-
కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రుకాల్చి వాత పెట్టాలి: కేటీఆర్
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా కొత్తగా ఇవ్వలేదని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 30 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వమయితే.. నియామక పత్రాలు ఇచ్చింది మాత్రమే రేవంత్ రెడ్డి అని తెలిపారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తాను ఇచ్చానని రేవంత్ అబద్దపు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. కొత్తగూడెం ఇల్లందులో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో కేటీఆర్ పాల్గొని బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా ఉన్న వాళ్లకు పట్టం కడితే ప్రశ్నించే గొంతుకైతారని కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం రేవంత్కు బద్ది చెప్పాలంటే, 2 లక్షల ఉద్యోగాల హామీ నెరవేరాలంటే, ఆ ఒత్తిడి ఉండాలంటే దమ్మున్న రాకేశ్ రెడ్డిని గెలిపిస్తే శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తాడని తెలిపారు. పచ్చి అబద్దాలు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యావంతులు కర్రుకాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజుల్లేకుండా ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పారు. కేసీఆర్ హయాంలో టెట్కు దరఖాస్తు ఫీజు రూ. 400 పెడితే.. ఇదే రేవంత్ నానా యాగీ చేశారు. ఇవాళ టెట్ పరీక్షకు వెయ్యి పెట్టారు. ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పాలి. మొదటి కేబినెట్ సమావేశంలో మెగా డీఎస్సీ వేస్తామన్నారు. ఆ హామీ కూడా నెరవేరలేదు. సింగరేణిలో 24 వేల వారసత్వ ఉద్యోగాలు ఇచ్చాం. సింగరేణిని అదానీకి అమ్మేందుకు రేవంత్ సిద్ధంగా ఉన్నాడు. ఇదే విషయంపై మోదీతో రేవంత్ కూడబలుక్కున్నాడు. చివరకు సింగరేణిని కూడా ప్రయివేటుపరం చేస్తారు.ప్రైవేట్ రంగంలో 24 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు బీఆర్ఎస్ కృషి చేసింది. సోషల్ మీడియాలో మాపై వ్యతిరేక ప్రచారం వల్లే మా అభివృద్ధి ప్రచారంలోకి రాలేకపోయింది. ఇక్కడ రేవంత్ రెడ్డి అక్కడ నరేంద్ర మోీదీ తలుపులు తెరుచుకొని ఉన్నారు. రాబోయే రోజుల్లో సింగరేణి ప్రైవేటుపరం చేయడానికి కంకణం కట్టుకున్నారు. 56 కేసులు ఉన్న ఒక బ్లాక్ మెయిలర్కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి టికెట్ ఇచ్చింది. ఇప్పటికైనా ఆలోచించి పట్టబద్రులు ఓటు వేయాలి’ అని కోరారు. -
తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు, ధిక్కార స్వరాలు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నేడు తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపిచాలని కోరుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు.బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి హన్మకొండ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించారని, ప్రతిష్టాత్మక బిట్స్ పిలానిలో విద్యాభ్యాసం చేశారని తెలిపారు. మేనేజ్మెంట్, ఎకనామిక్స్లో డ్యూయల్ మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆయన, అమెరికాలో ఏడేళ్ల పాటు పలు అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగం చేసి.. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారని పేర్కొన్నారు.‘అద్భుతమైన వాగ్ధాటి, పోరాట పటిమ, ప్రజా సమస్యలపై ప్రశ్నించే తత్వం కలిగిన రాకేష్ రెడ్డి.. సమకాలీన రాజకీయాంశాలపై, ఆర్థిక స్థితిగతులపై ప్రముఖ వార్తా పత్రికల్లో ఆర్టికల్స్ రాయడమే కాకుండా నవశకానికి నాంది, ప్రగతి రథ చక్రాలు, ఫిస్కల్ ఫెడరలిజం, ద డాన్ ఆఫ్ న్యూ ఎరా, తెలంగాణ ఎకానమీ లాంటి పుస్తకాలను రచించారు.సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులకు ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీపై గెస్ట్ లెక్చర్లు కూడా ఇచ్చారు. పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే పేద విద్యార్థుల కోసం రాకేష్ రెడ్డి ఈ-క్లాసెస్ యాప్ అనే ఫ్రీ కోచింగ్ యాప్ను రూపొందించి ఉచితంగా అందజేశారు. హన్మకొండలో మెగా జాబ్ మేళాలు నిర్వహించారు.టీవీ చర్చల్లో చురుగ్గా పాల్గొని, విద్యార్థి, నిరుద్యోగ, ఉద్యోగుల సమస్యల, హక్కులపై బలంగా గళం విప్పారు. కరోనా మహమ్మారి సమయంలో, వరంగల్లో వరదలు వచ్చినప్పుడు ప్రజలకు అండగా నిలిచి తన వంతు సహాయాన్ని అందించారు. ఇండస్ ఫౌండేషన్ ద్వారా ఓరుగల్లులో కూచిపూడి, పేరిణి లాంటి నృత్య కళలను, పల్లె సంస్కృతులను, సాహిత్యాన్ని, మన జానపద కళారూపాలను పరిరక్షించడం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారుకేసీఆర్ ఆశీస్సులతో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న రాకేష్ రెడ్డి.. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సరైన చాయిస్. యువకుడు, ఉన్నత విద్యావంతుడు, ప్రశ్నించే తత్వం, లోతైన విషయ పరిజ్ఞానం ఉన్న రాకేష్ రెడ్డి గారిని పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపిస్తే.. పట్టభద్రుల గొంతుకగా నిలుస్తారు. నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు.ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో మీ మొదటి ప్రాధాన్యత ఓటు రాకేష్ రెడ్డి గారికే వేసి.. వారిని గెలిపించాలని కోరుతున్నాం’అని ట్వీట్లో పేర్కొన్నారు.✊ ఈరోజు తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు💠 ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గారు హన్మకొండ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో… pic.twitter.com/V7KWVFSdpt— KTR (@KTRBRS) May 18, 2024 -
జనసేనతో పొత్తు ఉన్నా లేనట్లే
సాక్షి, అమరావతి : ఉత్తరాంధ్ర పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తున్న తనకు మద్దతుగా బహిరంగ ప్రకటన చేయాలని స్వయంగా మిత్రపక్ష జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కళ్యాణ్ను కోరినా ఆయన స్పందించలేదని.. క్షేత్రస్థాయిలో కలిసి పనిచేసే పరిస్థితి లేనప్పుడు బీజేపీ–జనసేన కలిసి ఉన్నా లేనట్లే అని శాసనమండలిలో బీజేపీ పక్ష నాయకుడు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీఎన్ మాధవ్ ఘాటుగా స్పందించారు. పొత్తులో కొనసాగుతున్నప్పటికీ జనసేన ఎక్కడా బీజేపీ అభ్యర్థులకు మద్దతు తెలపని అంశంపై మంగళవారం విజయవాడలో జరిగిన బీజేపీ రాష్ట్ర పదాధికారులు, జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఇన్చార్జిల సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన సాగిన ఈ సమావేశంలో కేంద్ర పార్టీ నుంచి జాతీయ సహ సంఘటనా ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ పాల్గొన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలను మాధవ్తో పాటు మరో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణరాజు, పార్టీ అధికార ప్రతినిధి చందు సాంబశివరావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు జనసేనతో పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మేం జనసేనతో కలిసి ఉన్నా లేనట్లేనన్న వాతావరణం ఉంది. ఇటీవల పవన్ కూడా జనసేన–బీజేపీ పొత్తు ఉంది అన్నారు. అయితే, క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయడం లేదన్నది వాస్తవం. నిజంగా పొత్తులో ఉంటే క్షేత్రస్థాయిలో కూడా కలిసి పనిచేయాలని కోరుతున్నాం. ఆ విధంగా వెళ్తేనే ప్రజలలో మనం కలిసి వెళ్తుతున్నామన్న మాటకు అర్థం ఉంటుంది. నామ్కే వాస్త్గా పొత్తుతో ఉపయోగం లేదని మా అందరి అభిప్రాయం’.. అని మాధవ్ వ్యాఖ్యానించారు. ఇప్పటికీ పొత్తు కొనసాగాలనే కోరుకుంటున్నాం.. ‘బీజేపీ–జనసేన కలిసి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని బీజేపీ ఇప్పటికీ కోరుకుంటోంది. కలిసి పనిచేస్తే ప్రజా మద్దతు రెండు పార్టీలకు ఉంటుంది. ఆయనా (పవన్) నమ్మాలి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రకటన చేయాలని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు కోరారు. పోటీలో ఉన్న అభ్యర్థిగా నేనూ అడిగాను. చాలాసార్లు కోరాం. కానీ, ప్రకటన రాలేదు. మరోవైపు.. ఉత్తరాంధ్రలో పీడీఎఫ్ అభ్యర్థి తమకు జనసేన మద్దతు ఉందని ప్రచారం చేసుకున్నారని, దానిని ఖండించమని కోరినా ఖండించలేదు’.. అని మాధవ్ చెప్పారు. కలిసి పనిచేసే విషయంలో బీజేపీ నుంచే స్పందనలేదని పవన్కళ్యాణ్ అంటున్నారని విలేకరులు ప్రశ్నించగా.. ‘ఆయన వైపు నుంచే స్పందనలేదు’ అని బదులిచ్చారు. అందుకే సొంతంగా ఎదగాలనినిర్ణయించుకున్నాం.. ‘జనసేనతో కలిసి ఉన్నా లేనట్లేనన్న వాతావరణం నేపథ్యంలో పార్టీ తనంతట తాను ఎదిగేలా అన్ని ఏర్పాట్లుచేసుకోవాలని అనుకున్నాం. ఇందులో భాగంగా ఏప్రిల్ 1–14 వరకు బూత్ స్వశక్తీకరణ అభియాన్ కార్యక్రమం చేస్తున్నాం. మే ఒకటి తర్వాత ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జిషీటు వేసే కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించాం. ఏదైనా పొత్తు నిర్ణయం ఉంటే కేంద్ర పార్టీ ఆలోచిస్తుంది’ అని మాధవ్ చెప్పారు. -
