-
ఈ మార్పులపై ఓ లుక్కేయండి!
ఆదాయపన్ను పరంగా ఏప్రిల్ 1 నుంచి కొన్ని కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. కొన్ని పన్ను మిహాయింపులు తొలగిపోగా.. కొన్ని సాధనాలకు సంబంధించి పెట్టుబడి పరిమితుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. గతంతో పోలిస్తే ఆదాయపన్ను కొత్త విధానం మరింత ఆకర్షణీయంగా మారింది. ప్రధానంగా పన్నుల వ్యవస్థను మరింత సరళీకృతం చేయడం, పారదర్శకతను పెంచే లక్ష్యాలతో కేంద్ర సర్కారు ఎప్పటికప్పుడు కొత్త ప్రతిపాదనలు, సవరణలు తీసుకొస్తోంది. కనుక ఆదాయపన్ను పరిధిలోని ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన మార్పులను వివరించే కథనమిది... నూతన పన్ను విధానం... నూతన పన్ను విధానం ఎంపిక చేసుకునే వారికి వార్షిక ఆదాయం రూ.7 లక్షల వరకు ఉంటే రూపాయి పన్ను చెల్లించే పని లేకుండా పన్ను రాయితీని ప్రభుత్వం కల్పించింది. సెక్షన్ 87ఏ కింద గరిష్టంగా రూ.25,000 రాయితీని ప్రకటించింది. అంటే నికరంగా రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి పన్ను భారం ఉండదు. తక్కువ ఆదాయం కలిగిన వారికి ఉపశమనం కల్పించడమే ఈ రాయితీ ఉద్దేశ్యమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2022–23 ఆర్థి క సంవత్సరం నుంచే ఈ రాయితీ అమల్లోకి వచ్చింది. ఈ రాయితీ వల్ల ఎక్కువ మందికి ప్రయోజనం లభించనుంది. ఒకవేళ ఆదాయం రూ.7లక్షలకు పైన స్వల్పంగా ఉన్నప్పుడు భారీగా పన్ను చెల్లించాల్సి వస్తోంది. దీన్ని అర్థం చేసుకున్న కేంద్ర సర్కారు ఆర్థిక బిల్లు 2023లో కొన్ని సవరణలు చేసింది. ఉదాహరణకు రూ.7 లక్షలకు పైన మరో రూ.5 వేల ఆదాయం ఉంటే అప్పుడు నిబంధనల కింద రూ.26,500 పన్ను (సెస్సులతో) చెల్లించాల్సి ఉంది. దీని స్థానంలో.. రూ.7లక్షలకు పైన అదనంగా ఉన్న రూ.5వేలపైనే పన్ను చెల్లిస్తే సరిపోతుంది. అలాగే, నూతన పన్ను విధానంలోనూ రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం కల్పించారు. దీంతో నికరంగా రూ.7.50 లక్షల వరకు పన్ను భారం పడదు. నూతన పన్ను విధానం కింద పన్ను రేట్లలోనూ మార్పులు చేశారు. 60 ఏళ్లలోపు వారికి రూ.3 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండదు. రూ.3–6 లక్షల ఆదాయంపై 5 శాతం పన్ను, రూ.6–9 లక్షల ఆదాయంపై 10 శాతం పన్ను పడుతుంది. రూ.9–12 లక్షల ఆదాయంపై 15 శాతం, రూ.12–15 లక్షల ఆదాయంపై 20 శాతం, రూ.15 లక్షల ఆదాయంపై 30 శాతం పన్ను రేటు వర్తిస్తుంది. బీమాపైనా పన్ను జీవిత బీమా పాలసీలకు చెల్లించే ప్రీమియంపైనే కాదు, గడువు తీరిన తర్వాత అందుకునే మొత్తంపైనా పన్ను ఉండదనేది అందరికీ తెలిసిన విషయం. కానీ, 2023 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన మార్పుల ప్రకారం.. జీవిత బీమా పాలసీలకు చెల్లించే వార్షిక ప్రీమియం రూ.5 లక్షలకు మించి ఉంటే.. పాలసీదారు జీవించి ఉన్న సందర్భాల్లో గడువు తీరిన తర్వాత అందుకునే మొత్తం పన్ను పరిధిలోకి వస్తుంది. అంటే అధిక ప్రీమియం పాలసీల మెచ్యూరిటీపై ఇప్పటి వరకు ఉన్న సున్నా పన్ను ప్రయోజనాన్ని సర్కారు తొలగించింది. వార్షిక ప్రీమియం రూ.5 లక్షల వరకు ఉండే పాలసీల మెచ్యూరిటీపై ఇక ముందూ పన్ను మినహాయింపు ప్రయోజనం కొనసాగుతుంది. అలాగే, 2023 మార్చి 31వరకు కొనుగోలు చేసిన జీవిత బీమా పాలసీలకు సంబంధించి వార్షిక ప్రీమియం రూ.5 లక్షలకు మించి ఉన్నా, చివర్లో అందుకునే మొత్తంపై పన్ను ఉండదు. అలాగే, పాలసీదారు మరణించిన సందర్భంలో చెల్లించే పరిహారంపైనా పన్ను ఉండదు. యులిప్ ప్లాన్ల ప్రీమియం ఎంత ఉన్నా కానీ, పన్ను పరిధిలోకి రావు. డెట్ ఫండ్స్పై కూడా... డెట్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులను మూడేళ్లపాటు కొనసాగించినప్పుడు వచ్చిన లాభం దీర్ఘకాల మూలధన లాభం కిందకు వస్తుంది. వచ్చిన లాభం నుంచి పెట్టుబడి పెట్టిన కాలంలో సగటు ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించి, మిగిలిన లాభంపైనే 20 శాతం పన్ను చెల్లిస్తే సరిపోయేది. ఇది గతంలో ఉన్న విధానం. కానీ, ఈ ప్రయోజనాన్ని తొలగించారు. 2023 ఏప్రిల్ 1 నుంచి డెట్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడుల కాల వ్యవధి ఎంతైనా కానీయండి, వచ్చే లాభం మొత్తం వార్షిక ఆదాయానికి కలుస్తుంది. ఏ శ్లాబు రేటు పరిధిలో ఉంటే, ఆ మేరకు పన్ను చెల్లించాల్సి వస్తుంది. అంటే ప్రస్తుతం డెట్ ఫండ్స్లో అమల్లో ఉన్న స్వల్పకాల మూలధన లాభాల పన్ను విధానమే ఇక మీదట అన్ని రకాల డెట్ ఫండ్స్ లాభాలకు అమలవుతుంది. మొత్తానికి డెట్ ఫండ్స్లో పెట్టుబడులకు దీర్ఘకాల మూలధన లాభాల పన్ను ప్రయోజనాన్ని తొలగించారు. తద్వారా డెట్ ఫండ్స్లో దీర్ఘకాల పెట్టుబడులను నిరుత్సాహపరిచినట్టయింది. దీంతో దీర్ఘకాల పెట్టుబడులు జీవిత బీమా, ఈక్విటీ సాధనాల వైపు వెళతాయన్నది నిపుణుల అంచనాగా ఉంది. 2023 ఏప్రిల్ 1 నుంచి చేసే తాజా డెట్ పెట్టుబడులకు నూతన పన్ను విధానం అమలవుతుంది. 2023 మార్చి 31 వరకు చేసిన పెట్టుబడులకు కొత్త నిబంధన వర్తించదు. రిటర్నుల దాఖలు ఆదాయపన్ను రిటర్నులను దాఖలు చేసే వారు తప్పకుండా గమనించాల్సిన మార్పు ఒకటి ఉంది. పాత, కొత్త పన్ను విధానాలు ఉన్నప్పటికీ, నూతన పన్ను విధానమే డిఫాల్ట్గా కనిపిస్తుంది. పాత పన్ను విధానంలోనే కొనసాగాలని అనుకునేవారు రిటర్నులు దాఖలు చేసే ముందే దానిని ప్రత్యేకంగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. నూతన పన్ను విధానంలో పన్ను రేట్లు తక్కువ. కానీ, చాలా వరకు పన్ను మినహాయింపులు, పన్ను తగ్గింపు ప్రయోజనాల్లేవు. అన్ని రకాల మినహాయింపు ప్రయోజనాలను ఉపయోగించుకునే వారికి పాత విధానం అనుకూలం. కనుక ఎవరికి వారు తమ వార్షిక ఆదాయం, పెట్టుబడుల ఆధారంగా ఏ పన్ను విధానం అనుకూలం అనేది ఎంపిక చేసుకోవాలి. ఈ విషయంలో స్పష్టత రాకపోతే పన్ను నిపుణుల సాయం తీసుకోవాలి. ఎస్సీఎస్ఎస్ పదవీ విరమణ పొందిన వారికి క్రమం తప్పకుండా ఆదాయం తెచ్చి పెట్టే పెట్టుబడి పథకాల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) ఒకటి. ఈ పథకంలో పెట్టుబడిపై ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ ఆదాయం చెల్లిస్తారు. 60 ఏళ్లు నిండిన వ్యక్తులు ఎవరైనా ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు అయితే 55–60 ఏళ్ల మధ్యలో ఉన్నా పెట్టుబడికి అర్హులు. ఈ పథకంలో ఒక్కరు గరిష్టంగా రూ.15 లక్షల వరకే ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనుమతి ఉండగా, ఏప్రిల్ 1 నుంచి దీన్ని రూ.30 లక్షలకు పెంచారు. నగదు ఉపసంహరణలపై టీడీఎస్ బ్యాంకు ఖాతా నుంచి భారీగా నగదు ఉపసంహరణలను నిరుత్సాహ పరిచేందుకు గాను కేంద్ర సర్కారు మూలం వద్ద పన్ను మినహాయింపు (టీడీఎస్ను) ప్రవేశపెట్టింది. ఒక ఆర్థి క సంవత్సరంలో ఒక బ్యాంక్ ఖాతా నుంచి నగదు ఉపసంహరణలు రూ.కోటి మించితే టీడీఎస్ కింద బ్యాంకులు 2 శాతాన్ని మినహాయిస్తాయి. వ్యక్తులు, వ్యాపార సంస్థలకూ ఇది అమలవుతుంది. ఎల్టీఏ ప్రభుత్వ ఉద్యోగులు కాని వారు సెలవులను నగదుగా మార్చుకునే మొత్తంపై పన్ను ప్రయోజనానికి పరిమితి ఉంది. 