లీలోని జేఎన్యూ, జమియా మిలియా, కోల్కతాలోని జాదవ్పూర్ యూనివర్సి టీలను ఛీత్కరించటం అలవాటు చేసుకున్న మర్యాదస్తులకు ప్రపంచశ్రేణి విశ్వవిద్యాలయాల వర్త మాన పోకడలు మింగుడుపడకపోవచ్చు. అయోమయానికి గురిచేయవచ్చు. కానీ అమెరికా తదితర దేశాల విశ్వవిద్యాలయాల క్యాంపస్లు ఎప్పుడూ ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహిస్తూనే వున్నాయి. ఇప్పుడు సాగుతున్న విద్యార్థి ఉద్యమాలతో ప్రొఫెసర్లు సైతం గొంతు కలపటం, అరెస్టుకావటం యాదృచ్ఛికం కాదు. ఈ నిరసనలను యూదు వ్యతిరేక ఆందోళనలుగా చిత్రించి అధికారుల, రిపబ్లి కన్ పార్టీ శ్రేణుల ప్రాపకంతో పోటీ ఉద్యమాలను నిర్వహిస్తున్న విద్యార్థులు లేక పోలేదు. పాలస్తీనా సంఘీభావ ఉద్యమకారులపై వారు దాడులకు కూడా వెనకాడటం లేదు. ఇది విచారకరం.పిల్లి కళ్లు మూసుకుని పాలుతాగుతూ ఎవరూ చూడటంలేదని భ్రమపడుతుంది. అమెరికా ప్రభుత్వం ఈ ధోరణిని విరమించుకోవాలి. తన ఆయుధ పరిశ్రమ లాభార్జనకు తోడ్పడుతున్నా యన్న ఏకైక కారణంతో ఇజ్రాయెల్, ఉక్రెయిన్ తదితర దేశాలకు అమెరికా భారీగా సైనిక సాయం అందించటం అనైతికం, అమానుషం. విద్యార్థి ఉద్యమాలు పంపుతున్న సందేశాన్ని సక్రమంగా అర్థం చేసుకుని ప్రపంచశాంతికి దోహదపడటం అగ్రరాజ్యంగా తన బాధ్యతని ఇప్పటికైనా ఆ దేశం గుర్తించాలి. లేకుంటే మున్ముందు ఈ ఉద్యమాలు మరింత విస్తరిస్తాయి. -
Israel-Hamas war: కాలిఫోర్నియా వర్సిటీలోకి పోలీసులు
లాస్ ఏంజెలిస్: గాజాలో తక్షణ కాల్పుల విరమణ డిమాండ్తో లాస్ ఏంజెలిస్ నగరంలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో తిష్టవేసిన పాలస్తీనా అనుకూల విద్యార్థులు, నిరసనకారుల తాత్కాలిక శిబిరాలను పోలీసులు చెల్లాచెదురుచేశారు. పాలస్తీనా అనుకూల, ఇజ్రాయెల్ అనుకూల నిరసనకారులకు మధ్య ఘర్షణతో వర్సిటీలో బుధవారం ఉద్రిక్తత నెలకొన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున పోలీసులు వర్సిటీలోకి ప్రవేశించారు. టెంట్లను తొలగించి నిరసనకారులను చెదరగొట్టారు. దీంతో 1000 మందికిపైగా నిరసనకారులు పోలీసులను ప్రతిఘటించారు. ‘‘ జరిగింది చాలు శాంతించండి’’ అని వర్సిటీ చాన్స్లర్ జీన్ బ్లాక్ వేడుకున్నారు. డార్ట్మౌత్ కాలేజీలో టెంట్లు కూల్చేసి 90 మందిని పోలీసులు అరెస్ట్చేశారు. ఏప్రిల్ 17న కొలంబియాలో మొదలైన ఈ పాలస్తీనా అనుకూల నిరసన ఉదంతాల్లో అమెరికావ్యాప్తంగా 30 విద్యాలయాల్లో 2,000 మందికిపైగా అరెస్ట్చేసినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ‘అసమ్మతి ప్రజాస్వామ్యానికి కీలకం. అయితే శాంతిభద్రతలకు విఘాతం కల్గించేస్థాయికి అసమ్మతి పెరిగిపోకూడదు’’ అని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అన్నారు. బ్రిటన్లోని బ్రిస్టల్, లీడ్స్, మాంచెస్టర్, న్యూక్యాజిల్, షెఫీల్డ్ వర్సిటీల్లోనూ నిరసనకారుల శిబిరాలు వెలిశాయి. యూనివర్సిటీ కాలేజ్ లండన్లలో ఇప్పటికే నిరసనకారులు ఆందోళనలు మొదలెట్టారు. ఫ్రాన్స్, లెబనాన్, ఆ్రస్టేలియాలకూ నిరసనలు విస్తరించాయి. -
ఇజ్రాయెల్కు షాక్.. ‘దౌత్య సంబంధాలు తెంచుకుంటాం’
కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా తమ దాడులు ఆగవని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు పేర్కొంటున్నారు. హమాస్కు గట్టిపట్టున్న రఫాలో వారిని అంతం చేయటమే తమ సైన్యం లక్ష్యమని ముందుకు వెళ్లుతున్నాడు. అయితే మరోవైపు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా.. పాలస్తీనా ప్రజలకు అనుకూలంగా అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్కు కొలంబియా దేశం షాక్ ఇచ్చింది. ఇజ్రాయెల్లో దేశంతో దౌత్యపరమైన సంబంధాలు తెంచుకుంటామని తెలిపింది. జాతి విధ్వంస ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో తమ దౌత్యపరమైన సంబంధాలు తెంచుకుంటుమని కొలంబియా దేశ అధ్యక్షుడు గుస్తావో పెట్రో తెలిపారు.‘‘గురువారం నుంచి ఇజ్రాయెల్తో ఉన్న దౌత్యపరమైన సంబంధాలు తెంచుకుంటున్నాం. ఒక జాతి విధ్వంసక ప్రధానితో మేము ఇక సంబంధాలు కొనసాగించలేము. జాతి విధ్వంస ప్రవర్తన, జాతీ నిర్మూలనను ప్రపంచం అస్సలు ఆమోదించదు. ఒకవేల పాలస్తీనియా అంతం అయితే.. ప్రపంచంలో మానవత్వం అంతం అయినట్లే’’అని బుధవారం మే డే ర్యాలీలో గుస్తావో పెట్రో అన్నారు.కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోపై ఇజ్రాయెల్ స్పందించింది. ‘‘గుస్తావో పెట్రో ఇజ్రాయెల్ పౌరుల ద్వేషి, వ్యతిరేకి. ప్రాణాలు తీసే, అత్యాచారాలు చేసే హమాస్ మిలిటెంట్లకు పెట్రో రివార్డులు ఇస్తానని హామీ ఇచ్చారు. వాటిని ప్రస్తుతం ఆయన బయటపెట్టారు’’ అని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ తెలిపారు. అత్యంత నీచమైన రాక్షసుల (హమాస్ మిలిటెంట్లు) పక్షాన నిలబడాలని నిర్ణయించుకున్న పెట్రోను చరిత్ర గుర్తుపెట్టుకుంటుదన్నారు. హమాస్ మిలిటెంట్లు చిన్నపిల్లను పొట్టనబెట్టుకున్నారని, మహిళలపై అత్యాచారం చేశారని, అమాయక ప్రజలను అపహరిచారని మండిపడ్డారు.హమాస్ మిలిటెంట్లు అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై మెరుపుదాడి చేసి.. 250 మందిని బంధీలుగా తీసుకెళ్లారు. కొంతమందిని హమాస్ మిలిటెంట్లు విడిచిపెట్టగా.. ఇంకా 129 మంది హమాస్ చెరలోనే ఉన్నారు. అక్టోబర్ 7 తర్వాత ప్రతీకారంతో ఇజ్రాయెల్ గాజాపై చేస్తున్నదాడుల్లో 34,568 మంది పాలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. -
మానవతకు 200 రోజుల మచ్చ
ఒకటీ, రెండూ కాదు... ఆరు నెలలు దాటింది. మంగళవారంతో ఏకంగా రెండు వందల రోజులు గడిచిపోయాయి. అయినా, పాలెస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు ఆగడం లేదు. సంక్షోభానికి పరిష్కా రమూ కనిపించడం లేదు. సామూహిక సమాధులు, కూలిన ఆస్పత్రులు, శిథిలాల కుప్పగా మారిన భవనాలు, ప్రాణాలు పోయిన వేలాది జనం, ప్రాథమిక వసతులు పూర్తి విధ్వంసంతో పాలెస్తీనా బావురుమంటోంది.తీవ్రవాద హమాస్ బృందం తమపై ఆకస్మికంగా దాడి చేసి, 250 మందిని బందీలుగా చేసుకొని, 1200 మంది ప్రాణాలు తీసినందుకు బదులుగా గత అక్టోబర్ 7న సైనిక చర్యకు దిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగిస్తూనే ఉంది. గాజాలోని 23 లక్షల జనాభాలో దాదాపు 85 శాతం మంది ఇళ్ళు వదిలి పారిపోయారు. హమాస్ ఏరివేతకని చెబుతూ మొదలుపెట్టిన ఈ పాశవిక, ప్రతీకార దాడిలో ఇప్పటికి 14 వేల పైచిలుకు పసిపిల్లలతో సహా 34 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని లెక్క. నిజానికి, ఆ సంఖ్య ఇంకా ఎక్కువేనని సహాయక సంస్థల అంచనా. గాజా భూఖండపు ఉత్తర ప్రాంతంపై ఇటీవల ఎన్నడూ లేనంతగా శతఘ్నుల వర్షం కురిపిస్తూ, అక్కడ నుంచి జనాల్ని ఖాళీ చేయమంటున్న ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంత ప్రధాన నగరమైన రాఫాపై దాడికి సర్వసన్నద్ధమవుతుండడం తాజా విషాద పరిణామం. పశ్చిమాసియాలోని ఈ సంక్షోభం అంతకంతకూ పెద్దదవుతూ వచ్చింది. ఇరాన్ సైతం ఇటీవల ఇజ్రాయెల్తో ఢీ అనడం పర్యవసానాలపై ప్రపంచం భయపడాల్సిన పరిస్థితి తెచ్చింది. పాలెస్తీనా శరణార్థులకు ఉద్దేశించిన ఐరాస సహాయ సంస్థ (యూఎన్ఆర్డబ్ల్యూఏ) ఉన్నా దానికిప్పుడు నిధులు లేని దుఃస్థితి.ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన దాడికి ఆ సంస్థ సిబ్బంది కొందరు సహకరించారని ఇజ్రాయెల్ ఆరోపించింది. దాంతో ఆ సంస్థకు సహాయం అందిస్తున్న 16 దాతృత్వ దేశాలు నిధులు నిలిపివేశాయి. పర్యవసానంగా 45 కోట్ల డాలర్ల మేర నిధుల లోటు ఏర్పడి, వేలాది పాలెస్తీనియన్లు ఈ యుద్ధకాలంలో ఆకలిదప్పులతో అలమటిస్తున్నారు. అయితే ఇజ్రాయెల్వి నిరాధార ఆరోపణలని స్వతంత్ర పరిశీలనలో ఈ వారమే తేలింది. అమెరికా సహా ఇతర దేశాలు మానవతా అవసరంగా గుర్తించి, నైతిక బాధ్యతతో యూఎన్ ఆర్డబ్ల్యూఏకు ఆర్థిక సాయం పునరుద్ధరించాలని అరబ్ లీగ్ తాజాగా డిమాండ్ చేస్తున్నది అందుకే. ఇజ్రాయెల్ భీకర దాడుల అనంతరం గాజాలోని ప్రధాన ఆస్పత్రుల వద్ద 300కు పైగా మృతదేహాలతో బయటపడ్డ సామూహిక భారీ సమాధుల దృశ్యాలు సహజంగానే అంతర్జాతీయ ప్రపంచాన్ని కుదిపివేస్తున్నాయి. ఇజ్రాయెలీ సైనికుల దాడుల్లో అంతర్జాతీయ మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగిందడానికి సమాధుల్లో కట్టేసిన చేతులతో, వివస్త్రంగా కనిపిస్తున్న శవాలే ప్రత్యక్ష సాక్ష్యం. అనుమానాలకు తావిస్తున్న ఈ సమాధులపై పారదర్శకంగా, స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఐరాస ఇప్పటికే డిమాండ్ చేసింది.యూరోపియన్ యూనియన్ సైతం బుధవారం అదే అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. ఆగని ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో బాధిత పక్షం వైపు అంతర్జాతీయంగానూ క్రమంగా మొగ్గు కనబడుతోంది. పాలెస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించడమే ప్రస్తుత సమస్యకు సత్వర పరిష్కారమని భావిస్తున్నవారి సంఖ్యా పెరుగుతోంది. గాజా సమస్య అంతకంతకూ మానవతా సంక్షోభంగా పరిణమిస్తుండడంతో తాజాగా జమైకా ప్రభుత్వం పాలెస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తున్నట్టు ప్రకటించడం విశేషం. పరస్పర గౌరవం, శాంతియుత సహజీవనమనే ఐరాస నియమావళి పట్ల నిబద్ధతే ఈ నిర్ణయానికి ప్రేరణ అని జమైకా పేర్కొంది. ప్రతి 10 నిమిషాలకూ ఓ పసివాడు చనిపోవడమో, గాయపడడమో జరుగుతున్న పాలెస్తీనాలో, ఇప్పటికి కనీసం 75 వేల టన్నుల పేలుడు పదార్థాల తాకిడికి గురై 62 శాతం ఇళ్ళు ధ్వంసమైన భూభాగంలో, ఆహార కరవుతో 11 లక్షల మంది అన్నమో రామచంద్రా అని అలమటిస్తూ రోజూ పదుల సంఖ్యలో ప్రాణాలు విడుస్తున్న ప్రాంతంలో... సత్వరమే సంక్షోభాన్ని పరిష్కరించి, శాంతి స్థాపన జరపకపోతే చరిత్ర మనల్ని క్షమించదు. ఒకప్పటి కీలకపాత్రధారి ఐరాస ప్రస్తుతం మాటలే తప్ప చేతలు లేక చేష్టలుడిగి చూస్తోంది.కాల్పుల విరమణకై ఈ ఆరునెలల్లో ఐరాస 4సార్లు తీర్మా నాలు చేసినా, అవన్నీ అగ్రరాజ్యాలు మోకాలడ్డడంతో వీగిపోవడం దురదృష్టం. ఐరాసలో అండగా నిలవడమే కాక, ఇజ్రాయెల్కు ఆయుధాలిస్తున్న అమెరికా ఆ దేశానికి ఇటీవలే 2600 కోట్ల డాలర్ల సాయం మంజూరు చేసి, శరణార్థులకేమో మొండిచేయి చూపడం పెద్దన్న ద్వంద్వనీతికి దర్పణం. గాజా పోరులో అమెరికా అధ్యక్షుడి విధానాలపై స్వదేశంలోనే నిరసనలు పెరిగాయి. పాలెస్తీనాకు అనుకూలంగా అమెరికాలోని అనేక విశ్వవిద్యాలయాల్లో వేలాది విద్యార్థులు వీధికెక్కడం విశేషం.పశ్చిమాసియాలో సమస్య పరిష్కారానికి అమెరికా, దాని భాగస్వాములు పాత కథ వదిలి, మళ్ళీ మథనం చేయాలి. భద్రత పరంగా ఇజ్రాయెల్కు ఉన్న ఆందోళనల్ని పోగొడుతూనే, పాలెస్తీనా ప్రజల ప్రత్యేక రాజ్య ఆకాంక్షను నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయత్నాలు సఫలమయ్యేలా అటు ఇరాన్నూ భాగస్వామిని చేసి, శాశ్వత పరిష్కారానికై పాశ్చాత్య ప్రపంచం కృషి చేయాలి.ఇరాన్ సైతం పశ్చిమాసియాలో తన ప్రభావాన్ని విస్తరించుకోవడం కోసం లెబనాన్, గాజా, సిరియా, యెమన్లలో పరోక్ష శక్తులకు ఆయుధాలు సమకూర్చి, అండగా నిలిచే పని మానుకోవాలి. ఇలా పాముల్ని పాలుపోసి పెంచడం ఉద్రిక్తతల్ని పెంచే పాపమని గుర్తించాలి. ఈ ప్రాంతంలో 90 లక్షల మంది మన ప్రవాసులున్నందు భారత్ సైతం ఇజ్రాయెల్, అరబ్ దేశాలతో సత్సంబంధాల రీత్యా కీలక భాగస్వాముల్ని ఒక దగ్గరకు చేర్చి, పరిష్కారానికి యత్నించాలి. వాణిజ్యంలో, ఇంధన సరఫరాలో కీలకమైన పశ్చిమాసియాలో శాంతి నెలకొంటేనే... ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది. -
పాలస్తీనాపై అమెరికా ‘ప్రేమ’!
మన కళ్లను మనమే నమ్మలేని అరుదైన అసాధారణమైన ఉదంతాలు చరిత్రలో అప్పుడప్పుడు చోటు చేసుకుంటాయి. సోమవారం భద్రతామండలిలో జరిగిందదే. గాజాలో ఇజ్రాయెల్ దాష్టీకాన్ని నిలిపేయాలని, తక్షణం బేషరతు కాల్పుల విరమణ పాటించాలని కోరే తీర్మానంపై జరిగిన వోటింగ్కు అమెరికా గైర్హాజరైంది. నిరుడు అక్టోబర్లో హమాస్ మిలిటెంట్లు హఠాత్తుగా దాడిచేసి 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులను హతమార్చి 250 మందిని బందీలుగా తీసుకుపోయారు. ఆ ఘటనలో అనేకమంది గాయాలపాలయ్యారు. ఆ సంస్థ చెరలో ఇంకా 134 మంది వరకూ వున్నారని అంచనా. ఆనాటినుంచీ ఇజ్రాయెల్ పగబట్టి గాజాలోని జనావాస ప్రాంతాలే లక్ష్యంగా క్షిపణుల వర్షం కురిపిస్తోంది. బాంబుల మోత మోగిస్తోంది. ఎడతెగని ఈ దాడుల్లో ఇంతవరకూ 32,000 మంది పాలస్తీనా పౌరులు మరణించారు. లక్షలమంది తీవ్రంగా గాయపడ్డారు. ఆకలితో అలమటిస్తున్న వారు ఆహారం తీసుకొచ్చిన వాహనాలపైకి ఎగబడినప్పుడు వారిని అదుపు చేసే పేరిట అమానుషంగా ప్రవర్తించటంతోపాటు కాల్చిచంపుతున్న ఉదంతాలకు కొదవలేదు. మంచినీరు, ఆహారం,మందుల కొరతతో పాలస్తీనా పౌరులు పడుతున్న అగచాట్లు అన్నీ ఇన్నీ కాదు. ఇజ్రాయెల్ సాగిస్తున్న నరమేథం, విధ్వంసం ఆధునిక చరిత్రలో కనీవినీ ఎరుగనివి. ఇజ్రాయెల్ను సమర్థించటానికి అలవాటుపడిన అమెరికా, పాశ్చాత్య దేశాలు దీన్నంతటినీ నిర్వికారంగా చూశాయి. అదేమంత విషయం కాదన్నట్టు మొదట్లో వ్యాఖ్యానించాయి. భద్రతామండలిలో ఇజ్రాయెల్ను అభిశంసిస్తూ ఇంతవరకూ వచ్చిన మూడు తీర్మానాలను వీటో చేశాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ‘యుద్ధం సాగుతున్నప్పుడు పౌరుల మరణాలు సంభవించటం రివాజే’ అని వ్యాఖ్యానిస్తే ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. ఒకపక్క ఇజ్రాయెల్కు ఆయుధాలు, ఇతర యుద్ధ సామగ్రి అందజేస్తూ, అంత ర్జాతీయ వేదికలపై దాని దురాగతాలను సమర్థిస్తూ... మరోపక్క పౌర ప్రాంతాల విషయంలో జాగ్రత్తలు పాటించాలని ఆ దేశానికి సుద్దులు చెబుతూ అమెరికా కాలక్షేపం చేసింది. హమాస్ అంత మొందేవరకూ ఇజ్రాయెల్ దాడులు ఆగరాదనీ, అలా ఆపితే అది ఆ మిలిటెంటు సంస్థకు బలం చేకూరుస్తుందనీ వాదించింది. అంతర్జాతీయంగానూ, స్వదేశంలోనూ వస్తున్న ఒత్తిళ్ల కారణంగా దాదాపు ఆర్నెల్లయ్యాక ఇన్నాళ్లకు ఇజ్రాయెల్ను వ్యతిరేకించే తీర్మానంపై వోటింగ్లో గైర్హాజరైంది. నిజానికి ఇది కంటి తుడుపు చర్య. ఆ తీర్మానాన్ని సమర్థించి, ప్రతీకారానికి కూడా హద్దులుంటాయని చెప్తే వేరుగా వుండేది. ఇకపై ఇజ్రాయెల్కు అన్ని రకాల సాయం నిలిపేస్తామని ప్రకటించివుంటే హుందాగా వుండేది. వాటన్నిటి బదులూ వోటింగ్కు గైర్హాజరు కావటంవల్ల పెద్దగా ఒరిగేది వుండదు. హమాస్ ఉగ్ర దాడిని ఎవరూ సమర్థించటం లేదు.దాని దుందుడుకు చేష్టలు స్వతంత్ర పాలస్తీనా లక్ష్యానికి విఘాతం కలిగిస్తాయని, రాజ్యాల అమానుష కృత్యాలకు సాధారణ పౌరులపై కక్ష తీర్చుకోవటం పరిష్కారం కాదని ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు దుయ్యబట్టాయి. అయితే గత ఏడు దశాబ్దాలుగా ఇజ్రాయెల్ సాగిస్తున్న దురాగతాలు తక్కువేమీ కాదు. నిజానికి పాలస్తీనా సమస్య సాకుగా ఇజ్రాయెల్లో జాతీయవాదాన్ని రెచ్చగొట్టి ఎన్నికల్లో పబ్బం గడుపుకోవాలన్న మితవాద పక్షాల వైఖరివల్లే పరిష్కారం జటిలంగా మారింది. పాలస్తీనా పౌరుల నిరాశానిస్పృహలే మిలిటెంటు సంస్థ లకు ఊపిరులూదాయి. పాలస్తీనా మనోభావాలను బేఖాతరు చేసి ఇజ్రాయెల్ ఆవిర్భావానికి కారణమై, దాని దురాక్రమణలకు వంతపాడుతూ వచ్చిన అమెరికా, పాశ్చాత్య దేశాల వైఖరి సైతం మిలిటెంట్లకు బలం చేకూర్చింది. భద్రతామండలి తీర్మానాన్ని అమెరికా వీటో చేయకుండా గైర్హాజరు కావటం సహజంగానే ఇజ్రాయెల్కు మింగుడుపడటం లేదు. ఆ దేశ ప్రధాని నెతన్యాహూ అలకబూనారు. జో బైడెన్తో చర్చల కోసం వాషింగ్టన్ వెళ్లబోతున్న ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం పర్యటనను చివరి నిమిషంలో రద్దుచేశారు. చరిత్ర తిరగేస్తే ప్రతి మలుపులోనూ ఇజ్రాయెల్కు అమెరికా అండగా నిలబడిన సంగతి కనబడుతుంది. దాని అకృత్యాలను తక్కువచేసి చూపడం లేదా మూర్ఖంగా సమర్థించటం కళ్లకు కడుతుంది. అదే సమయంలో ప్రతి సందర్భంలోనూ అమెరికా హితవచనాలను ఇజ్రాయెల్ బేఖాతరు చేయటం కూడా తేటతెల్లమవుతుంది. ఈ యేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలుండటం, ఇజ్రాయెల్ సేనలు నిరాటంకంగా ఊచకోతను కొనసాగించటం బైడెన్కు ఇబ్బందిగా మారింది. ఒకపక్క ఇజ్రాయెల్కు అన్నివిధాలా సాయపడుతూ కూడా దాన్ని కించిత్తు కూడా ప్రభావితం చేయ లేని బైడెన్ తీరు ఆయన బలహీనతను ప్రస్ఫుటం చేసింది. ఇదంతా చివరకు తన విజయావకా శాలను దెబ్బతీసేలా వున్నదని ఆయన గ్రహించారు. పర్యవసానంగా భద్రతామండలిలో భిన్నమైన వైఖరి తీసుకున్నారు. ఇది తమ విధానానికి అనుగుణంగానే వున్నదని అమెరికా చెబుతున్నా ఇజ్రాయెల్ స్పందననుబట్టే నిజానిజాలేమిటో గ్రహించవచ్చు. ఏదేమైనా భద్రతామండలి తీర్మానం ఆశించిన విధంగా గాజాలో తక్షణం కాల్పుల విరమణ అమల్లోకి రావాలి. రంజాన్ మాసం పూర్తయ్యే వరకూ ఇది అమల్లోవుండాలని తీర్మానం కాంక్షిస్తున్నా ఈ కాలంలో ఉద్రిక్తతలు ఉపశమిస్తే... బందీల విడుదల జరిగితే అది శాంతికి దోహదపడుతుంది. ఆ పరిణామం సమస్య శాశ్వత పరిష్కారానికి దారితీస్తే అంతకన్నా కావలసిందేముంది? ఇజ్రాయెల్ మంకుపట్టు విడనాడాలి. గాజాలో హంతక దాడులకు స్వస్తి చెప్పాలి. తన సైన్యం చేసిన దురాగతాలపై విచారణకు అంగీకరించాలి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement