సుప్రీంకోర్టు గురించి 151 నిజాలు


పుస్తకాన్ని ఆవిష్కరించిన జస్టిస్ దీపక్‌మిశ్రా

 

 న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం గురించి తెలుసుకునేందుకు వీలుగా రూపొందించి న ఒక పుస్తకాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దీపక్‌మిశ్రా ఆవిష్కరించారు. శనివారం ఢిల్లీలోని హేబిటాట్ సెంటర్‌లో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జస్టిస్ దీపక్ మిశ్రా మాట్లాడుతూ.. పుస్తకాలు, సంకలనాలు సమాచార ఉపయక్తమైనవని, వాటిలో ఉండే సమాచారం చారిత్రక వాస్తవాల పట్ల ఆసక్తి ఉన్న వారిని ఆలోచింపజేస్తుందన్నారు. ‘సుప్రీంకోర్టును మరింత ఉన్నతంగా అర్థం చేసుకోవడం - తెలుసుకోదగిన 151 నిజాలు’ పేరుతో ఈ పుస్తకాన్ని న్యాయ సమాచార కేంద్రం రూపొదించింది. ఇందులో 1950 నుంచి 2013 మధ్య కాలంలో 212 మంది న్యాయమూర్తులు వెలువరించిన 43వేల తీర్పుల అధ్యయన సమాచారాన్ని పొందుపరిచారు.

 

 దీన్ని తీసుకురావడానికి కృషి చేసిన వారిని జస్టిస్ దీపక్ మిశ్రా ఈ సందర్భంగా మెచ్చుకున్నారు. ఈ పుస్తకంలో ఉన్న నిజాలు సుప్రీంకోర్టులో ఐదు దశాబ్దాల పాటు పనిచేసిన వారికి సైతం తెలియవని సీనియర్ న్యాయవాది పీపీ రావు అన్నారు. ఇది అంత ప్రత్యేకమైన, విలక్షణమైన పుస్తకమని చెప్పారు. ఈ పుస్తకం న్యాయ సమాజానికి శక్తిమంతమైన సాధనంగా ఉపయోగపడుతుందని న్యాయ సమాచార కేంద్రం అధ్యక్షుడు అరుణేశ్వర్ గుప్తా అన్నారు. 

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top