'ఓట్ల లెక్కింపులో అక్రమాలు చూపినా ఆర్ఓ పట్టించుకోలేదు'
అనంతపురం క్రైం: ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని, వాటిని సాక్ష్యాలతో సహా చూపించినా రిటర్నింగ్ అధికారి(ఆర్ఓ), కలెక్టర్ నాగలక్ష్మి పట్టించుకోలేదని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ వైఎస్సార్సీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికల కౌంటింగ్లో అధికారులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావడం దేనికి సంకేతం అని ప్రశి్నంచారు. పైగా వారు తమకు పడ్డ ఓట్లను సైతం తగ్గించి చూపించారని మండిపడ్డారు. ఆదివారం ఆయన అనంతపురంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కౌంటింగ్ కేంద్రంలో కళ్ల ముందు జరిగిన అన్యాయాన్ని చూసి చాలా బాధేసిందన్నారు. ‘కౌంటింగ్ నిర్వహణలో కలెక్టర్, ఎస్పీ పూర్తిగా వైఫల్యం చెందారు. టీడీపీకి అనైతికంగా మద్దతుగా నిలి్చన వీరిపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, టీడీపీ వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, టీడీపీ ప్రొద్దుటూరు ఇన్చార్జ్ ప్రవీణ్, కమలాపురం ఇన్చార్జ్ నరసింహారెడ్డి, పులివెందులకు చెందిన పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆలం నరసానాయుడు, వడ్డే మురళీ, సరిపూటి రమణ.. ఇలా పది మందికిపైగా టీడీపీ ముఖ్య నేతలు ఏజెంట్లుగా కూర్చున్నప్పటికీ ఆర్ఓ పట్టించుకోలేదు. వీరు కౌంటింగ్ హాల్లోని ప్రతి టేబుల్ వద్దకు వెళ్లి ప్రభావం చూపేలా వ్యవహరించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ కౌంటింగ్ హాలులో పదుల సంఖ్యలో, పరిసర ప్రాంతాల్లో వందలాది మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు తిష్ట వేసినా ఎస్పీ ఫక్కీరప్ప ప్రేక్షక పాత్ర పోషించారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రవీంద్రారెడ్డి ఇంకా ఏమన్నారంటే.. ► మాజీ సీఎం చంద్రబాబు ఫోన్ చేస్తే కలెక్టర్ నాగలక్షి్మ, ఎస్పీ ఫక్కీరప్పలు ఏవిధంగా మాట్లాడారు? ఎన్నికల కోడ్ అమలులో ఉన్న విషయాన్ని మరచిపోయారా? ► కౌంటింగ్ హాల్లో టేబుల్ నంబర్ 19లో ఓ అధికారి టీడీపీ అభ్యర్థివి 44, మా పార్టీవి ఆరు ఓట్లు కట్టకట్టి ఒకే దానిలో వేశారు. దీనిపై మా ఏజెంట్ ఫిర్యాదు చేయగా అసలు నిజం వెలుగు చూసింది. ► అదే అధికారి 3, 4, 5 రౌండ్లలోనూ ఉన్నాడని ఫిర్యాదు చేస్తే తనకేం సంబంధం లేదని రిటర్నింగ్ అధికారి చెప్పడమేంటి? అక్రమాలు జరిగినప్పుడు విచారణ చేయకపోతే ఆర్ఓగా ఎందుకున్నట్లు? మరో అధికారి.. తమవి 70 ఓట్లు ఉంటే ఆ కట్టపై 50 అని రాశారు. టీడీపీవి 30 ఉంటే 50 అని నమోదు చేశారు. ► ఎనిమిది మంది స్వతంత్ర అభ్యర్థుల ఓట్లు గల్లంతైనట్లు ఫిర్యాదు చేసినా కలెక్టర్ పట్టించుకోలేదు. ఏదిఏమైనా ఈ ఎన్నికల్లో నైతిక విజయం మాదే. నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు. చదవండి: ‘స్కిల్’ సూత్రధారి బాబే -
రెండో ప్రాధాన్యత ఓటుతో గట్టెక్కిన టీడీపీ
సాక్షి ప్రతినిధి, అనంతపురం/చిత్తూరు కలెక్టరేట్/సాక్షి, విశాఖపట్నం : తూర్పు, పశ్చిమ రాయలసీమ, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండవ ప్రాధాన్యత ఓట్లతో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరూ గెలుపునకు సరిపడా ఓట్లు సాధించ లేక పోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లే గెలుపును నిర్ణయించాయి. మూడు రోజులుగా కొనసాగిన కౌంటింగ్ ప్రక్రియలో శనివారం తుది ఫలితాలు వెలువడ్డాయి. నువ్వా నేనా అన్నట్టు సాగిన పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్రెడ్డి 7,543 ఓట్ల మెజారిటీతో గెలిచారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో మెజారిటీ రావడమే కాకుండా.. రెండో ప్రాధాన్యతలోనూ ఆధిక్యంలో కొనసాగిన వైఎస్సార్సీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి చివరి రౌండులో ఓటమి పాలయ్యారు. చివరి రౌండులో పీడీఎఫ్ అభ్యర్థి పోతుల నాగరాజుకు వచ్చిన 19వేల పైచిలుకు ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు సందర్భంగా టీడీపీకి మెజార్టీ వచ్చింది. బీజేపీ అభ్యర్థి నగనూరు రాఘవేంద్రకు వచ్చిన ఓట్లలోనూ రెండో ప్రాధాన్యత ఓట్లు ఎక్కువగా టీడీపీకి వచ్చాయి. దీంతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి చెందిన ఎక్కువ ఓట్లు చెల్లుబాటు కాకపోవడం కూడా ఆ పార్టీ అభ్యర్థి ఓటమికి ఒక కారణంగా చెప్పుకుంటున్నారు. మొత్తం మీద బి.రామగోపాల్రెడ్డి (టీడీపీ)కి 1,09,781 ఓట్లు, వెన్నపూస రవీంద్రారెడ్డి (వైఎస్సార్సీపీ)కి 1,02,238 ఓట్లు వచ్చాయి. కాగా, అనంతపురంలోని కౌంటింగ్ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన నాయకులు తిష్ట వేయడంతో తొలి నుంచి అనుమానాలు తలెత్తాయి. శుక్రవారం రాత్రి ఈ అనుమానాలు నిజమయ్యాయి. వైఎస్సార్సీపీ చెందిన ఓట్లు కొన్ని తెలుగుదేశం పార్టీ కట్టల్లోకి వెళ్లినట్టు తేలింది. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి మొత్తం ఓట్లను రీకౌంటింగ్ చేయాలని పట్టుపట్టారు. కానీ ఆ బాక్స్ వరకు మాత్రమే లెక్కిస్తామని, మొత్తం రీ కౌంటింగ్ కుదరదని అధికారులు చెప్పారు. కౌంటింగ్ జరుగుతున్న సేపు తెలుగుదేశం నాయకులు అక్కడున్న సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేశారు. రెండో ప్రాధాన్యత ఓటుపై పీడీఎఫ్తో పొత్తు వల్లే గెలుపు తూర్పు రాయలసీమలో, ఉత్తరాంధ్రలోనూ పీడీఎఫ్ ఓట్ల వల్లే టీడీపీ అభ్యర్థులు గట్టెక్కగలిగారు. పొత్తు లేకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓడిపోతామన్న భయంతో ముందే పీడీఎఫ్ నేతలను బతిమాలి మరీ టీడీపీ నేతలు రెండవ ప్రాధాన్యత ఓటుపై పొత్తు పెట్టుకున్నారు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లతో టీడీపీ గట్టెక్కగలిగింది. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ (తూర్పు రాయలసీమ)గా టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్కు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో స్పష్టత రాకపోవడంతో.. పీడీఎఫ్ అభ్యర్థి మీగడ వెంకటేశ్వరరెడ్డికి వచ్చిన రెండవ ప్రాధాన్యత ఓట్లతో గెలుపు వరించింది. శ్రీకాంత్కు 1,24,181 ఓట్లు రాగా, వైఎస్సార్సీపీ అభ్యర్థి పేర్నాటి శ్యాంప్రసాద్రెడ్డికి 90,071 ఓట్లు వచ్చాయి. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీడీపీ మద్దతిచ్చిన అభ్యర్థి వెంపాడ చిరంజీవిరావు రెండో ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించారు. విజయానికి 94,509 ఓట్లు కావాల్సి ఉండగా, టీడీపీ మద్దతు అభ్యర్థికి 82,958 ఓట్లు.. వైఎస్సార్సీపీ మద్దతు అభ్యర్థి సీతంరాజు సుధాకర్కు 55,749, పీడీఎఫ్ అభ్యర్థికి 35,148 ఓట్లు, బీజేపీ అభ్యర్థికి 10,884 ఓట్లు వచ్చాయి. దీంతో 36 రౌండ్లలో ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. బీజేపీ, పీడీఎఫ్ ద్వితీయ ప్రాధాన్యత ఓట్లతోనే టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. -
రెండు సీట్లకు ఎగిరి గంతేయడమే టీడీపీ స్టైల్!
ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎమ్మెల్సీ(శాసనమండలి) ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ల నియోజకవర్గాలలో.. తప్ప మిగిలిన అన్నిటిని కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీకి రెండు స్థానాలు దక్కాయి. దీంతో తెలుగుదేశం పార్టీ సంబరాలు చేసుకుంటోంది. తప్పు లేదు. వందకు వంద మార్కులు వస్తాయని భావించిన వారు రెండు మార్కులు తగ్గితే బాధపడతారు. అదే సున్నా మార్కులు వస్తాయని అనుకున్నవారు రెండు మార్కులు వచ్చినా ఎగిరి గంతేస్తారు. అలాగే ఉంది తెలుగుదేశం పార్టీ పరిస్థితి. టీడీపీ నేతలంతా మొత్తం సాదారణ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చేసినంత హడావుడి చేస్తున్నారు. తెలుగుదేశంకు మద్దతు ఇచ్చే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 వంటివి అయితే శరభ.. శరభ అంటున్నాయి. ఈనాడు అయితే ఏకంగా తిరుగుబాటు అనే హెడింగ్ పెట్టి ఆత్మ సంతృప్తి చెందింది. తమ మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ అక్రమాలను బయటపెడతారా? అనే అక్కసు అందులో కనిపిస్తోంది. సహజంగానే ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల ఫలితాల తర్వాత సమీక్షించుకుని తన బలాన్ని బెరీజు వేసుకుంటుంది. ఇక్కడ గమ్మత్తు అయిన అంశం ఏమిటంటే పశ్చిమ,తూర్పు రాయలసీమలోని టీచర్ల ఎమ్మెల్సీ స్థానాలు రెండిటిని వైఎస్ ఆర్ కాంగ్రెస్ గెలుచుకుంటే దానిని ఏదో మామూలు విషయంగా చూస్తున్న టీడీపీ, రెండు చోట్ల గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలలో గెలవడం చాలా పెద్ద విషయం అనుకుంటోంది. స్థానిక సంస్థల నియోజకవర్గాలు తొమ్మిదింటికి గాను ఐదింటిని వైసీపీ ఏకగ్రీవంగా నెగ్గింది. మరో నాలుగింట టీడీపీ మద్దతుతో కొందరు పోటీచేసినా ఫలితం దక్కలేదు.. పశ్చిమగోదావరి వంటి చోట్ల వైసీపీకి ఉన్న బలం కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయట. ఆ సంగతిని టీడీపీ మీడియా కప్పిపుచ్చే యత్నం చేస్తోంది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమలలోని గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలలో టీడీపీ గెలవడంతో వైసీపీకి పతనం ఆరంభం అయిందని టీడీపీ సీనియర్ నేతలంతా స్టేట్మెంట్లు ఇచ్చేశారు. గ్రాడ్యుయేట్లలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్న వాదన చేసేవారు టీచర్లలో ప్రభుత్వ సానుకూలత ఉందని ఒప్పుకోవలసి ఉంటుంది. నిజానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తాయా అంటే అది పరిమితం అని చెప్పాలి. అలా అని అసలు ప్రాధాన్యత లేదని కాదు. కానీ గ్రాడ్యుయేట్లు ముందుగా తమ ఓటును రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎన్నికలు జరిగిన ప్రాంతాలను పరిగణనలోకి తీసుకున్నా ఏభై లక్షల మందికి పైనే గ్రాడ్యుయేట్లు ఉండాలి. కానీ అధికారికంగా ఓట్ల సంఖ్య మాత్రం తొమ్మిది లక్షలే!. .. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, ఇతర రంగాలలోని గ్రాడ్యుయేట్లు ఉండవచ్చు. ఇటీవలి కాలంలో ప్రభుత్వ ఉద్యోగులను, టీచర్లను టీడీపీ కాని, ఆ పార్టీ మీడియా కానీ, విపరీతంగా రెచ్చగొడుతున్నాయి. బహుశా ఆ ప్రభావం కొంతమేర పడి ఉండడం వల్ల గ్రాడ్యుయేట్ సీట్లలో వైసీపీకి నష్టం కలిగి ఉండవచ్చు. లేదా అభ్యర్థి ఎంపికలో లోపం ఉండవచ్చు. పార్టీ నాయకత్వంలో సమన్వయ లోపం కారణం కావచ్చు. అతి విశ్వాసం కూడా ఉండి ఉండవచ్చు. విశాఖలో అయితే పార్టీలకు అతీతంగా చిరంజీవిరావుకు ఓట్లు పడ్డాయట. దానికి కారణం ఆయన గ్రూప్ పరీక్షలకు భోధన చేసే లెక్చరర్ కావడమట. అది టీడీపీకి కలిసి వచ్చింది. మరి టీడీపీ స్థానిక సంస్థల నియోజకవర్గాలలో కానీ, టీచర్ల నియోజకవర్గాలలో కానీ ఓటమి చవిచూడడానికి కూడా కారణాలు ఉంటాయి కదా? వాటిని విస్మరించి టీడీపీ వారు కేవలం గ్రాడ్యుయేట్ల నియోజకవర్గాలలో గెలిచినందుకే రెచ్చిపోతే వారికి ఎంత ప్రయోజనమో తెలియదు. నిజానికి గతంలో గ్రాడ్యుయేట్లు, టీచర్ల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇంత ప్రాధాన్యత ఉండేది కాదు. ప్రధాన రాజకీయ పార్టీలు స్వయంగా రంగంలో దిగేవికావు. కానీ కాలక్రమేణా అభ్యర్దులకు పరోక్ష మద్దతు, తదుపరి ప్రత్యక్షంగా పార్టీలే రంగంలో దిగడం జరిగింది. టీచర్ల స్థానాలో ఎక్కువగా వామపక్షాలకు సంబందించిన సంఘాల నేతలు పోటీపడేవారు. గ్రాడ్యుయేట్ల స్థానాలలో బీజేపీ, వామపక్షాలు అధికంగా పోటీ పడేవి. దానికి ప్రత్యేక కారణం కూడా ఉంది. అసెంబ్లీ ఎన్నికలలో ఈ పార్టీలకు పెద్దగా సీట్లు వచ్చే పరిస్థితి లేదు. అందుకే పరిమిత ఓటర్లు ఉండే ఎమ్మెల్సీ ఎన్నికలపై ఇవి ఎక్కువగా దృష్టి పెడుతుండేవి. ఈసారి రెండు ప్రధాన రాజకీయ పార్టీలు పోటీపడడంతో వామపక్షాల సంఘాల అభ్యర్దులు, బీజేపీ అభ్యర్థులు పూర్తిగా తెరమరుగు అయినట్లుగా కనిపిస్తోంది. గతసారి బీజేపీ అభ్యర్ధిగా గెలిచిన మాదవ్ ఈసారి పరాజయం చెందారు. తెలుగుదేశం మీడియా ఈ ఎన్నికల ఫలితాలపై ఒక విశ్లేషణ ప్రచారం చేస్తోంది. గ్రాడ్యుయేట్ల స్థానాలు వంద శాసనసభ స్థానాల పరిధిలో ఉన్నాయని, అందువల్ల ఈ ఫలితాలు వచ్చే సాధారణ ఎన్నికలకు నాందీ అవుతాయని ఆ మీడియా అంటున్నది. అదే నిజమైతే.. ఎన్నికలు జరిగిన ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలు, ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, శ్రీకాకుళం మొదలైన జిల్లాలు స్థానిక సంస్థల నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి. అవన్నీ వైసీపీ పరం అయ్యాయి. అంటే ఈ జిల్లాలన్నిటిలో టీడీపీ తుడిచిపెట్టుకుని పోయినట్లు అంగీకరిస్తారా? రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో టీచర్ల నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ రెండు సీట్లు వైసీపీ గెలుచుకుంది. టీడీపీకి అవకాశం లేకుండా పోయిందని అంగీకరిస్తారా? ఈ ఎన్నికల ఫలితాల ప్రాతిపదికనే ఒక అభిప్రాయానికి రావడం కరెక్టు కాకపోవచ్చు. గత నాలుగేళ్లలో జరిగిన అన్ని ఎన్నికలలో వైసీపీనే గెలిచింది. చివరికి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహించే కుప్పంలో సైతం స్థానిక ఎన్నికలన్నిటిని వైసీపీ గెలుచుకుంది. అందువల్ల టీడీపీ పని అయిపోయినట్లు ఎవరైనా అంటే ఒప్పుకుంటారా? అదే సమయంలో వీటిని ఒక సంకేతంగా తీసుకోవడం ఆక్షేపణీయం కాదు. ఆ రకంగా చూసినా టీడీపీ గ్రాడ్యుయేట్ల స్థానాలలోనే గెలిచింది. మిగిలిన అన్ని వైసీపీనే గెలుచుకుంది. మండలి ఎన్నికలలో గెలిచినంత మాత్రాన సాదారణ ఎన్నికలలో గెలవాలని లేదు. ఉత్తరాంద్రలో గతసారి బీజేపీ అభ్యర్ధి మాధవ్ మండలికి గెలిచినా, ఆ తర్వాత జరిగిన సాదారణ ఎన్నికలలో బీజేపీకి ఆ ప్రాంతంలో ఒక్క సీటు కూడా రాలేదు. పీడీఎఫ్ పేరుతో వామపక్ష అభ్యర్దులు పోటీ చేస్తుంటారు. ఉదాహరణకు ఏలూరులో సూర్యారావు అనే టీచర్ వామపక్షవాది. ఆయన మండలి ఎన్నికలలో గెలిచారు. ఆ తదుపరి శాసనసభ ఎన్నికలలో ఆ ప్రాంతంలో సీపీఎం విజయం సాదించలేదు. పీడీఎఫ్ అభ్యర్దులు గెలిచిన జిల్లాలలో శాసనసభ ఎన్నికలలో వారి ప్రభావం ఏమీ కనిపించలేదు. తెలంగాణలో గతంలో బీజేపీ నేత ఎమ్. రామచంద్రరావు గ్రాడ్యుయేట్ల నియోజకవర్గంలో గెలుపొందారు. కానీ ఆ తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీనే గెలిచింది. తెలుగుదేశం పార్టీ తనకు ఈ రెండు చోట్ల గెలవడం ఎంతో ఉపయోగంగా సహజంగానే భావిస్తుంది. ఆ నేపథ్యంలోనే ప్రజలను ప్రభావితం చేసి శాసనసభ ఎన్నికలలో ఫలితం రాబట్టడానికి తంటాలు పడుతోంది. కానీ శాసనసభ ఎన్నికలు జరగడానికి ఇంకా ఏడాది సమయం ఉందన్న సంగతి మర్చిపోరాదు. తాము రెండు చోట్ల గెలిచాము కాబట్టి మండలి ఎన్నికలలో అక్రమాలు జరగలేదని టీడీపీ చెబుతుందేమో తెలియదు. తొలుత తన విజయం మీద నమ్మకం లేక టీడీపీ వర్గాలు అసలు కౌంటింగే జరగరాదని ఏకంగా కోర్టుకే వెళ్లారు. పోలింగ్లో అవకతవకలు జరిగాయని ఆరోపించింది. ఇప్పుడు టీడీపీ ఆ విషయం చెప్పడం లేదు. గతంలో నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ గెలిచిన తర్వాత ఇంకేముంది.. 2019 శాసనసభ ఎన్నికలలో కూడా తమదే గెలుపు అని టీడీపీ నేతలు బీరాలు పోయేవారు. కానీ 2019 ఎన్నికలలో టీడీపీ ఘోర పరాజయం మూటకట్టుకోగా, వైసీపీ ఘన విజయం సాధించింది. ఇలా ఎన్నో అనుభవాలు ఉన్నా టీడీపీ అధినాయకత్వం మండలి ఎన్నికల ఫలితాలపైనే ఇంత ప్రచారం చేయడం కేవలం ప్రజలను ప్రభావితం చేయాలన్న ఆశతోనే. కానీ అసలు ఎన్నికలకు ఇంకా ఏడాది టైమ్ ఉందన్న సంగతి గుర్తుంచుకోవాలి. వైఎస్సార్ సీపీ అధినేత , ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శాసనసభలో ఒక మాట అన్నారు. పెత్తందారులకు, సామాన్యులకు పోరాటం జరుగుతోందని, తన నడక సామాన్యులతోనేనని, పేదల సంక్షేమం, అభివృద్ధే తన లక్ష్యమని ఆయన స్పష్టంగా చెప్పారు. శాసనసభ సాదారణ ఎన్నికలలో పేద, మధ్య తరగతి ప్రజలంతా వైఎస్సార్సీపీ వైపే ఉంటారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇంతకాలం ప్రభుత్వానికి వారే అండగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా అందుకు భిన్నంగా ఉంటారని అనుకోజాలం. గ్రాడ్యుయేట్ల నియోజకవర్గాలలో గెలవలేకపోవడం వారికి కొంత అసంతృప్తి కలిగించవచ్చేమో కానీ.. అవే వచ్చే శాసనసభ ఎన్నికల ఫలితాలు నిర్దేశిస్తాయని భావించవలసిన అవసరం లేదు. :::కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్ -
Fact Check: టీడీపీ అసత్య ప్రచారం.. అందులో వాస్తవం లేదు
సాక్షి, అమరావతి: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పులివెందులలో అధికార వైఎస్సార్సీపీ అభ్యర్థి కంటే టీడీపీ అభ్యర్థికి అధిక ఓట్లు వచ్చాయని జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం శుక్రవారం ట్విట్టర్లో తెలిపింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ వాదన పూర్తిగా నిరాధారమని పేర్కొంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ.. ఎమ్మెల్యే ఎన్నికల మాదిరిగా నియోజకవర్గాల వారీగా జరగదని గుర్తుచేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విడివిడిగా కాకుండా పోలైన ఓట్లన్నీ కలిపే లెక్కింపు చేస్తారని స్పష్టంచేసింది. త్వరలో ఎన్నికల సంఘం తుది వివరాలను ప్రకటిస్తుందని, అసత్య వార్తలను నమ్మవద్దని కోరింది. చదవండి: జై కొట్టిన టీచర్లు.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా -
పటిష్టంగా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ
కడప సిటీ: పట్టభద్రులు, ఉపాధ్యాయ, స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ విజయరామరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వీసీ హాలులో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై జేసీ సాయికాంత్వర్మ, ఏఎస్పీ తుషార్డూడి, నగర పాలక సంస్థ కమిషనర్ జీఎస్ఎస్ ప్రవీణ్చంద్, అసిస్టెంట్ కలెక్టర్లు ‡రాహుల్మీనా, ప్రవీణ్, డీఆర్వో గంగాధర్గౌడ్తో కలిసి ఎన్నికల నోడల్ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గతంలో జరిగిన ఎన్నికల విజయవంతానికి ఏ విధంగా కృషి చేశారో అదే స్ఫూర్తితో ఈ ఎన్నికలను విజయవంతం చేయాలన్నారు. పోలింగ్ సిబ్బందిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా లేని వారిని మాత్రమే నియమించాలన్నారు. వారి సొంత మండలంగానీ, వారు విధులు నిర్వర్తించే మండలానికిగానీ విధులను కేటాయించరాదన్నారు. ఎన్నికల కమిషన్ సూచనల మేరకు ఎన్నికల నియమ నిబంధనలను తప్పకుండా పాటించాలన్నారు. ఎన్నికలకు అవసరమైన వాహనాలను రూట్ మ్యాప్ వేసుకుని ఆ ప్రకారంగా సిద్ధం చేసుకోవాలన్నారు. ఎన్నికల పరంగా ఏవైనా ఫిర్యాదులు చేయాలనుకుంటే 1950 టోల్ఫ్రీ నంబరుకు కాల్ చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు ధర్మచంద్రారెడ్డి, వెంకట రమణ, జెడ్పీ సీఈఓ సుధాకర్రెడ్డి, డీపీఓ ప్రభాకర్రెడ్డి, సీపీఓ వెంకట్రావు, డ్వామా, డీఆర్డీఏ, మెప్మా, ఏపీఎంఐపీ పీడీలు యదుభూషణరెడ్డి, ఆనంద్ నాయక్, రామ్మోహన్రెడ్డి, రవీంద్రారెడ్డితోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఏపీ, తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో 8 స్థానిక సంస్థల నియోజకవర్గాలకు, 3 గ్రాడ్యుయేట్ స్థానాలకు, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు, తెలంగాణలో ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి, మరో స్థానిక సంస్థల స్థానానికి ఎన్నిక జరగనుంది. ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 13న ఎన్నికలు నిర్వహించనున్నారు. మార్చి 16న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. -
Graduates MLC: పట్టం కట్టేదెవరికి.. పాఠం కలిసొచ్చేదెవరికి?
రాయలసీమ పశ్చిమ నియోజకవర్గానికి జరగనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఘట్టంలో తొలి అంకం ముగిసింది. గత నెల 30న తుది ఓటరు జాబితా ఖరారైంది. ఈ నెలాఖరులో నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. దీంతో ప్రధాన పారీ్టలైన వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ప్రకటించిన అభ్యర్థులతో పాటు ఆశావహులు ప్రచారపర్వంపై దృష్టి సారించారు. ఆరు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి ఓటర్లతో సమావేశమవుతున్నారు. దీంతో ఉమ్మడి కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. – సాక్షి ప్రతినిధి కర్నూలు పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్రెడ్డి, కత్తి నరసింహారెడ్డిల పదవీకాలం మార్చితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ వీటి భర్తీకి ఉపక్రమించింది. ఇప్పటికే అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలు నిర్వహించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. వైఎస్సార్సీపీ, టీడీపీ అభ్యర్థులు వెన్నపూస రవీంద్రారెడ్డి, భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డితో పాటు స్వతంత్ర అభ్యర్థులు విస్తృత ప్రచారంలో తలమునకలవుతున్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులతో.. యూనియన్ల వారీగా, శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి మద్దతు కోరుతున్నారు. పట్టభద్రుల కోటాలో 3,28,807 ఓట్లు నమోదయ్యాయి. గత ఎన్నికల్లో 2.52లక్షలు మాత్రమే ఉన్నాయి. అంటే గతంతో పోలిస్తే 76వేల ఓట్లు అధికం. పెరిగిన ఓట్లు ప్రభుత్వ పనితీరును, గ్రాడ్యుయేట్లు, ఉద్యోగులపై ప్రభుత్వ చిత్తశుద్ధిని స్పష్టం చేస్తున్నాయని వైఎస్సార్సీపీ భావిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ వైఎస్సార్సీపీ, టీడీపీ అభ్యర్థులతో పాటు ‘అనంత’ నుంచి పోటీ చేస్తోన్న బీసీ నాగరాజు మధ్య ప్రధాన పోటీ ఉండే అకాశం ఉంది. వీరితో పాటు బోరంపల్లి ఆంజనేయులు, గైబున్నీసా, బోయ నాగరాజు, పట్టుపోగుల పవన్ కుమార్తో పాటు పలువురు పోటీలో ఉన్నా, పోటీ మాత్రం ఆ ముగ్గురి మధ్యనే ఉన్నట్లు తెలుస్తోంది. వెన్నపూస రవీంద్రారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్సీ, ఎన్జీవో సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు తనయుడు కావడం సానుకూలాంశం. రాంగోపాల్రెడ్డి పులివెందుల నియోజవకర్గ వాసి. ఎవ్వరికీ తెలియని వ్యక్తి! రవీంద్రారెడ్డి అభ్యరి్థత్వాన్ని ఆరు జిల్లాలలోని 26మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఇన్చార్జీలు ఏకగ్రీవంగా సమర్థించారు. బాధ్యత తీసుకుని గెలుపునకు కృషి చేస్తున్నారు. రాయలసీమలోని 52 అసెంబ్లీ స్థానాల్లో 49 చోట్ల ఓడిపోయామని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఘోర పరాభావం తప్పదని, పోటీ వద్దని టీడీపీ ఇన్చార్జీలు భావించారు. గత ఎన్నికల్లో ప్రతిపక్ష పారీ్టగా వైఎస్సార్సీపీ ఉండి ఎమ్మెల్సీ గెలిచిందని, ఇప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉండి కనీసం పోటీ చేయకుంటే ఆ ప్రభావం కేడర్పై బలంగా పడుతుందని నామమాత్రపు పోటీకి సిద్ధమైంది. పోటీకి అభ్యర్థులు ముందుకు రాకపోవడంతో రాంగోపాల్రెడ్డిని తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ నాయకత్వం ఎంత బలహీనంగా ఉందో తెలిసిందే. అక్కడ టీడీపీకి ఎలాంటి విజయాలు లేవు. అలాంటి నియోజకవర్గం నుంచి అభ్యర్థిని నిలపడం చూస్తే ఈ ఎన్నికలను టీడీపీ ఎంత సీరియస్గా తీసుకుందో అర్థమవుతోంది. రవీంద్రారెడ్డి 28 నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి తరచూ సమావేశాలు నిర్వహించి ఓటర్లను కలుస్తున్నారు. రాంగోపాల్రెడ్డి చంద్రబాబు పర్యటనలో మినహా ఎక్కడా కనిపించని పరిస్థితి. వైఎస్సార్సీపీ అభ్యర్థికి అనుకూల అంశాలు ►సచివాలయాల ఏర్పాటుతో వేలాది నిరుద్యోగులకు సర్కారు కొలువులు. ►ఇచ్చిన మాటకు కట్టుబడి ఉద్యోగులకు వేతనాలు పెంచడంతో పాటు పర్మనెంట్ చేయడం. ►పోలీస్రిక్రూట్మెంట్ ద్వారా 6,900 పైగా ఉద్యోగాల భర్తీకి చర్యలు. ►అభ్యర్థుల వినతి మేరకు వయస్సు సడలింపు నిర్ణయం. ►న్యాయశాఖ పరిధిలో 3వేలకుపైగా ఉద్యోగాల భర్తీ ►గ్రూప్–1 నోటిఫికేషన్కు చర్యలు. ►వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలో ఖాళీలన్నీ భర్తీకి నిర్ణయం. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలోనూ త్రిముఖ పోరే.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో 27,716 ఓట్లు నమోదయ్యాయి. గతంతో పోలిస్తే ఈ ఓట్లు కూడా పెరిగాయి. ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డితో పాటు బీజేపీ నేత ఒంటేరు శ్రీనివాసరెడ్డి, రామచంద్రారెడ్డి, ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నారాయణరెడ్డి, అనిల్కుమార్రెడ్డితో పాటు పలువురు పోటీ చేస్తున్నారు. కత్తి, ఒంటేరు, రామచంద్రారెడ్డి మధ్య త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉంది. కత్తి ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘానికి చెందిన వ్యక్తి. ఉపాధ్యాయ ఎన్నికల్లో యూనియన్లు ప్రధానపాత్ర పోషించే అవకాశం ఉంది. ఇక్కడ అభ్యర్థి గెలుపోటములను యూనియన్లే ప్రభావితం చేయనున్నాయి. దీంతో అభ్యర్థులంతా యూనియన్ల నేతలు, సభ్యులను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. -
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలి
సాక్షి, అమరావతి: త్వరలో జరగనున్న పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల గెలుపునకు పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు కృషి చేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వర్క్షాప్లో ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల నియోజకవర్గం పార్టీ అభ్యర్థిగా సీతంరాజుసుధాకర్, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల నియోజకవర్గం అభ్యర్థిగా పేర్నాటి శ్యాంప్రసాద్రెడ్డి, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల నియోజకవర్గం పార్టీ అభ్యర్థిగా వెన్నపూస రవి పోటీ చేస్తున్నారని తెలిపారు. -
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పోటీ
సాక్షి, అమరావతి: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యక్తం చేసిన ఏకాభిప్రాయాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదించారు. ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల గ్రాడ్యుయేట్.... ఉమ్మడి అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్.... ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు చిత్తూరు జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, రెండు టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సోమవారం సచివాలయంలో ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం వైఎస్ జగన్ సమావేశమై అభిప్రాయాలను స్వీకరించారు. వచ్చే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఏకాభిప్రాయం వ్యక్తం చేయడంతో సీఎం జగన్ ఆమోదించారు. గ్రాడ్యుయేట్, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలను గతంలో ప్రాధాన్యతగా తీసుకోలేదని సీఎం జగన్ పేర్కొనగా.. ఎవరో ఒకరికి మద్దతు ఇవ్వడం, ఉత్సాహవంతులకు అండగా నిలిచామని ఎమ్మెల్యేలు గుర్తు చేశారు. అయితే శాసనమండలిలో ప్రభుత్వపరంగా విధానపరమైన నిర్ణయాలకు మద్దతు కోరినప్పుడు మన మద్దతుతో గెలిచిన వారు కూడా మొహం చాటేసిన పరిస్థితులను చూశామని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రస్తావించారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పోటీ చేయడమే మంచిదని ఏకాభిప్రాయంతో సీఎం జగన్కు నివేదించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సూచనకు సీఎం జగన్ అంగీకరించారు. ముందుగా ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలను తీసుకుని మూడు గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను సీఎం వైఎస్ జగన్ ఖరారుచేశారు. ఉమ్మడి విశాఖ– విజయనగరం – శ్రీకాకుళం గ్రాడ్యుయేట్ స్థానానికి అభ్యర్థిగా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఎస్.సుధాకర్ను ఖరారు చేశారు. ఉమ్మడి ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు గ్రాడ్యుయేట్ స్థానానికి గూడూరు నియోజకవర్గానికి చెందిన శ్యాంప్రసాద్రెడ్డి అభ్యర్థిత్వాన్ని సీఎం జగన్ ఖరారు చేశారు. ఉమ్మడి కర్నూలు–కడప– అనంతపురం గ్రాడ్యుయేట్ స్థానానికి వెన్నపూస రవి పేరును ఖరారు చేశారు. టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ, అభ్యర్థిపై తర్వాత నిర్ణయం తీసుకుందామని సీఎం జగన్ సూచించారు. -
APలో 3గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో YSRCP పోటీ
-
మల్లన్న ఓటమిని తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య
నాంపల్లి (మునుగోడు): తీన్మార్ మల్లన్న ఓటమిని తట్టుకోలేక యువకుడు ఆత్మహ త్య చేసుకున్నాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం లెంకలపల్లిలో ఆదివారం జరిగింది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన ఏర్పుల శ్రీశైలం (22) ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తీన్మార్ మల్లన్న చేపట్టిన పాదయాత్రలో మూడు నెలల పాటు కళాకారుడిగా పని చేశాడు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల సందర్భం గా రెండ్రోజుల పాటు ఇంట్లోనే టీవీకి అతుక్కుపోయి కౌంటింగ్ ప్రక్రియను చూశాడు. శనివారం రాత్రి మల్లన్న ఓడిపోయాడని తెలిసి భోజ నం చేయలేదు. ఆదివారం ఉదయం ఇంట్లో ఉన్న పురుగుల మందు డబ్బాను తీసుకుని పక్కనే ఉన్న గుడిసెలోకి వెళ్లి తాగాడు. ఆ తర్వాత ఇద్దరు స్నేహితులకు ఫోన్ చేయగా వారు ఎత్తలేదు. అంతలో అతడిని గమనించిన తల్లిదండ్రులు, చెల్లెలు ఇలా ఎందుకు చేశావని శ్రీశైలాన్ని అడిగారు. తీన్మార్ మల్లన్న ఓడిపోవడం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని అన్నాడని కుటుంబసభ్యులు చెప్పినట్టు పోలీసులు తెలిపారు. అనంతరం శ్రీశైలాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. శ్రీశైలం తండ్రి ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు. శ్రీశైలం కుటుంబసభ్యులను ఆదివారం తీన్మార్ మల్లన్న పరామర్శించారు. కుటుంబానికి రూ.50 వేల ఆర్థికసాయాన్ని అందజేశారు. శ్రీశైలం చెల్లెలి వివాహానికి రూ.లక్ష చెక్కును అందజేశారు. చదవండి: ఓడి.. గెలిచిన తీన్మార్ మల్లన్న -
ఎమ్మెల్సీ ఎన్నికలు: ఫెయిలైన ప్రొఫెసర్లు..!
-
‘పీఆర్సీ ఇవ్వరనే భయంతో టీఆర్ఎస్కు ఓటేశారు’
-
‘పీఆర్సీ ఇవ్వరనే భయంతో టీఆర్ఎస్కు ఓటేశారు’
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓట్ షేర్ పెరిగిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఓటమి లక్ష్యంగా కొన్ని పార్టీలు పని చేశాయని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో పుట్టగతులు లేవని సీఎం కేసీఆర్కు అర్థమైందని తెలిపారు. అందుకే సీఎం కేసీఆర్ బయటకు రాకుండా వేరే పార్టీ నేత ముఖం పెట్టుకుని వచ్చారని మండిపడ్డారు. బీజేపీతో టీఆర్ఎస్లో భయం పట్టుకుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ బెనిఫిట్స్ ఇవ్వాలన్నారు. బంగారు తెలంగాణలో గత పీఆర్సీ కంటే ఎక్కువ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ భయంతో కేసీఆర్ ముఖంలో నవ్వు కరువైందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టి టీఆర్ఎస్ గెలిచిందని బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఉద్యోగులను మానసికంగా ఇబ్బంది పెట్టారని బండి సంజయ్ మండిపడ్డారు. పట్టభద్రులు టీఆర్ఎస్ మీద ప్రేమతో ఓటు వేయలేదన్నారు. పీఆర్సీ ఇవ్వరని భయపడే టీఆర్ఎస్కు ఓటేశారని తెలిపారు. పీఆర్సీ ఇవ్వకపోతే సీఎం కేసీఆర్ తలదించుకునేలా చేస్తామని తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్, నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. 70 శాతం మంది ఓటర్లు టీఆర్ఎస్ను వ్యతిరేకించారని అన్నారు. ఓట్లు చీలడం వల్లే టీఆర్ఎస్ గెలిచిందని, గుర్రం బోడు, భైంసా ఘటనలు, తమ నాయకులపై రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న దాడులను మరచిపోమని తెలిపారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చే వరకు బీజేపీ పోరాటం చేస్తుందని చెప్పారు. అన్ని కేంద్రం ఇస్తే నువ్వు ఎందుకు ఇక్కడ అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ వాళ్లు వైజాగ్ వెళ్లినా ఎవరు పట్టించుకోరని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. చదవండి: ప్రపంచమంతా ఆగమైతుంటే... ఇక్కడెలా పెరిగింది? -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయ భేరీ మోగించడంతో టీఆర్ఎస్ పార్టీకి మళ్లీ జోష్
-
వాడిన కమలం: ‘సిట్టింగ్’ కోల్పోయి.. ‘సెకండ్’ పోగొట్టుకుని!
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని ఆత్మ రక్షణలోకి నెట్టాయి. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం కోల్పోవడంతో పాటు గతంలో రెండో స్థానంలో నిలిచిన స్థానంలో ఈసారి నాలుగో స్థానానికి దిగజారడం ఆ పార్టీ నేతలను కలవరపరుస్తోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకొంటున్న కమలనాథులు ఈ ఫలితాలతో కంగుతిన్నారు. అధికార టీఆర్ఎస్ అనుసరించిన వ్యూహం ముందు నిలవలేకపోయామా? లేదా పట్టభద్రుల ప్రయోజనాలను పసిగట్టడంలో విఫలమయ్యామా? అనే చర్చ బీజేపీ వర్గాల్లో జరుగుతోంది. అయితే పార్టీ విశ్లేషణలు ఎలా ఉన్నా ఈ ఎన్నికల ద్వారా బీజేపీ రాజకీయంగా నష్టపోయినట్లేనని చర్చ జరుగుతోంది. గెలుస్తామనుకున్న సిట్టింగ్ చేజారి.. కచ్చితంగా గెలుస్తామనుకున్న మహబూబ్నగర్– హైదరాబాద్– రంగారెడ్డిలో బీజేపీకి ఓటమి ఎదురుకావడంతో బీజేపీ శ్రేణులు నైరాశ్యంలో పడ్డాయి. బీజేపీ అభ్యర్థి రామ్చందర్రావు సామాజిక వర్గానికే చెందిన మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కూతురు వాణీదేవిని టీఆర్ఎస్ అనూహ్యంగా బరిలో నిలపడంతో ఆ వర్గం ఓట్లు చీలిపోయాయన్న ఆలోచనల్లో పడింది. మరోవైపు ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ, పీఆర్సీ ఇవ్వబోతున్నారన్న ఉద్యోగ సంఘాల ప్రకటనలు తమ అభ్యర్థి ఓటమికి ప్రధాన కారణంగా బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీ శ్రేణుల్లో ఉన్న అసంతృప్తి కూడా బీజేపీ ఓటమికి కారణం అయిందనే వాదనలు ఉన్నాయి. సిట్టింగ్ అభ్యర్థి రామ్చందర్రావు రెండు సార్లు ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయడం, ఎంపీగా ఆయననే పోటీలో నిలపడం, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆయనకే టికెటివ్వడం వంటివి పార్టీలోని కొన్ని వర్గాలను అసంతృప్తికి గురి చేసిందనే వాదనలు ఉన్నాయి. గుజ్జుల ప్రేమేందర్రెడ్డి వరంగల్ వరకే పరిమితమైన నేత అనే భావన పట్టభద్రుల్లో ఉంది. నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో పార్టీ సంస్థాగతంగా బలంగా లేదని, అక్కడి పట్టభద్రుల ఓట్లను రాబట్టుకోవడంలో విఫలమైందనే వాదనలు ఉన్నాయి. దీంతో 2015లో 2వ స్థానంలో ఉన్న బీజేపీ ఈసారి 4వ స్థానానికి పడిపోయింది. హైదరాబాద్పై పెట్టినంత దృష్టి వరంగల్పై పెట్టలేదని, అందుకే నాలుగో స్థానాకి పరిమితమైందన్న చర్చ జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని పట్టభద్రులను పట్టించుకోలేదన్న ఆరోపణలు వచ్చాయి. ఆ గెలుపును ఉపయోగించుకోలేకపోయామా? దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పొందిన గెలుపును సరిగ్గా వినియోగించుకోలేకపోయామన్న అభిప్రాయం కొందరు నేతల నుంచి వ్యక్తం అవుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచాం కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు ఎలాగూ ఓట్లు వేస్తారనే ఆలోచనలు కూడా తమ ఓట మికి కారణం అయిందన్న భావన నెలకొంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేక పోయారన్న చర్చ పార్టీలో జరుగుతోంది. కొత్తగా చేరిన నేతలు అందరినీ ఆయా నియోజకవర్గాల్లో చేపట్టిన ప్రచారంలో కలుపుకొని పోలేదన్న విమర్శలు ఉన్నాయి. అభ్యర్థుల గెలుపు విషయంలో పార్టీ శ్రేణులంతా తీవ్రస్థాయిలో కృషి చేయలేదన్న వాదన ఉంది. ఉద్యోగాల కల్పనపై టీఆర్ఎస్ ప్రకటనలను తిప్పికొట్టడంలో వెనుకంజలో ఉన్నారని, కాంగ్రెస్ తరహాలో కూడా విమర్శలు చేయలేకపోయారన్న విమర్శలు వచ్చాయి. కొన్ని అంశాలలో భావోద్వేగ ప్రకటనలు కొన్ని వర్గాల ఓటర్లను దూరం చేశాయని, అదే నల్లగొండ స్థానంలో రెండో ప్రాధాన్యం దక్కకుండా చేసిందని, ఫలితంగా పరాభవం మూటగట్టుకోవాల్సి వచ్చిందన్న చర్చ జరుగుతోంది. చదవండి: MLC Election Results: ఓడి.. గెలిచిన తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఎన్నికలు: ఫెయిలైన ప్రొఫెసర్లు..! -
ఎమ్మెల్సీ ఎన్నికలు: ఫెయిలైన ప్రొఫెసర్లు..!
సాక్షి, హైదరాబాద్: నాలుగు రోజులుగా ఉత్కంఠ నడుమ సాగిన మండలి పట్టభద్రుల కోటా ఓట్ల లెక్కింపులో ఇద్దరు ప్రొఫెసర్లు ఓటమి చెందగా, టీఆర్ఎస్ తరఫున పోటీచేసిన విద్యా సంస్థల యజమానులు ఇద్దరూ విజేతలుగా నిలిచారు. వారిపై పోటీ చేసిన ఇద్దరు ప్రొఫెసర్లు మాత్రం మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. పైగా వారికి వచ్చిన ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు టీఆర్ఎస్ అభ్యర్థుల విజయంలో కీలకపాత్ర పోషించడం గమనార్హం. మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 53,610 మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించిన నాగేశ్వర్.. లెక్కింపు ప్రక్రియలో చివరి వరకు కొనసాగినా ఎలిమినేషన్ ప్రక్రియలో తగినన్ని ఓట్లు సాధించలేకపోయారు. ‘నల్లగొండ– ఖమ్మం– వరంగల్’పట్టభద్రుల స్థానంలో తొలిసారిగా బరిలోకి దిగిన టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు. 70,072 ప్రథమ ప్రాధాన్యత ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. పట్టభద్రుల కోటా ఎన్నికల్లో ప్రొఫెసర్లు ఓటమి చెందడం చర్చనీయాంశమైంది. కాగా, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన పలువురు నేతలు కూడా ప్రస్తుత ఎన్నికల్లో ఓటమి చెందారు. ‘నల్లగొండ’స్థానం నుంచి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ ఇంటి పార్టీ వ్యవస్థాపకుడు చెరుకు సుధాకర్, యువ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణిరుద్రమలు గణనీయంగా ఓట్లు సాధించినా.. గెలుపు తీరాలకు చేరలేకపోయారు. చదవండి: MLC Election Results: ఓడి.. గెలిచిన తీన్మార్ మల్లన్న కేసీఆర్ చాణక్యం: టీఆర్ఎస్కు కలిసొచ్చిన అంశాలివే.. -
కేసీఆర్ చాణక్యం: టీఆర్ఎస్కు కలిసొచ్చిన అంశాలివే..
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయ భేరీ మోగించడంతో టీఆర్ఎస్ పార్టీకి మళ్లీ జోష్ వచ్చింది. ఒక సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో పాటు కమలం చేతిలో ఉన్న స్థానాన్ని కూడా చేజిక్కించుకుని కారు పార్టీ సత్తా చాటింది. టీఆర్ఎస్ అనుసరించిన బహుముఖ వ్యూహం, ఎత్తుగడలు పార్టీ అభ్యర్థుల విజయానికి బాటలు వేశాయి. టీఆర్ఎస్కు కలిసొచ్చిన అంశాలను ఓసారి పరిశీలిస్తే.. ఫలించిన ‘అనూహ్య అభ్యర్థి’ఎత్తుగడ ‘నల్లగొండ– ఖమ్మం– వరంగల్’పట్టభద్రుల స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డిని మరోమారు అభ్యర్థిగా ప్రకటించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ‘హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్నగర్’బరిలో అభ్యర్థిని నిలిపే విషయంలో చివరి నిముషం వరకు గోప్యత పాటించారు. ‘హైదరాబాద్’స్థానానికి 2007, 2009, 2015లో జరిగిన ఎన్నికల్లో 2009 మినహా మిగతా రెండు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని నిలిపినా టీఆర్ఎస్ విజయం సాధించలేదు. దీంతో ప్రస్తుత ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పోటీ చేసే అవకాశం లేదని, స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ కె.నాగేశ్వర్కు మద్దతు ఇస్తుందని కూడా ఓ దశలో ప్రచారం జరిగింది. ఫిబ్రవరి 23న నామినేషన్ల స్వీకరణ ముగియగా.. ఒకరోజు ముందు ఫిబ్రవరి 22న ‘హైదరాబాద్’స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు కూతురు సురభి వాణీదేవి పేరును అనూహ్యంగా కేసీఆర్ ఖరారు చేశారు. పీవీ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో వాణీదేవి పేరు తెరమీదకు రావడం విపక్షాలతో పాటు టీఆర్ఎస్ శ్రేణులు ఆశ్చర్యానికి లోనయ్యాయి. శతజయంతి ఉత్సవాల కానుకగా ఆమెను గెలిపించి చట్టసభకు పంపిస్తామని టీఆర్ఎస్ నాయకులు చెప్పారు. ఓడిపోయే స్థానంలో పోటీకి దింపి వాణీదేవిని బలిపశువును చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి. దాంతో టీఆర్ఎస్ ఈ స్థానంలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పోలింగ్ తేదీకి కేవలం 20 రోజుల ముందు పార్టీ అభ్యర్థిని ఖరారు చేసిన కేసీఆర్ శరవేగంగా ప్రచార వ్యూహాన్ని ఖరారు చేయడంతో పాటు పార్టీ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో మోహరించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (హైదరాబాద్), రాజ్యసభ సభ్యుడు కేశవరావు (రంగారెడ్డి), ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి (మహబూబ్నగర్)కు సమన్వయ బాధ్యతలు అప్పగించారు. ‘నల్లగొండ’పట్టభద్రుల స్థానంలో సమన్వయ బాధ్యతలు ఉమ్మడి జిల్లా మంత్రులకు అప్పగించిన కేసీఆర్ ‘హైదరాబాద్’లో మాత్రం ఉమ్మడి జిల్లాల మంత్రులతో పాటు అదనంగా మరో ముగ్గురు మంత్రులు గంగుల కమలాకర్ (హైదరాబాద్), టి.హరీష్రావు (రంగారెడ్డి), వేముల ప్రశాంత్రెడ్డి (మహబూబ్నగర్)లను ఇన్చార్జ్లుగా నియమించారు. ప్రచారంలో దూకుడు.. పోలింగ్పై దృష్టి ‘నల్లగొండ– ఖమ్మం– వరంగల్’స్థానంలో ఆరు నెలలుగా సన్నాహక సమావేశాలతో పార్టీ యంత్రాంగాన్ని సన్నద్దం చేస్తూ వచ్చిన టీఆర్ఎస్ ‘హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్నగర్’లో మాత్రం ఎన్నికల ప్రచారంలో దూకుడు ప్రదర్శించింది. మండల, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో సన్నాహాక సమావేశాలు ముగిసిన వెంటనే క్షేత్రస్థాయిలో ప్రతీ 50 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జిని నియమించి ప్రతీ ఓటరును చేరుకునేలా సమన్వయంపై దృష్టి కేంద్రీకరించింది. రెండు పట్టభద్రుల స్థానాల్లోనూ పార్టీ వ్యూహం అమలును కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు మంత్రులు, ఇన్చార్జిలు, ఎమ్మెల్యేలు, ఇతర మంత్రులను అప్రమత్తం చేస్తూ వచ్చారు. 22 జిల్లాలు.. 77 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పట్టభద్రుల ఎన్నికలు జరుగుతుండటంతో ఈ ఎన్నికలను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు తదితర వృత్తి నిపుణులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, కొన్ని కుల సంఘాలు, కాలనీ సంఘాలతోనూ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడానికి టీఆర్ఎస్ ప్రాధాన్యతనిచ్చింది. పోలింగ్ శాతం పెరిగితేనే పార్టీ అభ్యర్థులకు ప్రథమ ప్రాధాన్యత ఓట్లలో ఆధిక్యత దక్కుతుందనే అంచనాతో చేసిన ప్రయత్నాలు కూడా టీఆర్ఎస్కు అనుకూలించినట్లు ఫలితాల సరళి వెల్లడించింది. ఫలించిన ‘ఫిట్మెంట్’.. కలిసొచ్చిన ఓట్ల చీలిక పోలింగ్కు మూడు రోజుల ముందు ప్రగతిభవన్లో కేసీఆర్ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో జరిపిన భేటీ టీఆర్ఎస్కు కొంత అనుకూల వాతావరణాన్ని సృష్టించింది. 29 శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సానుకూలత వ్యక్తం చేశారని ఆయా సంఘాల నాయకులు చేసిన ప్రకటనపై విమర్శలు వచ్చినా.. ఆయా వర్గాల్లోటీఆర్ఎస్పై ఉన్న వ్యతిరేకత కొంతమేర తగ్గడానికి ఉపయోగపడింది. ఇదిలా ఉంటే రెండు పట్టభద్రుల స్థానాల్లోనూ భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేయడం ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల చీలికకు దారితీసింది. ‘హైదరాబాద్’లో 93, ‘నల్లగొండ’లో 71 మంది పోటీ చేయగా, రెండు చోట్లా ఎనిమిదేసి మందికి పైగా అభ్యర్థులు భారీగా ప్రథమ ప్రాధాన్యత ఓట్లు సాధించడం టీఆర్ఎస్ ఆధిక్యానికి బాటలు వేసింది. ఈ ఆధిక్యానికి ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు తోడు కావడంతో టీఆర్ఎస్ గెలుపు సునాయాసమైంది. మరోవైపు బీజేపీ లక్ష్యంగా టీఆర్ఎస్ అటు క్షేత్రస్థాయి ప్రచారంలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ అత్యంత దూకుడును ప్రదర్శించింది. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం, గ్యాస్, డీజిల్, పెట్రో ధరల పెంపు వంటి అంశాలను ప్రస్తావించడంతో పాటు, ఉద్యోగులు, విద్యార్థులతో తమది పేగు బంధమనే సెంటిమెంటును కూడా లేవనెత్తింది. ] చదవండి: టీఆర్ఎస్కే పట్టం.. రెండు స్థానాలు 'గులాబీ'కే ఇకపై ఎన్నికల్లో పోటీ చేయను: చిన్నారెడ్డి -
ఇకపై ఎన్నికల్లో పోటీ చేయను: చిన్నారెడ్డి
సాక్షి, మీర్పేట: డబ్బులు పంచకపోవడం వల్లే తనకు ఓట్లు వేయలేదని, ఇకపై తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిన్నారెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఓట్ల లెక్కింపు జరుగుతున్న సరూర్నగర్ ఇండోర్ స్టేడియం వెలుపల ఆయన విలేకరులతో మాట్లాడారు. డబ్బులు లేకపోతే ఎవరూ ఎన్నికల్లో పోటీ చేయొద్దని సూచించారు. పట్టభద్రులు కూడా అధికార టీఆర్ఎస్కు ఓట్లు అమ్ముకోవడం తనకు బాధ కలిగిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని యువత ఎంతో ఆశపడ్డారని, ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాలను కూడా ప్రభుత్వం భర్తీ చేయలేకపోయిందని విమర్శించారు. నిరుద్యోగ భృతి ఇస్తామని 26 నెలలైనా నయా పైసా ఇవ్వలేదని, అయినా యువత వీటన్నింటిని మరిచి రూ.వెయ్యి, రెండు వేలకు ఆశపడి టీఆర్ఎస్కు ఓటు వేయడం బాధ కలిగించిందన్నారు. టీఆర్ఎస్ పార్టీ డబ్బు, మద్యంతో ప్రభావితం చేసి ఓటు వేయించుకుంటుందని, ఈ సంస్కృతి పోవాలన్నారు. -
రేయింబవళ్లు... 4 రోజులు
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్కు ఈసారి ఏకంగా నాలుగు రోజుల సమయం పట్టింది. ఈనెల 17వ తేదీన ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ రేయింబవళ్లు కొనసాగి 20వ తేదీ అర్ధరాత్రికి ముగిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా నాలుగు రోజుల పాటు లెక్కింపు ప్రక్రియ జరిగేందుకు చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈసారి ఎన్నికల బరిలో రెండు నియోజకవర్గాల్లో నూ ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉండడం, పోలింగ్ కూడా ఊహించిన దాని కన్నా ఎక్కువ కావడం, జంబో బ్యాలెట్లతో అధికారులు కుస్తీ పట్టాల్సి రావడం, ఓట్లను బండిల్స్ చేసేందుకు ఎక్కువ సమయం తీసుకోవడం, తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేషన్ ప్రక్రియ క్లిష్టతరం కావడంతో చాలా సమయం తీసుకుందని ఎన్నికల వర్గాలంటున్నాయి. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ మూడున్నర లక్షలకుపైగా జంబో బ్యాలెట్లను ప్రథమ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో, ఆపై రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో దాదాపు లక్షన్నర బ్యాలెట్లను పరిగణనలోకి తీసుకోవాల్సి రావడం కత్తిమీద సాములానే మారింది. మొత్తంమీద దాదాపు 90 గంటలు జరిగిన ఈ ప్రక్రియ పెద్దగా సమస్యలు రాకుండానే ముగియడంతో ఎన్నికల యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. బండిల్స్ నుంచి ఎలిమినేషన్ వరకు నల్లగొండలోని వేర్హౌసింగ్ గోదాములో నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి, హైదరాబాద్లోని సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్నగర్ స్థానానికి కౌంటింగ్ జరిగింది. ఈనెల 17న ఉదయం 8 గంటలకు బ్యాలెట్ బాక్సులను పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో తెరచి వాటిని కుప్పలుగా పోసి 25 ఓట్ల చొప్పున బండిల్స్ కట్టే ప్రక్రియ ప్రారంభమైంది. అయితే, ఈసారి నల్లగొండ స్థానంలో 3,88,011 (76 శాతం) ఓట్లు, రంగారెడ్డిలో 3,57,354 (65శాతం) ఓట్లు పోలయ్యాయి. వీటన్నింటినీ 25 ఓట్ల చొప్పున కట్టలు కట్టేందుకు 12 గంటలకు పైగా సమయం పట్టింది. దీంతో మొదటి ప్రాధాన్యత ఓట్ల తొలిరౌండ్ లెక్కింపు 17న రాత్రి సమయంలో ప్రారంభమైంది. ఒక్కో రౌండ్లో 56 వేల ఓట్లు లెక్కించాల్సి రావడంతో తొలిరౌండ్ ఫలితం వచ్చేసరికే అర్ధరాత్రి దాటింది. హైదరాబాద్ స్థానంలో అయితే తెల్లవారుజామున గానీ తొలిరౌండ్ ఫలితం రాలేదు. అలా ఏడురౌండ్ల కౌంటింగ్కు రెండు రోజులకు పైగా సమయం పట్టింది. ఈనెల 19న ఉదయానికి గానీ తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి కాలేదు. ఆ తర్వాత కొంత విరామం తీసుకున్న ఎన్నికల యంత్రాంగం 19వ తేదీ మధ్యాహ్నానికి ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభించింది. ఒక్కొక్కరినీ తీసేస్తూ.. ఒక్కో ఓటు కలుపుతూ.. ఇక రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపునకు కూడా చాలా సమయం తీసుకుంది. ఈసారి నల్లగొండ స్థానం నుంచి 71 మంది, హైదరాబాద్ నుంచి 93 మంది బరిలో ఉండటంతో వారిలో అత్యంత తక్కువ ఓట్లు దక్కించుకున్న వారిని ఆరోహణ క్రమంలో ఒక్కొక్కరినీ ఎలిమినేట్ చేస్తూ.. వారి బ్యాలెట్లలోని ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను మిగిలిన వారిని కలుపుతూ పోయారు. అభ్యర్థు లు ఎలిమినేట్ అయ్యే కొద్దీ ఎక్కువ ఓట్లు లెక్కపెట్టాల్సి వచ్చింది. అలా తొలి ఐదు స్థానాల్లో ఉన్న అభ్యర్థులను తేల్చేందుకు శనివారం ఉదయం అయింది. ఆ తర్వాత ఒక్కొక్కరిని తీసివేస్తూ వారి ఓట్లను కూడా లెక్కించి ఇతరులకు కలిపే ప్రక్రియ ప్రారంభించిన అధికారులు అతికష్టం మీద శనివారం రాత్రికి లెక్కింపు ప్రక్రియను పూర్తి చేశారు. 4 రోజులు జరిగిన ఈ కౌంటింగ్ ప్రక్రియ కోసం ఎన్నికల యంత్రాంగం పకడ్బందీ ఏర్పా ట్లు చేసింది. 8 హాళ్లు, ఏడు టేబుళ్లలో, టేబుల్కు వెయ్యి ఓట్ల చొప్పున రౌండ్కు 56 వేల ఓట్లు లెక్కించారు. కౌంటింగ్ నిరంతరాయంగా జరగాల్సి రావడంతో అ«ధికారులు తమ సిబ్బందికి షిఫ్టుల వారీగా డ్యూటీలు వేశారు. కౌంటింగ్లో ఇబ్బందుల్లేకుండా ఎన్నికల యంత్రాంగం జాగ్రత్తలు తీసుకోగా, కౌంటింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుం డా పోలీసుశాఖ భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. -
వాణీదేవిదే విజయం
సాక్షి, హైదరాబాద్: నువ్వా నేనా అన్నట్టు సాగిన ‘మహబూబ్నగర్–రంగారెడ్డి–హైదరాబాద్’గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ పోరులో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె, టీఆర్ఎస్ అభ్యర్థి ఎస్.వాణీదేవి విజయం సాధించారు. ఆమె ఎన్నికలకు కొత్త అయినప్పటికీ.. బీజేపీ అభ్యర్థి ఎన్.రాంచంద్రరావు, ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రొఫెసర్ కె.నాగేశ్వర్లతో పోటీపడి పైచేయి సాధించారు. ఈ ఎన్నికలో ప్రథమ ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ విజయానికి అవసరమైన ‘కోటా’ఓట్లు రాలేదు. రెండో ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కించగా.. మొత్తం 1,89,339 ఓట్లు వాణీదేవికి లభించాయి. మొదటి ప్రాధాన్యత ఓటును రాంచంద్రరావుకు వేసిన వారిలో 23 వేల మందికిపైగా రెండో ప్రాధాన్యతగా వాణీదేవికి వేశారు. సుదీర్ఘ లెక్కింపు తర్వాత.. 17వ తేదీన ఉదయమే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలై సుదీర్ఘంగా సాగింది. శనివారం రాత్రి ఫలితం ప్రకటించారు. నాలుగు రోజుల పాటు అటు రాజకీయ నేతలు, విశ్లేషకులతోపాటు సాధారణ ప్రజల్లో సైతం ఇది ఉత్కంఠ రేకెత్తించింది. తక్కువ ఓట్లు వచ్చిన వారందరినీ ఒక్కొక్కరిగా ఎలిమినేట్ చేస్తూ రాగా.. ప్రధాన ప్రత్యర్థి రామచంద్రరావు ఎలిమినేషన్ సమయానికి వాణీదేవికి కోటాకు మించి ఓట్లు లభించాయి. అయితే ద్వితీయ ప్రాధాన్యత ఓట్లతో ఇతర అభ్యర్థులు ముందుకు దూసుకెళతారేమో అన్న అభిప్రాయం తొలుత వ్యక్తమైనా.. వాణీదేవి ముందుకు దూసుకెళ్లారు. ప్రథమ ప్రాధాన్యతతో 1,12,689 ఓట్లు పొందిన ఆమె.. రెండో ప్రాధాన్యతగా 76,650 ఓట్లు పొందారు. మొదటి నుంచీ టీఆర్ఎస్ ఆధిక్యత ప్రధమ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచి చివరి వరకు అధికార టీఆర్ఎస్ ఆధిక్యత ప్రదర్శించింది. ఏడు రౌండ్లలో ప్రతి రౌండ్ ఓట్లలో 34 నుంచి 35 శాతం వరకు ఓట్లు వాణీదేవి ఖాతాలో పడ్డాయి. బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావు ప్రతి రౌండ్లో 30 నుంచి 32 శాతం ఓట్లతో గట్టి పోటీ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి 7 నుంచి 9 శాతం, టీడీపీ అభ్యర్థి ఎల్.రమణ ఒకటి నుంచి రెండు శాతం ఓట్లకు పరిమితమయ్యారు. స్వతంత్ర అభ్యర్థి ఫ్రొఫెసర్ నాగేశ్వర్రావుకు మాత్రం ప్రతి రౌండ్లో 14 నుంచి 16 శాతం వరకు ఓట్లు వచ్చాయి. రికార్డు ఎన్నిక ఇది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇంత భారీగా 93 మంది పోటీ చేయడం, 67 శాతం పోలింగ్ జరగడం ఇదే తొలిసారి. ప్రథమ ప్రాధాన్యతలో తక్కువ ఓట్లు వచ్చినవారిని ఒక్కొక్కరిగా ఎలిమినేట్ చేస్తూ, రెండో ప్రాధాన్యత ఓట్లను కేటాయిస్తూ.. ఏకంగా 92 మందిని ఎలిమినేట్ చేసిన రికార్డు కూడా ఈ ఎన్నికదే. ►మొత్తం 93 మంది అభ్యర్థుల్లో 84 మందికి కనీసం వెయ్యి ఓట్లు కూడా రాలేదు. ►ఒక అభ్యర్థికి కేవలం 8 ఓట్లు మాత్రమే వచ్చాయి ►రెండంకెల ఓట్లు మాత్రమే వచ్చిన వారు 51 మంది, మూడంకెల ఓట్లు దక్కినవారు 32 మంది ►ప్రధాన పోటీదారులు నలుగురు కాకుండా.. 5 వేల కంటే ఎక్కువ ఓట్లు వచ్చినవారు ముగ్గురున్నారు. పట్టభద్ర ఓటర్లకు ధన్యవాదాలు: సీఎం కేసీఆర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలుగా టీఆర్ఎస్ అభ్యర్థులు వాణీదేవి, పల్లా రాజేశ్వర్రెడ్డిలను గెలిపించిన పట్టభద్రులకు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. వారి గెలుపు కోసం క్షేత్రస్థాయిలో పనిచేసిన టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను అభినందించారు. అలాగే వాణీదేవి, రాజేశ్వర్రెడ్డికి సీఎం అభినందనలు తెలిపారు. వాణీదేవి శనివారం సాయంత్రం ప్రగతిభవన్కు వెళ్లి సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనకు అవకాశమిచ్చి, గెలుపు కోసం కృషి చేసిన సీఎంకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా వాణీదేవిని అభినందించి, శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీలు కె.కేశవరావు, సంతోష్ కుమార్, బడుగుల లింగ య్య యాదవ్, మంత్రులు హరీశ్ రావు, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, వి.శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, శేరి సుభాష్ రెడ్డి, శంభీపూర్ రాజు, నవీన్రావు, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, కేపీ వివేకానంద, అబ్రహం, కృష్ణమోహన్ రెడ్డి, మెతుకు ఆనంద్, రాజేందర్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి పాల్గొన్నారు. -
చట్టసభలకు రాకుండా అడ్డుకున్నారు: తీన్మార్ మల్లన్న
సాక్షి, నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు గెలిచారని స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. శనివారం రాత్రి కౌంటింగ్ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. దొంగ ఓట్లు, నోట్ల కట్టలతో తనను చట్టసభలకు రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. జాతీయ, రాష్ట్ర పార్టీలను కాదని సామాన్యుడినైన తనను పట్టభద్రులు భుజాలపై ఎక్కించుకుని మోశారని తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా నల్లగొండ కౌంటింగ్ వైపే చూశారన్నారు. ప్రగతిభవన్ గోడలు బద్దలుకొట్టే రోజులు వస్తాయని, సీఎం కుర్చీపై సామాన్యుడిని కూర్చోబెట్టే వరకు తన ఉద్యమం ఆగదని మల్లన్న స్పష్టంచేశారు. డబ్బున్న వాళ్లు మాత్రమే రాజకీయాలు చేయాలనే దానికి ఎన్నికలు సమాధి కట్టాయని, అధికారపక్షం తలదించుకునేలా ప్రజలు తీర్పునిచ్చారన్నారు. ప్రజలు తనను డిస్టింక్షన్లో గెలిపించాలని చూశారు కానీ పల్లా రాజేశ్వర్రెడ్డి నకిలీ ఓట్లతో గెలిచారని ఆరోపించారు. ఈ సందర్భంగా పల్లాకు శుభాకాంక్షలు తెలిపారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement