-
పీకల మీదకొచ్చింది!
ముప్పు ముంచుకొచ్చినప్పుడు కాని మేలుకోకపోతే కష్టమే. పరిస్థితి చూస్తే అలానే ఉంది. పర్యావరణ మార్పులపై సంబంధిత పక్షాల సదస్సు తాజా సమావేశం (కాప్–28) ఈ నెలాఖరు నుంచి డిసెంబర్ 12 దాకా దుబాయ్లో జరగనుంది. ఏటేటా ఐరాస ఆధ్వర్యంలో ఇది మొక్కుబడి తంతుగా మారిపోతున్న వేళ కొద్దిరోజులుగా వివిధ నివేదికలు ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి. ఇప్పటికే పరిస్థితి విషమించిందని వెల్లడిస్తున్నాయి. రోజువారీ సగటు ప్రపంచ ఉష్ణోగ్రతలు తొలి సారిగా ఈ నవంబర్ 17న పారిశ్రామికీకరణ మునుపటి హద్దు దాటి 2 డిగ్రీల సెల్సియస్ పెరిగా యన్న వార్త ఆందోళన రేపుతోంది. పుడమిపై కర్బన ఉద్గారాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ దేశాలు తాము పెట్టుకున్న లక్ష్యాల గురి తప్పుతూనే ఉన్నాయని స్పష్టమవుతోంది. ఎప్పటికప్పుడు పర్యావరణ పరిరక్షణకు ప్రతిన చేస్తున్నా, నష్టనివారణకు నిధుల కొరత పీడిస్తూనే ఉంది. ఆహార అభద్రత మొదలు వ్యాధుల దాకా అనేక రకాలుగా వాతావరణ మార్పులు ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతున్నాయి. ప్రజారోగ్యంలో దశాబ్దాలుగా సాధించిన ప్రగతిని దెబ్బ తీస్తున్నాయి. ఆ నేపథ్యంలో వాతావరణ మార్పులపై తాజా నివేదికలు అలజడి సృష్టిస్తున్నాయి. పుడమి మీది ఒక శాతం అత్యంత ధనికులే మొత్తం ప్రపంచ జనాభాలోని 66 శాతం మంది కలగజేసేటంత భూతాపానికి కారణమని ఆక్స్ఫామ్ తాజా నివేదిక తేల్చింది. ఇక, ‘కౌంట్డౌన్ ఆన్ హెల్త్ అండ్ క్లైమేట్ ఛేంజ్’ అంటూ గత వారం లాన్సెట్ వెలువరించిన 8వ వార్షిక నివేదిక ప్రజారోగ్యం, ఆరోగ్య రక్షణ వ్యవస్థలపై పడే ప్రభావాన్ని కళ్ళకు కట్టింది. పర్యావరణ మార్పుకు ప్రధాన కారణాలైన శిలాజ ఇంధనాల వినియోగం లాంటి వాటికి అడ్డుకట్ట వేయకుంటే, ప్రజల ఆరోగ్యానికే పెను ప్రమాదమని లాన్సెట్ నివేదిక హెచ్చరిస్తోంది. భారత్కు సంబంధించి ఈ నివేదిక చెప్పిన అంశాలు, చేస్తున్న హెచ్చరికలు ఆలోచన రేపుతున్నాయి. మన దేశంలో 1986 – 2005 మధ్య కాలంతో పోలిస్తే, 2018 – 2022 మధ్య కాలంలో సగటు వేసవి ఉష్ణోగ్రతలు 0.5 డిగ్రీల సెల్సియస్ పెరిగాయట. ఇప్పటికే ఈ అధిక ఉష్ణోగ్రత పిల్లల నుంచి పెద్దల వరకు అందరి ఆరోగ్యాన్నీ దెబ్బ తీస్తోంది. ఈ వాతావరణ పరిస్థితులు మలేరియా, డెంగ్యూ కేసుల్ని పెంచుతున్నాయి. అలాగే సముద్రతీర ప్రాంతాల్లో గ్యాస్ట్రో ఎంటరైటిస్, సెప్సిస్, కలరాలకు సానుకూలంగా తయారవుతున్నాయి. అలాగే, ‘బ్రోకెన్ రికార్డ్’ శీర్షికన ఐరాసా వెల్లడించిన తాజా నివేదిక సైతం పరిమితులు దాటి గ్రీన్హౌస్ వాయువుల విడుదల పెరిగిన కథను వివరించింది. వెరసి, ఉష్ణోగ్రతలు పారిశ్రామికీరణకు ముందు స్థాయి కన్నా 2 డిగ్రీలు, వీలుంటే 1.5 డిగ్రీలు మించి పెరగరాదని 2015 నాటి ప్యారిస్ ఒప్పందం (పీఏ)లో చేసుకున్న బాసలు చెరిగిపోయేలా కనిపిస్తున్నాయి. నికరంగా కర్బన ఉద్గారాలు లేని ‘నెట్ జీరో’కు కట్టుబడతామని అనేక దేశాలు మాట ఇస్తున్నా, అది ‘విశ్వసనీయంగా’ లేదని తాజా నివేదిక తేల్చేసింది. భూతాపం పెంపును 1.5 డిగ్రీల లోపలకు నియంత్రించే అవకాశాలు నూటికి పద్నాలుగు వంతులేనట! 2021తో పోలిస్తే 1.2 శాతం ఎక్కువగా 2022లో ప్రపంచమంతా కలసి 57.4 బిలియన్ల కర్బన ఉద్గారాలను వెలువరించిందని లెక్క. అలాగే, కరోనాలో 4.7 శాతం తగ్గిన ఉద్గారాలు ఈ ఏడాది మళ్ళీ కరోనా ముందు స్థాయికి చేరిపోవచ్చని అంచనా. నిజానికి, పర్యావరణ మార్పు, ధనిక – బీద అసమానతలు విడదీయరాని జంట. ప్రధానంగా ధనిక దేశాల పాపానికి పేద దేశాలు బలి అవుతున్నాయి. పర్యావరణ మార్పు ప్రభావాన్ని మోస్తున్నాయి. ధనిక