2002 నుంచి ఈ పరిమితి రూ.3 లక్షలుగా ఉంటే, దాన్ని రూ.25 లక్షలకు పెంచారు. అంటే సెలవులను నగదుగా మార్చుకునే మొత్తం రూ.25 లక్షలు ఉన్నా కానీ పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం పోస్టాఫీసు మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (పీవో ఎంఐఎస్) కూడా నెలవారీ ఆదాయం కోరుకునే వారికి ఉద్దేశించిన పథకం. ఈ పథకంలోనూ ఒక్కరు గరిష్టంగా రూ.4.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టుకునేందుకు అనుమతి ఉంటే, దీన్ని రూ.9 లక్షలకు పెంచారు. జాయింట్ అకౌంట్ కింద రూ.9 లక్షల పరిమితిని రూ.15 లక్షలు చేశారు. హెచ్ఎన్ఐలపై పన్ను భారం బడ్జెట్లో అధిక సంపద కలిగిన వ్యక్తులకు సర్చార్జీ భారాన్ని తగ్గించారు. వార్షికాదాయం రూ.5 కోట్లకు పైన ఉన్న వారికి సర్చార్జీ 37 శాతం నుంచి 25 శాతానికి దిగొచ్చింది. కాకపోతే నూతన పన్ను విధానాన్ని ఎంపిక చేసుకునే వారికే దీన్ని పరిమితం చేశారు. ఎన్పీఎస్ నుంచి వైదొలగాలంటే.. ఏప్రిల్ 1 నుంచి ఎన్పీఎస్ పథకం నుంచి వైదొలిగే లేదా యాన్యుటీ ఎంపిక చేసుకునే వారికి కేవైసీ డాక్యుమెంట్లు అప్లోడ్ చేయడం తప్పనిసరి చేశారు. పథకం నుంచి వైదొలిగిన సభ్యులకు వేగంగా యాన్యుటీ చెల్లింపుల చేసేందుకే ఈ ఆదేశాలు అమల్లోకి తెచ్చారు. ఎన్పీఎస్ ఎగ్జిట్ లేదా విత్ డ్రాయల్ ఫారమ్, గుర్తింపు, చిరునామా ధ్రువీకరణ, బ్యాంక్ అకౌంట్ రుజువు, ప్రాన్ (పెన్షన్ అకౌంట్) కార్డ్ కాపీని సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ సిస్టమ్లోకి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అనారోగ్యం, వైకల్యం తదితర సందర్భాల్లో ఎన్పీఎస్ నుంచి 25 శాతం ఉపసంహరణకు అనుమతి ఉంది. ఆ సందర్భాల్లోనూ వీటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ–గోల్డ్ భౌతిక బంగారాన్ని ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీప్ట్ (ఈజీఆర్) రూపంలోకి మార్చుకుంటే ఎలాంటి మూలధన లాభాల పన్ను పడదు. ఆన్లైన్ గేమింగ్ ఆన్లైన్ గేమింగ్ ద్వారా గెలుచుకునే మొత్తంపై 30 శాతం టీడీఎస్ అమలు కానుంది. ఈపీఎఫ్ ఉపసంహరణపై టీడీఎస్ ఈపీఎఫ్ ఖాతాకు పాన్ లింక్ చేయకపోతే.. సభ్యులు ఉపసంహరించుకునే మొత్తంపై 20 శాతం టీడీఎస్ అమలు చేస్తారు. ఇంటి మూలధన లాభంలో మార్పులు ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 54, 54 ఎఫ్ కింద ఒక ఇంటిని విక్రయించగా వచ్చే మొత్తాన్ని తిరిగి ఇన్వెస్ట్ చేయడం ద్వారా పన్ను లేకుండా చూసుకోవచ్చు. ఈ సెక్షన్ల కింద తిరిగి పెట్టుబడి పెట్టే మూలధన లాభాలను రూ.10 కోట్లకు పరిమితం చేశారు. అంటే ఇంతకు మించి మూలధన లాభం ఉంటే దానిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ మహిళలకు 2023 బడ్జెట్లో కొత్తగా ప్రకటించిన పథకం ఇది. 2025 మార్చి వరకు ఈ పథకం ఉంటుంది. ఒక్కరు రూ.2 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పెట్టుబడిపై 7.5% వడ్డీ రేటు చెల్లిస్తారు. గరిష్టంగా రెండేళ్లు డిపాజిట్ చేసుకోవచ్చు. బంగారం విక్రయం ఇలా.. హాల్ మార్క్ ఆభరణాలు, బంగారం వస్తువులను ఏప్రిల్ 1 నుంచి 6 నంబర్ల ఆల్ఫాన్యూమరిక్ హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (హెచ్యూఐడీ)తోనే విక్రయించాల్సి ఉంటుంది. హాల్ మార్క్ జ్యుయలరీ పట్ల వినియోగదారుల్లో విశ్వాసాన్ని ఇది పెంచనుంది. హెచ్యూఐడీ లేకుండా విక్రయించడాన్ని బీఐఎస్ నిషేధించింది. -
వైవిధ్యమే పెట్టుబడులకు రక్ష
రిటైల్ ఇన్వెస్టర్లలో చాలా మందికి పరుగెత్తే కుందేలు అంటేనే ఇష్టం. తాబేలు వైపు చూసేది చాలా కొద్ది మందే. కానీ, అడవి అన్న తర్వాత అన్ని జంతువులకూ నీడనిచ్చిన మాదిరే.. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్లోనూ ఒకటికి మించిన సాధనాలకు చోటు కల్పించాలి. ఇక్కడ కుందేలు అంటే ఈక్విటీ మార్కెట్. తాబేలు అంటే డెట్, గోల్డ్ అని చెప్పుకోవచ్చు. దీర్ఘకాలంలో ఈక్విటీలలో వచ్చినంత రాబడి మరే సాధనంలోనూ ఉంటుందని చెప్పలేం. కానీ, అన్ని కాలాలకూ, పెట్టుబడులు అన్నింటికీ ఈక్విటీ ఒక్కటే వేదిక కాకూడదు. ఏదైనా సంక్షోభం ఎదురైతే.. వేరే సాధనంలోని పెట్టుబడులు కొంత రక్షణనిస్తాయి. ఇన్వెస్టర్లు తమ రిస్క్ సామర్థ్యం ఆధారంగా ఈక్విటీతోపాటు ఇతర సాధనాల మధ్య కూడా కొంత పెట్టుబడులను వైవిధ్యంగా చేసుకోవాలి. అప్పుడే పెట్టుబడుల ప్రయాణం సాఫీగా సాగుతుంది. ఈ వివరాలన్నీ తెలియజేసే కథనమిది... ఈక్విటీ, డెట్ మార్కెట్లలో గతేడాది నుంచి అస్థిరతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ఏడాది దాటిపోయింది. అన్ని దేశాలూ ద్రవ్యోల్బణ రిస్క్ను ఎదుర్కొంటున్నాయి. కంపెనీల మార్జిన్లపై దీని ప్రభావం గణనీయంగానే ఉంది. ద్రవ్యోల్బణాన్ని కిందకు దించేందుకు సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపు ఆయుధాన్ని నమ్ముకున్నాయి. మన దగ్గరా గతేడాది మే నుంచి రెపో రేటు 2.5 శాతం పెరిగింది. అమెరికా, యూరప్ మాంద్యం ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఐటీ రంగంలో ఉద్యోగాలకు కోతలు పడుతున్నాయి. ఒకవైపు ఈక్విటీ, డెట్ మార్కెట్లు ఆటుపోట్లు చూస్తుంటే.. మరోవైపు బంగారం, వెండి గడిచిన ఏడాది కాలంలో మంచి ర్యాలీని చూశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లకు మెరుగైన పెట్టుబడుల విధానమే అస్సెట్ అలోకేషన్. అంటే ఒకే విభాగం కాకుండా, ఒకటికి మించిన సాధనాల మధ్య పెట్టుబడులను వర్గీకరించుకోవడం. ఒక్కో విభాగం ఒక్కో రీతిలో పనితీరు చూపిస్తుంటుంది. కనుక అస్సెట్ అలోకేషన్తో దీర్ఘకాలంలో మంచి ప్రతిఫలాన్ని చూడొచ్చు. అంతేకాదు పోర్ట్ఫోలియో రిస్క్ను (ఒక్క బాక్సులోనే అన్ని గుడ్లు పెట్టడం)ను తగ్గించుకోవచ్చు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్)కూడా పెట్టుబడుల వైవిధ్యానికి అందుబాటులో ఉన్న సాధనాలు. గత పదిహేనేళ్ల కాలంలో వివిధ సాధనాలు ఎలా పనిచేశాయి? వైవిధ్యం ఏ విధంగా నష్టాలను పరిమితం చేసి, మెరుగైన రాబడులు ఇచ్చిందన్నది అర్థం చేసుకోవాలంటే కొన్ని గణాంకాలను విశ్లేషించుకోవాల్సిందే. పనితీరు ఇలా.. 2006 నుంచి 2022 వరకు డేటాను పరిశీలిస్తే.. ఈక్విటీ, డెట్, గోల్డ్, వెండి ఎలా ర్యాలీ చేసిందీ తెలుస్తుంది. 2006లో ఈక్విటీ 41.9 శాతం, 2007లో 56.8 శాతం చొప్పున ర్యాలీ చేసింది. డెట్ ఆ రెండు సంవత్సరాల్లో ఒకే అంకె రాబడులను ఇచ్చింది. బంగారం స్వల్పంగా లాభాలను ఇచ్చింది. అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం ప్రభావంతో 2008లో ఈక్విటీ మార్కెట్ 51 శాతం పడిపోయింది. కానీ, బంగారం అదే ఏడాది 26.1 శాతం ర్యాలీ చేసింది. 2011లో యూరోజోన్ సంక్షోభం తలెత్తింది. దీంతో ఈక్విటీ మార్కెట్ 23.8 శాతం పడిపోయింది. కానీ, బంగారం 31.7 శాతం రాబడులను ఇచ్చింది. డెట్లో రాబడి 8 శాతంగా ఉంది. అంతెందుకు కరోనా సంవత్సరం 2020లోనూ ఈక్విటీ మార్కెట్ 50 శాతం వరకు పడిపోగా, అంతే వేగంగా రివకరీ అయి, ఆ ఏడాది నికరంగా 16%రాబడినిచ్చింది. అదే ఏడాది బంగారం 28% రాబడులను ఇచ్చింది. 2021లో బంగారం నికరంగా నష్టాలను మిగల్చితే.. ఈక్విటీలు రాబడులు మెరుగ్గా ఉన్నాయి. ఇక్కడి గణాంకాలను పరిశీలిస్తే, అన్ని సాధనాలు ఒకే తీరులో కాకుండా.. భిన్న సమయాల్లో భిన్నమార్గంలో చలిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. అందుకనే పోర్ట్ఫోలియోలో వీటన్నింటికీ చోటు ఇవ్వాలని చెప్పేది. ఇక్కడ బంగారం రాబడికి ఎంసీఎక్స్, బాండ్ల పనితీరునకు క్రిసిల్ షార్ట్ టర్మ్ ఇండెక్స్ గణాంకాలను పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. పెట్టుబడుల మిశ్రమం వైవిధ్యం కోసం ఈక్విటీలకు తోడుగా ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల (డెట్) వరకే పరిమితం కాకూడదు. ఈక్విటీ, డెట్కు తోడు బంగారం కూడా జోడించుకోవడం మెరుగైన విధానమని చెప్పుకోవచ్చు. కేవలం ఈక్విటీ, డెట్తో కూడిన పోర్ట్ఫోలియోతో పోలిస్తే, ఈక్విటీ, డెట్, గోల్డ్తో కూడిన పోర్ట్ఫోలియోలోనే మెరుగైన రాబడులు ఉన్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2002 నుంచి 2022 వరకు ఈ సాధనాల్లో మూడేళ్ల రోలింగ్ రాబడులను గమనించినట్టయితే.. 65:35 నిష్పత్తిలో ఈక్విటీ, డెట్ పోర్ట్ఫోలియో 67.2 శాతం సమయంలో 10 శాతానికి పైగా వార్షిక రాబడులను ఇచ్చింది. అదే 65:20:15 నిష్పత్తిలో ఈక్విటీ, డెట్, గోల్డ్ పోర్ట్ఫోలియో మాత్రం 71.7% కాలంలో 10 శాతానికి పైనే రాబడులను ఇచ్చింది. కానీ, గత 20 ఏళ్ల కాలంలో ఈక్విటీ, డెట్ పోర్ట్ఫోలియో వార్షిక రాబడి 14.3 శాతంగా ఉంటే, ఈక్విటీ, డెట్, గోల్డ్తో కూడిన పోర్ట్ఫోలియోలో రాబడి 15.4 శాతం చొప్పున ఉంది. ఈక్వటీ, డెట్కు బంగారాన్ని జోడించుకోవడం వల్ల ఒక శాతం అదనపు రాబడులు కనిపిస్తున్నాయి. మల్టీ అస్సెట్ పోర్ట్ఫోలియో రిస్క్ను అధిగమించి దీర్ఘకాలంలో మెరుగైన రాబడులను ఇచ్చాయి. మిశ్రమ పోర్ట్ఫోలియో వల్ల మూడేళ్లకు మించిన కాలంలో ప్రతికూల రాబడులకూ అవకాశం దాదాపుగా ఉండదు. గత ఐదేళ్లలో మల్టీ అస్సెట్ పథకాలు, అగ్రెస్సివ్ హైబ్రిడ్ లేదా డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ మెరుగైన పనితీరు చూపించాయి. ఎంత చొప్పున.. అస్సెట్ అలోకేషన్ విషయంలో ఏ సాధనానికి ఎంత పెట్టుబడులు కేటాయించాలన్నది ముఖ్యమైన అంశం అవుతుంది. ఇది ఇన్వెస్టర్ రిస్క్ సామర్థ్యం, పెట్టుబడుల కాలం, రాబడుల అంచనాల ఆధారంగా నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అందరికీ ఒక్కటే ప్రామాణిక సూత్రం పనిచేయదు. యుక్త వయసులో ఉన్న వారు ఈక్విటీలకు ఎక్కువ కేటాయింపులు చేసుకోవాలి. వయసు పెరుగుతున్న కొద్దీ ఈక్విటీలకు కేటాయింపులు తగ్గుతూ వెళ్లాలి. అదే సమయంలో డెట్, గోల్డ్కు కేటాయింపులు పెంచుకుంటూ వెళ్లాలి. రిటైర్మెంట్ తర్వాత కూడా కొంత మేర పెట్టుబడులు ఈక్విటీల్లోనే ఉండాలి. అప్పుడే ద్రవ్యోల్బణం నుంచి పెట్టుబడులకు రక్షణతోపాటు, మెరుగైన రాబడులను సొంతం చేసుకోవడానికి వీలుంటుంది. 100 నుంచి ఇన్వెస్టర్ తన వయసును తీసివేయగా, మిగిలేంత ఈక్విటీలకు కేటాయించుకోవచ్చన్నది ఒక సూత్రం. ఉదాహరణకు 30 ఏళ్ల ఇన్వెస్టర్ 70 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈక్విటీలకు తప్పనిసరిగా మెజారిటీ పెట్టుబడులు కేటాయించుకోవడం అవసరం. దీర్ఘకాలంలో (7 ఏళ్లకు మించి) ఈక్విటీలు సగటున రెండంకెల రాబడులను ఇచ్చాయి. ఇక ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలు (డెట్) స్థిరమైన రాబడులకు మార్గం అవుతుంది. వైవిధ్యంతోపాటు, నష్టాలకు అవకాశం ఉండదు. బంగారం అన్నది ద్రవ్యోల్బణానికి హెడ్జింగ్గా అనుకూలిస్తుంది. ఈక్విటీలు ప్రతికూలతలు ఎదుర్కొంటున్న సందర్భాల్లో అండగా నిలిచే సాధనం ఇది. బంగారం కేవలం హెడ్జింగ్ కోసమే కాకుండా, దీర్ఘకాలంలో డెట్కు మించి రాబడులను ఇవ్వగలదని గణాంకాలు చెబుతున్నాయి. 2006 నుంచి 2012 మధ్య కాలంలో రెండంకెల వార్షిక రాబడులను ఇచ్చింది. కానీ, ఆ తర్వాత 2013 నుంచి 2015 వరకు నష్టాలను ఎదుర్కొన్నది. ఇక వెండి అన్నది పారిశ్రామిక కమోడిటీ. ఎలక్ట్రానిక్స్, బ్యాటరీలు, స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్యానెళ్లలో దీని అవసరం ఉంటుంది. ఈ రంగాలు వృద్ధి చెందే కొద్దీ వెండికి డిమాండ్ పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు చూపిస్తున్న దశలో వెండికి డిమాండ్ పెరుగుతుంది. ఒకవేళ వెండిలోనూ ఇన్వెస్ట్ చేయాలనే ఆసక్తి ఉంటే సిల్వర్ ఈటీఎఫ్లకు 5 శాతం లోపు కేటాయింపులను పరిశీలించొచ్చు. బంగారం కోసం సావరీన్ గోల్డ్ బాండ్ ఫండ్స్ను పరిశీలించొచ్చు. భౌతిక బంగారం మెరుగైన పెట్టుబడి సాధనం కాబోదు. నేరుగా ఇన్వెస్ట్ చేసుకునే ఆసక్తి లేకపోయినా లేదా అంత పరిజ్ఞానం లేకపోయినా నిరాశ పడక్కర్లేదు. మార్కెట్లో మెరుగైన మల్టీ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ ఉన్నాయి. ఇన్వెస్టర్లు వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవడాన్ని పరిశీలించొచ్చు. మల్టీ అస్సెట్ పథకాలు చాలా వరకు ఈక్విటీ, డెట్, బంగారానికి 65:20:15 నిష్పత్తిలో పెట్టుబడులు కేటాయిస్తుంటాయి. ఈ విభాగంలో ఐసీఐసీఐ మల్టీ అస్సెట్ అలోకేషన్, హెచ్డీఎఫ్సీ మల్టీ అస్సెట్, ఎస్బీఐ మల్టీ అస్సెట్ తదితర పథకాలు అందుబాటులో ఉన్నాయి. -
ఇంట్లో పెళ్లి కోసం.. తక్కువ రిస్క్తో ఈ మార్గంలో ఇన్వెస్ట్ చేయండి!
నేను నా సోదరి వివాహం కోసం ప్రతి నెలా రూ.45,000 చొప్పున పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఈ మొత్తాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి? ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లేదా డెట్ మ్యూచువల్ ఫండ్స్ లేదా సార్వభౌమ బంగారం బాండ్లలోనా? మన దేశంలో వివాహాలు సాధారణంగా చూస్తే తక్కువ ఖర్చుతో ముగిసేవి కావు. మీరు అనుకుంటున్నట్టు ప్రతి నెలా రూ.45,000 చొప్పున వచ్చే ఆరేళ్ల పాటు ఇన్వెస్ట్ చేసినట్టయితే గణనీయమైన మొత్తమే సమకూరుతుంది. వివాహం లక్ష్యం విషయంలో రాజీపడలేం. అనుకున్న సమయానికి కావాల్సినంత చేతికి అందాల్సిందే. వాయిదా వేయడానికి ఉండదు. తక్కువ రిస్క్ కోరుకునే వారు అయితే మధ్యస్థ మార్గాన్ని అనుసరించాలి. అందుకుని 50 శాతాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల పెట్టుబడికి రిస్క్ ఉండదు. మిగిలిన 50 శాతాన్ని వృద్ధి కోసం ఈక్విటీలకు కేటాయించుకోవాలి. డెట్ విషయంలో షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ లేదా టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్స్ను ఎంపిక చేసుకోవచ్చు. ఈక్విటీ పెట్టుబడులకు లార్జ్క్యాప్ ఫండ్స్ లేదా లో కాస్ట్ ఇండెక్స్ ఫండ్స్ నుంచి ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ ఈ పెట్టుబడి మీ పోర్ట్ఫోలియో పరంగా చూస్తే స్వల్ప మొత్తం అయి, అధిక రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉంటే.. అప్పుడు కాస్త దూకుడుగా పెట్టుబడుల సాధనాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆటుపోట్లను తట్టుకునేట్టు అయితే ఈక్విటీలకు 65 శాతం నుంచి 80 శాతాన్ని కేటాయించుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని డెట్ సాధనాలకు కేటాయించుకోవాలి. బంగారం కోసమే అయితే సార్వభౌమ బంగారం బాండ్లలో (ఎస్జీబీలు) కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బంగారం విలువ పెరుగుదలకు తోడు, పెట్టుబడి విలువపై ఏటా 2.5 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఈ బంగారంతో సోదరి పెళ్లి సమయంలో ఆభరణాలు చేయించొచ్చు. ‘‘ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నిఫ్టీ బ్యాంక్ ఈటీఎఫ్ స్టాక్ స్ప్లిట్నకు గురవుతోంది. రూ.10 ముఖ విలువ నుంచి రూ.1కు తగ్గనుంది. ఇందుకు సంబంధించి రికార్డు తేదీ సెప్టెంబర్ 02, 2022’’ అంటూ నాకు మెస్సేజ్ వచ్చింది. అంటే దీనర్థం ఏంటి? ఒక ఇన్వెస్టర్గా దీనివల్ల నాకు ఏం జరగనుంది? దయచేసి వివరాలు తెలియజేయగలరు. సాధారణంగా ఫండ్ హౌస్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ల్లో లిక్విడిటీ (లభ్యత) పెంపునుకు వీలుగా స్టాక్ స్ప్లిట్ ప్రకటిస్తుంటాయి. దీనివల్ల సదరు ఈటీఎఫ్ యూనిట్ విలువ మరింత తగ్గి చిన్న ఇన్వెస్టర్లకు కూడా కొనుగోలుకు అందుబాటులోకి వస్తుంది. నిబంధనల ప్రకారం ఈటీఎఫ్ యూనిట్లను స్టాక్ ఎక్స్ఛేంజ్లలో లిస్ట్ చేయడం తప్పనిసరి. ఒక ఇన్వెస్టర్గా ఇలాంటి నిర్ణయాల వల్ల పెట్టుబడులకు సంబంధించి జరిగే మార్పు ఏమీ ఉండదు. ఈటీఎఫ్ ముఖ విలువ తగ్గడం వల్ల యూనిట్ ఎన్ఏవీ కూడా తగ్గుతుంది. అదే సమయంలో యూనిట్ల సంఖ్య పెరుగుతుంది. ఉదాహరణకు మీకు రూ.10 ముఖ విలువ కలిగిన 100 యూనిట్లు ఉన్నాయని అనుకుందాం. రూ.1 ముఖ విలువకు యూనిట్ను స్ప్లిట్ చేయడం వల్ల అప్పుడు మీ వద్దనున్న 100 యూనిట్లు కాస్తా 1,000 యూనిట్లకు పెరుగుతాయి. కొత్త యూనిట్లు రికార్డు తేదీ తర్వాత మీ ఖాతాకు జమ అవుతాయి. చదవండి: భారీ నౌక, రూ.8,318 కోట్ల ఖర్చు.. తొలి ప్రయాణం కూడా కాకముందే తునాతునకలు! -
రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదా, అయితే ఇందులో పెట్టుబడులే సురక్షితం!
రిస్క్ పెద్దగా ఉండొద్దని కోరుకునే వారికి షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్ అనుకూలం. తక్కువ రిస్క్ తీసుకునే వారికి, స్వల్పకాలం కోసం ఇన్వెస్ట్ చేసుకోవాలని భావించే వారు షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్ను పరిశీలించొచ్చు. ఏడాది నుంచి మూడేళ్ల కాలానికి వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ విభాగంలో ఇన్వెస్ట్ చేయాలనుకునే ఇన్వెస్టర్లు హెచ్డీఎఫ్సీ షార్ట్ టర్మ్ డెట్ ఫండ్ను పరిశీలించొచ్చు. ఈ పథకం భిన్నమైన పెట్టుబడుల విధానంతో, మంచి పనితీరు చూపిస్తోంది. రాబడులు షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్ను ఫిక్స్డ్ డిపాజిట్స్తో పోల్చి చూడొచ్చు. ఈ పథకంలో గడిచిన ఏడాది కాలంలో వచ్చిన రాబడి 4 శాతంగా ఉంది. అదే మూడేళ్లు అంతకుమించిన కాలాల్లో చూసినప్పుడు సగటు రాబడి 7 శాతానికి పైన ఉండడాన్ని గమనించాలి. మూడేళ్ల కాలంలో 7.42 శాతం, ఐదేళ్లలో 7.32 శాతం, ఏడేళ్లలో 7.65 శాతం, పదేళ్లలో 8.23 శాతం చొప్పున రాబడులను ఈ పథకం ఇన్వెస్టర్లకు అందించింది. 2010 జూన్ లో ఈ పథకం ఆరంభం కాగా, నాటి నుంచి చూసుకుంటే వార్షిక రాబడి రేటు 8.31 శాతంగా ఉండడం గమనార్హం. పోర్ట్ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.14,634 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఎక్స్పెన్స్ రేషియో 0.74 శాతంగా ఉంది. మొత్తం సెక్యూరిటీలు 146 ఉన్నాయి. సగటు మెచ్యూరిటీ 2.76 సంవత్సరాలుగా ఉంది. అధిక నాణ్యతను సూచించే ఏఏఏ రేటెడ్ బాండ్లలో 50 శాతం పెట్టుబడులు పెట్టింది. ఆ తర్వాత ప్రభుత్వ సెక్యూరిటీల్లో 22.48 శాతం ఇన్వెస్ట్ చేసింది. కొంచెం రిస్క్ ఉంటే ఏఏ రేటెడ్ పత్రాల్లో 15.55 శాతం, ఇంకాస్త అధిక రిస్క్ను సూచించే ఏ1ప్లస్ పత్రాల్లో 5 శాతం చొప్పున (అధిక రాబడులు) ఇన్వెస్ట్ చేసింది. 7.22 శాతం మేర నగదు నిల్వలు కలిగి ఉంది. పెట్టుబడుల విధానం ఈ పథకానికి అనిల్ బంబోలి మేనేజర్గా పనిచేస్తున్నారు. రిస్క్ తక్కువగా ఉండే విధంగా పెట్టుబడులు పెట్టడంలో ఆయనకు ఎంతో నైపుణ్యం ఉంది. ఎక్కువ క్రెడిట్ రిస్క్ తీసుకోకుండా మంచి రాబడులు ఇచ్చే విధంగా పనిచేస్తుంటారు. డ్యురేషన్ బెట్స్ (కాలవ్యవధికి సంబంధించి సెక్యూరిటీలు)కాకుండా..మంచి విలువ తెచ్చిపెడతాయనుకున్న సెక్యూరిటీలను ఎంచుకుంటారు. లోతైన పరిశోధన తర్వాతే సెక్యూరిటీల ఎంపిక ఉంటుంది. పెట్టుబడులు పెట్టడానికి ముందు ఆయా డెట్ పత్రాలను ఇష్యూ చేస్తున్న కంపెనీ యాజమాన్యం, ఆర్థిక మూలాలు, వ్యాపార బలలాను విశ్లేషించిన తర్వాతే పెట్టుబడుల నిర్ణయం ఉంటుంది. ప్రధానంగా ఆయా కంపెనీలు తిరిగి చెల్లింపులు చేయగలుగుతాయా? అన్నది చూస్తారు. కంపెనీల నగదు ప్రవాహాలు (వ్యాపార ఆరోగ్యాన్ని సూచించేది), ఇతర రేషియోలను కూడా ఈ పథకం పరిశోధన బృందం విశ్లేషిస్తుంది. ఇందుకోసం ఈక్విటీ పథకాల పరిశోధన బృందం అనుభవాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఇవన్నీ చూసిన తర్వాతే కంపెనీల డెట్ పేపర్ల నాణ్యతపై నిర్ణయానికొస్తారు. భద్రత, ఆయా సెక్యూరిటీల్లో లిక్విడిటీ అంశాలకు ప్రాధాన్యం ఇస్తారు. స్వల్పకాలం నుంచి మధ్యకాలానికి పెట్టుబడులు పెట్టాలనుకునే వారు ఈ పథకాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. -
డెట్ ఇష్యూల్లో రూ.5 లక్షల వరకు పెట్టుబడులకు యూపీఐ
న్యూఢిల్లీ: రిటైల్ ఇన్వెస్టర్లు యూపీఐ ద్వారా డెట్ సెక్యూరిటీల పబ్లిక్ ఇష్యూల్లో ఇక మీదట రూ.5 లక్షల వరకు పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ప్రస్తుతం ఈ పరిమితి రూ.2లక్షల వరకే ఉంది. మే 1 నుంచి ప్రారంభమయ్య డెట్ ఇష్యూలకు నూతన నిబంధన అమలు కానుంది. ఈ మేరకు సెబీ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం రిటైల్ ఇన్వెస్టర్లు రూ.2లక్షల వరకు పెట్టుబడికి యూపీఐ ఆధారిత ‘బ్లాక్ ఫండ్స్’ ఆప్షన్తో డెట్ ఇష్యూల్లో పాల్గొనేందుకు అనుమతి ఉంది. అంటే ఆయా నిధులు బ్యాంకు ఖాతాల్లోనే ఉండి ఇష్యూ అలాట్మెంట్ ముగిసే వరకు బ్లాక్లో ఉంటాయి. సెక్యూరిటీలు కేటాయిస్తే ఆ మేరకు పెట్టుబడి మొత్తం డెబిట్ అవుతుంది. లేదంటే ఖాతాలోనే అన్బ్లాక్ అవుతాయి. పెట్టుబడులు సులభంగా మార్చేందుకు భాగస్వాములతో సంప్రదించిన మీదట ఈ పరిమితిని రూ.5లక్షలకు పెంచుతున్నట్టు సెబీ తెలిపింది. దీంతో బ్లాక్ ఫండ్స్ ఆప్షన్తో రూ.5లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చని పేర్కొంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
రాహుల్గాంధీపై అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు
ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు చల్లని కబురు
అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)
షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు
సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
Advertisement