దేశాలు కర్బన ఉద్గారాలను తగ్గించాలనీ, చేసిన నష్టానికి పరిహారం చెల్లించాలనీ కాప్28 లాంటి చోట్ల పేద దేశాలు ఒత్తిడి తెస్తున్నది అందుకే. కానీ, అతి తక్కువ సంఖ్యలోని ఆ ధనిక దేశాలే ప్రపంచ పర్యావరణ విధానాన్ని నిర్ణయిస్తుండడంతో పరిష్కారం దిశగా అడుగులు పడడం లేదు. ఈజిప్ట్లో నిరుడు కాప్27 సదస్సులో ‘నష్ట పరిహార నిధి’ని ఏర్పాటు చేయాలంటూ ఒప్పందం కుదిరింది. స్వీయ కర్బన ఉద్గారాలు తక్కువే అయినా ధనిక దేశాల ఉద్గారాలతో నష్టపోతున్న బీద దేశాలను పర్యావరణ మార్పు ప్రభావాల నుంచి కాపాడేందుకు ఈ నిధిని ఉద్దేశించారు. ఆలోచన మంచిదైనా, ఆచరణకు వచ్చే సరికి ఆ నిధి ద్వారా డబ్బులు ఎవరిస్తారు, ఎవరికి ఇస్తారనేది ఇప్పటికీ తేలనే లేదు. ఇంకా చిత్రమేమిటంటే– పర్యావరణానికి తూట్లు పొడిచే భారీ చమురు ప్రణాళికలు వేస్తున్న దుబాయ్లో కాప్28 సమావేశం జరగనుండడం! అలాగే, వాతావరణ సంక్షోభం, ప్రకృతి సంక్షోభం... ఈ రెంటినీ భిన్నమైన సవాళ్ళుగా భావిస్తూ, స్పందిస్తున్నాం. వాటి వల్ల సమాజంలో తలెత్తే సంక్షోభాన్ని అర్థం చేసుకోవడం లేదు. ప్రపంచమంతా చేస్తున్న ప్రమాదకరమైన తప్పు అదే! తీవ్ర వాతావరణ ఘటనలతో వర్ధమాన దేశాల్లో బాలికలకు నాణ్యమైన విద్య దెబ్బ తింటోందని ప్లాన్ ఇంటర్నేషనల్ నివేదిక మాట. పర్యావరణ బాధిత 30 దేశాల్లో ఏటా కనీసం 1.25 కోట్ల మంది బాలికలు అర్ధంతరంగా చదువుకు గుడ్బై చెప్పడానికి వాతావరణ మార్పులు కారణమవుతాయని ‘మలాలా ఫండ్’ సైతం హెచ్చరిస్తోంది. ఇలాంటి గణాంకాలెన్నో వాస్తవ పరిస్థితికి ప్రతిబింబం. అందుకే, పర్యావరణ మార్పు గురించి మాటల కన్నా చేతలు ముఖ్యం. రానున్న దుబాయ్ సదస్సు లోనూ ప్యారిస్ ఒప్పందం తాలుకు అమలు తీరుతెన్నులపై ప్రపంచం మళ్ళీ చర్చిస్తుంది. ఈసారైనా మాటలు తగ్గించి, చేతలపై దృష్టి పెడితే మంచిది. ఎందుకంటే, పర్యావరణంపై ప్రపంచం ఇప్పటికే గాడి తప్పింది. దుష్ఫలితాలూ చూస్తోంది. తాజా హెచ్చరికలు పెడచెవిన పెడితే మరిన్ని కష్టాలు తప్పవు. ప్రపంచానికి పరిష్కారం ఎడారి దేశంలోనూ ఎండమావిగా మారితేనే మానవాళికి నష్టం. -
Climate Change: డేంజర్ మార్క్ దాటేశాం
భయపడుతున్నంతా అవుతోంది. మితిమీరిన కాలుష్యం, ఇంధన వాడకం, అడ్డూ అదుపూ లేని పారిశ్రామికీకరణ, విచ్చలవిడిగా అడవుల నరికివేత భూమిని శరవేగంగా వినాశనం వైపు నెడుతున్నాయి. వీటివల్ల భూతాపోన్నతి అతి త్వరలో ‘2 డిగ్రీ’ల అంతిమ హద్దును దాటుతుందని, అదే జరిగితే సర్వనాశనమేనని పర్యావరణప్రియులు, శాస్త్రవేత్తలు కొన్ని దశాబ్దాలుగా హెచ్చరిస్తుండటం తెలిసిందే. ఈ పెను విపత్కర పరిస్థితిని నివారించడమే ఏకైక లక్ష్యంగా చిన్నా పెద్దా దేశాలన్నీ దశాబ్దాలుగా మేధోమథనం చేస్తున్నాయి. గ్లోబల్ వారి్మంగ్కు అడ్డుకట్ట వేసేందుకు భారీ లక్ష్యాలు నిర్దేశించుకుంటూ వస్తున్నాయి. అందుకు వందల కోట్ల డాలర్లను కేటాయిస్తున్నట్టు ప్రకటనలు చేస్తున్నాయి. అవన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయని, ఆ లక్ష్యాల సాధనకు క్షేత్ర స్థాయిలో చేస్తున్నదేమీ లేదని తేలిపోయింది. నవంబర్ 17న అంతటి విపత్కర పరిస్థితిని భూమి తొలిసారిగా రుచిచూసింది. భూతాపంలో గత శుక్రవారం తొలిసారి ఏకంగా 2 డిగ్రీల పెరుగుదల నమోదైంది! భూగోళాన్ని మనం శరవేగంగా వినాశనం దిశగా నెడుతున్నామనేందుకు ఇది తాజా హెచ్చరిక సంకేతమేనని సైంటిస్టులు ఆందోళన చెందుతున్నారు...! వినాశనమే...? గ్లోబల్ వారి్మంగ్తో ఎదురయ్యే ప్రమాదాన్ని కళ్లకు కట్టేందుకు పర్యావరణవేత్తలు భూతాపాన్ని పారిశ్రామికీకరణకు ముందు నాళ్లతో, అంటే 1850–1900 మధ్య కాలంతో పోల్చి చెబుతుంటారు. అప్పటితో పోలిస్తే భూతాపం ఇప్పటికే 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ దాకా పెరిగిపోయింది. దానికే కొన్నేళ్లుగా కనీవినీ ఎరగని ఉత్పాతాలతో ప్రపంచమంతా అతలాకుతలమైపోతోంది. అలాంటిది, నవంబర్ 17న సగటు భూతాపంలో పెరుగుదల కొద్దిసేపు ఏకంగా 2.06 డిగ్రీలుగా నమోదైందని యూరప్లోని కోపరి్నకస్ వాతావరణ మార్పుల సంస్థ సోమవారం ప్రకటించింది! 1991–2020 మధ్య నమోదైన భూతాప సగటుతో పోలి్చనా ఇది ఏకంగా 1.17 డిగ్రీలు ఎక్కువని సంస్థ డిప్యూటీ డైరెక్టర్ సమంతా బర్గెస్ ఆందోళన వెలిబుచ్చారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆమె చేసిన పోస్టు పర్యావరణవేత్తల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ‘‘గ్లోబల్ వారి్మంగ్కు అడ్డుకట్ట వేయకుంటే సర్వనాశనం తప్పదన్న హెచ్చరికలను సంపన్న దేశాలు పెడచెవిన పెడుతున్నాయని తేలిపోయింది. భూమిపై జీవజాలాన్ని తుడిచిపెట్టగల ఈ ప్రమాదానికి అడ్డుకట్ట వేసేందుకు కృషి చేస్తున్నామన్న మాటలు నీటి మూటలేనని రుజువైంది’’ అంటూ వారు మండిపడుతున్నారు. మానవాళి చరిత్రలో నవంబర్ 17 దుర్దినమేనని సైంటిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘కాప్’ లక్ష్యాలన్నీ గాలికి... గ్లోబల్ వారి్మంగ్ను 2 డిగ్రీల కంటే తక్కువ స్థాయికి, సరిగ్గా చెప్పాలంటే 1.5 డిగ్రీలకు పరిమితం చేసి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని పారిస్ పర్యావరణ సదస్సులో ప్రపంచ దేశాలు ప్రతినబూనాయి. దాని సాధనే ప్రధాన లక్ష్యంగా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఏటా కాప్ సదస్సులు నిర్వహించుకుంటూ వస్తున్నాయి. కాప్–27 పర్యావరణ సదస్సు గతేడాది నవంబర్లో జరిగింది. పర్యవారణ లక్ష్యాల సాధనకు ఆర్థిక వనరుల్లేని పేద దేశాలకు వందలాది కోట్ల డాలర్లు గ్రాంట్గా అందజేసేందుకు సంపన్న దేశాలన్నీ అంగీకరించాయి. గ్లోబల్ వారి్మంగ్కు అడ్డుకట్ట వేసేందుకు తామంతా కూడా చిత్తశుద్ధితో కృషి చేస్తామని ప్రకటించాయి. ముఖ్యంగా శిలాజ ఇంధనాల వాడకాన్ని దాదాపుగా తగ్గించేస్తామని చెప్పుకొచ్చాయి. కానీ వాస్తవంలో జరుగుతున్నది వేరు... ► చాలా దేశాలు శిలాజ ఇంధనోత్పత్తిని 2030కల్లా రెట్టింపు, అంతకంటే ఎక్కువ చేయనున్నాయని ఐరాస గత వారం విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది! ► గ్లోబల్ వారి్మంగ్ 1.5 శాతానికి పెరగకుండా ఉండాలంటే కర్బన ఉద్గారాలను 2030కల్లా 45 శాతం తగ్గించాల్సి ఉంది. గత కాప్ సదస్సులో దేశాలన్నీ నిర్దేశించుకున్న లక్ష్యం కూడా అదే. కానీ అన్ని దేశాలూ తమ తమ పర్యావరణ లక్ష్యాలను సాధించినా కర్బన ఉద్గారాలు 2030కల్లా 9 శాతం పెరుగుతాయని హెచ్చరించింది. ► గ్లోబల్ వార్మింగ్ ఉత్పాతానికి అడ్డుకట్ట వేసేందుకు దేశాలు చేయాల్సినంత ప్రయత్నం చేయడం లేదని పలు అంతర్జాతీయ పర్యావరణ నివేదికలు కూడా ముక్త కంఠంతో ఘోషిస్తున్నాయి. ► ముఖ్యంగా గ్రీన్హౌజ్ వాయువుల ఉద్గారాన్ని తగ్గించేందుకు కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడం చాలా అవసరమని బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్లో క్లైమేట్ సైన్స్ ప్రొఫెసర్ రిచర్డ్ అలన్ స్పష్టం చేస్తున్నారు. ► గత సదస్సుల వాగ్దానాలేవీ ఆచరణలోకి రాలేదన్న పెదవి విరుపుల మధ్య మరో రెండు వారాల్లో దుబాయ్లో కాప్–28 సదస్సు జరగనుంది. అందులో ఏమేం చర్చిస్తారో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి! వినాశనమే...? ఉష్ణోగ్రతలో ఒకట్రెండు డిగ్రీల పెరుగుదలతో ఏమవుతుంది లెమ్మనుకుంటే చాలా పొరపాటు. భూమి సగటు ఉష్ణోగ్రత అతి తక్కువగా పెరిగినా తీవ్ర పర్యవసానాలుంటాయి. అలాంటిది ఒక డిగ్రీ పెరిగిందంటే అది తీవ్ర ప్రభావమే చూపుతుంది. పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే అదే జరుగుతోంది! గత వందేళ్లలో భూతాపం విపరీతంగా పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే సగటున ఒకటిన్నర డిగ్రీల మేరకు పెరిగిపోయింది. దాంతో నానారకాల పర్యావరణ ఉత్పాతాలతో మానవాళి అతలాకుతలం అవుతోంది. అదే ఉష్ణోగ్రతలో పెరుగుదల గనక 2 డిగ్రీలకు చేరితే కనీవినీ ఎరగని వినాశనం, కష్టనష్టాలు తప్పవని పర్యావరణవేత్తలు ఎప్పట్నుంచో నెత్తీనోరూ బాదుకుంటున్నారు. భూతాపోన్నతి 1.5 డిగ్రీలను దాటిన కొద్దీ దారుణాలు జరుగుతాయి. అదే 2 డిగ్రీలు పెరిగిందంటే... ► పెను తుఫాన్లు, తీవ్ర దుర్భిక్షం వంటి అతి దారుణ పరిస్థితులు తలెత్తుతాయి. ► పర్యావరణ సంతులనాన్ని కాపాడటంలో అతి కీలకమైన కోరల్ రీఫ్లు, ధ్రువ ప్రాంతపు మంచు పొరలు సమూలంగా తుడిచిపెట్టుకుపోతాయి. ► పర్యావరణ వ్యవస్థ మరింకెప్పటికీ ఎన్నటికీ బాగుచేయలేనంతగా పాడైపోతుంది. ► క్రమంగా భూమి నివాసయోగ్యం కాకుండా పోతుంది. ► జీవ, జంతు జాలాల మనుగడ ప్రమాదంలో పడుతుంది. ► అత్యుష్ణ పరిస్థితులు స్థిరంగా కొనసాగితే జీవజాలం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినా ఆశ్చర్యం లేదు. ► గత 12 నెలలు ఆధునిక ప్రపంచ చరిత్రలోనే అత్యంత వేడి నెలలుగా రికార్డుకెక్కాయి. గత ఏడాది కాలంలో పాకిస్తాన్, ఉత్తర అమెరికాలో తీవ్ర వరదలు, ఆస్ట్రేలియా, అమెరికాల్లో కార్చిచ్చులు, మంచు తుఫాన్ల వంటి వైపరీత్యాలతో ప్రపంచం అల్లాడింది. ► మన దేశంలో చూసుకుంటే పారిశ్రామికీకరణకు ముందు చెన్నై సగటు ఉష్ణోగ్రత 28 డిగ్రీలుండేది. ఇప్పుడది 29.5 డిగ్రీలు దాటేసింది! ఇదే ధోరణి దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ ప్రతిఫలిస్తోంది. ► ఇటీవలే ఉత్తరాఖండ్లో భూమి బీటలుబారడం తెలిసిందే. భూతాపంలో పెరుగుదల 2 డిగ్రీల సెంటీగ్రేడ్ల సరిహద్దును దాటింది కొద్దిసేపు మాత్రమే. కానీ భూమి నానాటికీ ఆమోదయోగ్యం కానంతగా వేడెక్కిపోతోందనేందుకు ఇది అతి పెద్ద సంకేతం. ఇదే ధోరణి ఇంకొంతకాలం కొనసాగితే దిద్దుబాటు అసాధ్యమే కావచ్చు! – సమంతా బర్గెస్, డిప్యూటీ డైరెక్టర్, కోపర్నికస్ వాతావరణ మార్పుల సంస్థ – సాక్షి, నేషనల్ డెస్క్ -
దూసుకెళ్తున్న పారి‘శ్రామికం’
రాష్ట్రంలో పారిశ్రామికవృద్ధి పరుగులు పెడుతోంది. సుదీర్ఘ తీరప్రాంతం, అపారమైన సహజ వనరులు, మానవ వనరులకు తోడు అన్ని విధాలుగా సహకరించే రాష్ట్ర ప్రభుత్వం.. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో ఉండటంతో దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి కదలివస్తున్నాయి. ఈ నాలుగేళ్లలో అంబానీ, అదానీ, టాటా, బిర్లా, మిట్టల్, జిందాల్, భంగర్, భజాంకా, ఒబెరాయ్, దాల్మియా, సింఘ్వీ తదితర పారిశ్రామిక దిగ్గజాలు రాష్ట్రానికి స్వయంగా వచ్చి పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు చేసుకున్నారు. సులభతర వాణిజ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అగ్రగామిగా ఉండటంతో పాటు పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావడం కూడా పారిశ్రామికవేత్తలను ఏపీవైపు వచ్చేలా చేస్తోంది. – సాక్షి, అమరావతి ఐటీలోనూ మేటి.. వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రోత్సాహంతో పలు ఐటీ సంస్థలు విశాఖపట్నానికి తరలివచ్చి.. తమ కార్యాలయాలను ప్రారంభిస్తున్నాయి. 2019కు ముందు ఏపీలో ఐటీ కంపెనీల సంఖ్య 178 ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 372కు చేరింది. ఈ నాలుగేళ్లలో ఇన్ఫోసిస్, అదానీ డేటా సెంటర్, కంట్రోల్ఎస్ డేటా సెంటర్, రాండ్శాండ్, బీఈఎల్, అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్, టెక్ మహీంద్రా, డబ్ల్యూఎన్ఎస్, టెక్నోటాస్్క, టెక్బుల్ తదితర సంస్థలు రాష్ట్రంలో ఐటీ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి. వీటి ద్వారా 20,000 మందికి ఉపాధి లభిస్తోంది. కొత్తగా ఏర్పాటయ్యే ఐటీ కంపెనీల కోసం విశాఖలో ఐస్పేస్ బిజినెస్ పార్క్ను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. మరోవైపు ఈ ఏడాది మార్చిలో విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో రూ.13,11,465 కోట్ల విలువైన 386 పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. వీటి ద్వారా 6.07 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. పోర్టులు, హార్బర్లు.. పారిశ్రామిక పార్కులు రూ.18,000 కోట్లతో ప్రభుత్వం కొత్తగా నాలుగు పోర్టులు(రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడ వద్ద) నిరి్మస్తోంది. వీటి ద్వారా కనీసం లక్ష మందికి ఉపాధి లభించనుంది. మత్స్యకారులకు లబ్ధి చేకూర్చేలా రూ.3,700 కోట్లతో పది ఫిషింగ్ హార్బర్లతో పాటు 6 ఫిషింగ్ ల్యాండ్లను అభివృద్ధి చేస్తోంది. రాష్ట్రం నుంచి వెళ్తున్న మూడు పారిశ్రామిక కారిడార్ల(విశాఖ–చెన్నై, చెన్నై–బెంగళూరు, హైదరాబాద్–బెంగళూరు)లో రూ.11,753 కోట్లతో నక్కపల్లి, రాంబల్లి, కృష్ణపట్నం, కొప్పర్తి, చిత్తూరు సౌత్, ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. కోవిడ్ సంక్షోభంలోనూ కొప్పర్తిలో వైఎస్సార్ఈఎంసీ, వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. విశాఖ, అనంతపురంతో పాటు కొప్పర్తి, ఓర్వకల్లు వద్ద లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేస్తోంది. కొత్తగా ఓర్వకల్లు ఎయిర్పోర్టును అందుబాటులోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు రామాయపట్నం తెట్టు వద్ద మరో విమానాశ్రయం ఏర్పాటు చేస్తోంది. లక్షలాది మందికి ఉపాధి.. సీఎం జగన్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.75,649.77 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. ఇందులో 111 భారీ, మెగా యూనిట్లు రూ.56,534.53 కోట్ల పెట్టుబడులతో ఉత్పత్తి ప్రారంభించాయి. వీటి ద్వారా 73,876 మందికి ఉపాధి లభించింది. అంటే సగటున ఏడాదికి రూ.15,418 కోట్ల పెట్టుబడులతో ఉత్పత్తి మొదలయ్యింది. ఇందులో సీఎం జగన్ చేతుల మీదుగా రూ.13,766 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఆరు యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభమైంది. వీటి ద్వారా 15,040 మందికి ఉపాధి లభించింది. ఇవికాకుండా రూ.7,305 కోట్ల విలువైన కియా పరిశ్రమ వాణిజ్యపరమైన ఉత్పత్తిని కూడా సీఎం జగన్ 2019 డిసెంబర్ 5న ప్రారంభించారు. వీటికి అదనంగా ఎంఎస్ఎంఈ రంగంలో 1,52,558 కొత్త యూనిట్లు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా రూ.19,115.24 కోట్ల పెట్టుబడులు రావడంతో 13,63,706 మందికి ఉపాధి లభించింది. ఇవికాకుండా మరో 86 ప్రాజెక్టులకు సంబంధించిన రూ.2,35,125.60 కోట్ల పెట్టుబడులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇవి కూడా వాస్తవ రూపంలోకి వస్తే 2,36,806 మందికి ఉపాధి లభించనుంది. వీటిలో రూ.35,672.28 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఏడు భారీ యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటి ద్వారా 7,015 మందికి ఉపాధి లభిస్తుంది. -
ఆది నుంచీ వివాదమే.. బైలడిల్లా.. కుట్రల ఖిల్లా!
ఆదివాసీ జనాభా మెజార్టీ గా ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లాలోని గనులు ఆది నుంచీ వివాదాలకు కేంద్రంగానే నిలుస్తున్నాయి.పారిశ్రామికీకరణ మొదలయ్యాక బ్రిటిషర్ల హయాం నుంచి నేటి వరకు అక్కడి ఖనిజ సంపదపై పట్టు కోసం పట్టువిడవకుండా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి.ఈ క్రమంలోనే నిన్నమొన్నటి వరకు పచ్చని అడవిని తుపాకీ మోతలు ఎరుపెక్కించేవి. తాజాగా ఇక్కడ మైనింగ్ చేసుకునేఅవకాశాన్ని అదానీ కంపెనీకి కేంద్రం కట్టబెట్టడంతో బైలడిల్లా గనులు మరోసారి వార్తల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో బైలడిల్లా గనుల గత చరిత్రపై ప్రత్యేక కథనం.. సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం : ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లాలో బైలడిల్లా ప్రాంతం ఉంది. దట్టమైన అడవిలో ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల మధ్య సుమారు 35 కిలోమీటర్ల పొడవు, 9 కిలోమీటర్ల వెడల్పుతో విస్తరించిన కొండల ప్రాంతాన్ని బైలడిల్లాగా పిలుస్తున్నారు. ఇక్కడున్న ధాతువులో అత్యధికంగా 60 నుంచి 68 శాతం వరకు ఇనుము లభిస్తోందని పరిశోధనల్లో తేలింది. ఈ గుట్టల్లోనే విలువైన టిన్, నియోలియం, టాంటాలమ్ వంటి ఖనిజాలూ ఉన్నాయి. దేశానికి స్వాతంత్రం వచ్చాక జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ) ఆధ్వర్యంలో ఇక్కడ ఇనుప ఖనిజం వెలికి తీస్తున్నారు. బస్తర్ రాజ్యాన్ని కలుపుకోవాలనుకున్న బ్రిటిషర్లు వరంగల్ కేంద్రంగా మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన కాకతీయులు తర్వాత పరిస్థితులు అనుకూలించక బస్తర్ ప్రాంతానికి వెళ్లిపోయారు. అలా మొదటగా అన్నమదేవ్ బస్తర్లో సామ్రాజ్యాన్ని నిర్మించాడు. బ్రిటిషర్లు భారతదేశం మీద పట్టు సాధించే సమయానికి అన్నమదేవ్ వారసుల్లో 19వ రాజైన రుద్రప్రతాప్దేవ్ దాని పాలకుడిగా ఉన్నాడు. ఆయనకు మగ సంతానం కలగలేదు. 1921 నవంబర్లో రుద్రప్రతాప్ మరణించే సమయానికి ఆయన కుమార్తె ప్రపుల్లకుమారి దేవికి 11 ఏళ్లు. రాజ్య సంక్రమణ సిద్ధాంతం పేరుతో బ్రిటిషర్లు బస్తర్ రాజ్యాన్ని తమలో కలిపేసుకోవాలని చూసినా భౌగోళిక అననుకూలత కారణంగా వెనుకడుగు వేశారు. మరోవైపు ఒడిశా ప్రాంతానికి చెందిన భంజ్ రాజవంశానికి చెందిన ప్రపుల్ల చంద్ర భంజ్దేవ్తో ప్రపుల్లకుమారి వివాహం జరిగింది. ఇల్లరికం వచ్చిన ప్రపుల్ల చంద్ర రాజయ్యాడు. అనారోగ్య కారణాలతో రాజును తప్పించి.. వారసత్వ సంక్షోభ సమయంలో బస్తర్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన బ్రిటిషర్లకు ఇక్కడి బైలడిల్లా గనుల గురించి తెలిసింది. ప్రపంచ యుద్ధాల కారణంగా ఏర్పడిన నష్టాలను భర్తీ చేసుకునేందుకు బైలడిల్లా గనులపై బ్రిటిష్ ప్రభుత్వం కన్నేసింది. తమ చేతికి మట్టి అంటకుండా తక్కువ ఖర్చుతో పని సాధించేందుకు సైన్య సహకార పద్ధతిలో భాగంగా ఆరో నిజాం ద్వారా బస్తర్ రాజ్యంతో సంప్రదింపులు ప్రారంభించింది. బైలడిల్లా గనులు విషయంలో నిజాం రాజుతో ఒప్పందం చేసుకోవాలంటూ ప్రపుల్ల చంద్ర భంజ్దేవ్పై ఒత్తిడి తీసుకొచ్చినా ఆయన అంగీకరించలేదు. ఆ తర్వాత అనారోగ్య కారణాలు చూపుతూ ప్రపుల్ల చంద్రను బ్రిటిష్ ప్రభుత్వం కోల్కతాకు పంపించడంతో బస్తర్ పాలనా పగ్గాలు ప్రపుల్లకుమారి చేతిలోకి వచ్చాయి. తదనంతర కాలంలో ప్రఫుల్ చంద్ర కన్నుమూశారు. అంతు చిక్కని రాణి మరణం బైలడిల్లా గనుల విషయంలో బస్తర్ పాలకులను మచ్చిక చేసుకునేందుకు 1933లో ప్రపుల్లకుమారి దేవికి రాణి బిరుదును బ్రిటిష్ ప్రభుత్వం ప్రదానం చేసింది. అయినా బైలడిల్లా గనులను నిజాంకు ఇచ్చేందుకు ఆమె సుముఖత చూపలేదు. దీంతో రెండు రాజ్యాల మధ్య యుద్ధం జరిగే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే 1936లో ప్రపుల్లకుమారి అనారోగ్య కారణాలతో చికిత్స కోసం లండన్ వెళ్లారు. అక్కడ అపెండిసైటిస్ ఆపరేషన్ వికటించడంతో ఆమె మరణించారు. అయితే ఈమె మరణం వెనుక బ్రిటిషర్ల కుట్ర ఉందనేది బస్తర్ అంతఃపుర వాసుల నమ్మకం ప్రభుత్వ దళాల దాడిలో ప్రపుల్లకుమారి మరణానంతరం ఆమె కొడుకు ప్రవీర్చంద్ర భంజ్దేవ్ బస్తర్కు రాజయ్యాడు. తర్వాత కొద్ది కాలానికే బ్రిటిషర్లు దేశాన్ని విడిచి వెళ్లారు. ఆ సమయంలో దేశంలో 9వ అతిపెద్ద ప్రిన్సిలీ స్టేట్గా బస్తర్ ఉండేది. స్వాతం్రత్యానంతరం పారిశ్రామికీకరణలో వేగం పెంచేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకోగా.. బిలాస్పూర్, భిలాయ్ల్లో ఉక్కు కర్మాగారాలు ఏర్పాటయ్యాయి. వీటిలో కొన్నింటికి యూరప్ దేశాలతో పాటు జపాన్ సైతం ఆర్థిక సాయం అందించింది. ఆ నెపంతో బైలడిల్లా నుంచి ఇనుప ఖనిజాన్ని తరలించే వ్యూహాన్ని చాపకింద నీరులా పరాయి దేశాలు అమలు చేశాయి. ఈ క్రమంలోనే విశాఖపట్నం – కిరండోల్ రైలు మార్గానికి జపాన్ భారీగా నిధులు సమకూర్చింది. అయితే బైలడిల్లా గనుల నుంచి ఖనిజాన్ని వెలికితీసే ప్రయత్నంతో అప్పటి భారత ప్రభుత్వానికి బస్తర్ రాజు ప్రవీర్చంద్ర భంజ్దేవ్కి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆందోళనలు, నిరసనలు అక్కడ నిత్యకృత్యంగా మారాయి. చివరకు 1966లో జరిగిన ఓ ఘర్షణలో ప్యాలెస్లోకి భద్రతా దళాలు చొరబడ్డాయి. వారు జరిపిన కాల్పుల్లో ప్రవీర్భంజ్దేవ్, ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో మరణించారు. ఆ తర్వాత బస్తర్ ప్రధాన పట్టణమైన జగదల్పూర్లో ఎన్ఎండీసీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి బైలడిల్లాలోని ఖనిజాన్ని తవ్వి తీయాలని కేంద్రం నిర్ణయించుకుంది. ఇప్పటివరకు అదే కొనసాగుతూ వస్తోంది. గ్రీన్హంట్..సల్వా జుడుం 90వ దశకంలో సరళీకృత ఆర్థిక విధానాలు సత్ఫలితాలు ఇవ్వడం మొదలైన తర్వాత మరోసారి బైలడిల్లా గనులు తెరపైకి వచ్చాయి. అప్పటికి ఈ ప్రాంతం మావోయిస్టుల పట్టులోకి వెళ్లింది. దండకారణ్యం లేదా అబూజ్మడ్గా పిలిచే ఈ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత కోసం ఆపరేషన్ గ్రీన్హంట్ ఈ శతాబ్దం మొదట్లో ప్రారంభమైంది. అడవిని భద్రతా దళాలు జల్లెడ పడుతుండగానే మధ్యలో సల్వా జుడుం ప్రారంభమయ్యింది. మొత్తం మీద రెండు దశాబ్దాల పాటు దండకారణ్యంలో రక్తం ఏరులై ప్రారింది. ప్రజలు, భద్రతా దళాలు పిట్టల్లా రాలిపోయారు. ఇప్పుడు సగటున ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒకటి చొప్పున బస్తర్లో భద్రతా దళాల క్యాంపులు వెలిశాయి. తాజాగా ఇక్కడ అదానీ కంపెనీ మైనింగ్ చేపట్టేందుకు కేంద్రం అవకాశం ఇవ్వడంతో బైలడిల్లాకు సంబంధించి మరో అధ్యాయంమొదలవుతున్నట్టయ్యింది. -
భారత్లో ఇంధనానికి భారీ డిమాండ్
న్యూఢిల్లీ: ఈ దశాబ్దంలో భారత్లో ఇంధన వినియోగం గణనీయంగా పెరుగుతుందని అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ (ఏఈఏ) అంచనావేసింది. ‘‘భారత్ 2025 నాటికి అత్యధిక జనాభా దేశంగా ఉంటుంది. పట్టణీకరణకుతోడు, పారిశ్రామికీకరణ వల్ల ఏటా ఇంధన డిమాండ్ 3 శాతం చొప్పున పెరుగుతుంది’’అని తెలిపింది. పప్రంచ ఇంధన వినియోగంపై అంచనాలతో ఓ నివేదికను గురువారం విడుదల చేసింది. పునరుత్పాదక ఇంధనానికి ప్రభుత్వం ఇస్తున్న మద్దతు, సమర్థవంతమైన విధానాల వల్ల 2030 నాటికి పెరగనున్న విద్యుత్ డిమాండ్లో 60 శాతాన్ని పర్యావరణ అనుకూల ఇంధనాలే తీరుస్తాయని వివరించింది. అదే సమయంలో బొగ్గు ఆధారిత విద్యుత్ మొత్తం ఇంధన డిమాండ్లో మూడింట ఒకటో వంతు ఉంటుందని అంచనా వేసింది. ఒకటో వంతు అవసరాలు చమురు ద్వారా తీరతాయని పేర్కొంది. శిలాజ ఇంధనాల దిగుమతుల బిల్లు వచ్చే రెండు దశాబ్దాల కాలంలో రెట్టింపు అవుతుందని అంచనా వ్యక్తీకరించింది. ఇది ఇంధన భద్రతకు రిస్క్గా అభివర్ణించింది. ప్రపంచం మొదటి అంతర్జాతీయ ఇంధన సంక్షోభం మధ్యస్థ దశలో ఉన్నట్టు వివరించింది. ఉక్రెయిన్పై రష్యా దాడి దీనికి ప్రేరణనిచ్చిందని తెలిపింది. ‘‘రష్యా ప్రపంచంలో శిలాజ ఇంధనాల ఎగుమతుల్లో పెద్ద దేశంగా ఉంది. అయితే, యూరప్కు సహజ వాయువు సరఫరాను రష్యా తగ్గించేయడం, అదే సమయంలో రష్యా చమురు, బొగ్గు ఎగుమతులపై యూరప్ ఆంక్షలు విధించడం ప్రపంచ ఇంధన వాణిజ్యానికి ప్రధాన అవరోధాలు’’అని ఈ నివేదిక ప్రస్తావించింది. ఇంధనాల వారీగా డిమాండ్.. ► భారత్లో 2030 నాటికి బొగ్గు డిమాండ్ గరిష్ట స్థాయిలో రోజువారీగా 770 మిలియన్ టన్ను లకు చేరుతుంది. 2021 నాటికి బొగ్గు ఆధారిత విద్యుత్ సామర్థ్యం 240 గిగావాట్లుగా ఉంటే, 2030 నాటికి 275 గిగావాట్లకు పెరుగుతుంది. ► చమురుకి డిమాండ్ 2021కి రోజువారీగా 4.7 మిలియన్ బ్యారెళ్లు ఉంటే, 2030 నాటికి 6.7 మిలియన్ బ్యారెళ్లకు పెరుగుతుంది. 2040 నాటికి 7.4 మిలియన్ బ్యారెళ్లకు చేరుతుంది. ► 2030 నాటికి అదనంగా పెరిగే విద్యుత్ అవసరాల్లో 60 శాతాన్ని పునరుత్పాదక వనరులు తీరుస్తాయి. అప్పటికి మొత్తం విద్యుత్ అవసరాల్లో పునరుత్పాదక ఇంధనాల వాటా 35 శాతం మేర ఉంటుంది. ఇందులో సోలార్ పీవీ ప్లాంట్ల ద్వారానే 15 శాతం అవసరాలు తీరతాయి. ► సహజ వాయువు డిమాండ్ 2030 నాటికి 115 బిలియన్ క్యూబిక్ మీటర్లకు చేరుతుంది. 2021 నాటికి ఇది 66 బిలియన్ క్యూబిక్ మీటర్లుగా ఉంది. మొత్తం మీద పెరిగే ఇంధన అవసరాల్లో గ్యాస్ వాటా 5 శాతంగానే ఉంటుంది. ► తక్కువ ఉద్గారాలు విడుదల చేసే ప్రత్యామ్నా య ఇంధన వనరుల్లో వేగవంతమైన పురోగతి కోసం భారత్ తీసుకుంటున్న చర్యలు.. 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఉన్నాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement